కుహనా లౌకికవాదం ఇంకెన్నాళ్లు?



ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై మూడు రోజులు, మాజీ సీఎం మాయావతి ప్రచారంపై రెండు రోజులు నిషేధం విధించింది. ఎన్నికల ర్యాలీలో మాయావతి మా ట్లాడుతూ-‘ముస్లింలు మహాకూటమికే వోటు వేయాలి’ అన్నది. దానికి కౌంటర్‌గా యోగి- ‘కాంగ్రెస్,ఎస్పీ, బీఎస్పీలకు అలీపై నమ్మకముంటే మాకు భజరంగబలీపై విశ్వాసముంది’ అన్నాడు. మాయావతి చర్య జరిపితే,యోగి ప్రతిచర్యగా వ్యాఖ్యానించాడు. దురదృష్టమేమిటంటే ఈ దేశంలో చర్య జరపడం గొప్ప అభ్యుదయంగా, ప్రగతిశీలవాదంగా, సమసమాజ స్థాపనగా- ఇంకా చెప్పాలంటే ‘లౌకికవాదం’గా భ్రమింపజేస్తారు. గిచ్చినా, గిల్లినా మూతికి తాళం వేసుకొని వౌనముద్రలో ఉండడం లౌకికవాదం. ఇటీవల ‘దెబ్బకు దెబ్బ’ అన్నట్లుగా కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు తిరగబడేసరికి ‘లౌకికవాదం’ ప్రమాదంలో పడిందంటారు. వెయ్యేళ్ళ నుండి మనసునిండా బానిసత్వం నింపి, కాఫిర్లుగా చూసిన అణచివేత ఇపుడు తిరగబడుతున్నది. కానీ ఓట్ల కోసం కక్కుర్తిగా తమకు తామే లౌకికవాదులుగా చెప్పుకొనే వ్యక్తులు తాము మాట్లాడుతున్నది సరైందా? కాదా? అని ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు.

ఈ దేశ కుహనా లౌకికవాదానికి కేంద్ర బిందువు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్. ఎన్నో ఏళ్లుగా అతను విజయానికి దూరమయ్యాడు. ఆయన కాలుపెట్టిన గోవా, ఆంధ్రప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీ సమూలంగా ధ్వంసమైంది. ఆయన ఇపుడు భోపాల్ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. డిగ్గీరాజా గెలిస్తే తన సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమలనాథ్ కూడా ఓడించేందుకు గొప్ప ప్రయత్నమే చేస్తున్నాడు.

ఇదంతా ఓ ఎత్తయితే యూపీఏ ప్రభుత్వం ఉన్నపుడు ‘హిందూ తీవ్రవాదం’ అనే కొత్త పదబంధాన్ని సృష్టించిన జనక మహారాజు దిగ్విజయ్. దానిని సమర్థించినవాళ్ళలో సుశీల్‌కుమార్ షిండే, పి.చిదంబరం లాంటివారున్నారు. అజ్మీర్ దర్గా, మాలేగావ్ పేలుళ్లలో హిందూ తీవ్రవాదుల హస్తం ఉందని, దానిని నిరూపించాలని, అందుకో ఉదాహరణ కావాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం తలచుకొన్నది. అందులో భాగంగా సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, స్వామి అసీమానంద వంటివాళ్లను తీవ్రవాద చట్టాల కింద జైలుకు పంపారు. ఇటీవలే కొన్ని కేసుల నుండి విముక్తి పొంది బయటకు వచ్చిన ప్రముఖ జాతీయవాది సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ను ‘ముల్లును ముల్లుతోనే తీయాలనే’ మోదీ, అమిత్‌షాల వ్యూహంతో భాజపా అభ్యర్థిగా దిగ్విజయ్‌పై పోటీకి నిలబెట్టారు. దీంతో దిగ్విజయ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇటీవల కొద్దిపాటి తేడాతో మధ్యప్రదేశ్‌లో గెలిచి మంచి ఊపుమీదున్న కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది.

సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఆనాటి యూపిఏ ప్రభుత్వం కొందరి సంతుష్టీకరణ కోసం తనపై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడిందో ఒక్కోటి విప్పుతుంటే ఉత్తరాదిన సరికొత్త రాజకీ యం మొదలైంది. అఫ్జల్ గు రు, అజ్మల్ కసబ్ లాంటి వాళ్లకు సకల మర్యాదలు చేసి న సోనియా గాంధీ కోటరీ, దేశం కోసం ప్రాణాలర్పిస్తానని జీవితాన్ని భారతమాతకు అంకితం చేసిన సా ధ్వి పట్ల ప్రదర్శించిన అనుచిత వైఖరిని ఉత్తర భారతం గమనిస్తున్నది. ఒక మహి ళ నేతృత్వం వహించిన యూపిఏ ప్రభుత్వంలో మరో మహిళను దారుణ చిత్రహింసలకు గురిచేయ డం అమానుషం.

