తూలుతూ వెళ్తున్న తాగుబోతును ఒ పెద్దమనిషి అడిగాడట. “ఏమయ్యా! ఎందుకు తాగుతున్నావు”? అని.తాగుబోతు సమాధానం ఇస్తూ “ చేసిన అప్పుల బాధలు మరిచిపోవడానికి”? అన్నాట్ట. వెంటనే పెద్దమనిషి ‘మరి అప్పెందుకు చేసావు’ అన్నాడట. ఇంకెం దుకు తాగడానికే! అన్నాడట  తాగుబోతు!

 సరిగ్గా ఇటీవల మూకదాడులనే పదాన్ని సరిక్రొత్త అకాడమిక్ పరిభాషగా మార్చడానికి ప్రయత్నిస్తున్న వారి తీరు ఇలాగే ఉంది. గుంపుగా వెళ్ళి బలహీనులపై దాడులు చేసే దాన్ని ‘మూకదాడి’ అంటాం. ఇటీవల సుప్రీంకోర్టు దానిపై కేంద్రానికి కొన్ని నిర్దేశాలు జారి చేసినందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం క్రొత్త చట్టాలను రూపొందించడమో, పాత చట్టాలకు పదును పెట్టాలనో చర్చ ప్రారంభమైంది.

ఏ నాగరిక సమాజంలోనైనా ఒకరిపై ఒకరు దాడి చేయడం ఆటవిక మనస్తత్వం. అలాగే రాజ్యాంగబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వపాలనలో ఉన్న మనలాంటి దేశాల్లో  అది అత్యంత గర్హనీయమైన చర్య. అయితే అది ఎవరు చేస్తే మూకదాడి? ఎవరు చేస్తే మూగరోదన! అన్న విషయంలోనే భేదాభిప్రాయాలున్నాయి. 

ప్రతి విషయాన్ని కులాల, మతాల దృష్టికోణంలో పరికిస్తున్న మనకు, ప్రతి అంశంలో రాజకీయకోణం వెతుకుతున్న మనకు ఇదొక రాజకీయ అస్త్రమేగాని చిత్తశుద్దితో ఈ విషయాన్ని నిర్మూలించే మనసు లేదు. అందుకు ఈ దేశంలో స్వాతంత్య్రం రాక ముందు నుండి ఈ రోజు వరకు వేల ఉదాహరణలు చెప్పవచ్చు.  

భారతదేశపు ఒకప్పటి విస్తీర్ణం 76.58,300 చ.కి.మీ. మరి ఇప్పుడు, 31,66,414 చ.కి.మీ. ఈ దేశం ఎందుకు ఇంతగా కుంచించుకు పోయింది. జమ్మూకాశ్మీర్‌లోని 5 లక్షల హిందూ జనాభా వేలల్లోకి ఎందుకు పడిపోయిందో ఎవరైనా చెప్పగలరా? 1947లో క్రైస్తవులే లేని త్రిపురలో ఇపుడు లక్షాయాభైవేలకు పైగా ఎలా పెరిగింది?

ప్రతి సంఘటనకు చర్య, ప్రతి చర్య రెండూ ఉంటుంటాయి. ఇవి నాణానికి బొమ్మా  బొరుసులాంటివి. ఏదైనా సంఘటన గురించి మాట్లాడినపుడు చర్య, ప్రతిచర్య రెండింటి గురించి మాట్లాడాలి. కానీ ఈ మేధావులు ప్రతిచర్య గురించి మాట్లాడడం వల్లనే ఈ స్వయం ప్రకటిత మేధావుల శీలాన్ని శంకించాల్సి వస్తుంది!? కేవలం ఔరంగజేబు శౌర్యాన్ని గురించి మాట్లాడి శివాజీ ధైర్యాన్ని సందిగ్ధం చేయడమే ఈ సంఘటనల్లోని మూల సమస్య! 

కారల్‌మార్క్స్, జోసఫ్ స్టాలిన్, మావోసేతుంగ్‌లను మాహాత్ముల్లా కీర్తించి సావర్కర్‌ను, తిలక్‌ను, వివేకానందుడిని వెనక్కి నెట్టడమే అసలు సమస్య!?

1857 తిరుగుబాటు తర్వాత బ్రిటీషు వారు కుటిల నీతిని ఉపయోగించి సైన్య నియామకంలో హిందువుల్లో విభజన తీసుకు వచ్చారు. క్షాత్ర (martial)  క్షాత్రేతర (non martial) పేరుతో రెండు వర్గాలుగా విభజించారు. అకుంఠిత దేశభక్తులైన మరాఠాలను ఏకాకులను చేసి విభజించు  పాలించు సిద్ధాంతం అమలుచేసినప్పటి నుండే ఈ దేశం అలాంటి పద్ధతులకు అలవాటు పడింది. ఎక్కడో టర్కీలో ఖలీఫాను రక్షించాలని భారతదేశంలో ఆందోళనలు రేపి ఇక్కడి హిందువులను ఊచకోత కోసినరోజే ఈ జాతి మూకదాడులకు అలవాటు పడింది.

 1906 డిసెంబరు 30న ఆలిండియా ముస్లిం లీగ్ ఏర్పడింది. బ్రిటీష్ వారి అడుగులకు మడుగులొత్తడానికి పుట్టిన ఆ సంస్థ ఆశయా లు, లక్ష్యాలు ఈ దేశంలోని హిందువులపై ఎంత విషం కక్కే విధంగా ఉన్నాయో పట్వర్థన్, మెహతాలు రచించిన “ ది కమ్యూనల్ ట్రయాంగిల్‌” అనే పుస్తకం చూస్తే అర్థమవుతాయి.

ముస్లీం లీగ్ ఆవిర్భావ సమయంలో లాల్ ఇస్తహర్ పేరిట పంచిన ఎర్రకరపత్రాల్లోని విజ్ఞప్తులు, సూచనలు చూస్తే మన మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ ఎర్రకర పత్రంలోని ప్రకటనల వల్ల కొన్ని రోజుల్లోనే 1907 మార్చి 4న నేటి బంగ్లాదేశ్‌లోని కొమిల్లా ప్రాంతంలో నవాబ్ సలీముల్లా అనుచర గుండాలు దాడిచేసినపుడు జరిగిన మానభంగా లు, లూటీలు, ఆస్తుల విధ్వంసం, గృహ దహనాలు ఏ వర్గం వారివో సోకాల్డ్ మేధావులు నోరు తెరచి చెప్పగలరా? అప్పుడు హిందువులు పట్టిన మూగనోము ఇంకా విడువలేదు. చరిత్రను త్రవ్వితే కుప్పలు తెప్పలు పుట్టుకొస్తాయి. చరిత్రకు వెయ్యేండ్లకు, పదిరోజులకు తేడా లేదు.

గాంధీకన్నా ముందు ఈ దేశంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు నడుం కట్టిన స్వామిశ్రద్ధా నందను 1926 డిసెంబర్ 23న అబ్దుల్ రషీద్ అనే మతోన్మాది కాల్చిచంపినా హిందువులు మూగగా రోదించారు కానీ ఎవరిపై మూకదాడి చేయలేదే? ఇటీవల లోక్‌సభలో సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించినట్లు 1984 ఇందిర హత్య తర్వాత సిక్కుల ఊచకోత ఎంత పెద్ద మూకోన్మాదమో మర్చిపోయామా!  ఇందిర మరణానంతరం గద్దెనెక్కిన రాజీవ్‌గాంధీ ఒక మహావృక్షం నేలగూలినపుడు చుట్టు ప్రక్కల భూమి కంపించటం సాధారణ విషయం అనడం ఎంత వైచిత్రి.

ఆ కేసుల్లో నిందితులుగా చెప్తున్న జగదీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్‌లను ఇన్నేళ్ళ ప్రభుత్వాలు శిక్షించాయా? యాకుబ్‌మెమెన్ ముంబాయి పేలుళ్ళు ఎవరినుద్దేశించి చేసాడో చెప్పగలరా! 

అఫ్జల్ గురు, కసబ్ భారతదేశంపై దాడికి ఏ ఉద్దేశంతో వచ్చారు? వాళ్ళ దాడులను గజనీ, ఘోరీ, బాబర్‌లు చేసిన యుద్ధాన్ని ఏ సరికొత్త పదంతో నిర్వచిస్తారు!? ఇన్ని దాడుల్లో మూగగా రోదించిందెవరు? మూగనోము పట్టి నటించినదెవరు?! లక్షలాది హిందూ కాశ్మీరీ పండిట్లు లోయనుండి ఎందుకు తరిమివేయబడ్డారు? మూకదాడులపై మాట్లాడేవారు కేరళలో జాతీయవాదులపై దాడులు, బెంగాల్‌లో నిత్యకృత్యమైన తృణమూల్ దౌర్జన్యాలపై ఎందుకు ప్రశ్నించరు? సెక్యులర్ సిద్ధరామయ్య కర్ణాటకలో జరిగిన హత్యలను ఎందుకు ప్రస్తావించరు?

దేశంలోని పత్రికా సంపాదకులు మొదలుకొని చోటామోటా నాయకుల వరకు 2002 గుజరాత్ అల్లర్లు దారుణం, అవి మూకదాడులే అని ప్రస్తావిస్తారు. నిజంగా అలా జరుగడం దారుణమే!  కానీ మూలకారణమైన సబర్మతీ రైళ్లో 79 మంది రామకరసేవకుల దహనం ఎందుకు జరిగిందో, ఎవరు చేసారో ఒక్క వాక్యం వీళ్ళ పెన్నుల నుండి సిరా కదిల్చి రాయరు!? సబర్మతీ రైళ్ళో చంపబడిన కరసేవకుల శవాల దగ్గరకు వెళ్ళి ఈ సూడో మేధావులు, పార్టీలు సానుభూతి తెలిపి ఉంటే తర్వాత ఘోరం జరిగేదే కాదు. 

