కొక్కొరో ... క్కో ...

***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
26 : నవంబర్, డిశంబర్ 02 - 2018
సంపుటి : 71, సంచిక : 04



చాలామంది ఆర్టీసీ బస్సు ఎక్కాలని ఇష్టపడతారు. కారణం ఆర్టీసీలో ప్రయాణం ‘సుఖకరం, సురక్షితం’ అని నమ్మడం. అనివార్య కారణాల వల్ల మాత్రమే ప్రైవేటు వాహనాలపై ఆధారపడతారు. అప్పటివరకు అరచి గీపెట్టినా ప్రైవేటు వాహనంలో ఎక్కనివారు సైతం కాస్త స్థలం ఉంటే కూర్చుంటామని బతిమాలుతారు. ఇదంతా బస్టాండ్ల వద్ద నిత్యం కనిపించే దృశ్యం. కానీ, తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం చూసాక ఇలాంటి దృశ్యాలను టీవీలు, పత్రికలు నింపేస్తున్నాయి. ఎక్కడ సీటు దొరికితే అక్కడ, ఏ వాహనంలోనైనా ప్రయాణించేవాళ్లు, వాహనాలకు వేలాడుతూ వెళ్లడానికైనా సిద్ధపడడం వంటి దృశ్యాలు బస్టాండ్ల ముందే కాదు... రాజకీయ పార్టీల ఆఫీసుల ముందు కూడా చూడవచ్చు.

పార్టీకి సేవచేస్తామని వచ్చే నాయకులు కొన్నాళ్లకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా మారుతున్నారు. తీరా ‘పారాచుట్ నాయకుల’ రాకతో వాళ్ల సీటుకు కాకపుట్టి అర్ధరాత్రి ఎగరేసుకుపోతే ఏం చేయాలి? చివరకు తెలంగాణలో దిక్కూదివాణం లేని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ)లకూ గిరాకీ పెరిగింది. నిజానికి ఈ పార్టీల బీ-్ఫరాలతో ఒకవేళ ఎవరైనా గెలిస్తే- వారిని ప్రధాన పార్టీలు లాగేస్తాయి. దీన్ని గత అనుభవాలను చూసి మనం తెలుసుకోవచ్చు. ఇలా గెలిచిన ఇంద్రకరణ్‌రెడ్డి ఏకంగా కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసాడు.

‘బిఎల్‌ఎఫ్’ అంటూ కమ్యూనిస్టు కాకాసురులు పుట్టించిన కూటమి బహుగొప్ప బీసీ వాదాన్ని ముందుకు తెచ్చింది. ఎలాగూ గెలిచేది లేదు కాబట్టి బీసీలకు ఎక్కువ టిక్కెట్లు ఇచ్చామంటారు. తమ్మినేని వీరభద్రం పోస్టు ఏనాడూ బీసీ కులాలకు దక్కదు. బీవీ రాఘవులు స్థానం ఏ బీసీతోనూ భర్తీచేయరు. కానీ ‘గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం’ అన్నట్లు ఎలాగూ గెలవరు కాబట్టి అనామక బీసీలను అందులో చేర్చుకొని ఆటపట్టిస్తారు! కూటమి ‘పెద్దల’ అసలు లక్ష్యం వేరే ఉంటుంది. ప్రధాన ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీలలో వారికి ఇష్టమైనవారికి పరోక్షంగా మేలుచేసే వ్యూహం కూడా ఇందులో ఉంటుంది. ఇదంతా కొంత సిద్ధాంతం, మరికొంత అవకాశవాదం- ప్రక్కనపెడదాం.

ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ ఎన్నికల వేళ భారతీయ జనతాపార్టీ వేసిన కొన్ని అడుగులు తప్పటడుగులా? తప్పుటడుగులా?? అని తేల్చుకోలేక రైట్‌వింగ్ కార్యకర్తలు బుర్రలు గోక్కుంటున్నారు. విలువలు, సిద్ధాంతాలకు మారుపేరైన, నికార్సయిన రాజకీయం చేసే పార్టీ భారతీయ జనతాపార్టీ. తెలంగాణలో ‘పొత్తు’ల తలనొప్పి లేని ఏకైక పార్టీ భాజపా. ప్రస్తుత ఎన్నికల్లో 15-20 సీట్లు భాజపా గెల్చుకోగలిగితే రేపు తెలంగాణలో ఏర్పడే కాంగ్రెసేతర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం ఖాయం. కానీ అసలు రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఇలాంటి రాజకీయ క్రీడ ఆడాలన్న ‘కసి’ కన్పించట్లేదన్నది చా లామంది మదిని తొలుస్తున్న ప్రశ్న.

 తెలంగాణలో ఎన్నికలు వస్తాయని కేసీఆర్‌కు ఎంతముందుగా తెలు సో, భాజపాకు అంతేముందు తెలుసు. కేసీఆర్ మోదీని కలిసి వచ్చాక పదిహేనురోజుల పాటు అన్నీ సర్దుకుంటూ, గోప్యత పాటిస్తూ వ్యవహారం చక్కబెట్టుకొని ఎన్నికల రంగంలోకి దూకాడు. భాజపా వారు నామినేషన్ల గడువు పూర్తయ్యేముందురోజు రాత్రికి ఆరవ జాబితాను విడుదల చేశారు. పద్దెనిమిది రోజుల్లో అభ్యర్థులు ఎలా పనిచేయగలరని నాయకత్వం ఎందుకు ఆలోచించలేదు. తెలంగాణ భాజపా అంతా ఒకప్పటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబివిపి) వారితోనే నిండిపోయింది. ఇందులో ముఖ్యమైన వాళ్లంతా ముం దే టిక్కెట్లు కేటాయించుకొన్నారు. 

అమాయకులుగా, అధికారం లేకున్నా గుడ్డిగా ఏళ్ల తరబడి పార్టీకి సేవచేస్తూ వస్తున్నవాళ్లకు చివరివరకు సీట్లు ఇవ్వలేదు. డబ్బుగల వాళ్లకోసం వాటిని రిజర్వ్ చేస్తే- వాళ్లు రాకపోతే ఇచ్చారన్నమాట. అంటే గిరాకీ లేని సీట్లలో నిబద్ధులైన వాళ్లకు కేటాయించారు. పోనీ ‘పారాచూట్’లలో వచ్చిన వాళ్లకు సిద్ధాంత సారూప్యత ఉందా? ఒకవేళ వాళ్లు గెలిస్తే పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారా? బొడిగె శోభ, బాబూ మోహన్, అరుణతారల గురించి అధిష్ఠానం ఆలోచించిందా? గాలివాటంగా వచ్చినవారు అదే స్వార్థబుద్ధితో ఉంటే కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతినదా? గతంలో ఏదో ఆశించివచ్చిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి, కపిలవాయి దిలీప్‌కుమార్ ఇప్పుడు ఎక్కడున్నారు?

అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే రోజుల్లో కూడా భాజపాలో ఎందరో కార్యకర్తలు నోరువాయి కట్టుకొని అమ్ముడుపోకుండా సేవ చేస్తున్నారు. దానికి కారణం నిబద్ధతగల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నియంత్రణ ఉండడం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భాజపాను ఆరెస్సెస్ నియంత్రణ చేస్తున్నట్లు కన్పించదు. సంఘ్ పెద్దలను రాజకీయంకట్టడి చేసిందా? అన్నది దేవుడికెరుక. సంఘ్ తరఫున పార్టీ బాధ్యతలు చూస్తున్న మంత్రి శ్రీనివాస్ పైనే వేళ్లన్నీ చూపిస్తున్నాయి. జాతీయవాద అభివృద్ధికి, పార్టీ ఎదుగుదలకు సరైన కార్యాచరణను స్థానిక నాయకత్వం ఎందుకు తీసుకోవడం లేదు? గతంలో ఎప్పుడూ దిగజారనంతగా ఇపుడు భాజపా పాతాళంలోకి వెళ్లిందని ఏ కార్యకర్తను అడిగినా చెప్తున్నారు. ఇవాళ తెలంగాణలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంబొట్లు అన్నట్లు ఎదుగూబొదుగూ లేకుం డా ఉందన్నది నిజం.

ఈశాన్య రాష్ట్రాల్లో సై తం జోరుగా దూసుకుపోతున్న భాజపా తెలంగాణలో మాత్రం ఎందుకు అధికారంలోకి రాలేకపోతోంది? ఒకప్పుడు నరేంద్ర, విద్యాసాగర్, బద్దం బాల్‌రెడ్డి వంటి పాతతరం నాయకులే హైదరాబాద్‌లో ‘సాలార్’కు ముచ్చెమటలు పట్టించారు. హైదరాబాద్‌లో జరిగిన అల్లర్లలో ఎందరో హిందువులు ప్రాణాలు కోల్పోతే బాధితుల పక్షాన నిలబడ్డారు. ఇటీవలి కాలంలో భాజపా ఉదాసీనత కారణంగానే అసదొద్దీన్ ఓవైసీ జాతీయ నాయకుడయ్యాడు. అతడు ప్రధానినే సవాల్ చేసే వ్యక్తిగా ప్రతిపక్షాలకు, సూడో సెక్యులర్ పార్టీలకు కన్పిస్తున్నాడు. దీనికి కారణం ఎవరు? అంతెందుకు..? సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రధానిని బండబూతులు తిడితే హైద్రాబాద్ నుండి ఒక్క పెద్ద నాయకుడు కూడా నిలువరించలేదు.

హైద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న రెండు, మూడు ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు మోదీ టార్గెట్‌గా చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్న ఒక్క భాజపా నాయకుడు దీనిపై చర్యలకు ఉపక్రమించలేదు. ప్రత్యేక హోదాను ప్రాంతీయ వాదంలా జనాల్ని రెచ్చగొడుతున్న మీడియా సంస్థలపై చట్టపరంగా భాజపా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఏపీ భాజపాలోని ఒక వర్గం ఈరోజుకూ చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తుంది. మరి తెలంగాణ నాయకులకు ఏం అడ్డంకి..?

తెలంగాణలో కొందరు ప్రధానిపై అదే పనిగా దుమ్మెత్తిపోస్తూ, దుష్ప్రచారం చేస్తుంటే అది ఎన్నికల నిబంధన ఉల్లంఘనగా భాజపా నాయకులు ఎందుకు ఫిర్యాదు చేయరు? వీరు టీవీలు చూడడం, పత్రికలు చదవడం మానేశారా? మోదీ ప్రతిష్ఠపై ప్రత్యర్థులు బురద చల్లుతుంటే ఎన్నికల్లో ఆ ప్రభావం పడదా? నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు ఉన్న ఈ తీరుతెన్నులు ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తాయి? భాజపా నాయకులు తర్కం లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తూ ‘మేం అధికారంలోకి వస్తాం, 70 సీట్లు గెలుస్తాం, కేసీఆర్ అసలు ఏమీ చేయలేదు..’ అని చెప్పే మాటలను ప్రజలు స్వీకరించడం లేదు. పార్టీని గోవర్ధన పర్వతంలా ఎత్తేస్తానని వచ్చిన పరిపూర్ణానంద స్వామి కూడా ఇలా మాట్లాడకూడదు. కేసీఆర్ నియంతృత్వాన్ని, కుటుంబ పాలనను, కాంగ్రెస్ కుల రాజకీయాన్ని, సంతుష్టీకరణ విధానాన్ని ఎండగట్టండి. పార్టీని ‘నిర్ణాయక శక్తిగా మారుస్తాం’ అంటే ప్రజలు స్వీకరిస్తారు.

అడ్డగోలుగా జరిగిన టిక్కెట్ల పంపిణీ వ్యవహరం పార్టీకి నష్టం చేకూరుస్తుంది. ఉదాహరణకు పరిగిలో నలభై ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన కరణం ప్రహ్లాదరావుకు ఆరవ లిస్ట్‌లో అదీ అతను రాజీనామా చేశాక టిక్కెట్టు ఇచ్చారు. అక్కడ ధనికుడైన కాసాని వీరేశ్‌ను పోటీకి దింపాలనుకొన్నారు. ఏనాడూ మళ్లీ నియోజకవర్గం ముఖం చూడని వ్యక్తి కేవలం 18 రోజుల్లో ఎంత డబ్బున్నా ఎలా బరిలోకి దిగుతాడు? అతడికి కుత్బుల్లాపూర్ టిక్కెట్టు ఇచ్చారు. తీరా అతడు నామినేషన్ వెనక్కి తీసుకొన్నాడు. అక్కడి భాజపా రెబల్ అభ్యర్థుల నామినేషన్లు చెల్లలేదు. దీంతో అక్కడ భాజపా అభ్యర్థి లేడు. ఈ ఉదాహరణ చాలదా? టిక్కెట్ల పంపిణీలో గందరగోళం జరిగిందనడానికి.

ముందే పొత్తులు, వ్యూహాలు ఖరారు చేసుకొని అభ్యర్థులను జల్లెడపట్టి టిక్కెట్లు కేటాయింపుచేస్తే ఈ సమస్య ఉండదు. 26 స్థానాల్లో అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ కేసీఆర్ వారికి ఎందుకు టిక్కెట్లు ఇచ్చాడు? ఓట్లు అభ్యర్థులను చూసి కాదు.. తనను చూసి వెయ్యమని! మరి భాజపా సైన్యాధ్యక్షుడు సరిగ్గాలేనపుడు బలమైన అభ్యర్థుల కోసం ఎలాంటి సర్వే చేసారో తెలియదు? కనీసం ప్రచారాన్నైనా వ్యూహాత్మకంగాచేస్తే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. గెలిచే స్థానాలపై దృష్టిపెట్టకపోతే ఏళ్లకు ఏళ్లు పనిచేస్తున్న కార్యకర్తలకు, జాతీయవాదులకు దుఃఖమే మిగులుతుంది. మోదీని దెబ్బతీయడానికి తెలుగు రాష్ట్రాల నుండే కుట్ర జరుగబోతోంది. ఇక్కడి భాజపా నేతలు ఎలాంటి వ్యూహం లేకుండా యుద్ధంలోకి దిగడం అవివేకం. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలిచినా కేంద్రంలో ఫ్రంట్‌ల పేరుతో టెంటులు వేస్తారు. భాజపా నాయకత్వం తక్షణ చర్యలతో ముందుకు వెళ్లకపోతే ‘పంచ పాండవులు మంచం కోళ్లలాగా ముగ్గురే’ అన్న సామెత పునరావృతం అవుతుంది. *

*********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ 
పెన్ గన్ గ  : ఆంధ్రభూమి 

కొక్కొరో ... క్కో ... 
***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
19 - 25 : నవంబర్ - 2018
సంపుటి : 71, సంచిక : 03



బుతంచ స్వాధ్యాయ ప్రవచనేచ
సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ
 
యథార్థమైన ఆచరణతో చదువుతూ, చదివిస్తూ ఉండాలి! సత్యాచారంతో సత్యమైన విద్యలను చదువుతూ ఉండాలి అని శ్రుతులు చెప్పాయి. స్వాధ్యాయం ఒక యజ్ఞంగా శ్రీకృష్ణుడు గీతలో చెప్పుకొచ్చాడు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పురాణపురుషుల జీవనాధ్యయనం స్వాధ్యాయమే. పారాయణం, పఠనం బయటకు కనిపించే స్వాధ్యాయ లక్షణాలు. దాని అంతరిక రూపం మననం. మొదటి దశలో పారాయణం, పఠనం చేస్తాం. రెండవ దశలో చదివిన ఆ విషయాన్ని క్రమంగా ఆచరణకు తేవాలి. అలా కాకుండా కేవలం పుస్తకాలను వెంటమోసుకుపోవడం ‘కుంకుమపువ్వును మోసే కాశ్మీరగార్దభం’ చందమే అనేది అక్షర సత్యం. విలువైన కుంకుమ పువ్వు మూటను మోసే గాడిదకు దాని గొప్పదనం తెలియదు. అలాగే శాస్త్రం ఎంత గొప్పదైనా అది చదివి జీర్ణించుకొని, ఆచరించకపోతే ఉపయోగం లేదు.
 
శాస్త్రాణ్య ధీత్యాపి భవంతి మూర్ఖాః
యస్తుక్రియావాన్‌ పురుషః సవిద్యాన్‌
సుచింతితం ఔషధ మాతురాణాం
న నామ మాత్రేణ కరోతి శాంతిమ్‌
 
శాస్త్ర వాసన చాలా మందికి ఉన్నా మూర్ఖులుగానే ఉంటారు. ఆచరణ ఉన్న క్రియావంతుడే నిజమైన విద్వాంసుడు. బాగా పరీక్షించి ఎంపిక చేసిన ఔషధమైనా.. కేవలం దాని పేరు చెప్పినంత మాత్రాన రోగనివారణ జరగదు. వ్యక్తిని వ్యక్తిత్వంగల ధీరునిగా తీర్చిదిద్దాలంటే స్వాధ్యాయం అవసరం ఉంది. ఒకప్పటి గురువులు వ్యక్తిలో సంస్కారం నింపి, జీవన సుగంధాలను పరిమళింపజేయాలనే ఉద్దేశంతోనే సద్గ్రంథ రచన చేశారు. ఈరోజు మితిమీరిన సాంకేతిక పరిజ్ఞానంతో మనం జీవిస్తున్నా అందరిదీ అశాంతియుత జీవనమే. ఆ పరిజ్ఞానం అందించే సమాచారం మనలో సంఘర్షణను కూడా కలగజేస్తోంది. వివేచన, సత్యం ఉన్న సమాచారం వివేకాన్ని పెంపొందిస్తుంది. అలాకాకుండా కేవలం సమాచారం కోసం పఠనం, శ్రవణం, పారాయణం, దర్శనం జరిగితే ఎక్కడో వెలితి కనిపిస్తుంది. అలాంటి సదసద్వివేక జ్ఞానం కలిగించే సద్గ్రంథ పఠనం జరగాలి. మనపూర్వులు అత్యంత నిబద్ధతతో అలాంటి సద్గ్రంథాలను మనకు అందించారు. వాటిని ఆధునిక జీవన సమస్యలకు అన్వయించుకొని దర్శిస్తే ఈ రోజూ మనం సుఖంగా ఉండగల్గుతాం. 
********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య నివేదన ॐ*
కొక్కొరో ... క్కో ... 


***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
08-14 : అక్టోబర్  - 2018
సంపుటి : 70, సంచిక : 51
కొక్కొరో ... క్కో ... 


***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
15-21 : అక్టోబర్  - 2018
సంపుటి : 70, సంచిక : 52
కొక్కొరో ... క్కో ... 

***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
22-28 : అక్టోబర్  - 2018
సంపుటి : 73, సంచిక : 53
జాతీయ భావాల మీద ముప్పేట దాడి 
***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
దీపావళి ప్రత్యేక సంచిక 
05-11 నవంబర్ - 2018
సంపుటి : 71 , సంచిక : 01



ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తూ ‘మీ తాత ఇంత గొప్ప గురువుకదా? ఆయన పెళ్లెందుకు చేసుకున్నాడు?’ అన్నాడట. ‘ఆయన పెళ్లి చేసుకొని ఉండకపోతే నేను పుట్టేవాణ్ణేకాదు, మీకు ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉండేదీ కాదు’ అని బదులిచ్చాడట విద్యార్థి. ఇటీవల మూడో కూటమి గురించి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఇంతే గొప్పగా సెలవిస్తున్నది! ఇపుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నా, ఒకపుడు ఈ ప్రాంతాన్ని తొమ్మిదేళ్లు నిరాఘాటంగా ఏలిన చంద్రబాబుకు చెందిన ‘జాతీయ పార్టీ’ ఇక్కడ సొంతంగా పోటీ చేయదు. పోనీ ప్రపంచ తెలుగువారి ‘ఆత్మగౌరవానికి పేటెంట్ హక్కున్న’ పేరు మీదైనా చేస్తారంటే అదీ లేదు.

 హైద్రాబాద్‌లో సెటిలర్లు మేం ఎలా చెప్తే అలా వింటారని అమరావతి బుద్ధవిగ్రహం ప్రక్కనుండి రోజూ పిల్లిమొగ్గలు వేస్తారు కదా.. తెలంగాణలో కేసీఆర్‌ను గద్దెదింపేద్దాం అంటే మొన్నటివరకు చంద్రబాబు ఇక్కడ ప్రచారానికే రాను అన్నారు! ‘హైద్రాబాద్‌ను కులీ కుతుబ్‌షా కన్నా ఎక్కువ హక్కుతో నేనే ఎక్కువ అభివృద్ధి చేసాను’ అని అమెరికాలోని ఆటా మొదలుకొని అన్ని సంఘాల సదస్సుల్లో చెప్తారు కదా.. డైరెక్ట్‌గా కేసీఆర్‌తో తలపడండి అంటే అలాంటి పాపపు పనులు చేయను అంటాడు బాబు. కర్ణాటకలో నేను ఇచ్చిన పిలుపునకే భాజపా చిత్తుచిత్తుగా డిపాజిట్లు రాకుండా సున్నా సీట్లతో నిలిచింది అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు కదా.. తెలంగాణలో సగం సీట్లలోనైనా పోటీ చేయండి అంటే అలా కూడా కుదరదట!

ఇదంతా ఎందుకంటే- ఇపుడు తెదేపా తెలంగాణలో పోటీచేస్తున్న (పది సీట్లకు అటు ఇటూ) విషయం కన్నా, చంద్రబాబు కనుసన్నల్లో కాంగ్రెస్ నడుస్తుందన్న విషయం పైనే ఫోకస్. కాగా, కొంగర కలాన్ సభ తర్వాత ఎందుకో కేసీఆర్ గ్రాఫ్ కొంత తగ్గుతూ పోయింది. కాంగ్రెస్ పార్టీ వారు కేసీఆర్ నియంతృత్వ పోకడ, అహంకార దర్పం,కుటుంబ పాలన, మాటల గారడీ అని చాలా ఎక్స్‌పోజ్ చేసారు. దాంతో అందరూ కేసీఆర్‌కు గడ్డురోజులే అని భావించారు. సరైన పోటీ ఉంటుందని భావించారు. కాంగ్రెస్ వాళ్లను సజ్జనులుగా, కేసీఆర్ వాళ్లను డామినేట్ చేస్తున్నాడని ప్రజలు భావించారు. కేసీఆర్ ఆయత చండీయాగం ఫలితం రూపంలో ‘చంద్రబాబు పొత్తు’ కాంగ్రెస్ ప్రయత్నాలను నీరుగారుస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ పెద్దన్న పాత్రలోనే ఉన్నప్పటికీ వాళ్ల చక్రం ‘నలభై ఏళ్ల ఇండస్ట్రీ’లోకి వెళ్లిందని మెల్లమెల్లగా తెలంగాణ ప్రజలకు ఎక్కుతున్నది. ప్రచారం ముగిసే వరకూ కేసీఆర్ ఉపన్యాస పరంపర అలాగే ఉండనున్నది. కేసీఆర్ మొత్తం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక రెండు సభల్లోనే ప్రసంగం చేసాడు. ఈ మిగతా రోజుల్లో ప్రసంగాలు వేడివేడి మిరపకాయ బజ్జీల్లా సిద్ధం చేసుకొని వస్తాడు. అదే చంద్రబాబు.. రోజూ ఉపన్యాసాలే!

కేసీఆర్‌ను దెబ్బతీయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంటే చంద్రబాబు కేసీఆర్‌తో పొత్తు పెట్టుకొని మోదీ దెబ్బతీయాలనుకున్నాడు. నిజానికి ఏ రాజకీయ నాయకుడికీ చంద్రబాబు ఇంతవరకు అర్థం కాలేదు. ఒక్క కేసీఆర్‌కు తప్ప! ఎందుకంటే కేసీఆర్ చంద్రబాబు పాఠశాలలో అన్ని తరగతులూ క్షుణ్ణంగా చదివి కాన్వకేషన్ పట్టాను పొందాడు. అందుకే చంద్రబాబు కేసీఆర్‌కు రాయబారం పంపాడు. ఈ విషయం బాబే ఒప్పుకొన్నాడు.
చిన్నా చితకా పార్టీలను కలిపి మోదీని గద్దె దింపాలని బాబు ఆలోచన. కేసీఆర్‌కు సెంటిమెంట్‌ను ఎలా వాడుకోవాలో తెలుసు. కాబట్టి బాబుతో పొత్తుకు వెనక్కి తగ్గాడు. కేసీఆర్‌కు కేంద్రంలో ఎవరున్నా ఇబ్బంది లేదు. ఇపుడున్న పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలతో కలిపి కాంగ్రెస్‌కు ఊడిగం చేసి అస్థిత్వాన్ని కోల్పోవద్దన్నది కేసీఆర్ భావన. ఆంధ్రాలో చంద్రబాబు కాంగ్రెస్‌ను సర్వనాశనం చేసాడు కాబట్టి రెండవ కాంగ్రెస్ పార్టీగా ప్రకటించుకున్నాడు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో పిల్ల పార్టీలు పుట్టాయి. కేసీఆర్ వెనక్కి తగ్గి, ఇపుడు చంద్రబాబును టార్గెట్ చేసి టీఆర్‌ఎస్ గ్రాఫ్ పెంచాడు. ఆంధ్రాలో లేని మోదీని శత్రువుగా చూపిస్తూ చంద్రబాబు ఎలా ఎదుగుతున్నాడో, కేసీఆర్ తెలంగాణలో లేని బాబును బూచిగా చూపిస్తూ మెల్లమెల్లగా వ్యూహం అల్లుతున్నాడు. ఇందులో సత్యం ఏమిటంటే రేపు కేసీఆర్‌కు కొద్దిగా మెజార్టీ తగ్గితే మొదట లైన్లో ఉండేది టీడీపి నుంచి గెలిచే వారే! అపుడు కాంగ్రెస్ వారు నోరు వెళ్లబెట్టాల్సిందే!? గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వారు బాబు సలహా మేరకు వెళ్లామని చెప్తారు! కేసీఆర్‌తో అవసరాల దృష్ట్యా ఆనాడు బాబు అలాచేసారని గిట్టనివారు అంటారు.

మొన్నటి దాకా కేసీఆర్‌తో సరిసమానంగా వ్యూహాలు రచించే స్థాయికి ఎదిగిన తెలంగాణ కాంగ్రెస్ ఇపుడు చంద్రబాబు కనుసన్నల్లో నడవడం మహాకూటమికి ఇబ్బందే. ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు తెలిసినా జాతీయ రాజకీయాల దృష్ట్యా కిమ్మనడం లేదు.

రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎక్కాక ఎక్కడా విజయం సాధించిన దాఖలాలు లేవు. పంజాబ్‌లో కూడా రాహుల్‌ను ప్రచారానికి రావద్దని కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పాడంటారు. ఉత్తరాది సీనియర్ ప్రాంతీయ పార్టీల నాయకులెవరూ రాహుల్‌తో రావడానికి ఇష్టపడడం లేదు. శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, మాయావతి, శరద్‌యాదవ్, మమత, కేజ్రీవాల్, లాలూ, ములాయం, కమ్యూ నిస్టులు మోదీతో ఏదో దశలో తలపడినవారే. ఇపుడు మొదటిసారి చంద్రబాబే ఈ యుద్ధం చేస్తున్నట్టు తెలుగు మీడియా ఎంత హడావుడి చేసినా వాళ్ల ఆలోచనలు వాళ్లకున్నాయి. రాహుల్ చుట్టూ వీళ్లంతా చేరడానికి చంద్రబాబు వ్యూహం అవసరమని కాంగ్రెస్ భావిస్తున్నది. అందుకే ఆంధ్రలో కాంగ్రెస్ చచ్చినా, తెలంగాణలో బాబు వల్ల కాంగ్రెస్ ఇరకాటంలో పడినా ఇద్దరి కామన్ శత్రువు మోదీ అని జాతీయ కాంగ్రెస్ సరిపెట్టుకొంటున్నది. కేసీఆర్‌ను నాలుగున్నరేళ్లు తట్టుకొని చచ్చీ చెడి పార్టీని నిలబెట్టిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు- ఇది తలనొప్పి అని తెలిసినా.. వారు ‘జండూబామ్’ అడగడం లేదు.

ఈ ఫ్రంట్‌లోని టీడిపి, టీజెఎస్, ఇంటి పార్టీ, సిపిఐ ఓట్లు మొత్తం కలిపినా 5 శాతం దాటవని కాంగ్రెస్‌కు తెలుసు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఒక వేవ్ సృష్టించాలని కాంగ్రెస్ యత్నం. ఇదంతా తెలుసుకున్న కేసీఆర్ కూ టమా? గూటమా? అని ఓ సభలో ఎద్దేవా చేసాడు. తెలంగాణలో గోడకు తగిలించే కొయ్యను, లేదా ఏదైనా నా ఖాళీని పూడ్చేందుకు కొట్టే కొయ్యను ‘గూటం’ అంటారు. కదలకుండా చేసేది గూటం. మళ్లీ లేవకుండా చేస్తానని కేసీఆర్ గూటం అని ప్రయోగించాడు. ఆచార్య కోదండరాంకు సీట్లివ్వడం కన్నా తమవైపు పెద్దమనిషిగా ఉంచుకొని వ్యవహారం చేద్దామని కాంగ్రెస్ ఆలోచన. కానీ ఆయన వెనకున్న ఒకరిద్దరు సీట్లు కావాలని వత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్, టిజెఎస్‌కు 8 సీట్లిస్తే పొత్తు ధర్మం విస్మరించిన కోదండ 12 స్థానాలు మావని ప్రకటించుకున్నారు. ముఖ్యంగా బీసీ కులాలకు కేటాయించిన సీట్లు కోదండ రూపంలో ఇతరులు ఆక్రమిస్తున్నారని ఆరోపణ. చంద్రబాబుతో పొత్తును తెలంగాణ తాతాచార్లముద్రను కోదండరాంతో వేయించాలని కాంగ్రెస్ ఆలోచన. కానీ కేసీఆర్ కోదండరాంను కూడా ఎలా బోనులోకి లాగాలో తెలిసినవాడు. కోదండారం మంచి వ్యక్తే. కానీ ఆయన వెనుకున్న వాళ్లంతా అన్ని టంకశాలల్లో తిరిగి తిరిగి చెల్లకుండా వచ్చినవాళ్లే.

ఈ పొత్తుల పితలాటకంలో కాకలుదీరిన కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పరిస్థితి చూసి జాలిపడి నవ్వాలో ఏడ్వాలో తెలియదు. సురవరం సుధాకర్‌రెడ్డి రోజూ మతతత్వ బీజేపీపై యుద్ధం చేస్తాం అని ఇచ్చే స్టేట్‌మెంట్లు చూస్తే వీళ్లు ఎంత బలంగా ఉన్నారో అనుకుంటాం. కానీ మూడు సీట్లకోసం కాంగ్రెస్‌ను దేబిరించడం, నిన్నగాక మొన్నపుట్టిన కోదండరాం పార్టీ కన్నా ఘోరంగా దిగజారడం చూస్తే వాళ్ల దయనీయ స్థితి తెలుస్తుంది. వాళ్లకు అంత బలమే ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ల మోచేయి పట్టుకొని ఎందుకు బ్రతిమాలుతుంది. ఇక నిన్నటివరకు ఇంటి పార్టీలో ఇద్దరు నాయకులు చెఱుకు సుధాకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలకు కాంగ్రెస్ ఆశజూపి బైబై చెప్పింది. వాళ్లు కాంగ్రెస్‌లో కలవలేక కేసీఆర్‌తో నడవలేక నరకయాతన అనుభవిస్తున్నారు. కూటమి సీట్ల సర్దుబాట్లవల్ల ఆందోళనలు, ఫిరాయింపులు, గొడవలు జరుగుతుంటే గట్టి రెబల్స్‌ను నిలబెట్టి కాంగ్రస్‌కు షాక్ ఇవ్వాలని కేసీఆర్ ప్రయత్నం.

ఆంధ్రలో 2014లో బలంగా ఉన్న కాంగ్రెస్‌ను విలన్‌గా చూపి భాజపాను, పవన్‌ను కలుపుకొని బయటపడ్డ బాబు ఇపుడు అదే వ్యూహం అమలుచేస్తున్నాడు. ఆనాడు కామినేని శ్రీనివాస్‌ను భాజపాలోకి పంపి, అక్కడ భాజపాను ధ్వంసం చేసాడు. తనకు నమ్మకమైన రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపి ఇపుడు కాంగ్రెస్ వైపు కాల్వ మలిపాడు. బీజేపీని బూచిగా చూపి జగన్, పవన్, భజపాలను కలవకుండా చేసి దీనస్థితిలో ఉన్న కాంగ్రెస్‌కు ముష్టిగా కొన్ని సీట్లు ఇచ్చి ఓటు ట్రాన్స్‌ఫర్ కాకుండా వాళ్లను గెలనివ్వడు. ఇపుడు తెలంగాణలో కూడా టీడిపికి ఓట్లూ లేవు, సీట్లూ రావు. నాయకులున్న ఆ 10, 12 సీట్లలో ఎలాగూ పోటీ ఉంటుంది. ఒకవేళ అందులో టీడిపి గెలిస్తే వాళ్లను కేసీఆర్ నుండి కాపాడుకోవడం, మొన్న కర్ణాటకలో అయినట్లు ప్రతి ఎమ్మెల్యే ‘విలువైతే’ ఆ భారం కాంగ్రెస్ మోయాల్సిందే. మూడు రంగులను పచ్చ పార్టీతో, ఎరుపురంగుతో కలిపి వండుతున్న ఈ ‘పంచకూట్ల కషాయం’ ఎవరికి చేదో, ఎవరికి అమృతమో చెప్పలేని దుస్థితి. ఈ కూటమి వెనుక బాబు సెలవిచ్చినట్లు విస్తృత విశాల ప్రయోజనం ఉన్నా కేసీఆర్, మోదీ బలవంతులన్న విషయం చెప్పకనే చెప్పింది. తమిళ నటుడు రజనీకాంత్ అన్నట్టు ‘బలహీనులు ఒక్కటవుతున్నారంటే మోదీ బలవంతుడని ఒప్పుకున్నట్లే’ అన్నది అక్షర సత్యం. మహాకూటమి ఇంకా సీట్ల పంచాయతీ, బుజ్జగింపుల పర్వంలో కొనసాగుతుంటే కేసీఆర్‌కు కాగల కార్యం అమరావతి గంధర్వుడే తీరుస్తాడని విశే్లషకుల అంచనా.*

*********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ 
పెన్ గన్ గ  : ఆంధ్రభూమి 
సమయ పేదరికం
 


********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య నివేదన ॐ*
*ॐ 05 - 11 - 2018 : సోమవారం ॐ*




గులాబీ చెట్టుకు పూలు, ముళ్లు కలిసే ఉంటాయి. రెండింటి వేర్లూ ఒక్కటే. ముళ్లకు, పూలకు వేర్వేరు మూలం ఉండదు. ద్వంద్వం అలాగే ఉంటుంది; కానీ దానికి అతీతంగా జీవించడం నేర్చుకుంటేనే జీవనం సుఖంగా ఉంటుంది. అలా ద్వంద్వాతీతులైన వ్యక్తులే సుఖంగా జీవించగలుగుతారు. అందుకే..
 
సుఖ దుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్య స్వనైవం పాపమవాప్స్యసి

‘‘సుఖ దుఃఖాలను, జయాపజయాలను, లాభనష్టాలను సమానంగా భావించి ఆ తర్వాత యుద్ధానికి సిద్ధపడు. అలా చేస్తే నీవు పాపం అనే దోషాన్ని పోందవు’’ అని శ్రీకృష్ణుడు యుద్ధరంగంలో అర్జునుడికి భోదించాడు. శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, జయాపజయాలు, రాగద్వేషాలు ఇవన్నీ స్వరూపంగా ఒక్కటే. కానీ ప్రక్రియాపరంగా వేరుగా అనిపిస్తాయి. పొగడ్త, నింద నాణేనికి రెండు భాగాలు. కొన్నింటిని స్వీకరిస్తాం. మరొకదాన్ని తిరస్కరిస్తాం. దూషణ, భూషణాలు కూడా అలాంటివే ఒక దానిలో ఆనందం కలుగుతుంది; మరోదాంట్లో దు:ఖం కలుగుతుంది. ఇందులోని మౌలిక భేదం గుర్తించకుండా ఈ ద్వంద్వాల్లోని మాయలో పడుతుంటాం.
 
ఇది గుర్తించిన వాళ్లు మహాత్ములవుతారు. ఆనాటి ప్రసిద్ధులైననాయకుల్లో ఒకరైన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ లాంటివారు రమణ మహర్షి ముందుకు వస్తే ఎలాంటి రాగం ప్రదర్శించలేదు. శ్రీరామకృష్ణులు తనకు క్యాన్సర్‌ వ్యాధి వచ్చినా అది దేహబాధగానే భావించారు. మరి విషవృక్షం లాంటి సంసారంపై కూర్చున్న వ్యక్తులు అలా ఉండగలరా? సుఖసుఖాల లోతుపాతులను గ్రహించే ఆత్మజ్ఞానం పొందినవ్యక్తి వాటిని అనుభవిస్తూనే వాటి ఫలితాలను అంటకుండా జీవించగలుగుతాడు. అందుకు శ్రీకృష్ణుని జీవితమే ఒక ఉదాహరణ. భగవద్గీతలో పరమాత్మ చెప్పింది కూడా ఇదే. శాంతి-అశాంతి, సుఖం-దు:ఖం, చావు-పుట్టుకలను వ్యతిరేకమైన పదాలుగా చెప్తాం. వెలుతురు-చీకటి వేరు కాదు. వాటి కలయిక, సంభవం రెండూ ఒకేసారి కన్పించకపోవచ్చు కానీ ఒక చోట కలుస్తాయి. మన నిజజీవితంలో ఇవన్నీ పరస్పర వైరుధ్యంతో కూడిన అంతర్నాటకాలు. దీనిని అర్థం చేసుకోవడం వల్లనే మానవ జీవనం సాఫల్యం అవుతుంది.

********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య నివేదన ॐ*





మనకు శిల, దారు, లోహాలతో విగ్రహం తయారుచేసి పూజించే సంప్రదాయం ఉంది. కానీ.. పుష్పాలను ఆరాధ్యదేవతగా చేసుకుని పూజించే సంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉంది. సుందరంగా ఉండే ఈ నిసర్గచక్రంలో ముగ్ధమనోహరంగా కనిపించేవి పుష్పాలు. ఆ పువ్వులు ప్రకృతికే అలంకారమయ్యే రుతువు శరత్కాలం. వర్ణ సంశోభితమైన పుష్పాలను కళాత్మకంగా ఏర్చికూర్చే ఈ సంబరం చూసిన కన్నులే కన్నులు. బతుకమ్మలను తీర్చిదిద్దడం, ఆ తర్వాత వాటిచుట్టూ స్త్రీలు తమ సంగీత, నృత్య, సాహిత్య కౌశలాన్ని ప్రదర్శించేందుకకు ఆడే ఆటలు, పాటలు మరో వినూత్న చైతన్యాన్ని తెలియజేస్తాయి. చివరిరోజు సద్దుల బతుకమ్మనాడు కలిసి ప్రసాదాలు పంచుకుని ఆడిపాడి ఆనందాన్ని పంచుకొనే దృశ్యం మన పండుగల సామాజిక దృష్టిని తెలియజేస్తున్నది. అదేరోజు సాయం సమయాన నీటిలో తేలియాడుతూ పూలరథాలుగా పయనించే వర్ణశోభిత బతుమ్మల సౌందర్యంలో భాషకందని భావాలతో సాగనంపే స్త్రీమూర్తుల ఆరాధన వ్యక్తమవుతుంది.

ఈ బతుకమ్మ.. వర్షరుతువు సమాప్తిని, శరదృతువు ఆగమనాన్ని సూచిస్తూ ఏటా మహాలయ అమావాస్య నుండి ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ మహర్నవమి మహాగౌరీపూజతో ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజుల్లో తయారుచేసే బతుకమ్మలను ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పేర్లముందున్న పదార్థాలే నైవేద్యాలు. బతుకమ్మ శబ్దం ‘బృహతమ్మ’ నుంచి వచ్చిందని కొందరు చెబుతారు. కాకతీయుల వంశదేవత కాకతమ్మనే బతుకమ్మగా మారిందని మరికొందరు పరిశోధకులు చెబుతున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో తంగేడు పువ్వుగా పుట్టిన చెల్లెలే బతుకమ్మ అని జానపదగాథలు చెబుతున్నాయి.

సంప్రదాయాలు తెలిసినవారు నవరాత్రుల్లో శ్రీచక్రాన్ని ముందు పెట్టుకొని నవావరణ పూజ చేస్తే.. సామాన్య స్త్రీలు ఎలాంటి రసాయనాలూ లేకుండా పూచే తంగేడు, గుమ్మడి, బీర, కట్ల గోరింట, గునుగు, అల్లి, టేకు పూలతో బతుకమ్మను మేరుప్రస్థ శ్రీచక్రం ఆకారంలో అమర్చి ఆరాధిస్తారు. స్త్రీలు ఇంటిపనులకే పరిమితం కాకుండా ఆట, పాటలలో నిమగ్నమై సామూహిక నిమజ్జనం (సామాజిక దృష్టి) చేసి సరికొత్త ఆలోచనలకు తెరతీస్తారు. అందరూ కలిసి ఆడిపాడి కులసమానత్వాన్ని సాధిస్తారు. సద్దుల బతుకమ్మనాడు అందరూ ఇళ్లనుంచి తెచ్చుకున్న ప్రసాదాలు పంచుకుని తినడం అంటే.. రుచికరమైన పదార్థం అందరూ తినాలనే ఆత్మీయత అందులో ఉంటుంది. మాతృ ఆరాధనకు నెలవుగా ఉన్న ఈ పండుగ స్త్రీత్వాన్ని గౌరవించాలని తెలుపుతుంది. అమ్మదనం ఉండి అందరూ బతకాలి.. అందరినీ బతికించాలి అనే సందేశం ఈ పండుగలో నిగూఢమై ఉంది.

********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య నివేదన ॐ*




ఓ కీకారణ్యం - అందులో కాకులు దూరవు.. చీమలూ చేరవు. కానీ ఓ ఋషి ప్రవేశించాడు. నీటి వసతి ఉన్న చోట కుటీరం ఏర్పాటు చేసుకొన్నాడు. గడ్డాలు, మీసాలు పెంచుకున్నాడు. దండకమండల ధారియై తపస్సు ప్రారంభించాడు. ఆయనకు తన శరీరంపై ఎలాంటి మమకారం, స్పృహ లేనేలేవు. అలా సంవత్సరాలు గడిచాయి. కొన్నాళ్ళకు దేవుని దర్శనం జరిగి, సృష్టికి సంబంధించిన ఏదో సత్యం పరమాద్భుతంగా గమనించాడు.
అంతే! అది ప్రపంచానికి అందించాలనుకొన్నాడు. జనంలోకి బయల్దేరాడు. తాను గురువుగా మారి ఈ ప్రపంచానికి ఉపదేశించాడు. తనువు చాలించాడు. ఆ ఉపదేశం గురువుల వద్ద నుండి శిష్యులకు చేరింది. శిష్యులు గురువులు అయ్యారు. ఆ సిద్ధాంతం సూర్యచంద్రులున్నంత వరకు నిలబడేంత గట్టిగా స్థిరపడింది. అలా జనంలోకి వచ్చిన వేదాంతమే ఈనాడు సూత్ర, స్తోత్ర, వేద, పురాణ, ఉపనిషత్తులుగా మన వరకు చేరింది. అందులోని సారభూతమైన అంశాలే యోగం, ధ్యానం, తపస్సు, ఆరాధన, పూజ, యజ్ఞం.. ఇలా అనేక మార్పులతో సమాజంలో నిలబడ్డాయి.
ఇప్పటివరకు తైలధారగా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ విషయం వేలయేళ్ల క్రింద జరిగింది. ఆనాడు ఋషులకు, గురువులకు అంతగా వసతులు లేవు. ప్రచార, ప్రసార మాధ్యమాలు అసలే లేవు. (ఇపుడు అన్నీ స్వామిజీలను, మహాత్ములను చెడ్డగా చిత్రీకరిస్తున్నాయి) ఆ ఋషులకు ప్రచారం యావ లేదు. ప్రచారం చేసిన గురువులకు తస్య దర్శనమే కాని ‘సత్తా’ (అధికారం) స్పర్శనం లేదు. ఏమీ లేని కాలంలో మానవుల్లో ఇంత అద్భుతంగా ‘నైతికత’ ను తీర్చిదిద్దారు ఋషులు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇంత గొప్ప పరంపర నుండి వచ్చిన మనం ఏ రకంగా ముందుకు కదులుతున్నాం!
వైదేశిక భావజాలం, స్వార్ధం, హింస, దోపిడీ, అవినీతి... ఇవి మాత్రమే మన పరమ లక్ష్యాలుగా (చాలామందిలో) ఉన్న ఈ రోజుల్లో మానవ ధర్మానికి ఏం కావాలో అది చేయడం లేదు. మనిషిని పశుత్వం నుండి బయటకు తీసుకొని వచ్చి.. ఇంకా ముందుకు పోయి నరోత్తముడిగా మార్చే సంస్కృతి మనది.
సత్యదర్శనం చేయడం మాత్రమే తెలిసిన మన పరంపర విశ్వానికే ఆదర్శవంతమైన సూత్రాలను రూపొందించాం. ప్రపంచానికి అందించాం.
వేదంలో ప్రకృతి, సూర్యుడు, గణితం నైతికభావజాలం, మానవులను విశ్వజనీనులుగా చేయడానికి కావాల్సిన సూత్రాలను రూపొందించారు. పురాణంలో వాటిని గాథలుగా మార్చి చక్కని ప్రయోజనాన్ని ఉపదేశంగా మనకు అందించారు.
ఇంకా వీరికి అర్థం కావనే ఉద్దేశ్యంతో రకరకాల మాధ్యమాలుగా మార్చి ఈనాటి స్థిరీకృతమయ్యేట్లుగా చేసారు. కానీ మనం నేనూ... నా కుటుంబం... ఇంకెవ్వరు మనుషులు కారు అనే రీతిలో వ్యవహరిస్తూ సత్యాన్ని విస్మరిస్తున్నాం. అటు ప్రకృతిని కాపాడుకోలేకపోతున్నాం. ఇటు మన సంస్కృతినీ కాపాడుకోలేకపోతున్నాం. ఏం ‘ఖర్మ’ పట్టింది మనకు?
మన పద్ధతులు మార్చుకొని చూద్దాం
మీరు ప్రొద్దునే ‘వాకింగ్’కు (కాలినడకన) వెళ్తున్నారా? మీ వెంబడి కొందరు ‘రన్నింగ్’కు (పరుగు) వస్తుంటారు. వారిని గమనించండి. అశ్లీలపు సినిమా పాటలు సెల్‌ఫోన్లో పెట్టుకొనో, లేదా బాగా ఉత్సాహం ఉరకలెత్తే (ఫాస్ట్‌బీట్) పాటల్ని పెట్టుకొనో రన్నింగ్ చేస్తుంటారు  ఇదే నేటి యువత తీరు! (అందరు కారు!)
ఏదైనా ఓ బస్సు ఎక్కండి! అందులో సడన్‌గా మధ్య సీట్లో ఏదో సినిమా పాట వినిపిస్తుంది. వెనుక సీటు నుండి ఎఫ్‌ఎమ్ రేడియో పాటలు విన్పిస్తాయ్. ముందు సీటు నుండి ఇంకో పాటల మోత  ఇవన్నీ కలగలసి మన చెవులకు శబ్దకాలుష్యం! ఏం... మనఖర్మ!
గుళ్లకి వెళ్లి చూడండి  కనీస సంప్రదాయ దుస్తులు లేకున్నా ఫర్వాలేదు జీన్స్, మిడ్డీలు  స్కర్ట్‌లు ... ఎంత ఘోరం! కాదు కాదు ఎంత అపచారం!
ఇంట్లో మనుషుల్ని చూడండి! సెల్‌ఫోను, టీవీలతో తప్ప మనుషులతో ఇంట్లో ఉన్నవాళ్ళతో మాట్లాడనే మాట్లాడరు  ఎంత వింత!
చిన్న పిల్లల్ని పలకరించండి! వాడి టై.. వాడి బుక్స్... వాడిగోల వాడిది. ముసలాళ్లలను గెలకండి! అనంత దుఃఖరాశి వారి హృదయాల నుండి పొంగి పొర్లుతుంది! ఏమైంది జాతికి!
స్త్రీలను మందలించండి! అమ్మా!.. నీకు ఏమైందని...?
ఎక్కడో గ్రామంలో ఉండే అత్తగారిమీద, ఇంకో ఊర్లో బతుకుతెరువుకు వెళ్లి స్థిరపడ్డ తోడికోడలు మీద.. పరాయి ఇంటికి వెళ్లిన ఆడకూతురు మీద.. ఇంటి పక్క ఎల్లమ్మ మీద.. ఎదురింటి మల్లమ్మ మీద.. లేనిపోని కారుకూతలు... అసూయలు.. ఈర్ష్యలు! ఏమయింది మన నారీ వారసత్వం!
ఇలా పార్టీలుగా, వర్గాలుగా, కులాలుగా, వ్యక్తిగా ఎక్కడికక్కడ గోడలు కట్టుకొని మన్నింపు లేని మనుషులుగా జీవిస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ అశాంతికి కారణమై బ్రతకడం విడ్డూరం.
ఆత్మస్తుతి... పరనింద ఒకవైపు..! ఆత్మాభిమానం పేరుతో సోమరితనం నూరిపోసే వర్గం ఇంకోవైపు!
మనిషి తనంతకు తాను కట్టుకొన్న ఈ అడ్డుగోడలు, వేసుకొన్నీ పరదాలు తొలగించుకోకపోతే జీవితానికి అర్థమే లేదు.
ఒక్కసారి మన అంతరంగంలోకి తొంగిచూద్దాం! ఇంద్రియాల ముందు లొంగిపోయిన మన మనస్సును వంచి పరమాత్మవైపు అడుగులు వేద్దాం!
నిత్యజీవితంలో మనం చేస్తున్న పొరపాట్లను మన్నించి తనవైపు మన హృదయాన్ని నింపమని ఆ హృదయేశ్వరుణ్ణి స్మరణం చేద్దాం.
ఎన్ని ఆధునిక పోకడలు మన జీవితంలో వచ్చినా, ఎంత కృతకత్వం మనకు కల్గినా సత్యరూపం కల్గించమని భగవంతుని కోరుకుందాం! విశ్వమంతా నీ రూపమని విశ్వం నీ చేతనే నడుస్తుందని, నీవు విశ్వమయుడని ఒక్కసారి గొంతును ఎలుగెత్తి ప్రార్థన చేదాం!
************************************
డాక్టర్. పి. భాస్కర యోగి
ఆధాత్మికం  : విజయక్రాంతి



బతుకమ్మ పూజతో ఆత్మారాధనం, భూతారాధనం, ప్రాఙ్మానవ దేవతారాధనం, మాత్రారాధనం, సర్వదేవతారాధనం కన్పిస్తుంది. ప్రపంచంలోనే పూలను పూజించే పండుగ బతుకమ్మ. పూలు సాకారానికి, నిరాకారానికి సమన్వయ స్వరూపం. అవి సజీవంగా, సాకారంగా కన్పిస్తాయి. సాయంత్రానికి మాయమవుతాయి. పసుపు ముద్దను గౌరమ్మగా చేసి పూల మధ్యలో పెడతారు. ఈ గౌరమ్మనే  త్రిమూర్త్యాత్మక స్వరూపం.

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ బతుకమ్మ పండుగ. ఇది ఒక జానపద ఉత్సవం. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. అయితే బతుకమ్మ పండుగను సద్దుల బతుకమ్మ, గౌరి పండుగ అనే పేర్లతో వ్యవహరిస్తారు.
బతుకమ్మను లక్ష్మీ, పార్వతీ, సరస్వతుల  త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావిస్తారు. అయితే శ్రీ లక్ష్మీదేవే ‘బతుకమ్మ’ స్వరూపంలో, ఆమె అవతారంగా తెలంగాణ ప్రాంతంలో ఆరాధన చేస్తారు. ఇక్కడ ‘లక్ష్మీ’ అంటే సంపద, ధనం, ధాన్యం, సంతానం, సౌభాగ్యం, వైభవం, విద్య అని భావిస్తారు. ఆమెనే ఈ సంపదలను ఇవ్వడానికి ‘శ్రీవాణి’ గిరిజగా భాసిస్తుందనేది అంతరార్థం.

శ్రీలక్ష్మినీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా! అన్న తెలంగాణ ప్రసిద్ధ బతుకమ్మ పాటలో ఇవన్నీ కన్పిస్తాయి. సర్వదేవతాస్వరూపమైన బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణలో దేవీ నవరాత్రులతో సమానంగా నడుస్తాయి. ‘ఆశ్వియుజ శుద్ధపాడ్యమికి’ ఒక రోజు ముందు మొదలై నవమి వరకు కొనసాగుతాయి. ఇది పౌరాణిక విశేషం అయితే, దీనికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక పండుగలు  పర్వాలు జరుగుతాయి. అవి కొద్దిపాటి తేడాతో అనేకచోట్ల జరుగుతాయి. కాని తెలంగాణ ప్రాంత ఆత్మను ప్రకటించే పండుగ బతుకమ్మ. జన సామాన్యంలో నుండి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ బతకమ్మ. ఈ బతుకమ్మకు అర్థం ‘జీవించు  బ్రతికించు’ అని. అదే తెలంగాణ సంస్కృతిలో ఆయువుపట్టుగా నిలిచింది. అన్యోన్య అనురాగం, ప్రేమించే తత్వం తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉందంటే దానికి మూలసూత్రం బతుకమ్మలో కన్పిస్తుంది. 
బతుకమ్మ పండుగకు ఓ గొప్ప చారిత్రక ఆధారం కన్పిస్తుంది. తెలంగాణ ప్రాంతాన్ని కాకతీయ రాజులు ఎంత గొప్పగా పాలించారో జగమెరిగిన సత్యం. కాకతీయ రాజ్య పాలకుడైన ‘గుండన’ పాలనలో పొలం దున్నుతుండగా గుమ్మడి తోటలో ఓ ‘స్త్రీ దేవతా విగ్రహం లభించింది. గుమ్మడిని సంస్కృతంలో ‘కాకతి’ అని పిలుస్తారు. గుమ్మడితోటలో లభించినందువల్ల ‘కాకతమ్మ’ అనే పేరుతో రాజులు ఆమెను పూజించారు. కాకతి విగ్రహాన్ని రాజవంశమే కాదు ఈ ప్రాంత ప్రజలంతా పూజించారు. రాను రాను విగ్రహం కన్నా, విగ్రహం ముందు (విగ్రహం మునిగేట్టుగా) పూలకుప్పలు పోసి ఆ కుప్పను పూజించడం మొదలుపెట్టారు. ఆ పూలకుప్పనే  ‘దేవతా స్వరూపం’గా మారిపోయింది. కాకతమ్మ అనే శబ్దం, బతుకమ్మ పేరుగా మారింది.

కాకతీయ వంశోద్భవకారిణీం
లోకోద్ధరణ స్వరూపిణీం
కృపామయీం కలుషహరిణీం
శక్తిమయీం రిపు విదారిణీం

నమామి శర్వాణీం ముక్తి దాయినీం అని కాకతీయులు కాకతమ్మను చేసిన ప్రార్థన. కాకతీయులకు శక్తి, పరాక్రమాలందించిన ఈ దేవతను మాతృస్వరూపణిగా ఆరాధించి అటుశక్తి తత్వాన్ని, ఇటు ‘మాతృ దేవతారాధన’ను వారు స్థిరీకరించారు. ఆ కాకతమ్మనే అందరికీ బ్రతుకమ్మగా  బతుకునిచ్చే తల్లిగా చారిత్రక పరిణామం.

బతుకమ్మ సందేశం
ఇంతగా ఆరాధించే బతుకమ్మకు ఎలాంటి విగ్రహం దారుహా ఏర్పడలేదు. ప్రకృతిలో నుండి లభించిన పూలను ఉపయోగించి దేవతగా సిద్ధం చేసే బతుకమ్మ ఆరాధన విశిష్ఠమైంది. ఇది నిరాకార నిర్గుణ ఆరాధనగా కూడా చెప్పవచ్చు. మట్టి నుండి పుట్టిన చెట్టు, ఆ చెట్ల నుండి వచ్చే పూలు మళ్లీ నీటిలో కలిసిపోయి మట్టిగా మారినట్లే జీవులన్నీ ఎక్కడి నుండి పుడతాయో భోగాలను అనుభవించి అక్కడికే చేరతాయి. అన్న ఆధ్యాత్మిక, తాత్విక సందేహసంలో ఈ పండుగ మనకు ఇస్తుంది. ఎన్నో రకాల పూలు ఒకదానిపైన ఒకటి కూర్పబడి అందంగా బతుకమ్మ నిర్మాణం అవుతుందో అలాగే ఎన్నో కులాల, వర్గాల మనుషులు కలిసి మెలసి అందమైన సమాజంగా మారాలనే సామాజిక సందేశం కన్పిస్తుంది.
మనకళ్లముందే వికసించిన పుష్పాలు మన మనస్సుకు ఆనందాన్ని కలిగించి పంచభూతాల్లోని నీటిలో కలిసిపోతాయి. అలాగే ఉన్నంతసేపు రంగు రంగుల పూలతో దర్శనమిచ్చి, పై భాగంలో గౌరమ్మ, దీపం, అగరవత్తుల వెలుగులు, వాసనలు, అన్నీ మాయమైపోతాయి. ఓ జీవుడా! నీవు ఎక్కడి నుండి వచ్చావు మధ్యలో అలంకారాలు చేసుకొని మాయమైపోతావు అన్న తాత్విక సందేశం ఇందులో ఉంది. 
బతుకమ్మ ఓ సామాజిక ఉత్సవం. సమాజంలో ఎలాగైనా భిన్న దృక్పథాలు  భాష, ప్రాంతం, కులం గలవాళ్లు జీవిస్తున్నారో అలాగే ప్రకృతిలోని ఎన్నో రకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. 

అని స్త్రీలు వాకిట్లో పెట్టి చుట్టూ తిరుగుతూ పాడుతారు. 
బతుకమ్మ లక్ష్మీదేవి స్వరూపం, గౌరిదేవి స్వరూపం, సరస్వతీ స్వరూపం కాబట్టే ఈ ముగ్గురి ఆరాధన ఇందులో కన్పిస్తుంది. అందుకే ‘భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై’ అని పాడుకుంటారు. బతుకమ్మ పండుగ అంతా అమంత్రకంగా స్త్రీలు జరిపే ఉత్సవం. అందువల్ల అనేక పాటలు పుట్టుకొచ్చాయి.
బతుకమ్మకు సంబంధించి భట్టు నరసింహకవి రచించిన పాటనే ప్రధాన ఆధారం. నరసింహకవి ఉయ్యాల పాటలో బ్రతుకమ్మ మూలాలు కన్పిస్తున్నాయి. ఇలా జానపద గాథ బతుకమ్మ చుట్టు తిరుగుతున్నది.

ధరచోళదేశమున ఉయ్యాలో ధర్మాంగుడను రాజ ఉయ్యాలో 
ఆ రాజు భార్యరో ఉయ్యాలో అతివ సత్యవతి ఉయ్యాలో..

ధర్మాంగరాజు భార్య సత్యవతి మళ్లీ ఎన్నో పూజలు చేయగా సాక్షాత్తు ‘లక్ష్మీదేవి’ అనుగ్రహించి నీ కూతురుగా వస్తానన్నదిట. పుట్టిన బిడ్డను ఆశీర్వదించటానికి దేవాన దేవతలు, మహర్షులు వచ్చి..

బ్రతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బ్రతుకమ్మ అనిరంత ఉయ్యాలో
శ్రీలక్షి దేవియు ఉయ్యాలో సృష్టి బతుకమ్మాయె ఉయ్యాలో.. 

అని ఆమె ‘బతుకమ్మ’ కావాలి అనే నామకరణం చేశారని, ధర్మాంగదుని జానపదగాథ తెల్పుతుంది. మరి బతుకమ్మ ఏ దేవి స్వరూపం? లక్ష్మీదేవియా, పార్వతియా అని ఆలోచిస్తే 

శ్రీ లక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ  చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
భారతీ దేవివై బ్రహ్మకిల్లాలివై పార్వతీ దేవివై పరమేశురాణివై
వరలక్ష్మీవయ్యా గౌరమ్మ భార్యవైతివి హరికినీ గౌరమ్మ

అనే పాట బతుకమ్మను త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ, లక్ష్మీ, గౌరీ స్వరూపంగా తెలియచేస్తుంది. బతుకమ్మకు సంబంధించి ఎలాంటి పౌరాణిక ఆధారాలు, శ్లోకాలు దొరకవు కాబట్టి బతుకమ్మ పాటలే మనకు ఆధారం. మొత్తానికి బతుకమ్మ కాకతీయుల కాలం నుండే ఆవిర్భవించినట్లు ఒక నిర్ధారణకు రావచ్చు. మహాలయ అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు సాగే బతుకమ్మ ఆరాధన తెలంగాణకు ప్రత్యేక శోభను కల్గిస్తుంది. 

తొమ్మిది రోజులూ ఉయ్యాలో
అతరి గుమ్మడి పూలు ఉయ్యాలో 
అని మొదలై...
పాడి పంటలు గలుగు ఉయ్యాలో
విష్ణుపథము గలుగు ఉయ్యాలో..  అని ముగిస్తారు.
బతుకమ్మ వేడుకల చివరి రోజు చీకటి పడే వేళకి  ఆడపడుచులందరూ బతుకమ్మలను తలపై పెట్టుకుని  పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా వెళ్తారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో, వాయిద్యాలతో కన్నుల పండుగగా వుంటుంది. జలాశయం చేరుకున్న మహిళలు బతుకమ్మలను పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత చక్కెర, రొట్టెతో చేసిన ‘మలీద’ అనే వంటకాన్ని బంధువులకు పంచిపెట్టి తింటారు. 
డా॥  పి. భాస్కరయోగి

తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు
9రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.
ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట  అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..
అలిగిన బతుకమ్మ: ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
చద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం.
తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.
బతుకమ్మను సిద్ధంచేయుట
దుసరి తీగతో అల్లిన ‘సిబ్బి’ లేదా ఇత్తడి తాంబూలం, ఏదైనా పళ్లెంలో పుష్పాలను మేరుప్రస్థ శ్రీ చక్రంలాగా వర్తులాకారంగా పేరుస్తారు. ఈ పుష్పాల అడుగు భాగంలో పెద్దవైన మోదుగ, టేకు, బాదాం వంటి ఆకులను పరుస్తారు. దానిపైన రకరకాల పూలు బంతి, గునుగు, గోరంట, తంగేడు, నీలంకట్ల, కాకర, బీర, గన్నేరు, పారిజాత, పొన్న, మందార, మొల్ల, మల్లె, గుల్మాల, రుద్రాక్ష వంటి ప్రకృతిలో పెరిగే పూలను సేకరిస్తారు. వాటిని చక్కగా అలంకరించి దారంతో కడతారు. పై భాగంలో పసుపు ముద్దను పెట్టి గౌరమ్మగా భావిస్తారు.

శ్రీరామచంద్రుడూ ఉయ్యాలో అయోధ్య పట్నాన ఉయ్యాలో..
శుక్రవారమునాడు ఉయ్యాలో  చన్నీటి జలకాలు ఉయ్యాలో.. 
చిత్తుచిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ..
ఏమేమి పువ్వొపూచే గౌరమ్మ ఏమేమి కాయేపూసే..
కలవారి కోడలు ఉయ్యాలో కనకమాలక్ష్మి ఉయ్యాలో
ఊరికి ఉత్తరాన వలలో ఉడాలమర్రి వలలో
తంగేడు పూవుల్లో చందమామ మ్లెప్పుడొస్తావు చందమామ
ఒకనాటి కాలాన ఉయ్యాలో ఏమీ జరుగుతుందమ్మ ఉయ్యాలో

గంగమ్మ గౌరమ్మ కోల్ గొవ్వలడంగా కోల్


************************************
డాక్టర్. పి. భాస్కర యోగి
ఆధాత్మికం  : విజయక్రాంతి
సోమవారం : అక్టోబర్  : 08 : 2018