మావోయిస్టులను తయారుచేసి, వారికి నగరాల్లో, విశ్వవిద్యాలయాల్లో వెన్నుదన్నుగా నిలుస్తున్న ‘అర్బన్ నక్సల్స్’ను అరెస్టు చేస్తే మానవ హక్కుల గురించి వల్లెవేసే మేధావులు, సంఘాలు సాధ్వి పట్ల ఎందుకు స్పందించలే దో అర్థం చేసుకోవడం చాలా సులభం. సన్యాసి వేషంలో తిరుగుతూ దేశ వ్తిరేక శక్తుల కొమ్ముగాసే స్వామి అగ్నివేశ్ సాధ్వి వున్న జైలుకు వెళ్లి ‘నీవు ఈ పేలుళ్లను ఫలానా సంస్థలపైకి నెట్టేస్తే బెయిలు ఇప్పిస్తా..’ అని చెప్పడం ఎంత దారుణం? ఈ విషయం ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో సాధ్వి వెల్లడించి కన్నీటి పర్యంతమైంది. అఖండ వాగ్ధాటి, నిస్వార్థ దేశభక్తి, నరనరాల్లో నింపుకొన్న జాతీయవాదం సాధ్వి ప్రజ్ఞాసింగ్ సొంతం. ఆమె ప్రభావం మధ్య భారతంలో జాతీయవాద శక్తులకు ఉత్ప్రేరకంగా మారుతోంది. ఇది జీర్ణించుకోలేని జాతి వ్యతిరేక శక్తులు ఆమెపై అనేక ఫిర్యాదులు, ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం బెయిలుపై ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. లాలూప్రసాద్ దాణా కుంభకోణంలో జైల్లో ఉండికూడా పార్టీని శాసిస్తున్నా అదంతా లౌకికవాదం! ఓటుకు నోటు కేసులో ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డ చంద్రబాబు నిఖార్సయిన లౌకికవాది! నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్‌పై వున్న సోనియా, రాహుల్ గాంధీలు గొప్ప సెక్యులరిస్టులు! ఐఎన్‌ఎక్స్ మీడియాపై కుంభకోణంలో దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పి.కార్తీ చిదంబరం కాంగ్రెస్ తరపున శివగంగ నుండి పోటీ చేయడం లౌకికవాద పరిరక్షణ!

 2016లో జేఎన్‌యూలో దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన కన్హయ్య కుమార్ సీపిఐ తరఫున బిహార్‌లోని బెగుసరాయ్ నుండి పోటీ చేయడం దేశ లౌకికవాద సంరక్షణ! 2జీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కనిమొళి తమిళనాడు సెక్యులరిజం పరిరక్షణకురాలు! శారద, నారద కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటు న్న బెంగాల్ ముఖ్యమంత్రి మమ తా బెనర్జీ కాబోయే లౌకికవాద ప్రధాని అభ్య ర్థి! సునందా పుష్కర్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శశి థరూర్ ఇపుడు తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థి! వేల కోట్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని బెయిల్‌పై వున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇపుడు ఆంధ్రప్రదేశ్ సీఎం అభ్యర్థే కాక సెక్యులరిజం కాపాడే మెస్సయ్య! ఇంతకన్నా దారుణం ఇంకేముంది? ఈ దేశంలో ఎన్ని హత్యలు చేసినా, అవినీతి పనులు చేసి నా, కుంభకోణాలకు పాల్పడినా, దేశ వ్యితిరేక వ్యాఖ్యలు చేసినా సరే! ‘సెక్యులరిస్ట్’ అ ని అజం ఖాన్, ఓవైసీలు వారికి సర్ట్ఫికెట్ ఇస్తే చాలు. వాళ్లంతా పుణ్యతీర్థంలో మునిగి పునీతులైనట్లే. ఇక ఈ దేశ సెక్యులరిజానికి టేకేదార్లయిన సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, జైపాల్‌రెడ్డి, కె.నారాయణ, సురవరం సుధాకర్‌రెడ్డి, బి.వి.రాఘవులు, డి.రాజా జీవితమంతా లౌకికవాద పరిరక్షకులే! వాళ్ల లౌకికవాదం హిందూ మతంపై దాడికి తప్ప ఇంకెందుకూ పనికిరాదు!