మతాలను బట్టి మూకదాడులను నిర్వచించడం వల్లనే ఈ రోజు ఇన్ని రకాల అపార్థాలకు దారులు పడుతున్నాయి. “ఏ మతంవారైనా మూకదాడులు చేయడం తప్పు” అని చెప్పే ధైర్యం ఎవరికీ లేకపోవడం వల్లనే ప్రతివారూ ప్రతి విషయంలో కుల, మతాల బేరీజు వేసుకొంటున్నారు. 

జాతిపిత మహాత్మాగాంధీ ప్రవచించిన ‘సెక్యులరిజం’ మనం అనుసరిస్తున్నాం. మరి గాంధీజీ స్వాతంత్య్రం వచ్చాక చేయాలని చెప్పిన మూడు పనుల్లో గోవధ నిషేధం ఒకటి.
అందువల్లనే చాలా రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టాలున్నాయి. వెయ్యేళ్ళు బానిసత్వంలో మగ్గిన హిందువుల కోసం ఒక్క గోవధ నిషేధ చట్టం అమలు చేయలేమా? గోవును ఎవరు తింటారు అనేది ప్రక్కన పెడితే ఈ దేశ మెజారిటీ ప్రజల మనోభావలకు విలువ లేదా? గోవులను భుజించడం ఆహారస్వేచ్ఛగా చెప్తున్న కొందరు నిజమైన దళితుల మనోభావాలను గాయపరచడం నిజం. 

డా॥ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పి క్రొత్త వివాదాలు సృష్టిస్తున్న వారు బౌద్ధధర్మాన్ని బాబా సాహెబ్ ఫ్యాషన్‌గా స్వీకరించాడనుకొంటున్నారా? లేక రాజకీయ ఎత్తుగడకు బౌద్ధాన్ని ఆయన తలకెత్తుకున్నాడను కుంటున్నారా? ఒక మేక పిల్ల ప్రాణం కోసం తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డ సిద్ధార్థుడిని త్రికరణశుద్ధిగా డా॥ బాబా సాహెబ్ అనుసరించి, అభిమానించాడు.

అంతటి అహింసామూర్తిని ఆదర్శంగా స్వీకరించిన డా॥ అంబేద్కర్ గోవులను వధించి ‘బీఫ్ ఫెస్టివల్స్’ చేయమన్నాడా!? బౌద్ధాన్ని అంబేద్కర్ కేవలం హిందుత్వపై తిరుగుబాటుగా స్వీకరించలేదు. అందులోని తత్వదృష్టి, సామాజిక భావనను ఆధారం చేసుకొని ఆయన బౌద్ధాన్ని స్వీకరించి హిందుత్వలోని ఛాందస కులతత్వానికి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. మనిషి ప్రవృత్తిలో మార్పు రానంతవరకు అన్ని మతాలలో ఇలాంటి కలుపుమొక్కలు మొలుస్తాయి. వాటిని పీకేయాల్సిందే. కానీ ఇతరమతాలను రెచ్చగొట్టడానికి గోవధకు పాల్పడడమెందుకు? ఇలాంటి ఉద్రిక్తతలు సృష్టించి వివాదాలు చేయడం ఎందుకు? రాజ్యాంగబద్ధమైన గోవధ నిషేధాన్ని ఉల్లఘించడం డా॥ బాబా సాహెబ్ అంబేద్కర్ ను గౌరవించడమా?

గోవును పూజించడం హిందువుల నమ్మకం అనుకొందాం. మరి ఇవాళ గోవును చంపడం ద్వారా వారిని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులది పరోక్షంగా మూకదాడి గాక ఇంకేమిటి? నిజానికి హిందూ వర్గాలు తప్పు చేస్తే మన దేశంలో వాళ్ళను చంకన ఎత్తుకునే వాళ్ళు ఎవరూ లేరు. గోసంరక్షణ పేరుతో దాడి చేసే వ్యక్తులను సంయమనం పాటించాలని ప్రధాని నరేంద్రమోడీనే తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇదే విషయంపై 2017లో న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎం ఖన్వీల్కర్ ధర్మాసనం వివిధ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. అయితే ఇలాంటి దాడుల ఘటనలు చాలా స్వల్పం. కానీ వాటికి రాజకీయ ప్రయోజనాలుండడం వల్ల ప్రచారం గరిష్టస్థాయిలో జరుపుతూ స్థానికంగా జరిగే వాటిని కూడా కుల, మత కోణాల్లో చూపిస్తూ సమన్వయం కాకుండా సంఘర్షణకు ఆజ్యం పోస్తున్నారు.

ఏడాదికి ముందు గల్ఫ్‌లో అనుమతి లేకుండా సత్యనారాయణ వ్రతం చేసారని మంగళూరు, ఉడిపి ప్రాంతాలకు చెందిన 9 మందిని కువైట్ నుండి బహిష్కరించారు. మరి మన దేశంలో స్వేచ్ఛగా ఆరాధన చేసుకునే సౌకర్యం ఉంది. ఎక్కడో జరిగే స్థానిక సమస్యను జాతీయ, అంతర్జాతీయ సమస్యగా మార్చి ఈ దేశంలో స్వేచ్ఛ లేదు అంటున్నవారు నిన్నటికి నిన్న అమెరికాకు చెందిన ‘హిందూ అడ్వక్వసీ గ్రూప్’ ప్రకటించిన అభిప్రాయం వింటే నివ్వెరపోతారు. 

భారత్‌లో మతపర మైన మైనార్టీలకు 600 మిలియన్ డాలర్ల బడ్జెట్ ఇచ్చి భారత ప్రజాస్వామ్యంలోని వైవిధ్యం ఈ దేశ మెజారిటీ ప్రజలు కనబరిచారని పేర్కొంది. ఈ నివేదికను హిందూ అమెరికన్ ఎండీ సమీర్ కైరా విడుదల చేశారు. ప్రపంచంలోని ఏ దేశంలో లేని స్వేచ్ఛ ఇక్కడ ఉండడం ఎవరి ఉదారత అన్నది విస్మరిస్తే ఆత్మహత్య సదృశమే!

********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం :  విజయక్రాంతి




‘పిచ్చి కుదిరింది, తలకు రోకలి చుట్టమన్నాట్ట’ వెనుకటికొకడు. సమాజంలో కులోద్రేకాలు రేకెత్తించడానికి ఓ అనామకుడు పథకం ప్రకారం వాచాలత్వం ప్రదర్శిస్తే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న పాలనవారు దోషికీ, సాక్షికీ ఒకే శిక్ష వేయడం ఎలా సబబు?

తన స్వంత పాపులారిటీతో ప్రసార మాధ్యమాలను, సామాజిక మాధ్యమాలను వాడుకొంటున్న ఇలాంటి విషపు ఎత్తులను మొలవకుండా ఆపడానికీ దెబ్బకొట్టించుకొన్న వాడికీ బహిష్కరణ శిక్ష వేయడం ఏ నాగరిక చట్టంలో ఉంది?
ఈ దేశంలో హిందువులను, వారి సంస్కృతిని ఎంత దూషిస్తే అంత ప్రచారం పొందొచ్చన్న కుత్సితం నేర్పిస్తున్న ప్రసార మాధ్యమాల దిక్కుమాలిన చర్య భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందా?

ఏమీ తెలియని వాళ్లు మతిలేకుండా తలాతోకా లేకుండా ఏదో మాట్లాడితే తెంపరితనంతో ప్రసారం చేయడం ఏ రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం! 

భారతదేశ దీనస్థితి చూస్తుంటే అధిక సంఖ్యాకులైన హిందువులకు ఈ దేశంలో స్వాతంత్య్రం వచ్చిందా? అనే అనుమానం లుగుతున్నది. 

ఎవరికి తోచినంత పేడ వారు హిందుత్వంపై చల్లుతుండడం, దానికి ప్రజాస్వామ్యమనే ముసుగేయడం తెంపరితనం కాక ఇంకేమిటి?

*********************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి


మార్కెట్‌ మాయాజాలంలో ఏది పడితే అది నమ్మడం ఓ బలహీనత. ఆ బలహీనతను ఆసరగా చేసుకోవడం పాపం పుణ్యం లేని నైపుణ్యం…! 

లేకపోతే తిరుమల సుప్రభాత సేవ టిక్కెట్లను బ్లాక్‌లో కొనుక్కొని పూజలు చేయడం ఏమిటి? సినిమా టిక్కెట్లు ఎక్కువ ధరకు కొనడంలో కొంత తెలివి తక్కువ తనమున్నా అందులో వినోదం ఉంది. మరి దేవుడి దగ్గర వ్యాపారం ఏంటి? వింత కాకపోతే!

ఇదిలా ఉండగా నగలు రెట్టింపవుతాయని ఏదో సినిమాలో ‘అరగుండు’లు చేసినట్టు కరక్కాయ పొడి కొంటానంటే వేల రూపాయలు తగలబెట్టడమేంటి? అదీ 5 కోట్లు కుంభకోణం హైదరాబాద్‌లో జరగడమా! 

జనం కూడా ఏది చెబితే దాని వెంబడి వెళ్లడానికి పరాకాష్ఠ ఇది. ‘నీకు ఆకలి కాకుండా మందు ఇస్తాను పట్టెడు చద్దెన్నం పెడతావా’ అన్నాడట వెనుకటికొకడు. ‘ఆకలి కాకుండా మందు ఇచ్చేవాడు మనల్ని నిన్నటి అన్నం ఎందుకు అడుగుతాడు !’ 

ఈ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న వేలం వెర్రి వేయి విధాలన్నా ఆశ్చర్యం లేదు. అంత బాగా కరక్కాయ పొడిని ఎగుమతి చేయగలవాడు మనల్ని ఎందుకు అడుగుతున్నాడు ? 

అని ఒక్క క్షణం ఆలోచించపోవడమే ఈ దుస్థితికి కారణం. ఇప్పటికీ అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలను తీర్చలేక నారా వారు నానాయాతనలు పడుతున్నారు.

బ్యాంక్‌ల బాధితులు, చిట్స్‌ మోసాలు, పాలసీ మోసాలు… ఇలా ఎన్నో సమోసాలు తినిపిస్తుంటే వాటిని జీర్ణం చేసుకోలేక ఆయాసపడుతుంటే ఇలాంటిదే మరో కొత్త మోసమన్న మర్మం తెలియక మన ఖర్మను మనమే వేలం వెర్రిగా నెత్తికి రుద్దుకొంటున్నాం ! తస్మాత్‌ జాగ్రత్త !!

*********************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి




జ్ఞానులు రోజూ చేసే ప్రబోధాలు సమాజంలో ఉత్తమ గుణాలు నిర్మాణం చేయడానికే. వారి అధ్యయనం, అధ్యాపనం, ఆచరణ అన్నీ సమాజహితం కోసమే. అయితే దరిద్రుడి వద్దకు మరో దరిద్రుడు దానం కోసం వెళ్తే అతని దుఃఖం తీరదు. రోగి దగ్గర మరొక రోగి వెళ్లి మందును యాచిస్తే రోగం తగ్గదు. అలాగే అజ్ఞాని దగ్గరకు ఇంకో అజ్ఞానివెళ్తే జ్ఞానం వికసించదు. కాబట్టి జ్ఞాన సముపార్జనకు సరైన గురువును ఆశ్రయించడమే ఉత్తమ ధర్మం. తాజా బావినీటిలో రూపాయి నాణెం వేస్తే ఎలా తళతళ మెరుస్తుందో.. వాసనలు లేని మనస్సు మొదట్లో అంత నిర్మలంగా ఉంటుంది. అనంతరకాలంలో రకరకాల జీవన మలుపులతో వ్యక్తిని ఈ మలినాలన్నీ ఆవరిస్తాయి.
మెదడు నిండా చెత్త పేరుకుపోతే కొత్త విషయాలకు తావుండదు. మనస్సు ఖాళీగా ఉండి నిర్మలత్వం పొందినప్పుడు అది చిత్తం అనే అంతఃకరణంగా మారుతుందని యోగ శాస్త్రం ప్రబోధిస్తోంది. ప్రాపంచిక వాసనల బలం పెరిగినపుడు మనస్సు అనేక విషయాలను తనకు తోడుగా తెచ్చుకుంటుంది. అవే అరిషడ్వర్గాలు, అహంకార, మమకారాలు. వీటి ప్రాబల్యం మనోబలాన్ని తగ్గించి పశుత్వంవైపు తీసుకెళ్తుంది. ఈ పశు స్వభావానికి వశమై పోవడం తప్ప ఇంకో జీవలక్షణం లేదు. ఒక్కోసారి జ్ఞానం కూడా బరువైపోయి అహంకారానికి దారితీస్తుంది. అది కూడా పెద్దబంధమే. అందుకే ‘‘అహంకారులైన విద్యావంతులకన్నా నిరహంకారులైన విద్యావిహీనులే ఉత్తములు’’ అని శ్రీరామకృష్ణులు చెప్తారు. మన శాస్త్రాలు ఎంత లోతుగా తత్వ దర్శనం చేశాయంటే.. శాస్త్ర పఠనం, గురూపదేశం లాంటివి కూడా ఇంద్రియ ప్రవృత్తులే. ఈ ప్రవృత్తిని వదిలిపెట్టగల నిస్సంగత్వం సాధకుడికి కావాలని చెప్పారు. అందరూ రమణ మహర్షిలా ఉండడం సాధ్యం కాదని మనకు తెలుసు. అందుకే గురుత్వం తత్వదర్శనానికి ప్రధానద్వారం. శాస్త్రపఠనం దారిదీపం. ఈ రెండూ ఆత్మ సాక్షాత్కారానికి కారణములు కాకున్నా కారణాలుగా స్వీకరించాల్సిన అవసరం ఎన్నో చోట్ల ప్రస్తావింపబడింది. పడవలో నీరు చేరకుండా జాగ్రత్త పడడం వేరు. పడవ నడపడం వేరు. అయితే, ఈ రెండూ పరస్పర ఆధారాలు. నడపడం వల్ల పడవ గమ్యాన్ని చేరిస్తే నీరు రాకుండా చేయడం మరణాన్ని ఆపుతుంది. అలాగే గురుతత్వం కూడా. అలాంటి గురువును వెదకి సేవించాలని గీత ప్రబోధం చేసింది.

తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేనసేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వ దర్శినః

‘సద్గురువుకు ప్రణామం చేసి ప్రశ్నించి పరిచర్య చేసి బ్రహ్మజ్ఞానం ఆర్జించాలి. తత్వద్రష్టలైన జ్ఞానులు నీకు బ్రహ్మోపదేశం చేస్తారు’ అని దీని అర్థం. ఈ జ్ఞానుల ప్రబోధం నిరంతరంగా సాగుతూనే ఉంది. చెప్పడం వారి ధర్మం, వినకపోవడం మన ఖర్మం.

*******************************************
     ✍ ✍  డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ





– నన్ను ‘పప్పూ’ అని పిలవండి. కానీ నన్ను గుర్తించండి.
– కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
– పప్పో, ఉప్పోగానీ మీరు ఏంచేసినా మీవాళ్ళు తెగ సంబరపడిపోతున్నారు. ఇక సూడో సెక్యులర్‌ లిబరల్‌ గ్యాంగ్‌ అయితే మీరు కన్నుకొట్టడం చూసి మహా మురిసిపోతున్నారు.
– సైన్యాన్ని అవమానించవద్దు. మేం పనిచేసుకొనేవాళ్ళం. వంశాలపేర్లు చెప్పుకొనేవాళ్ళ కళ్ళలోకి చూడలేం.
– నరేంద్రమోదీ, ప్రధాని
– మోదీగారు అంతలా మోదితే ఎలా? ఇప్పటికే రాహుల్‌ గిజగిజ లాడిపోతున్నాడు !
– మాట తప్పినవాడు మనిషే కాడు. ఏపికి ఇచ్చిన మాట తప్పారు.
– ఎంపి గల్లా జయదేవ్‌
– మీ అధినేత చెపుతున్న అబద్ధాలు మీకూ ఎక్కినట్లున్నాయి.
– త్వరలో స్వరాజ్య ఉద్యమం.
– జయప్రకాశ్‌ నారాయణ, లోక్‌సత్తా
– సురాజ్య ఉద్యమం అయిపోయిందా ?
– తప్పుల్లేకుండా రాహుల్‌ 15 ని||లు మాట్లాడితే భూమి కంపిస్తుంది.
– బిజెపి ఎంపి పరేశ్‌ రావల్‌
– వేరే దేశంలో వచ్చిన భూకంపానికి కారణం అదే అంటున్నారు.
– రాహుల్‌ వ్యాఖ్యలు అబద్ధం.
– ఫ్రాన్స్‌ అధికారవర్గాలు
– పట్టింది పరక (చేప) అంటే చూసినవాడు జల్ల (చేప) అన్నాడట.
– మోదీ అహంకారంతో మాట్లాడాడు. ఏపీకి అన్యాయం చేసాడు.
– తెదేపా వర్గాలు
– ఒక వేలుతో ఎదుటివారి తప్పును చూపించాలని భావిస్తే, మరో మూడు వేళ్ళు మన తప్పులను చూపిస్తాయి. అది మరువకండి.
– అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం.
– రాహుల్‌ గాంధీ
– అంటే అది రాదన్నమాట. కాంగ్రెస్‌పై ప్రజలకు అంత నమ్మకం.
– కృష్ణుడి కన్నా కరుణానిధే గొప్ప
– కేంద్రమంత్రి
– ఎందుకంటే ! కృష్ణుడి మనుమలు స్కాములు చేయలేదు కదా!
– కాంగ్రెసు నేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలి
– ఎఐసిసి కార్యదర్శి బోసురాజు
– అంటే ఇప్పటివరకు లేరా ఏంటి ?
– ఓటర్లతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.
– టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
– ఎలాగో మీరే చెప్పండి!
– తల్లి విదేశీయురాలు. రాహుల్‌ ప్రధాని కాలేరు.
– బిఎస్‌పి ఉపాధ్యక్షుడు జైప్రకాశ్‌
– పార్టీకో ప్రధాని అభ్యర్థి ! ఏం చేస్తాం ప్రకాశ్‌..!

*********************************
– డా|| పి.భాస్కర యోగి
మాటకు మాట : విశ్లేషణ : జాగృతి


రష్యా శాస్తవ్రేత్త, వ్యోమగామి యూరీ గగారిన్ ప్రపంచంలోని విజ్ఞానవేత్తల్లో ప్రసిద్ధుడు. బహుశా చంద్రుడిని అతి దగ్గరగా, భూమిని అత్యంత దూరం నుంచి చూసినటువంటి మొట్టమొదటి వ్యోమగామి ఆయనే. భూమికి తిరిగివచ్చి ఆశ్చర్యంతో యూరీ ఒక ప్రకటన చేశాడు. ఆ క్షణంలో భూమి కొంతభాగం సోవియట్ రష్యాగా, కొంతభాగం అమెరికాగా, కొంతభాగం భారత్‌గా, కొంతభాగం చైనాగా కనిపించడం చూసి ఆశ్చర్యపోయానని అన్నాడు. 

చంద్రుడు భూమిలాగా, భూమి చంద్రునిలాగా వెలిగిపోయే అత్యంత ఆశ్చర్యకరమైన ఖగోళ వింత జరుగుతుందని ఆయనకు కూడా తెలియదు. భూమి చంద్రుడి కన్నా 8 రెట్లు పెద్దది. దాని కాంతి కూడా ఎనిమిది రెట్లు ఎక్కువ. ఇదే విషయాన్ని మాస్కోలో జరిగిన ఓ సమావేశంలో ఆయన వివరిస్తూ ‘చంద్రుడిని చూశాక నా మనసులో కలిగిన మొదటి భావం- నన్ను క్షమించాలి. నేను రష్యన్‌ని అన్న విషయం పూర్తిగా మర్చిపోయాను’ అన్నాడు. ఎత్తుకు ఎదిగేకొద్దీ ప్రాంతాలు, సరిహద్దులు, భాషలు మనం గీసుకున్న గీతలు మర్చిపోతాం అనడానికి ఇదొక ఉదాహరణ. 

ఇవే విషయాలను రాజకీయాలకు వర్తింపజేస్తే నరేంద్ర మోదీ ఇపుడు ఈ దేశానికి ప్రధాని. అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అన్నింటికీ ఆయనే ప్రధాని. ఇటీవల ప్రాంతాల పేరుతో, భాషల పేరుతో, ఆత్మాభిమానం పేరుతో, ఉత్తర దక్షిణ భూభాగాల పేరుతో, ఆర్య ద్రావిడ సిద్ధాంతాల పేరుతో మోదీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. అందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు నేతృత్వంలోని తెదేపా, ఇతర భాజపా వ్యతిరేక పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

కొండకు వెంట్రుక వేసి లాగాలని కాంగ్రెస్ తలచింది. వెంట్రుకగా తెలుగుదేశాన్ని వాడుకుంది. తెదేపా సాధించింది శూన్యం. మోదీని గద్దె దింపడం ఏమోగానీ కాంగ్రెస్, టిడిపి, ఇతర ప్రతిపక్షాల వెన్ను విరిగినంత పనైంది. ఇటీవల మోదీ ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారంతో కేంద్రం ప్రతిష్ఠ కొంత మసకబారింది. ఇదే సమయంలో పరోక్షంగా చంద్రబాబు చేసిన మేలువల్ల మోదీ తన ‘ప్రోగ్రెస్ కార్డు’ను దేశం ముందుంచారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బాల్య చాపల్యం ప్రత్యక్షంగా దేశ ప్రజలు వీక్షించారు. ఆయన ప్రసంగం, మోదీని హత్తుకోవడం చూసి కాంగ్రెస్ వాళ్లు మురిసిపోయారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ కూడా ఆశ్చర్యపోయారు. 

అంతలోనే రాహుల్ జ్యోతిరాదిత్య సింధియాను చూసి కన్నుకొట్టడంతో ఈ ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. చివరకు స్పీకర్ రాహుల్‌ని మందలించాల్సి వచ్చింది.

నిజానికి రాహుల్ ‘ఆలింగనం’ వెనుక ఇంకో దురుద్దేశం ఉందని భాజపా ఢిల్లీ ప్రతినిధి తేజేందర్ పల్‌సింగ్ బగ్గా ఆరోపించారు. ఓ తాంత్రికుడి సలహా మేరకు ప్రధాని కుర్చీని తాకేందుకే రాహుల్ అలా చేశాడని ఆయన ఆరోపించారు. ‘అనుకున్నది ఒక్కటి- అయినది ఒక్కటి’ అన్నట్లుగా మోదీని దోషిగా నిలబెట్టాలనుకున్న ప్రతిపక్షాలు నోరెళ్లపెట్టాల్సి వచ్చింది. ఒకవేళ మోదీ ప్రభుత్వం పడిపోయినా, రాహుల్ బ్యాటింగ్ బాగా చేసినా తెలుగు చానళ్ల వ్యాఖ్యానం ఇంకో లా ఉండేది. అవిశ్వాసం వీగిన వెంటనే ఓ తెలుగు టీవీ చానల్ మోదీని తెదేపా ఎంపీ కేశినేని నాని పచ్చడి చేసాడని చెప్పడం ఎనిమిదో వింత! మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్‌ను కడిగిపారేసాడు. ఏ లక్ష్యంతోనైతే తెదేపా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిందో, ఆ లక్ష్యం నెరవేరకపోగా మోదీ వ్యూహం ఫలించింది.

తెదేపా నుంచి మాట్లాడిన గల్లా జయదేవ్ మంచి ఆంగ్లంలో ప్రసంగం అనర్గళంగా చేసినా, రామ్మోహన్ నాయుడు హిందీలో గుక్క తిప్పుకోకుండా ప్రసంగించినా, చివరన కేశినేని నాని ‘ఐదవ తరగతి ఆంగ్లం’ అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా తెదేపా పరువు తీసింది. ప్రధానిని ‘డ్రామా ఆర్టిస్టు’ అనడం వల్ల తెదేపా ప్రతిష్ఠ గంగలో కలిసింది. ఉత్తర భారతం నుంచి అనర్గళంగా పార్లమెంట్‌లో ప్రసంగించగల వక్తలు ఎందరో ఉన్నారు. మోదీని ఆగర్భ శత్రుత్వంతో వ్యతిరేకించేవాళ్ళు ఉన్నారు. ఎవరూ ఇలాంటి అభాసుపాలు అయ్యే ప్రసంగాలను చేయరు. ఇక్కడ కాంగ్రెస్‌ను తెదేపా వాడుకుందా? తెదేపాను కాంగ్రెస్ వాడుకుందా? అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. 

రాహుల్ అపరిపక్వ మాటలు, మల్లికార్జున ఖర్గే సీరియస్‌నెస్- మోదీపై యుద్ధానికి వచ్చినట్లే ఉంది కానీ దేశం ముందు ప్రధానిని దోషిగా నిలబెట్టలేకపోయారు. కాంగ్రెస్ దాని తోక పార్టీలు మోదీని వ్యక్తిగతంగా విమర్శించాయి కానీ విధానాలపై స్పష్టత ఇవ్వలేదు.

ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు గురించి రాహుల్ ప్రధానంగా ప్రస్తావిస్తూనే- ఫ్రాన్స్ అధ్యక్షుడిని తాను స్వయంగా కలుసుకున్నట్టు యధాలాపంగానే చెప్పారు. అవిశ్వాసానికి ఉన్న ‘తీవ్రత’ను రాహుల్ చెడగొట్టడంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపల, బయటా మాట్లాడుకుంటున్నాయి. 

రాహుల్ మోదీపై వేసిన బురదను కడుక్కునేకన్నా ముందే- ఫ్రాన్స్ అధికార కార్యాలయం నుంచి ప్రకటన వెలువడి రాహుల్ పరువు తీసింది. ప్రతిపక్ష హోదాగల పార్టీ అధ్యక్షుడు, భావి ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న వ్యక్తి ఇలాంటి చౌకబారు, ఆధారాలు లేని ప్రకటన చేయడం హాస్యాస్పదం. 

మోదీని, బిజెపిని టార్గెట్‌గా చేసుకుని కాంగ్రెస్ నేతలు ప్రసంగించగా, మిగతా పార్టీల ఎంపీలు తమ తమ ప్రాంతాల్లోని అనేక విషయాలను ప్రస్తావించారే తప్ప- తెదేపాకు మద్దతుగా మాట్లాడిన దాఖలాలు లేవు. తెలంగాణకు చెందిన టిఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేక హోదాను వ్యతిరేకించడమే గాక తెలుగుదేశాన్ని సభలో నిలదీసింది. ప్రొద్దున లేచినప్పటినుండి చంద్రబాబు జపించే ఉత్తర, దక్షిణ వివక్ష ఇక్కడ కనిపించకపోగా తెలుగుదేశానికి ఏ దక్షిణ భారతదేశపు పార్టీ కూడా మద్దతు పలకలేదు. 

తమిళనాడులోని అన్నాడిఎంకె గానీ, కర్ణాటకలోని కాంగ్రె స్-జెడియు ప్రభుత్వం కాని, కేరళ కమ్యూనిస్టులు గాని గట్టిగా మద్దతు తెలపలేదు. గుడ్డిగా తెలుగుదేశాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ ఏపి గురించి మాట్లాడింది కాని తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడదని ఇపు డు టిఆర్‌ఎస్ కొత్త రాగం ఎత్తుకుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఏపిలో కన్నా తెలంగాణలోనే కొంత పరిస్థితి బాగుంది. ఏపిలో కాంగ్రెస్ స్థానాన్ని వైఎస్సార్సీపి భర్తీ చేసింది. అక్కడ ఇపుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ కోలుకోవడం పగటికలే.

ఏపీలో తెదేపా, వైకాపా, భాజపా, జనసేన పార్టీలను దాటుకొని కాంగ్రెస్ ముందడుగు వేయడం అంత సులభమైన విషయం కాదు. చంద్రబాబు నాయుడి మాటలను పట్టుకుని కాంగ్రెస్ చేస్తున్న రాజకీయం ఆత్మహత్యా సదృశమే. తెలంగాణ రాష్ట్ర ప్రకటన సమయంలోనూ ఇలాంటి స్వార్థబుద్ధి కాంగ్రెస్‌ను సర్వనాశనం చేసింది. రెంటికీ చెడ్డ రేవడి చేసింది. 

తెలంగాణలో కాంగ్రెస్ ఇపుడు కాకున్నా 2024లో అయినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా ఇలాంటి తప్పిదాలతో తెలంగాణ ప్రజల మనసుల్లో కాంగ్రెస్ మరింత వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది. 2014 ముందు మోదీ హవాను చూసి చంద్రబాబు అటువైపుజంప్ అయ్యాడు. దీనికి పవన్ కూడా కొంత తోడుకాగా తెదేపా విజయం సాధించింది. 

జగన్‌కు ఎలాంటి ఎజెండా లేకపోవడంతో ప్రత్యేక హోదా అతనికి బ్రహ్మాస్త్రం అయింది. ఈ విషయంలో రాష్ట్ర భాజపా నాయకులు కూడా ఆ రోజుల్లో సరైన అవగాహన లేక ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇస్తూ వచ్చారు. భాజపా కూడా బాబును గుడ్డిగా నమ్మింది. కెసిఆర్‌లా కేంద్రంతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ పనులు చేసుకోకుండా ఒక్కసారిగా యుద్ధం ప్రకటించాడు చంద్రబాబు. చంద్రబాబు ప్రభుత్వం రోజువారీ కార్యక్రమాలను వదిలేసి ఫిబ్రవరి నెల నుంచి మోదీని తిట్టడానికి కాలాన్నంతా వెచ్చించింది. 

భాజపా ఎన్నికల వాగ్దానం చేసిందని మొత్తుకుంటున్న తెదేపా తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ని విషయాలను పూర్తిచేసిందో శే్వతపత్రం విడుదల చేయాలని భాజపా నాయకులు మొత్తుకుంటున్నారు. జగన్ ఇచ్చిన ఏపీ బంద్ పిలుపు సక్సెస్ అయింది. మళ్లీ తెదేపా తీరు కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా అయ్యింది. రాజ్యసభలో చర్చతో మంట పుట్టించాలని చంద్రబాబు భావించాడు. అక్కడ చైర్మన్ వెంకయ్య నాయుడు వైకాపా, తెదేపా నాటకాలను అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
ఇంత పెద్ద దేశంలో కేవలం ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడం వల్ల రేపు అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు వస్తే కేంద్రం ఎలా ఎదుర్కొంటుంది? 

ప్రతి రాష్ట్రానికీ ఓ ప్రత్యేక అస్తిత్వం, సెంటిమెంట్ ఉంటాయి. అలా ప్రతి రాష్ట్రం అస్తిత్వం పేరుతో గొంతెమ్మ కోర్కెలు కోరడం- వాటికి నెరవేర్చకపోవడం దేశద్రోహంగా భ్రమింపజేయడం ఎంతవరకు సబబు? ఇపుడు తెలుగు చానళ్లకు ఇది తప్ప ఇంకో పనిలేదు. మేధావుల పేరుతో భుజాలపై కండువాలు వేసుకొని కొందరు, తాతల కాలంనాడు సినిమాల్లో నటించినవాళ్లు కొందరు, కులం గజ్జితో పుట్టిన సైకాలజిస్టులు, విశే్లషకులు ఇంకొదరు కలిసి ప్రజల భావోద్వేగాలను రెట్టింపు చేస్తున్నారు. జీవన ప్రమాణం విషయంలో ఉత్తరాది రాష్ట్రాల కన్నా తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. 

నిజానికి తెలంగాణ కన్నా ఆంధ్రా సుభిక్షంగా ఉంది. తెలంగాణలో ఇప్పుడు కూడా గ్రామాల్లో 2 లక్షలకు ఎకరా భూమి దొరుకుతుంది. అదే ఆంధ్రాలో 2 లక్షలకు ఎకరా భూమి దొరకడం కలలోనైనా ఊహించగలమా? ప్రజల్లో అభద్రతా భావం కలిగించే వ్యక్తులు, శక్తులు, పార్టీలు తెలంగాణ ప్రజలను అనుమానంగా చూశారు. ‘ఆంధ్రా ప్రజలు గో బ్యాక్’ అంటారని దుష్ప్రచారం చేశారు. అందుకు భిన్నంగా ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రా ప్రాంత ప్రజలు రాజకీయ నిర్ణాయక శక్తిగా మారారు. దాదాపు పదేళ్లకుపైగా ఇవే శక్తులు, పార్టీలు తమ రాజకీయ ప్రాబల్యం కోసం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయి. మొన్నటికి మొన్న టి.జి.వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత అపరిపక్వంగా ఉన్నాయి?

చంద్రబాబును వెనకేసుకొస్తున్న కొన్ని మీడియా సంస్థలు ఇపుడు అత్యుత్సాహం వీడి, సంయమనం పాటించకపోతే అది ఆంధ్రా అభివృద్ధికి గొడ్డలిపెట్టు అవుతుంది. కేంద్రంతో చంద్రబాబుకు పొసగకపోతే టిఆర్‌ఎస్, బిజూ జనతాదళ్‌లా తమ హక్కుల ప్రకారం వచ్చే వాటాతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నయా రాయ్‌పూర్‌కు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది? ఛత్తీస్‌గఢ్‌కున్న పొటెన్షియాలిటీ తక్కువైనా అది మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థితిలో ఉంది. మోదీని దుమ్మెత్తిపోయడానికే వైకాపా, తెదేపా తమ శక్తియుక్తులను వెచ్చిస్తే- పార్లమెంటులో తాజాగా జరిగిన పరాభవమే పునరావృతమవుతుంది. 

రాజకీయ శత్రుత్వం మంచిదే కానీ వ్యక్తులపై ద్వేషం ప్రజాస్వామ్య లక్షణం కాదు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థలను పట్టించుకోకుండా, గత విభజన సూత్రాలను పాటించకుండా, రాజకీయ ప్రయోజనాలను ఆశించి చెప్పిన కుటిల యత్నం ఇంతదాకా తెచ్చింది. ఆపదమొక్కుల్లాంటి హామీలతో, బాధ్యతారహితమైన స్వప్రయోజనాలతో దేశానికి అరిష్టమే. అనవసర వ్యతిరేకతను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ఆటకు తెదేపా పావుగా మారడం ఆత్మహత్యా సదృశం. మోదీని గద్దె దించితే- ప్రధాని పదవికి ఎవరిని తెస్తారు? రాహుల్‌నా? ఇలా చేయడం- గద్దలకు మాంసం వేయడమే!

**********************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి📰
సెక్యులరిస్టుల భక్తి ప్రపత్తులు..!?


అడాల్ఫ్‌హిట్లర్ జాతకాన్ని పరిశీలించిన ఓ జ్యోతిష్యుడు “నీవు యూదుల సెలవురోజు మరణించడం ఖాయం” అన్నాడు. వెంటనే హిట్లర్ ఏ సెలవు రోజో చెప్పగలరా? అన్నాడు. అది చెప్పడం సాధ్యం కాదు కాని నేను చెప్పింది మాత్రం జరిగి తీరుతుంది అన్నాడు జ్యోతిషుడు. అదే ఎప్పుడో చెప్పండి అన్నాడు హిట్లర్. ‘ఏ సెలవో చెప్పలేనుగానీ నువ్వు మరణించిన రోజు మాత్రం యూదులకు సెలవు దినం అవుతుంది’ అన్నాడు జ్యోతిషుడు. సరిగ్గా మన దేశంలోని లౌకికవాద వ్రతం చేసే వాళ్ళకు ఈ హాస్య సన్నివేశం అతుకుతుంది. 

గత వారం జార్ఖండ్‌లో స్వామి అగ్నివేశ్‌పై కొందరు దాడిచేసారు. భౌతిక దాడులు చేయడం తప్పు. కానీ అలా చేసేందుకు ప్రేరేపించడం కూడా అంతే తప్పు.
ఒకరిది శారీరకమైన దాడి అయితే మరొకరిది మానసికమైన దాడి. స్వామి అగ్నివేశ్‌ను ఈ దేశ లౌకిక వాదానికి ప్రతీకగా భావిస్తారు. ఆర్య సమాజం అంటూనే ఎన్నోసార్లు హిందువులను బండబూతులు తిడతాడు. రాజకీయంగా ఎన్నైనా విమర్శలు చేయవచ్చు. కానీ ఇతరుల మనోభావాలను, నమ్మకాలను గేలి చేసే అధికారం ఎవరికీ లేదు. స్వామి అగ్నివేశ్ ఓ సభలో మాట్లాడుతూ హిందువులు మూర్ఖంగా ఆరాధన చేస్తారని, నరేంద్రమోడీ గంధం పెట్టుకొని మాల ధరించి పశుపతి నాథుణ్ణి, కాశీ విశ్వేశ్వరుణ్ణి, ఢాకేశ్వరిని పూజించ డం తప్పని నిందించాడు. హిందువులు శ్రీ వెంకటేశ్వర స్వామిని, అయ్యప్పను, అమర్‌నాథ్ లింగాన్ని పూజించడాన్ని ఎగతాళి చేశాడు.

అదీ ఇతర మతాల సభలో ఇలాంటి విషయాలు ప్రస్తావించడం ఎంతవరకు సబబు!? పోనీ ఆయనను అనుసరించే వీర సెక్యులర్ నిష్ఠాపరులంతా ఈ గుళ్ళకు వెళ్ళే వారే కదా! వారంతా మూర్ఖులా? ఈ దేశంలో సెక్యులర్ వ్రతం బాగా పాటించే వారే ఎక్కువగా భక్తి ప్రపత్తులు చాటుకున్నారు కదా! అందుకు వందల ఉదాహరణలు చెప్పవచ్చు. మహాత్మాగాంధీ సెక్యులర్ సిద్ధాంతానికి పిత. ఆయనలో హిందూ, జైన సంప్రదాయాలు మిక్స్‌డ్‌గా కన్పిస్తాయి. పాపభీతి, శరీరక క్రమశిక్షణకు గాంధీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన చేతిలో భగవద్గీత ఉండేది. ఆఖరుకు మరణించేటపుడు ‘హేరామ్’ అన్నాడని పెద్ద చర్చనే జరిగింది. సోషలిజాన్ని సెక్యులరిజాన్ని మిక్సీలో వేసి దంచితే నెహ్రూ పుట్టాడంటారు. అలాంటి నెహ్రూ రచనల్లో, జీవితంలో ఎన్నో హిందూ ఆచారాలు కన్పిస్తాయి.

నెహ్రూ జాతకాలను నమ్మేవాడని అంటారు. డా॥ బి.ఆర్ అంబేద్కర్ నాస్తికుడుగా జీవించలేదు కదా! బౌద్ధాన్ని జీవన చరమాంకంలో స్వీకరించినా అది జ్ఞానమే దేవుడిగా చెప్పే ఉపనిషత్తుల విలువల్ని పుణికి పుచ్చుకొన్నది కదా! రామ్ మనోహర్ లోహియా లాంటి సోషలిస్ట్ మేధావి తూర్పుపశ్చిమాలను కృష్ణుడు కలిపితే, ఉత్తర దక్షిణాలను శ్రీరాముడు కలిపాడని, భారతదేశ ఐక్యతకు ఈ ఇద్దరు మూలపురుషులని పేర్కొన్నారు. రామస్వామి నాయకర్ భార్య నాగమ్మాళ్ తన భర్తతో కలిసి ఉద్యమాలు చేసినా గొప్పదైవభక్తురాలు. పూలే భార్య సావిత్రీబాయి ముఖంలో బొట్టు లేకుండా చూడగలమా! మహాత్మా పూలే కూడా ఆర్య సమాజ ఊరేగింపులో పాల్గొన్నారు.

సెక్యులరిజం అనే ముద్దు పదాన్ని చట్టబద్దం చేసిన ఇందిరాగాంధీ గొప్ప భక్తురాలు. ఆమె మెడలో ఎప్పుడూ మాల కన్పించేది. ధీరేంద్ర బ్రహ్మచారి లాంటి వాళ్ళను  గురువులుగా స్వీకరించింది. రాజీవ్ గాంధీ ఏకంగా రామజన్మభూమి తాళాలు బద్దలు కొట్టిస్తే, రామాయణ కల్పవృక్షాన్ని రసంలా కడుపులో నింపుకున్న పి.వి. నరసింహారావు బాబ్రీమసీదు నేలమట్టం అవుతుంటే నిశ్చేష్టుడయ్యాడు. అలాగే తాంత్రిక గురువు చంద్రస్వామితో పి.వి. సంబంధాలపై ఒక పుస్తకమే రాయొచ్చు. రాష్ట్రపతిగా పనిచేసిన శంకర్‌దయాళ్ శర్మ గుళ్ళకు వెళ్ళడం, పూజలు, హోమాలు చేయడం మనం చూసాం.సెక్యులర్ వ్రత నియమాలకు భంగం వాటిల్లకుండా కంకణం కట్టుకొన్న లాలూప్రసాద్ యాదవ్ బీహార్‌లో నిర్వహించే ‘ఛత్‌పూజలో’ ఎలా పాల్గొంటాడో హోళీ పండుగకు రంగుల్లో ఎలా మునుగుతాడో మనం చూసాం.

అలాగే ములాయాం సింగ్ ఇంట్లో పండుగలు, పర్వాలు, ఉత్సవాలు అన్నీ ఎంత సంప్రదాయబద్దంగా జరుగుతాయో అందరికీ తెలుసు. ములాయాం కోడలు స్వయంగా గోశాల నిర్వహిస్తున్నారు. దేవేగౌడకు ఉన్న సెంటిమెంట్లు చూస్తే ఆయన పార్టీ పేరులో సెక్యులర్ ఉంటుంది గాని వంటి నిండా భక్తి పరవశమే. ఆయన కుమారుడు కుమారస్వామి గద్దెను ఎక్కడానికి ఎన్నోచోట్ల యజ్ఞాలు చేయించారని చెప్తారు. అలాగే దేవేగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ వాస్తు బాగోలేదని తన అధికారిక నివాసంలో ఉండకుండా ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసాడు. కుమారస్వామి సీఎం కుర్చీ ఎక్కగానే స్వామీజీల ఆశీర్వాదం తీసుకున్నాడు.

ఏకంగా ఈ దేశ సెక్యులర్ టీం ఛాంపియన్‌గా పేరొందిన సిద్ధరామయ్య కాకి వాలిందని కారే ఎక్కలేదు!! చంద్రబాబు అవసరాన్ని బట్టి అందుకునే సెక్యులర్ నినాదం అప్పుడపుడు అటక ఎక్కిస్తూ, దించేస్తూ ఉంటాడు. సత్యసాయి, జగ్గీవాసుదేవ్, బ్రహ్మ కుమారీస్‌ల దగ్గరకు వెళ్తాడు. బీజేపీతో కలిసి ఉంటే స్కూళ్ళలో సూర్య నమస్కారాలు చేయిస్తాడు. బీజేపీకి కటీఫ్ చెప్పినపుడు యోగా డే  నాడు అదే పాఠశాలలకు సెలవులూ ఇవ్వగలడు!? కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకులు ప్రియారంజన్‌దాస్‌మున్షీ, కమల్‌నాథ్ ఆశారాంబాపు దగ్గరకు తరచుగా వెళ్ళేవారు. ఎందరో మంత్రులు, నాయకులు రహస్యంగా పూజలు చేస్తుంటారు.

రాముణ్ణి దిట్టంగా తిట్టగల కరుణానిధి స్వయంగా శ్రీమద్రామానుజులపై రాసిన సీరియల్ కలైంగల్ టీవీలో ప్రసారం అయింది. టీటీడీకి చెందిన వేద పండితులు 06 నాడు ఆయనను ఆశీర్వదించారు. అదే కరుణానిధి భక్తి వికాస స్వామితో రామానుజుల జీవనంపై సమాలోచన చేసాడు. ఫరూఖ్ అబ్దుల్లా పాండే  హిందూభక్తి గీతాలను మనం వింటే పులకించిపోతాం. ఒమర్ అబ్దుల్లా, అతని భార్య పాయల్ తమిళనాడులోని విల్లుపురం దగ్గరున్న విష్ణుదేవాలయం సందర్శించారు. ఓ సారి జయలలిత ఎన్నికల్లో గెలిచాక గురువాయుర్ దేవాలయంలో ఏనుగును సమర్పించారు. ఎన్టీఆర్ వివేకానందునిలా వేషం ధరించి, భస్మధారణ చేసాడు. బి.వి. మోహన్ రెడ్డి జాతకాలు ఆయన బాగా నమ్మేవాడని చెప్తారు. అలాగే క్షుద్ర పూజలు చేసాడని కూడ వార్తలొచ్చాయి.
ఇక ప్రస్తుత గవర్నర్ నరసింహన్ సాక్షాత్తూ వైష్ణవపెరుమాళ్‌గా కన్పిస్తాడు. 

రాహుల్ గాంధీ కూడా ఈ రోజు సెక్యులరిజం పరిరక్షకుడే. ఆయన గుజరాత్ ఎన్నికల్లో శివభక్తుడిగా మారిపోయి, నాకూ జంధ్యం ఉందని గుళ్ళూ గోపురాలు సందర్శించాడు. కర్ణాటకలో ఎన్నో మఠాలను, శృంగేరి శారదా పీఠాన్ని దర్శించి స్వాములకు నమస్కరించాడు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కమ్యూనిష్టులు నాస్తిక స్వాములను ఆశ్రయిస్తే సెక్యులర్ పార్టీల నేతలు మఠాల ముందు సాగిలపడ్డారు. ఇక కేసీఆర్ బ్రాహ్మణ భక్తి, దైవభక్తి, దైవభక్తి, గురుభక్తిని గురించి చెప్పనలవికాదు. దేశంలో ఎవరూ చేయని ఆయత చండీయా గాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహింపజేసారు.

కొరవి వీర భద్రస్వామికి, తిరుపతి వెంకన్నకు, బెజవాడ కనకదుర్గకు మొక్కులు చెల్లించాడు. యాదాద్రి అభివృద్ధి చేస్తున్న తీరు చరిత్రలో నిలిచిపోయేదే. ఇతర దేవాలయాలు, పండుగలు, ఉత్సవాలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా చేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి భక్తి సంగారెడ్డికి వెళ్తే తెలుస్తుంది. మొన్నటివరకు కమ్యూనిష్టుల్లా వుండి బెంగాల్‌ను ఆక్రమించుకున్న మమతా బెనర్జీ ఇపుడు బీజేపీ పోటీకి వస్తుందని దుర్గా నవరాత్రులు, రామనవమి చేసేవరకు వెళ్ళింది. 

వీళ్ళంతా సెక్యులరిజం శిలువ మోసినా నాస్తికులమని చెప్పలేదు. కానీ కమ్యూనిష్టుల భక్తి విశేషాలను ప్రత్యేకంగా చెప్పాల్సిందే! హిరేన్ ముఖర్జీ తిరుపతికి వెళ్ళినట్లు సమాచారం. నంబూద్రిపాద్ లోలోపల దైవభక్తుడే. సీతారాం ఏచూరి, బి.వి. రాఘవులు, కె. నారయణలాంటి అద్భుతమైన సంప్రదాయపు పేర్లు బీజేపీ వాళ్ళకు కూడా లేవు. ఇటీవల కేరళలో బీజేపీకు పోటీగా కమ్యూనిష్టులు వినాయకుడిని పెట్టినట్లు ఓ కమ్యూనిష్టు నేత టీవీ ముఖంగా ఒప్పుకున్నాడు. జూలై 17 నుండి ఆగస్టు 16 వరకు సీపియం పార్టీ తరపున సంస్కృత సంఘం రామాయణ మాసం నిర్వ హించాలని వార్తలొచ్చాయి. వరవరరావు మావోయిస్టుల లక్ష్యాన్ని భారత కథలోని కుంతీ సహదేవుల పుత్రవాత్సల్యంతో వర్ణించారు. కె. నారాయణ తిరుపతికి వెళ్ళి తన కుటుంబం కోసమే అన్నాడు.

దిగంబర కవులుగా అరాచకం సృష్టించిన జ్వాలాముఖి, మహాస్వప్నలు కాళీభక్తులని చెప్తారు. కరడుగట్టిన మార్క్సిస్ట్ గజ్జెల మల్లారెడ్డి స్వామి వివేకానంద రచించిన ద సాంగ్ ఆఫ్ సన్యాసి (The Song of Sanyasin)ను  యతిగీతం పేరుతో అనువదించారు. రాముడు లేడని భావించే రంగనాయకమ్మ రామాయాణ విషవృక్షం రాసింది! మార్క్సిస్ట్ జీవనం గడిపిన రావిశాస్త్రి రాచకొండలో దేవాలయం సందర్శించి ‘ఇది మా పూర్వీ కుల గ్రామం’ అని సగర్వంగా చెప్పి అక్కడి మట్టిని మూట గట్టుకుపోవడం ఆశ్చర్యం కాదా! ఇటీవల కె. నాగేశ్వర్ రామాయణంపై చక్కటి క్లారిటీ ఇచ్చాడు. రాముడిని తిట్టిన కత్తి మహేశ్ చివరకు రామనామం జపించాడు.

చేకూరి రామారావు చివరి దశలో భాషాశాస్త్రం ప్రక్కనబెట్టి భగవద్గీత పట్టుకు తిరిగాడని చెప్తారు. అమీనా, మైదానం వంటి నవలలతో హిందుత్వాన్ని, సంప్రదాయాలను అవమానపరచి విశృంఖల స్వేచ్ఛా విహారానికి కారణమైన గుడిపాటి వెంకటాచలం రమణ మహర్షి దగ్గరకు వెళ్ళి ఆ మౌనంలోనే ఏకం అయ్యాడంటే మనం నమ్మగలమా! 

తుపాకులు పట్టాలన్న దాశరథి రంగాచార్య ఊర్ధపుండ్రాలు ధరించి వేదానువాదం, ఇతిహాసాలు రాయడం నిజం కాదా? అలాగే పురాణం సుబ్రహ్మణ్యశర్మ నారయణీయం అనువాదం చేసి జన్మ తరింపజేసుకోలేదా? గద్దర్ కొమరవెల్లి మల్లన్న, భద్రాచల రాముడిని దర్శించలేదా? కోదండరాం అనంతగిరి అనంత పద్మనా భుని దర్శించడం నిజంకాదా? మార్కిస్ట్‌లు రహస్యంగా భార్యలతో కలిసి పూజలు చేస్తుంటారన్నది సత్యం. 

అంతెందుకు! ఎందరో శాస్త్రవేత్తలు గొప్పభక్తులుగా జీవించారు. ఏపిజే అబ్దుల్ కలాం వీణవాయించి, గీతాపఠనం చేసి హిందువులా రామేశ్వరంలో జీవిస్తే ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ వంటి షెహనాయి కళాకకారుడు గంగను, కాశీ విశ్వనాథుడిని చూసి పులకించి పోయారు. చంద్రశేఖర్ వెంకట్రామన్ గ్రహణం రోజు పట్టు స్నానం, విడుపు స్నానం చేస్తే మీకు ఈ నమ్మకాలేమిటి అని ఎవరో అడిగితే దట్ ఈజ్ సైన్స్, దిస్ ఈజ్ సెంటిమెంట్ అన్నాట్ట! ఇలా ఎందరో సెక్యులర్ ఛాంపియన్లు ఇంత అద్భుత శక్తి ప్రదర్శన తమ వ్యక్తిగత జీవితంలో చేస్తూనే హిందుత్వను చిన్న చూపు చూస్తారు. హిందూమతంలోని ఆచారాలను, పూజలను సెక్యులర్ అని పిలిచేవారే ఎక్కువ నమ్ముతారు.

మరి అగ్నివేశ్ అలా విమర్శిస్తే సెక్యులరిజాన్ని తిట్టినట్లా? దానిని అనుసరించే ఈ నాయకులను తిట్టి నట్లా? మతతత్వ పార్టీ నాయకులుగా ముద్రపడిన ఎ.బి. వాజ్‌పేయి, థాకరే, అద్వాణీలలో పూజలు, ఆచారాలు చెప్పుకోదగినట్లు కన్పించవు. యోగి ఆదిత్యనాథ్ మాత్రం నవనాథుల్లో ఒకరైన గోరఖ్‌నాధ్ పీఠానికి మహంత్‌గా కన్పిస్తారు. నరేంద్ర మోడీ దుర్గా నవరాత్రుల్లో పచ్చి మంచినీళ్ళతో కఠిన ఉపవాసం చేస్తారు. గెలిచాక తన నియోజక వర్గమైన కాశీలో గంగాహారతిలో పాల్గొన్నారు. పశుపతినాధ్, ఢాకేశ్వరిని సందర్శిం చారు.

ఇంతే తప్ప రోజువారీ కార్యక్రమాల్లో హద్దులు మీరిన ఆధ్యాత్మిక చూపించరు! అదే సెక్యులర్ నాయకులు తమ రోజువారీ కార్యక్రమాల్లో భక్తి తీవ్రత ప్రదర్శిస్తారు. ఇక రంజాన్ మాసం వస్తే వీళ్ళంతా బొట్టుపెట్టుకొని, టోపీలు ధరించి ఇఫ్తార్‌లలో పాల్గొంటారు. ఏ ముస్లిం కూడా హిందూ పర్వదినాల్లో తిలకం ధరించడు! కానీ ఇదే సెక్యులర్ మేధావులు, మీడియా మోడీ, , ఆదిత్యనాథ్ టోపీని తిరస్కరించినందుకు పెద్ద వివాదం సృష్టించారు. ఇక్కడ ముస్లిం నాయకులకు క్లారిటీ ఉన్నట్లే బీజేపీ నాయకులకు క్లారిటీ ఉంది. ఎటొచ్చీ సెక్యులర్ నాయకులకే లేదు. ఇంతలా మాతాచారాలను నెత్తినమోసేవారు హిందుత్వంపై విరుచుకు పడతారు. ఇదంతా అవగాహనా లోపమా! అవకాశవాదమా!!

***************************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం :  విజయక్రాంతి
జులై - 24 - 2018 : మంగళవారం
ఈగ బుచ్చిదాసు 
యాదగిరి  క్షేత్ర సంకీర్తన కవి 

*************************************
  సబాల్టార్న్ బులిటెన్ 





పుస్తక సమీక్ష
July : 2018



– చైనా విషయంలో మోదీ వెనుకడుగు వేసారు.
– కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
– మీరు గతంలో చైనా వాల్‌ దూకి గెలిచారా ఏంటి ?
– లెఫ్ట్‌కు కాంగ్రెసు గుడ్‌బై – పశ్చిమ బెంగాల్‌లో పొత్తులేనట్లే.
– కాంగ్రెసు వర్గాలు
– అవకాశవాద పొత్తులు.. అనుమానాల కత్తులు..!
– ఇదేనా మీ సంస్కారం, రాంమాధవ్‌ క్షమాపణ చెప్పాలి.
– టిఆర్‌ఎస్‌ పార్టీ నేతలు శంకర్‌నాయక్‌, వినయభాస్కర్‌
– మీ తిట్ల దండకాలను రాస్తే పెద్ద పుస్తకమే అవుతుంది గద అన్నలూ.
– బీ రెడి. ఎన్నికలు ఎప్పుడైనా సిద్ధమే. శక్తియుక్తులను కూడదీసుకోండి.
– సిఎం కెసిఆర్‌
– కారులో ఎక్కిన నేతలంతా అవిశ్వాసాలూ, ఆందోళనలూ చేస్తూ బిజీగా ఉన్నారు సార్‌.
– ఆడవాళ్లు సిగరెట్లు తాగడం బాగుండదు.
– నటుడు కమల్‌హాసన్‌
– అయ్యో! మీరు లెఫ్ట్‌ లిబరల్‌ తరఫున మాట్లాడుతున్నారా?
– శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే స్వామి పరిపూర్ణానందకు నగర బహిష్కరణ.
– నగర పోలీసులు వర్గాలు
– ఆయన ఐఎస్‌ఐ తీవ్రవాది మరి !?
ం లైంగిక స్వేచ్ఛను కాదనలేం. స్వలింగ సంపర్కం నేరం కాదు.
– సుప్రీంకోర్టు
– మీరు అన్ని స్వేచ్ఛలు ప్రసాదిస్తూనే ఉండండి.
– ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నన్ను వేధిస్తోంది.
– మాజీ మంత్రి చిదంబరం
– ప్రెస్‌మీట్లు బాగానే పెడుతున్నారు కదా! ఆర్థిక నేరాలకు పాల్పడి ఎవరూ నన్ను అడగొద్దంటే ఎలా!
– కాంగ్రెసు వాళ్లు ఎన్నికలకు భయపడే కోర్టుకు వెళ్లారు.
– మంత్రి ఈటల రాజేందర్‌
– వారి సత్తా ఎన్నికలలో చూపిస్తారట గదా!
– కెసిఆర్‌ మూటాముల్లె సర్దుకోవాల్సిందే.
– కాంగ్రెసు నేత డికె అరుణ
– అవన్నీ వాళ్లకు మీరు చెప్పాలా !
– బిసిల చాంపియన్‌ టిఆర్‌ఎస్సే. కాంగ్రెస్‌ నేతలకు జ్ఞానం లేదు.
– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
– ఆటగాళ్లు తగ్గితే మీలాంటి గజ ఈతగాళ్లు టిఆర్‌ఎస్‌లోకి ఈదడానికి సిద్ధంగా ఉన్నారు కదా !
– ప్రజా సంక్షేమం పట్టని సర్కారు. ఒయును ఓపెన్‌ జైలుగా మార్చారు.
– కాంగ్రెసు నేత మల్లు భట్టి విక్రమార్క
– ఒకరిది సంక్షేమం, మరొకరిది సంక్షోభం – తేల్చాల్సింది మీరే.
– ఓట్ల కోసం నాకు ఎన్‌డిఎ ప్రభుత్వం ఉరేస్తున్నది.
– ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యా
– గురువింద సామెత చెప్పడం అంటే ఇదే.




*********************************
– డా|| పి.భాస్కర యోగి

మాటకు మాట : విశ్లేషణ : జాగృతి



హిందువుగా జన్మించుట ఇలలో మహా భాగ్యం’ అన్న పెద్దల మాట అక్షర సత్యం. వేల సంవత్సరాల ఉన్నత సంస్కృతికి వారసులు హిందు వులు. కత్తికి భయపడిపోయి మతం మార్చుకోని ధైర్యవంతుడు హిందువు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల రక్షకులు హిందువులు.

ఒకజాతి సంస్కృతి వారు ఆచరించే పండుగలను బట్టి అంచనా వేయవచ్చు. సంస్కృతీ సంప్రదాయా లకు పుట్టినిల్లు అయిన హిందూదేశంలో ప్రతిరోజు ఓ పండుగే. విశ్వానికే గురువైన ఈ పవిత్ర భూమిలో ఆచరించే పండుగలన్ని శాస్త్రీయమైనవే. 

తిథి, వారం, నక్షత్రం, ఋతువులు, గ్రహాల గమనంపై ఆధార పడినవి, సూర్యుని గమనానికి సంబంధించినవి, ప్రకృతిని పరిచయం చేసేవి, మనిషి సహజ స్వభావ మైన ఆనందాన్ని ఇతరులతో పంచుకునేందుకు ఉద్దేశించినవి, కుటుంబ సభ్యుల మధ్య అనురాగాలు, అనుబంధాలు పెంచేవి, మనిషి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఏర్పాటు చేసినవి, మన పూర్వీకులకు కృతజ్ఞతను ప్రకటించేవి, మన ఇంటిని స్వచ్ఛతతో అందంగా అలంకరించుకునేందుకు ప్రేరణనిచ్చేవి, ఇంటికి బంధుమిత్రులను ఆహ్వానించి సత్కరించు కునేందుకు, తన ఉన్నతికి కారకులైన గురువులను సత్కరించుకోవటం కోసం ఉద్దేశించినవి – సమర్పణా సంస్కారం కలిగించేవి, లోక సంగ్రహణ ప్రధాన ఉద్దేశంగా ఋషులు అందించిన పర్వదినాలు ఎన్నో మనకు ఉన్నాయి. 

ప్రతిరోజు పండుగే మనకు. ఈ పండుగలలో అరవై పండుగల గురించి విస్తృతంగా రాసిన గ్రంథమే ‘హిందువుల పండుగలు’. 670 పేజీల ఉద్గ్రంథం. ఈ ఘనకార్యం చేసిన గ్రంథకర్త డా|| పి.భాస్కరయోగి.

‘ఆధునిక జీవనాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ ఈ దేశ పౌరులకు తన అక్షరాల ద్వారా విజ్ఞానాన్ని అందిస్తున్న కవి, రచయిత, పండితులు, విమర్శకులు, అధ్యాపకులు, పాత్రికేయ ప్రకృతి తెలిసిన విజ్ఞులు’ అంటూ డా|| భాస్కరయోగిని శ్లాఘించారు ఆచార్య కసిరెడ్డి ఈ పుస్తకం ముందుమాటల్లో. ఈ యోగి యోగ్యమైన కలం జాగృతి పాఠకులకు సుపరిచితమే.

లోగడ సురవరం ప్రతాపరెడ్డి(1931), తిరుమల రామచంద్ర(1960) రాసిన పండుగ పుస్తకాలకు మరింత మెరుగులు దిద్దిన ఉద్గ్రంథం ‘హిందువుల పండుగలు’. పూర్వ రచనలతోపాటు 182 ఇతర పుస్తకాలు, ఎన్నో ఆధ్యాత్మిక వ్యాసాలు పరిశీలించి, పరిశోధించి సమగ్రమైనదిగా, శాస్త్రీయమైనదిగా పాఠకుల ముందు పెట్టిన అపూర్వ గ్రంథమే ఇది.

ప్రతీ పండుగకి ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మికత, చారిత్రకత వెరసి అరవై పండుగల కథా- కమామీషుని సులభమైన భాషలో ఈ పుస్తకంలో డా|| భాస్కరయోగి తెలుగు పాఠకుల ముందుపెట్టారు.

సృష్టికి జన్మదినమైన ‘ఉగాది’తో రచయిత పుస్తకాన్ని ప్రారంభించారు. తొలి పండుగకి 24 పేజీలు కేటాయించారు. ఉగాది జరుపుకోవటానికి ఉన్న పౌరాణిక (మత్స్యావతారం దాల్చిన రోజు), చారిత్రాత్మక (విక్రమాదిత్య పట్టాభిషేకం రోజు) కారణాలను వివరిస్తూ.. అసలు మన 12 మాసాలకి 12 నక్షత్రాల ఆధారంగా పేర్లు ఎలా వచ్చిందీ తెలియ జేశారు. 

ఉగాదికున్న ఖగోళ, జ్యోతిష్య విశేషాలను, ఉగాది పచ్చడి వెనుకున్న వైజ్ఞానిక రహస్యాలను, వివిధ రాష్ట్రాలలో ఈ పండుగను ఎలా జరుపుకుంటారన్న సమాచారాన్ని రచయిత విపులంగా అందించారు. సంస్కృతాంధ్ర భాషలలో రచయితకున్న పాండిత్యం కారణంగా పుస్తకంలో అక్కడక్కడ (పాయసంలో జీడిపప్పు, కిస్‌మిస్‌ల మాదిరి) అనేక శ్లోకాలను, పద్యాలను సందర్భానుసారంగా అందించటంతో విషయ నిరూపణలో ప్రామాణికత హెచ్చయింది.

వ్యవసాయ పనుల్లో సాయపడే, వర్షంతో ముడిపడిన కార్తెలను గురించిన అవగాహన ప్రజలలో సన్నగిల్లడంపై రచయిత ఆవేదనను వ్యక్తం చేశారు. బ్రిటీష్‌ దురహంకారుల వల్లనే మన ప్రాచీనులు అందించిన శాస్త్రీయ విషయాలు ప్రజలకు దూరమయ్యాయని అన్నారు. 

స్వాతంత్య్ర భారతంలో కూడా వ్యవసాయ పట్టభద్రులకు ఈ జ్ఞానాన్ని అందించక పోవటం శోచనీయం. హిందువులు ఆచరించే ఉపవాసాలు దేహానికి, దేశానికి కూడా ఉపయోగిస్తాయి.

‘ఏకాదశి’ పర్వదినాలను గురించిన అధ్యాయంలో 24 వివిధ ఏకాదశుల ప్రాశస్థ్యాన్ని, ఆ పుణ్యతిథుల్లో ఆచరించాల్సిన ఆహార నియమాలు, దీపదానాలు, జాగరణలు వంటి వాటిని సవివరంగా తెలిపారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ సాగే చాతుర్మాస దీక్షలు, వాటి ప్రాశస్థ్యం, విధి, నిషేధాలను భాస్కరయోగి భక్తి ప్రపత్తులతో అందించారు.

‘దేశంలో వివిధ ప్రాంతాలలో హిందువులు ఆచరించే పండుగలు, వాటి పరమార్థం, దశావ తారాల జయంతులతోపాటు హనుమ, శంకర, బసవ, మహావీర్‌, మధ్వాచార్య, రామానుజాచార్య, విశ్వకర్మ, గురునానక్‌ వంటి ప్రాతః స్మరణీయుల జయంతి పండుగలను వివరంగా రచయిత అందించారు. పత్రికా విలేకరులకు ఆద్యుడైన ‘నారదమహర్షి’ జయంతిని పాత్రికేయ దినోత్సవంగా, ఛత్రపతి శివాజీ సింహాసనాన్ని అధిష్టించిన రోజును ‘హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవటం కొంతమందికే తెలుసు. శివాజీని గురించిన స్ఫూర్తిదాయక ఘట్టాన్ని 11 పేజీల్లో రచయిత ఎంతో బాగా వర్ణించారు. 

ధర్మయుద్ధాలకు మాత్రమే అలవాటుపడిన హిందూ రాజులను మోసపూరితంగా గెలుస్తూ వస్తున్న విదేశీ దురాక్రమణదారులకు వారిదైన భాషలో జవాబు చెప్పి, చెమటలు పట్టించి, వెన్నులో వణుకు పుట్టించిన గెరిల్లా యుద్ధతంత్ర నిపుణుడైన శివాజీని రచయిత ఈ వ్యాసంలో  
శ్లాఘించి ‘హిందూ సామ్రాజ్యదినోత్సవాన్ని’ పాఠకులకు పరిచయం చేశారు.

పండుగల పరమార్థం తెలుసుకోవాలంటే, ఆ పండుగలను గురించిన లోతైన విషయాలను ఆకళింపు చేసుకోవాలంటే ఈ గ్రంథం పనికి వస్తుంది. ఎక్కువ మందికి రచయిత కొత్తగా పరిచయం చేసిన పండుగ ‘తేజో ఉత్సవం’. ‘తేజ్‌’ అంటే కన్నె పిల్ల. ఆమె ఎవరో కాదు సాక్షాత్తు గౌరీ దేవియే. గిరిజనులు తమ సంప్రదాయాల కనుగుణంగా శ్రావణమాసంలో జరుపుకొనే ఈ పండుగ గురించి రచయిత చాలా వివరాలే సేకరించి అందించారు. వాళ్ళు పాడుకొనే పాటలను బంజారీ తండాల నుంచి సేకరించి అందించటం విశేషం.

‘ప్రతిరోజూ పండుగే’ అంటూ చివరిగా ఓ 228 రోజుల ప్రాధాన్యాన్ని మాసాల వారీగా రచయిత తెలియజేశారు. హిందువులమైనందుకు గర్వించేవిగా ఉన్న ఈ సూచి చదువుతోంటే ‘ప్రతిరోజూ పండుగే మనకి’ అని తప్పక అనిపిస్తుంది. గ్రంథకర్త డా|| పి.భాస్కరయోగి కృషి అభినందనీయం. ఈ పండుగల పుస్తకాన్ని మన పుస్తకాల గూటిలోనికి తప్పక తెచ్చుకోవాలి.

''హిందువుల పండుగలు''
రచన : డా|| పి. భాస్కరయోగి
పుటలు : 676, వెల : రూ.500/-
ప్రతులకు : కొండా లక్ష్మీ కాంతరెడ్డి
విజ్ఞాన సరోవర ప్రచురణలు
ఫోన్‌ : 040-27427920, 9959656464
అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలు, హైదరాబాద్‌

*********************************
 ✍ ✍ బి. ఎస్. శర్మ 
 జాగృతి :  పుస్తక సమీక్ష