‘నారా హమారా- టీడీపీ హమారా’ అంటూ ఎన్నికల సభల్లో ఒక మతం వాళ్లను కూర్చోబెట్టి ‘త్రిపుల్ తలాక్ చట్టం తెచ్చిన దుర్మార్గపు మోదీ నుండి మిమ్మల్ని కాపాడుతా..’ అంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలకడం గొప్ప సెక్యులరిజం! ఈ వ్యాఖ్యలు చేసిన ఆయనపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యా తీసుకోలేదు. రాజ్యాంగ బద్ధంగా సాధ్యం కాదని తెలిసినా ఒక మతం వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తాం అంటూ అసెంబ్లీలో తీర్మానం చేయడం ఈ దేశంలో పరిఢవిల్లుతున్న కుహనా లౌకికవాదం!? ‘ఒక మతం వాళ్లు వోట్లు వేస్తే మేం గెలుస్తాం’ అంటూ బహిరంగ సభల్లో నిస్సిగ్గుగా చెప్తున్న పార్టీలు, నాయకులు ఈ దేశ మెజారిటీ ప్రజలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూడడం లౌకికవాదమా? మెజారిటీ ప్రజలను కులాలుగా విడగొట్టి మైనారిటీలను బుజ్జగించడం కుహనా లౌకికవాదం కాదా?

సాధ్వీ ప్రజ్ఞ మాట్లాడితే దేశ విభజన మతతత్వమా? ఏటిఎస్ అధికారిగా పనిచేసిన హేమంత్ కర్కరే గొప్ప పోలీస్ అధికారే కావచ్చు. తర్వాత ఎన్‌కౌంటర్‌లో భాగంగా తీవ్రవాదులపైకి వెళ్తే అతణ్ణి చంపేశారు. దీనికి ఎవరు కారణం? అని ఆలోచించడం మానేశాం. దీని మూలాలు ఎక్కడి నుండి వచ్చాయని ఒక్క క్షణం విచారణ చేయడం లేదు. అదే కర్కరే సాధ్విని చిత్రహింసలు పెట్టడాన్ని ఎలా ‘జస్టిఫై’ చేయగలుగుతాం? ‘నా శాపం వల్లే కర్కరే మరణించాడు’ అని సాధ్వి ప్రజ్ఞ అంటే, అదేదో దేశద్రోహం అయినట్లు మన సెక్యులర్ మీడియా, కుహనా లౌకికవాదులు గొంతు చించుకున్నారు. కర్కరే దేశభక్తి, పక్షపాత వైఖరి ఏకకాలంలో మనకు కన్పించడం లేదా? తీవ్రవాదుల చేతుల్లో ఆయన మరణం యాదృచ్ఛికం; సాధ్విని హింసించడం మాటేమిటి? అదే సోనియా గాంధీ బాట్లీహౌజ్ ఎన్‌కౌంటర్‌లో ముస్లిం తీవ్రవాదులు మరణిస్తే రాత్రంతా నిద్రపోకుండా వెక్కి వెక్కి ఏడ్చిందని ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించడం ఎలాంటి ‘లౌకికవాదం’ అని ఎవరూ ప్రశ్నించరు.

క్రీ.శ.712 మహమ్మద్ బిన్ కాశిం కాలం నుండి ఇటీవలి కాలం వరకు చర్యకు బలికావడమే చరిత్రలో చూస్తాం. ఇటీవల ప్రతిచర్యకు దిగడం తట్టుకోలేక ‘అసహనం’ ప్రదర్శిస్తున్నారు. దానికి మతోన్మాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ అని కలర్ ఇస్తున్నారు. సెక్యులర్ మనస్తత్వం ఈ దేశ మెజారిటీ ప్రజల డీఎన్‌ఏలోనే ఉంది. ‘మెజార్టీ ప్రజలు నశించాలని’ కోరేవాళ్లంతా, ఆ తర్వాత నిజమైన సెక్యులరిజం ఆనవాళ్లు ఈ భూమిపై ఎంత వెతికినా దొరకవని గ్రహిస్తే మంచిది. అలాంటి ప్రయత్నం చేస్తే సాధ్వి నిరంజన్ జ్యోతి, సాధ్వి ప్రాచీ, సాధ్వి ఉమాభారతి, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌లు పుట్టుకొస్తూనే ఉంటారు.


************************************

 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి