భారతదేశం ఎన్నో భాషలకు పుట్టిల్లు. పాణిని ఎప్పటివాడో ఎవరూ చెప్పలేరు. ఇక్కడ పుట్టిన ‘మహేశ్వర సూత్రాలు’ అన్ని భాషల అక్షరాలకు పొత్తిళ్లు.

కాశ్మీర్‌నుండి కన్యాకుమారి వరకు హఠన్‌నుండి కటక్ వరకున్న 1618 భాషలను, 6400 కులాలను, 29 ప్రధాన పండుగలను, మరెన్నో లెక్కలేనన్ని ఉత్సవాలను, సంప్రదాయాలను ‘ఏకం’చేసి అంతా ‘భారతీయత’నే నిండి ఉందని చెప్పే మహత్తర యజ్ఞానికి వేదికగా నిలవాల్సిన కేంద్ర సాహిత్య అకాడమీలో ఆశ్రీత పక్షపాతం, సిద్ధాంత విద్వేషం, మార్క్సిస్టు మనస్తత్వం రాజ్యమేలుతుంది.

వాళ్లు రాసిందే రాత...! 
వాళ్లు గీసిందే గీత...! 
వాళ్లు ఇచ్చిందే అవార్డు... 
వాళ్లు మెచ్చిందే రివార్డు...!! 

ఇంత పరమాద్భుతంగా సాహిత్య అకాడమీని నడిపిస్తున్న ‘గ్రంథ సాంగుల’ను గురించి చదివితే ఒళ్లు జలదరిస్తుంది...! మరీ ముఖ్యంగా మన ‘తెలుగు వెలుగు’ల జిలుగు పక్షుల గురించి, కవి కోకిలలను గురించి తెలుసుకొని తనివితీరా తరించాల్సిందే...!

సాధారణంగా రాజకీయాల్లో పదవుల కోసం, శత్రుపక్షాల వ్యూహాలను తుత్తినియలుచేసి గద్దెనెక్కే విద్యకోసం కుట్రలు, కుతంత్రాలు, వ్యూహ- ప్రతివ్యూహాలు చూస్తాం! కానీ పేరుమోసిన ‘సాహితీ రంగంలో’ ఇలాంటి జిత్తులమారి ఎత్తులన్నీ ‘కేంద్ర సాహిత్య అకాడమీ’పైన కూర్చొన్న ‘ఎర్రకోయిలలు’ నిస్సిగ్గుగా చేస్తుంటే చేవచచ్చిన పండిత ప్రకండులంతా కళ్లప్పగించి చూడడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు!!

ఇది భాషాపచారమా!
సాహిత్య విచారమా!
కవి పుంగవుల కన్నీళ్లా!
పండితుల వృథాప్రలాపమా!!
తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం!

గోపీచంద్ నారంగ్ (2003)
సునీల్ గంగోపాధ్యాయ (2008-2012)
విశ్వనాథ్‌ప్రసాద్ తివారీ ప్రస్తుతం కొనసాగుతున్నారు.
ఈరోజువరకు సాహిత్య అకాడమీ మహిళలను అధ్యక్షులుగా చేయలేదు. 2003లో గోపీచంద్ నారంగ్‌తో మహాశే్వతాదేవి పోటీపడ్డా గెలవలేదు.

సాహిత్య అకాడమీ సదస్సులు, సమావేశాలు, పరిశోధకులకు, రచయితలకు, కవులకు ప్రోత్సాహాలు ఇస్తుంది. అవి: 

1) కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, 
2) భాషాసమ్మాన్ పురస్కారం, 
3) అనువాద పురస్కారం, 
4) బాల సాహిత్య పురస్కారం, 
5) యువ పురస్కారం.

ఇండియన్ లిటరేచర్ (ఆంగ్లం), సమకాలీన భారతీయ సాహిత్య (హిందీ)- అనే రెండు ద్విమాస పత్రికలు సాహిత్య అకాడమీ ప్రచురిస్తుంది. ఏటా సాహిత్య అకాడమీ 1,00,000/- బహుమతిగా 24 భాషల నుంచి ఎంపిక చేసిన రచయితలకు అందిస్తుంది. ‘బహుభాషల పుస్తకాల’ సేకరణలో సాహిత్య ఆకాడమీ అతిపెద్ద గ్రంథాలయం నిర్వహిస్తుంది.

అంతర్జాతీయ సెమినార్లు, సంవత్సరోత్సవాలు, వార్షిక ఉపన్యాసాలు, కవి సంగమం కవి సంధ్య.. వంటి ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో కార్యక్రమాలు సాహిత్య అకాడమీ నిర్వహిస్తుంది. ఇంత ప్రసిద్ధమైన చరిత్ర... ఇందరు ప్రఖ్యాతులు నడయాడిన సాహిత్య అకాడమీకి ‘ఎర్ర జబ్బు’ ఎలా పట్టింది...!

మందులేని ‘మార్క్స్ రోగానికి’ అడ్డుకట్ట ఎలా...?

‘భారతదేశం నా వారసత్వ సంపద’- అని ప్రతిజ్ఞ చేసినట్లు సాహిత్య అకాడమీ ‘నా వారసత్వ సంపద’ అని బల్లగుద్దిచెప్పి తనవాళ్లనే జనరల్ కౌన్సిల్, ఎక్సిక్యూటివ్ కౌన్సిల్‌లో నియామకంచేస్తూ వెళ్లిపోవడం వెనుక రహస్యం ఏమిటి?
తాము పీఠంలో ఉన్నప్పుడు తలచుకున్నవారికి అవార్డులు ఇవ్వడం- వీలైతే వాళ్లకే అవార్డులు ఇచ్చి ప్రసిద్ధులను చేసి వివిధ భాషల్లో ఎక్సిక్యూటివ్ కౌన్సిల్‌లో స్థానం కల్పించడం. తర్వాత తమ పుస్తకాలకు అవార్డులు ఇప్పించుకోవడం ‘సాహిత్య వింత’ కాక ఇంకేమిటి!?

ఎందరు కవుల రచనలు వర్షానికి తడిసి, మంటల్లో మండి ధ్వంసం అయ్యాయో వాళ్లకు తెలియదు. ఎందరు కవుల రచనలు మరణం తర్వాత తమ కుటుంబం చేత ఈసడింపబడి లోకానికి తెలియకుండాపోయారో చెప్పలేం. ఎందరు కవులు ఉద్యోగాలు మార్చినప్పుడు, కొత్త ఇళ్లకు మారినప్పుడు తాము రాసుకొన్న రచనలు పోగొట్టుకొన్నారో తెలియదు. ఇలాంటి ఏ రచయిత రచనలను ప్రచురించకుండా ప్రసిద్ధ, పేరుమోసిన వాళ్లపేరుతో విమానాల్లో చక్కర్లుకొడుతూ సాహిత్య పరివ్యాప్తికన్నా విలాసాలకే విలువ ఇస్తూన్న సాహిత్య అకాడమీ ప్రతి ఐదు ఏళ్లలో పెట్టే ఖర్చు తెలిస్తే గుండె పగిలి చస్తాం. అక్షరాల అయిదేళ్ల సాహిత్య అకాడమీ బడ్జెట్ పదివేల కోట్లు!! సిగ్గు! సిగ్గు!

ప్రారంభం.. ఘనం..

భారతీయ భాషల ఏకత్వం కోసం... దేశంలోని అనేక సాహిత్య రీతులను ఏకోన్ముఖంగా నడిపించాలనే సదుద్దేశంతో 1944లో Royal Asiatic Society of Bengal వారు ఫ్రతిపాదించడంవల్ల National Cultural trust ఏర్పడింది. నాటి ఆలోచనతో మూడు సంస్థల ఏర్పాటుకు బీజం పడింది. దృశ్య కళలు (Visual Arts), రంగస్థల కళలు (Performing Arts), సాహిత్యం (Letters) - అనే వాటికి ఫ్రాధాన్యం లభించింది. ఆ తర్వాత 15 డిసెంబర్ 1952లో కేంద్ర సాహిత్య అకాడమీ ఏర్పాటుచేయాలని నిర్ణయం జరిగింది. ఈ అకాడమీ మొదటి సభకు సభ్యులుగా ప్రసిద్ధ భారతీయ తత్త్వవేత్త డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, విద్యావేత్త వౌలానా అబుల్‌కలామ్ ఆజాద్, సి.రాజగోపాలాచారి, కె.యం.్ఫణిక్కర్, కె.యం.మున్షీ, డా.జాకీర్‌హుస్సేన్, ఉమాశంకర్‌జోషి, మహాదేవివర్మ, డివి గుండప్ప, రాంధారీసింగ్ ఉన్నారు. దానికి అధ్యక్షులుగా పండిత జవహర్‌లాల్ నెహ్రూ ఉన్నారు. 1954 మార్చి 12న న్యూఢిల్లీలో ‘సాహిత్య అకాడమీ’ ప్రారంభింపబడింది. ఈ ప్రారంభ వేడుకలు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, వౌలానా అబుల్‌కలామ్ ఆజాద్ ఉపన్యాసాలతో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగాయి. వారి ఉపన్యాసాల్లో సాహిత్య అకాడమీ ఉద్దేశాలు చెప్పబడ్డాయి. సాహిత్య సృజనాత్మకతను గుర్తించడం, సాహిత్య సమూహాలు ఏర్పాటుచేయడం, సాహిత్యవేత్తలను ప్రోత్సహించడం, సృజనాత్మకత, సాహిత్య విమర్శ ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలుగా పెద్దలు చెప్పుకొన్నారు. తనను ప్రధానిగా కాకుండా కవిగా, రచయితగా గుర్తించి సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా నియమించినందుకు చాలా గర్వంగా ఉందని స్వయంగా జవహర్‌లాల్ నెహ్రూ పేర్కొన్నారు. అయితే విచిత్రంగా చైర్మన్ నియామకం ప్రభుత్వంద్వారా కాకుండా స్వతంత్రం సంస్థద్వారా జరగాలని నాటి పెద్దలు ప్రతిపాదించారు. ఆ తర్వాత మరికొన్ని సలహాలతో Societies Registration Act, 1860 క్రింధ సాహిత్య అకాడమీని పునరుద్ధరించి నెహ్రూని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు.
నెహ్రూ తర్వాత డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ (1958), జాకీర్‌హుస్సేన్ (1963), కె.ఆర్.శ్రీనివాస అయ్యంగార్ (1969, 1973). ఉమాశంకర్ జోషి (1978), బీరేంద్రకుమార్ భట్టాచార్య (1983), యు.ఆర్.అనంతమూర్తి (1993), రమాకాంత్థ్ (1998).
*
ఈ కవులు చాలా కాస్ట్‌లీ గురూ...!

జర్మన్‌లో ఓ ప్రసిద్ధమైన కవిని బ్రతికుండగానే గుర్తించిందట. ఆయన విగ్రహాన్ని నగరం నడిబొడ్డున పెట్టాలని నిర్ణయం తీసుకొంది. అందుకుగాను బడ్జెట్‌లో వందల డాలర్లు కేటాయించిందట. ఒకవైపు పనులు వేగంగా జరుగుతుంటే కొందరు పాత్రికేయులు ఈ కవి స్పందన తెలుసుకొందామని వెళ్లారట. తన విగ్రహం కోసం ప్రభుత్వం ఇంత ధనం కేటాయించడం ఆ కవికి ఆశ్చర్యం కలిగించినా ‘తనకు రోజూ 2 డాలర్లు ఇస్తే రోజూ స్వయంగా వచ్చి తానే నిలబడతాన’ని అన్నాడట! ఈ స్పందన ఆ కవి బీదత్వాన్ని, దీనత్వాన్ని తెలియజేస్తుంది. ఈ కథకు భిన్నంగా మన దేశంలో సాహిత్య అకాడమీ పనిచేస్తుంది.

సాహిత్య అకాడమీలోని పీఠాధిపతులు ఫ్లైట్‌లో తప్ప కాలు కదపరు. లేదా ఏసీ రైలు తప్ప ఇంకోటి ఎక్కరు. ఎందుకోసం? దేశంలోని నలుమూలల్లో జరిగే సదస్సులకు, సమ్మేళనాలని వెళ్లడంకోసం చాలా విలువైన విలాసవంతమైన ప్రయాణం చేస్తారు...!

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ ముతక బట్టలతో తెలిసినవాళ్ల ఇంటికివెళ్లి స్నానం చేయడానికి సబ్బు అడిగితే వాళ్లు ‘నీ మొహానికి సబ్బు అవసరమా’ అన్నట్టు చూశారట! దానిని కూడా ఆయన తన కవితాధారగా కన్నీటి ధారగా ప్రవహింపజేశారు.

కానీ మన సాహిత్య అకాడమీ ‘సాహిత్య నాయకులు’ దేశంలోని వివిధ ప్రముఖ నగరాల్లో ఖరీదైన ఐదు నక్షత్రాల హోటళ్లలో మాత్రమే బసచేస్తారు. ‘వర్కింగ్ లంచ్’ వాళ్లు ముట్టనేముట్టరు. సాదాసీదా భోజనం వీళ్లకు ముద్దదిగదు. షడ్రసోపేతమైన విందు భోజనం వీళ్ల ముందు ఉంటేనే వాళ్ల గౌరవానికి ఏమాత్రం భంగం రాకుండా ఉంటుంది.
ప్రజా సాహిత్యాన్ని పరివ్యాప్తం చేస్తామని చెప్పే ఈ సాహిత్యధీరులు ప్రజలతో సంబంధం లేని ఏసీ గదుల్లో కవిత్వం రాస్తారు. గతంలో హైదరాబాద్ ద్వారకా హోటల్లో తిని త్రాగి రాసే బ్యాచ్ వారసులే అకాడమీలో పీఠం వేసుక్కూర్చున్నారు. ఫైవ్‌స్టార్ కవితా సంస్కృతికి అలవాటుపడ్డ వీళ్లంతా ‘ఏసీ కవిత్వం’ రాస్తారు.

‘‘అయిదు చుక్కల హోటల్లో కూర్చొని
నాలుగు చుక్కలు వేసుకొని
మూడు ముక్కలు తిని ఆస్వాదిస్తూ
ఒక్కముక్క రాస్తాం’’
- అన్నాడు ఓ కవి. నిజమే!*

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి 📌
🔴 ఆంధ్రభూమి 🔴 30-04-2018 🔴సోమవారం 🔴


ఒక పట్టణంలో వ్యాపారి అయిన జీర్ణ్ధనుడు ఆర్థికంగా నష్టపోయి, తిరిగి సంపాదించడానికై ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. చివరకు తనకు మిగిలిన ఇనుప దూలాన్ని తన స్నేహితుడైన లక్ష్మణ్ దగ్గరుంచి భద్రపరచమని చెప్పి వెళ్లాడు. కొన్నాళ్ళకు తిరిగి వచ్చి తన ఇనుప దుంగను తిరిగి ఇవ్వమన్నాడు. ‘మిత్రమా! ఇనుప దుంగను ఎలుకలు తినేశాయి’ అన్నాడు లక్ష్మణ్. ‘అయ్యో! విధి విచిత్రం కాకపోతే ఇనుమును ఎలుకలు తినడమా!’ అని జీర్ణ్ధనుడు సరిపెట్టుకొన్నాడు. ‘సరేలే లక్ష్మణా.. సముద్ర స్నానానికి వెళ్తున్నాను. నా వస్త్రాలకు కాపలాగా నీ కొడుకును పంపించు’ అన్నాడు. సరేనని లక్ష్మణ్ తన కొడుకును స్నేహితుని వెంట పంపించాడు. ఆ పిల్లవాణ్ణి ఓ చోట భద్రపరచి, స్నానం చేశాక తిరిగి వచ్చి, ‘నీ కొడుకును గద్దలు ఎత్తుకుపోయాయి’ అని లక్ష్మణ్‌తో అన్నాడు. దాంతో లక్ష్మణ్ 15 ఏళ్ల కుర్రవాడిని గద్దలు ఎత్తుకు పోవడమేంటని న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి ఆగ్రహించి బాలుణ్ణి గద్దలు ఎత్తుకుపోవడమా? అని గద్దించాడు. దానికి జీర్ణ్ధనుడు నవ్వి ‘ఇనుప దుంగను ఎలుకలు తిన్నపుడు బాలుణ్ణి గద్దలు ఎందుకు ఎత్తుకుపోవు?’ అన్నాడు. న్యాయమూర్తి అందులోని రహస్యం అడగ్గా జీర్ణ్ధనుడు మొత్తం వివరించాడు. దాంతో న్యాయమూర్తి లక్ష్మణ్‌పై ఆగ్రహించి ఇనుప దుంగను జీర్ణ్ధనుడికి ఇప్పించి, బాలుణ్ణి లక్ష్మణ్‌కు అప్పగించాడు. ఇది పంచతంత్రంలో కరటకుడు దమనకుడికి చెప్పిని కథ.
డెబ్బై ఏళ్ల నుండి ఇనుప దుంగలను ఎలుకలు తిన్నాయని అబద్ధం చెప్పే గుంపునకు ‘బాలుణ్ణి గద్ద ఎత్తుకుపోయింద’ని చెప్పగానే బాధ కలుగుతుంది. ‘సూడో సెక్యులరిజం’ అనే ఎలుకకు ఇన్నాళ్లు హిందుత్వ అనే ఇనుప దుంగను తినిపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడది సాగకపోవడంతో సెక్యులర్ గుంపు రకరకాల వేషాలు వేస్తోంది. హిందూ సమాజంలోని గొప్పతనాన్ని చెప్పకుండా, కేవలం నిందించడం ఓ ఫ్యాషన్‌గా పెట్టుకొన్న విదేశీ మనస్తత్వాలు తమను తాము పరిశీలించుకోవడం లేదు. గాంధీజీ రాజకీయాల్లోకి రాగానే ఆయన మెత్తదనాన్ని ఉపయోగించుకుని హిందువులను అణచడం మొదలైంది. అది స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ విధానాలతో సంతుష్టీకరణగా మారిపోయింది. మైనార్టీలు ఓట్లు వేస్తేనే గద్దెపై కూర్చోవచ్చు అనే భ్రమను కలిగించి, హిందూ సమాజాన్ని కులాలవారీగా విడగొట్టి పబ్బం గడుపుతున్నారు. 2014లో నరేంద్ర మోదీ జాతీయవాదంపై నిలబడి అఖండమైన మెజార్టీ సాధించడం ఓ చారిత్రాత్మక పరిణామం. దీన్ని జీర్ణించుకోలేని వ్య క్తులు, శక్తులు గత నాలుగేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. జాతీయవాద సంస్థలపై, ఆ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తులపై సామాజిక, రాజకీయ దాడులను కొనసాగిస్తున్నారు. సామాజిక, పత్రికా రంగాల్లో మేధావులుగా చలామణి అవుతున్న వాళ్లు అంతులేని అసహనం ప్రదర్శిస్తున్నారు. వారి మేధో ఉగ్రవాదం ఎంతతీవ్ర స్థాయికి వెళ్లిందంటే ప్రతిదాంట్లో హిందూ జాతీయతను వ్యతిరేకించడమే. సహజంగా హిందువులది సెక్యులర్ మనస్తత్వం. దేశ విభజన జరిగిన తర్వాత, అంతకుముందు ఎన్నో మత ఘర్షణలు జరిగాయి. ప్రతిసారి హిందువులు తమ ప్రాణాలు, ఆస్తులు కోల్పోయారు. తమ మనోభావాలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ప్రవర్తించినా సర్దుకుపోయారు.
కాశ్మీర్ విషయంలో రాజకీయ పార్టీలు వ్యవహరించిన తీరుతో వేలాది మంది సైనికులను మనం కోల్పోయాం. కాశ్మీరీ పండిట్లపై అత్యాచారాలు చేసి, అక్కడి నుండి వెళ్లగొట్టినా కిమ్మనని భావదారిద్య్రంలో మనం బ్రతికాం. 2001 నుండి 2010 వరకే 1067మంది ప్రజలు, 590 మంది భద్రతా దళాల సైన్యం, 2850 మంది తీవ్రవాదులు మరణించారంటే కాశ్మీర్‌లో పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో మనం ఆలోచించవచ్చు. దీనికి ప్రధాన కారణం అక్కడి ముస్లింలలో ఎక్కువమంది తమను తాము ‘అంతర్జాతీయ సమాజం’గా ఊహించుకోవడం. పాకిస్తాన్ చేస్తున్న దురాగతాలకు కాశ్మీర్‌లోని వేర్పాటువాదులు సహకరించడం ఈ రోజుకూ చూస్తున్నాం. జూన్ 2017లో మహమ్మద్ అయూబ్ పండిట్ అనే పోలీసు అధికారిని మతోన్మాద గుంపు ఎంత కిరాతకంగా చంపిందో మనం గమనించవచ్చు. వీటిని ఖండించకుండా ఈ దుర్మార్గాలన్నీ పెంచి పోషిస్తున్న కుహనా లౌకికవాద రాజకీయ ముసుగులు మెల్ల మెల్లగా తొలగిపోతున్నాయి. హిందువుల్లో చైతన్యం పెరిగి ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. గత డెబ్భై ఏళ్ళనుండి సాహిత్య, సాంస్కృతిక కళారంగాలన్నీ కమ్యూనిస్టుల చేతుల్లో ఉన్నాయి. అందువల్ల మన పత్రికల్లో ‘హిందూ వ్యతిరేకతకు, ఇండియా వ్యతిరేకత’ సిద్ధాంతాలకు స్థానం ఎక్కువ. అలాగే గత డెబ్భై ఏళ్ళలో దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా క్రైస్తవ మిషనరీలు వచ్చాయి. ధనం ఆశ జూపి, పేదరికాన్ని ఆసరాగా చేసుకొని తీవ్రమైన మత మార్పిడి జరిగింది. దాంతో హిందూ సమాజంలో అంతఃకలహాలకు ఆస్కారం ఏర్పడింది. ‘దరిద్రమే లేకపోతే మీరు ఎవరికి సేవ చేస్తారు?’ అని బెర్‌ట్రాండ్ రస్సెల్ మిషనరీలను ప్రశ్నించాడు. సేవ పేరుతో జరిగిన మత మార్పిడివల్ల- మతం మారిన వారి చేతుల్లో బైబిల్ మిగిలింది, మారినవారి అనుయాయులకు రాజ్యాధికారం దక్కింది. ఈ పరిణామాలు కొత్తతరం హిందూ నాయకుల్లో, యువకుల్లో, మతాచార్యుల్లో అగ్నిలా మండి క్రొత్త క్రొత్త ఉద్యమాలకు ఊపిరిపోశాయి. హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు స్వాములు, పీఠాధిపతులు గతంలో లాగా ముక్కు మూసుకొని తపస్సులో మునగకుండా కొత్త తరహా ప్రబోధాలు మొదలుపెట్టారు.
1990 తర్వాత రామజన్మభూమి ఉద్యమం ఈ దేశంలో ప్రతి హిందువును తట్టిలేపింది. ఎక్కడికక్కడే హిందూ జాగృతి మొదలైంది. ఇపుడు సామాజిక మాధ్యమాలు హిందువులకు ప్రత్యామ్నాయ మీడియాగా మారిపోయాయి. పత్రికా రంగంలో పాతుకుపోయిన కమ్యూనిస్టు మేధావులు హిందువుల ఆచారాలను, సంప్రదాయాలను, రాజకీయాలను శీతకన్నుతో చూస్తూ సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. హిందూ సమాజానికి సోషల్ మీడియా వరంలా అందివచ్చింది. సంప్రదాయ ప్రచార ప్రసార మాధ్యమాలకు సమాంతరంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు జాతీయ వాదులకు క్రొత్త వేదికలుగా మారిపోయాయి. దాంతో మీడియాలోని ఏకపక్ష వామపక్ష వాదానికి అడ్డుకట్టపడింది. హిందూత్వను ఎంత తిడితే అంతగొప్ప లౌకికవాదిగా చిత్రీకరించే ధోరణిని సోషల్ మీడియా గట్టిగా ఎదుర్కొంది. అందువల్లనే మేధావుల్లో అసహనం మొదలైంది.
వెయ్యేళ్ల బానిసత్వ బాధలు హిందూ యువకులను ఏకం చేసి, వివిధ హిందూ సంస్థలను పటిష్టపరిచాయి. ఇందులో కూడా హిందూ చైతన్యం కన్నా హిందుత్వంపై జరుగుతున్న తీవ్ర దాడులే వారిని ఏకం చేశాయి. మతోన్మాదం ఏదైనా తప్పు అని చెప్పాల్సిన మేధావులు మైనారిటీ మతోన్మాదాన్ని పట్టించుకోకుండా ఎంతసేపూ మెజారిటీ మతవాదంపై ఒంటికాలిపై లేస్తారనే సత్యం హిందూ సమాజం మెల్ల మెల్లగా గుర్తించడం మొదలుపెట్టింది. హిందుత్వం సర్వమత సమాభావనను తన పునాదుల్లో తరాల నుండి నింపుకొంది. కాబట్టే అబ్దుల్ కలాం జాతీయతను ముస్లింలకన్నా హిందువులే ఎక్కువ ఇష్టపడతారు. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షెహనాయి వాద్యాన్ని హిందువులు తమ గుండెలనిండా నింపుకొన్నారు. ఖ్వాజా గరిరీ బన్నవాజ్, ఖ్వాజా బందేనవాజ్ వంటి సూఫీ గురువులను హిందూ సమాజం గౌరవించింది. అమీర్‌ఖాన్, షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, జావేద్ అక్తర్‌లను మన సినీ ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తున్నారు. కానీ కులౌకికవాదులు హిందుత్వను ఎప్పుడూ మతోన్మాదంగానే చిత్రీకరించారు. ఇప్పటికీ అదే పని నిరంతరాయంగా కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సిపిఎం జాతీయ మహాసభలు ‘మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తాం’ అనలేదు. ‘హిందూ మతోన్మాదాన్ని మాత్రమే వ్యతిరేకిస్తాం’ అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ విషయాలను హిందువులు బాగా గమనిస్తున్నారు. హిందువులను సహనశీలురుగా, అణచివేతను సహించే వ్యక్తులుగా ఉండాలని సూడో సెక్యులర్ వాదుల భావన.
మన దేశంలో 20 వేల జనాభానే ఉన్న ఫార్సీలు ఈ దేశంలో గొప్ప పదవులు నిర్వహించారు. జస్టిస్ కపాడియా సుప్రీంకోర్టు సిజెగా, మానెక్ షా మిలట్రీ అధికారిగా, సోలీ సొరబ్జీ అటార్నీ జనరల్‌గా పనిచేసి ఈ దేశ ఖ్యాతిని నిలబెట్టారు. మీకు ఏమైనా ప్రత్యేక అధికారాలు కావాలంటే ఇస్తాం అని స్వాతంత్య్రం ఇచ్చే సమయంలో బ్రిటీష్ వారు అడిగితే ‘మమ్మల్ని ఇక్కడి హిందువులు బ్రహ్మాండంగా గౌరవించారు. మాకేమీ వద్దు’ అని వారు సున్నితంగా తిరస్కరించారు. అలాంటి హిందూ సమాజంపై నిరంతరం అభాండాలు వేస్తూ ‘నేను హిందువును’ అని చెప్పుకోవడం నేరం అన్నట్లుగా తయారుచేసిన వాతావరణం ‘హిందువునని గర్వించు’ అనే నినాదం వరకు ఎందుకు వెళ్లింది?
దేశంలో జరిగే చిన్న చిన్న సంఘటనలను యావత్ హిందూ సమాజంపై మోపడం కూడా ‘సెక్యులర్ వాదుల’ కుట్రలో భాగమే. ఏదైనా సంఘటనను కులాలకు, మతాలకు ఆపాదించి చేసే దుష్ప్రచారం ఇంకెంతో కాలం సాగదు. లౌకికవాదం పేరుతో హిందూ అస్తిత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించినంతకాలం హిందూ జాతీయవాదాన్ని ఎవరూ ఆపలేరు. ఇనుప దుంగలను ఎలుకలు తింటే 15 ఏళ్ల బాలుణ్ణి గ్రద్ద ఎత్తుకుపోవడం నిజమే కదా అన్న పంచతంత్ర నీతిని కుహనా లౌకికవాదులు గ్రహించాలి!


********************************************************
✍✍-డాక్టర్. పి. భాస్కర యోగి 
Published Andhrabhoomi :
Friday,  April 27, 2018


ఈ రోజుల్లో మనుషులు ఎన్నో తప్పులు చేయడానికి ధనం ఒక కారణం. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవనంలో మనుషులు పవిత్రంగా ఉండడానికి కూడా ధనం ఆటంకంగా మారిపోయింది. ఈ ‘ధనసంచయం’ అనేది ఓ వికృత మనస్తత్వం. పూర్వం ప్రజలకు ఇప్పుడున్న వసతులేవీ లేకున్నా ‘కౌపీన వంత కడు భాగ్యవంత’ అన్నట్లు సుఖంగా ఉండేవారు. ఇప్పుడు అన్ని వసతులను అత్యంత వేగంగాపొందగలిగినా మోకాళ్లలోతు సుఖం.. మొలలోతు దుఃఖం చందంగా  జీవిస్తున్నారు.  అత్యాశ కారణంగాప్రతి రంగంలో మనిషి యంత్రంలాగా వేగంగా పరుగెత్తుతున్నాడు. అపరిమితమైన ఆ శతో అసలు సత్యాన్ని గుర్తించలేక జీవితం దుఃఖమయం చేసుకొంటున్నారు. ఈ అత్యాశ అనేది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అంధకారంలో పడేస్తుంది. అత్యాశ ధనం విషయంలో మాత్రమే కాదు, దేని విషయంలోనైనా అంతే. రోగానికి ఔషధం, అజ్ఞానానికి జ్ఞానం ఎలా విరుగుడో.. అలా అత్యాశకు ఆత్మజ్ఞానమే ఉపాయం. జ్ఞాని అయిన వాడు లోకంలోని దుఃఖానికి కారణం అత్యాశ అని గ్రహిస్తాడు. అది ఒక రోగం. దానికి ధర్మాచరణతో కూడిన ఆత్మజ్ఞానం ఔషధం. ఇది అర్ధం చేయంచడానికే పౌరాణిక గాథలు. పాపపుణ్యాలను ఆ గాథలకు లక్ష్యాలుగా నిర్ణయించి మనుషుల్లోని ఈ రోగనిర్మూలనకే ఇన్ని ఉపమానాలు. అవి విని మనలోని అసలు తత్వాన్ని తెలుసుకుంటే ఆత్మశాంతి లభిస్తుంది.

అర్ధస్య సాధనే సిద్ధే ఉత్కర్షే రక్షణే వ్యయే
నాశోపభోగ ఆయాసః త్రాసశ్చింతా భ్రమోనృణామ్‌

ధనసంపాదనలో నిమగ్నమయినవారు దాని అభివృద్ధి, రక్షణ, వ్యయం, నాశనం, అనుభవం కలుగగానే, వరుసగా శ్రమ, భయం, విచారం, దుఃఖం సుఖభ్రాంతులను పొందుతారు - అని భాగవతం తెలిపింది. ఈనాటి ధనసంపాదనంతా సుఖంగా జీవించడం కోసం, తమ సంతానం రాబోవు రోజుల్లో ఆనందంగా జీవితం గడపడం కోసం అనుకొని తీవ్రంగా ప్రతివారు కష్టపడుతున్నారు. అందులోనే విలువైన జీవితం గడిచిపోయి మనకున్న అసలైన ఆధ్మాత్మిక లక్ష్యాన్ని ధ్వంసం చేస్తున్నది.


*************************************************
      డాక్టర్‌ పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ
సమతాస్ఫూర్తి 

వైష్ణవ సిద్ధాంతాన్ని ఒడిసిపట్టిన శాస్త్రపారంగతుడు... విశిష్టాద్వైత వైభవాన్ని విశ్వమంతా చాటిన ఆచార్యుడు... సనాతన ధర్మంలో సమానత్వాన్ని చాటిన మేరునగధీరుడు వేదాంతదీపంగా వెలుగొందిన శ్రీ రామానుజాచార్యుడు!
శ్రీమద్రామానుజులు క్రీస్తుశకం 1017లో భూమి పిరట్టియార్‌, ఆసూరికేశవ పెరుమాళ్‌ దంపతులకు తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జన్మించారు. త్రిమతాచార్యులలో ద్వితీయుడైనా అద్వితీయమైన పాండిత్యంతో ఆయన భాష్యాలు రచించారు. రామానుజులు ప్రాథమిక విద్యను తండ్రి దగ్గరే నేర్చుకున్నారు. మొదట యాదవ ప్రకాశులనే గురువు వద్ద వేదాంతాన్ని అభ్యసించారు. ఒక వ్యాఖ్యానం విషయంలో గురుశిష్యుల మధ్య భేదాభిప్రాయాలు కలగడంతో, ఆఖరుకు గురువే శిష్యుణ్ణి చంపాలనుకొనేవరకూ పరిస్థితులు వస్తాయి. ఆ కుట్రను రామానుజుడు తెలుసుకున్నారు. దాని నుంచి తప్పించుకొని కంచికి చేరుకున్నారు. ఆ తరువాత తల్లి కోరిక మేరకు వివాహం చేసుకున్నారు.

ముడుచుకున్న వేళ్ళు తెరుచుకున్నాయి!

ఆ కాలంలో శ్రీరంగం వైష్ణవ విద్యలకు నిలయంగా ఉండేది. అక్కడ ఆళవందారు స్వామి వైష్ణవ గురువు. శ్రీరామానుజుణ్ణి తన దగ్గరకు రమ్మని పెరియనంబి ద్వారా ఆళవందారుస్వామి వర్తమానం పంపారు. రామానుజులు శ్రీరంగం వెళ్ళేసరికి, అప్పటికి కొన్ని గంటల ముందే, గురువుగారు దేహత్యాగం చేశారు. కానీ ఆయన మూడు వేళ్లు ముడుచుకొని ఉన్నాయి. ‘‘గురువుగారికి మూడు కోరికలుండేవి. బ్రహ్మసూత్రాలకూ, విష్ణు సహస్ర నామాలకూ, తిరువాయిమొళికి సరళార్థ ప్రబోధకంగా వ్యాఖ్యానం రాయాలని ఆయనకు ఉండేది. కానీ అది నెరవేరకపోవడం వల్ల వారు దానికి సంకేతంగా అలా వేళ్లు ముడుచుకున్నా’’రని వారు చెప్పారు. ‘‘ఆ కార్యం నేను నెరవేరుస్తాను!’’ అని రామానుజులు ప్రతిజ్ఞ చేయగానే వేళ్లు తెరుచుకున్నాయి.

అందరికీ మంత్రోపదేశం!

రామానుజుడి భార్య కాస్త కటువైన మనిషి కావడం వల్ల ఆయన సంసారం వదిలి సన్యాసం స్వీకరించారు. తరువాత వైష్ణవాగమాలనూ, శాస్త్రాలనూ క్షుణ్ణంగా చదువుకొని తిరుక్కోటియార్నంబి శిష్యుడై మంత్రోపదేశం పొందారు. ఆయనను ‘గోష్ఠిపూర్ణులు’ అని కూడా పిలుస్తారు. ఆ మంత్రం రహస్యమనీ, అది ఎవరికీ చెప్పవద్దనీ గురువు ఆదేశం. కానీ రామానుజులు ‘‘రహస్యమైన మంత్రాన్ని ఇతరులకు చెప్పి నేను నరకానికి వెళ్ళినా సరే, ఇతరులు మోక్షానికి వెళితే చాలు!’’ అని తిరుకోష్టియారు గుడి పైభాగానికి ఎక్కి అందరికీ మంత్రోపదేశం చేశారు. గురువు మొదట ఆక్షేపించినా రామానుజుని విశాల మనస్తత్వానికీ, సామాజిక సమరసతకూ ముచ్చటపడి ఆశీర్వదించారు.

అవి రెండూ ఒక్కటే!

ప్రస్థానత్రయంలోని న్యాయప్రస్థానమైన ‘బ్రహ్మసూత్రాలు’, శ్రుతి ప్రస్థానమైన ‘ఉపనిషత్తులు’, స్మృతిప్రస్థానమైన ‘భగవద్గీత’లపై శ్రీరామానుజులు విశేష కృషిచేసి భాష్యాలు అందించారు. కేవలం బ్రహ్మసూత్రాలకు వివరణాత్మకంగా మూడు గ్రంథాలను అధికారి భేదాన్ని దృష్టిలో ఉంచుకొని రచించారు. వీటిని ‘వేదాంత దీపము’, ‘వేదాన్త సారము’, ‘శ్రీభాష్యము’ అని పిలుస్తారు. ఇవేగాక ‘దినచర్య’, ‘శరణాగతగద్య’ తదితర తొమ్మిది గొప్ప గ్రంథాలను రామానుజులు అందించారు. విశిష్టాద్వైత దర్శనాన్ని ఆయా గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఈ దర్శనానికే ‘రామానుజ దర్శన’మని పేరు.
భేదం అంటే ద్వైతం, అభేదం అంటే అద్వైతం. ఈ రెండూ ఉపనిషత్‌ ప్రతిపాదనలు. వాటిని శాస్త్రప్రమాణంగా సమన్వయపరచినవే ఉపనిషత్తులు. వీటిని సమన్వయపరచడమే విశిష్టాద్వైతం. స్థూల, జీవ, జడ విశిష్టమైన బ్రహ్మము కార్యం. ఈ రెండూ వేరూ కానేరవు. ఇది అవస్థాభేదం మాత్రమే. అందువల్ల ‘విశిష్టమ్‌’ కారణ దశలో, కార్యదశలో ఒక్కటే కాబట్టి ‘విశిష్టము అద్వైతమే’ అని రామానుజులు తన సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.

సామాన్యుల ముంగిటికి వైష్ణవం

చోళరాజైన కుళోత్తుంగుడు పచ్చి శైవుడు. అతని ఆధీనంలోకి శ్రీరంగం వచ్చింది. ఆ సమయంలో కొన్నాళ్ళు రామానుజులు ప్రవాసంలో ఉన్నారు. అక్కడి రాజైన బిత్తిదేవుని వైష్ణవుడిగా మర్చారు. అక్కడి జైన పండితులను ఓడించారు. మేల్కొటే గ్రామంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించి గొప్ప సామాజిక సమరసతను సాధించారు. వైష్ణవ మతాన్ని సామాన్యుల వద్దకు కూడా తీసుకుపోవడానికి పీఠాలు ఏర్పాటు చేశారు.

************************************************************************************
డాక్టర్ పి. భాస్కర యోగి 
ఆంధ్రజ్యోతి నవ్య 
20-04-2018  శుక్రవారం

–  ఉపవాసానికి ముందు ఏదో కొంచెం తిని రావడం మన దేశంలో సాధారణమే. అందుకే ఈ రోజు ఉపవాసదీక్షకు కొంచెం తిని వచ్చాం.
– ఉపవాస దీక్షలో కూర్చున్న కాంగ్రెస్‌ నేతలు
– ‘కొంగజపం’ లాగా దొంగ ఉపవాసమన్న మాట.
– మోదీ కోటీశ్వరులకు మిత్రుడు. తన మిత్రుల లాభాల కోసమే రాఫెల్‌ యుద్ధ విమానాల స్కాం జరిగింది. వచ్చే ఎన్నికల్లో మోదీకి బుద్ధి చెప్పడం ఖాయం.
– కాంగ్రెసు నేత రాహుల్‌గాంధి
– అందరూ ‘ఖత్రోచి’ ని ఇంట్లో బంధువు లాగా పెట్టుకొంటారని ఊహిస్తే ఎలా ?
– నేను ఢిల్లీ వెళ్ళి అందరినీ కలుస్తా. బిజెపి ద్రోహాన్ని ఎండగడతా !
– ఎపి ముఖ్యమంత్రి బాబు
– హేమాహేమీలను కలుస్తానని వెళ్లి హేమమాలినిని కలిసి వచ్చారు.
– బిజెపి మమ్మల్ని చూసి భయపడుతోంది.
– బహుజన సమాజ్‌ పార్టీ నాయకురాలు మాయావతి
– మిమ్మల్ని చూశా ? గతంలో మీరు చేసిన స్కాముల్ని చూశా ?
– కేంద్రంలో గుణాత్మక మార్పులు తెస్తాం
– టిఆర్‌ఎస్‌ నేతలు
– ముందు రైతు ఋణాలు సరిగ్గా మాఫీ చేయండి.
– రామసేతును పరిశోధించం; అది మా పని కాదు
– ఐసిహెచ్‌ఆర్‌ స్పష్టీకరణ
– అయ్యో ! మీకు దేశంలో తాజ్‌మహల్‌లూ, చార్మినార్‌లు ఉండగా దాని జోలికి ఎందుకు పోతారులే !
– యజ్ఞంలా రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు. ఉచితంగా కంటి అద్దాలు, మందుల పంపిణీ.
– ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్‌
– కొంపదీసి అవి కూడా బతుకమ్మ చీరల్లా ఉండవు కదా !
– కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే రైతులకు న్యాయం.
– పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
– అధికారంలోకి వస్తే మళ్ళీ ఎంతమంది రైతులను చంపుతారు ?
– ప్రజల కోసమే తెలంగాణ జనసమితి
– ఆచార్య కోదండరాం
– అంటే మిగతా పార్టీలు !?
– న్యాయమడిగితే నేరమా? విభజన హామీల సాధన పోరాటం ఆగదు.
– ఢిల్లీలో తెదేపా ఎంపీలు
– మీ (వి) భజన రాజకీయం బోరు కొడుతోందండీ బాబూ !
– ఫులే మార్గంలో కెసిఆర్‌
– మంత్రి జోగురామన్న
– ఓ రోజు అంబేడ్కర్‌ మార్గం అంటారు. మరో రోజు ఫూలే మార్గం అంటారు. అసలు ఏ మార్గంలో బోతున్నరు..!?
– లౌకిక శక్తులతో రాజకీయ వేదిక
– సిపిఎం నాయకుడు బి.వి.రాఘవులు
– ఆ పదంపై మీకు బోరు కొట్టదా సార్‌ ?!


*********************************************************************************
– డా|| పి.భాస్కరయోగి



– కర్ణాటకలో మతతత్వ బిజెపిని ఓడించేందుకు కాంగ్రెసు, జెడియస్‌ సహా ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధం.
– జెడియు నేత శరద్‌యాదవ్‌
– అడగని ప్రసంగం చేయడమంటే ఇదే !
– గూండాలకు మానవహక్కులుండవు
– మధ్యప్రదేశ్‌ సిఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌
– చౌహాన్‌జి ! ఈ మాట మీరంటే మతతత్వం. కమ్యూనిస్టులంటే విప్లవం.
– మోదిపై తిరగబడండి. ¬దా అడిగితే కేంద్రం ఆంధ్ర ప్రజలను అవమానిస్తోంది.
– సిఎం చంద్రబాబు
– మా బాబే ! మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆంధ్ర ప్రజలను అన్నట్టా. మరి మీరు ఓటుకు నోటులో దోషిగా నిలబడితే ఆ అవమానం ప్రజలదా..!?
– కాగ్‌ నివేదికతో ప్రభుత్వ బండారం బట్టబయలు. ప్రభుత్వానివన్నీ దొంగ లెక్కలే.
– కాంగ్రెసు నేత దాసోజు శ్రవణ్‌
– మీరు హోంవర్క్‌ సరిగ్గా చేయడం లేదు.
– బిజెపిని ఓడించడానికి అందరినీ కలుపుతాం.
– సిపిఎం నాయకురాలు బృందా కారత్‌
– ముందు ప్రకాశ్‌ కారత్‌ను, సీతారాం ఏచూరిని కలపండి.
– కాంగ్రెసు థర్ట్‌క్లాస్‌ పార్టీ
– మంత్రి కెటిఆర్‌
– ఐటి శాఖ ప్రోగ్రెస్‌ కార్డులు కూడా ఇస్తోందా? కెటిఆర్‌గారూ !
– న్యాయవ్యవస్థ పెను ప్రమాదంలో ఉంది. ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం కాదు.
– జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌
– దానికి ఎవరు బాధ్యులు మిలార్డ్‌ ! మరి జస్టిస్‌ కర్ణన్‌ను ఎందుకు తమరు శిక్షించారు ?
– మోది పాలనలోనే బీఫ్‌ ఎగుమతులు వృద్ధి.
– కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి
– మరి ప్రతిపక్ష పార్టీగా మీరేం చేస్తున్నారో..!?
– వాళ్ల ప్రాజెక్ట్‌లన్నీ టెస్ట్‌మ్యాచ్‌లే. పూర్తవుతాయో, ఫలితం ఉంటుందో లేదో కూడా తెలియదు.
– మంత్రి హరీశ్‌రావు
– మీవన్నీ ఒలింపిక్‌ గేమ్‌లే..!?
– దమ్ముంటే అవిశ్వాసం ఎదుర్కోండి.
– సిపిఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి
– అంతకన్నా ఎక్కువగా దమ్మున్న, దగ్గున్న ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయిగా.
– రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. కెసిఆర్‌కు సిఎంగా కొనసాగే అర్హత లేదు. ఎన్నికల్లో కాంగ్రెసు ప్రభంజనం ఖాయం.
– టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
– ఉత్తమ వాక్యం. కానీ ఎదుర్కోవడమే ఉత్తమంగా లేదు.
– నరేంద్రమోది తోబుట్టువులతో అంత సన్నిహితంగా మెలగరు. అనుబంధాల పట్ల మోది వైఖరి చిన్ననాటి నుంచీ ఇదే.
– ఆంధ్రజ్యోతిలో విశ్లేషకుడు నరసింహారావు
– అంటే ఇంట్లో ఉన్నవాళ్లందరికీ పదవులు కట్టబెట్టడం, కులం వాళ్లందరినీ దేశం నిండా నింపడం, తన కులం వాళ్లయితే చాలు వాళ్ల రక్షణకు మాన ప్రాణాలు వదలడం – ఇవేనా మీరుకోరుకునే విలువలు ?!

**************************************************************************************
– డా|| పి.భాస్కరయోగి



– రాజ్యసభ ఎన్నికల్లో గుడ్డిగా అభ్యర్థిని పెట్టారు. కాంగ్రెస్‌ వాళ్ళకు సోయి లేదా ?
– సిఎం కెసిఆర్‌
– వాళ్ళకు సోయి లేదుకాబట్టే మిమ్మల్ని గుడ్డిగా నమ్మారు. లేకపోతే..!?
ం తెలంగాణ భాజపా టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో విఫలమైంది. కార్యకర్తలతో మాట్లాడి త్వరలోనే ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటా.
– మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి
– ఇక్కడి భాజపా పెద్దగా చింతించడం లేదు.
– ఎప్పటి నుంచో సిక్కులకు ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చి ఉగ్రవాదులుగా భారత్‌లోకి ఎగదోస్తున్నది.
– పంజాబ్‌ సిఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌
– ధైర్యంగా ఎదుర్కోండి కెప్టెన్‌ గారూ !
– దొంగ, నేరస్థుడు ప్రధానిని ఎలా కలుస్తారు ? భాజపా చెప్పేవన్నీ అబద్ధాలు.
– సిఎం చంద్రబాబు
– దొంగనోట్ల శేఖర్‌రెడ్డి గురించి మాట్లాడితే మీరెందుకండీ దూరతారు ?!
– ఇచ్చిన వాటికి ముందు లెక్క చెప్పండి. మేం ఎంతో చేశాం. తేదేపా కావాలనే ఎన్‌డిఎ నుండి బయటకు వెళ్ళి భాజపాను బద్నాం చేస్తోంది.
– భాజపా అధ్యక్షుడు అమిత్‌షా
– షా గారూ! దయచేసి సీరియస్‌గా ఆపరేషన్‌ మొదలుపెట్టండి. ఇతరులను అపఖ్యాతిపాలు చేయడంలో చంద్రబాబు దిట్ట.
– స్పీకర్‌ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు.
– పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
– గతంలో మీ ప్రభుత్వం ఉన్నపుడు పనిచేసిన స్పీకర్‌ సురేశ్‌రెడ్డిలా ఉన్నాడని బాధపడుతున్నారా !?
– ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనని సినిమావాళ్ళు దుర్మార్గులు.
– ఎమ్మెల్సి రాజేంద్రప్రసాద్‌
– దాని గురించి పోసాని కృష్ణమురళిని అడిగితే అద్భుతంగా చెప్తాడు.
– మా కులాలకు కెసిఆర్‌ దేవుడు.
– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
– అందుకే ఎప్పటి నుండో క్షీరాభిషేకాలు జరుగుతున్నాయ్‌ కదా !
– తప్పులు చేశాం. వెరీ సారీ.
– ఫేస్‌బుక్‌ సిఇఒ మార్క్స్‌ జుకర్‌బర్గ్‌
– ఫేస్‌ ‘బుక్కు’ అంటేనే ‘తప్పులు చేయడం – దిద్దుకోవడం’.
– ప్రాంతీయ పార్టీల మధ్య వైరుధ్యాలున్నాయి. అందర్నీ కూడగట్టి నిలబెట్టడం సాధ్యం కాదు. కెసిఆర్‌ ఫ్రంట్‌ కూడా విఫలమే.
– సిపిఎం నాయకుడు ప్రకాశ్‌కారత్‌
– ఈ ఫ్రంట్‌లన్నింటికీ ముందుగా టెంట్‌ వేసేది మీరేగా !
– భాజపా పతనం ప్రారంభమైంది.
– సిపిఎం నేత రాఘవ
– అదే ! మొన్న త్రిపురలో లాగానా !

************************************************************************************
– డా|| పి.భాస్కరయోగి

మీరూ నిద్ర లేచారా !




– దక్షిణాది రాష్ట్రాలలో ‘ద్రవిడనాడు’ డిమాండ్‌ వస్తే మద్దతిస్తాం.
– డిఎంకె నేత స్టాలిన్‌
– దానికి ‘కెసిఆర్‌’ను నాయకత్వం వహించమనండి బాగుంటుంది.
– ఆర్‌.ఎస్‌.ఎస్‌., భాజపాలు కౌరవులు. కాంగ్రెసు వృద్ధ నాయకులు – యువకుల మధ్య ఉన్న గోడ తొలగించాలి. భాజపా నాయకులు అధికారం కోసం ఏమైనా చేస్తారు.
– కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధి
– మరీ ఇన్ని ‘జోకులా’ ! నవ్వలేక చస్తున్నాం.
– మేం వస్తే అహంకారం, ఆశ్రిత పక్షపాతం, ప్రతీకార రాజకీయాల నుండి విముక్తి, మోది నియంత. ఆయన హామీలన్నీ నటనే. కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి కుట్రలు.
– కాంగ్రెసు ప్లీనరీలో విరుచుకుపడిన సోనియా
– మనకున్నది ఇతరులకు ఆపాదించొద్దు మేడం.
– తెలంగాణాలోనూ పాగా వేస్తాం. రానున్న ఎన్నికల్లో భాజపాకు ఎదురుండదు.
– భాజపా జాతీయ కార్యదర్శి అరుణ్‌సింగ్‌
– గట్టిగా యోజన చేసే మాట్లాడుతున్నారా !
– హిందూయిజం, హిందుత్వ వేర్వేరు. హిందూ స్పేస్‌ను బిజెపికి వదిలేయద్దు.
– కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌
– గుజరాత్‌లో రాహుల్‌ ఆలయాలకు వెళ్ళినప్పుడే అర్థమయింది.
– ముస్లిం ఓటుబ్యాంక్‌ మిథ్య. హిందూ ఓటుబ్యాంక్‌ సత్యం.
– అసదుద్దీన్‌ ఒవైసి
– పాతబస్తీ గురించి చెప్పు అసద్‌ భాయ్‌ !
– 3 పార్టీల కుట్రను ప్రజల ముందుంచుతాం. దేశం చూపు ఏపి వైపు.
– సిఎం చంద్రబాబు
– ‘ఏరు దాటాక తెప్ప తగలేయడం’ అంటే ఇదే.
– ఒకరిని హీరో చేయడం నాకిష్టం లేదు. మేము సూపర్‌ స్టార్లం.
– హీరో బాలకృష్ణ
– ఇంటి నిండా నటులే ఉన్నారు. ఇంకా కొత్తవాళ్లెవరు?
– మోది సర్కారుపై మరిన్ని ఆందోళనలు
– సీతారాం ఏచూరి
– మీరు ఆందోళనలు చేస్తేనే కదా, మోదీకి మరింత బలమొచ్చేది..!
– టెండర్ల అక్రమాల చెట్టు నా దగ్గరుంది. సిఐడి, ఈడి, ¬ం మంత్రులకు అందిస్తా. కెసిఆర్‌ భరతం పట్టడానికే ఢిల్లీ వచ్చా.
– కాంగ్రెసు నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– ‘పట్టు పట్టరాదు పట్టి విడువరాదు’ అన్నట్లుంది మీ పట్టు.
– మోది హవా తగ్గిపోతోంది.
– మాజి ప్రధాని దేవెగౌడ
– మీరూ నిద్ర లేచారా ! బాణం గురి ఇప్పుడు మీ వైపే (కర్ణాటక) ఉంది కదూ..!

*****************************************************************************************************************
– డా|| పి.భాస్కరయోగి



1952 అక్టోబర్ చివర్లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అస్సాం పర్యటనకు వెళ్తూ, మధ్యలో కొద్దిసేపు కలకత్తాలో ఆగాడు. తూర్పు బెంగాల్‌లో అల్పసంఖ్యాకులైన హిందువులపై ఘోరమైన అకృత్యాలు జరుగుతున్న సమయం అది. ఈ విషయంలో పాకిస్తాన్‌తో దృఢ వైఖరి అవలంబించాలని జాతీయవాద నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ అక్కడ నెహ్రూకు విజ్ఞాపన పత్రం సమర్పించాడు. అవసరమైతే పాక్‌పై ఆర్థిక ఆంక్షలు విధించి, అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టాలని కోరాడు. తన వినతిని నెహ్రూ సీరియస్‌గా తీసుకోనందున ముఖర్జీ ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలనుకొన్నాడు. 1952 అక్టోబర్ 16న కలకత్తాలో, అదే నెల 26న ఢిల్లీలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ప్రజాసోషలిస్ట్ పార్టీ నేత ఆచార్య కృపలానీ, హిందూ మహాసభ నేత ఎన్సీ ఛటర్జీ పాల్గొన్నారు. కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వడానికి బదులు ముఖర్జీపై బురద చల్లడం మొదలుపెట్టారు.
స్వాతంత్య్రం రాకముందూ, వచ్చాక ఎప్పుడూ జాతీయవాద శక్తులకు వ్యతిరేకంగా పనిచేయడమే కమ్యూనిస్టుల పని. ఈరోజు కూడా ఏ పత్రికను, ఏ టీవీ చూసినా ఏ.రాజా దగ్గర నుండి కె.నారాయణ వరకు, ప్రకాశ్ కరత్ నుండి తమ్మినేని వీరభద్రం వరకు ‘మతోన్మాద శక్తులపై పోరాటం చేస్తాం’ అని ప్రకటనలిస్తుంటారు. వారి దృష్టిలో అది ఏ మతోన్మాదం అంటే- హిందూ మతోన్మాదమే. వారు ఇంకే మతోన్మాదం గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. మతోన్మాదాన్ని అడ్డుకొంటే ఫరవాలేదు గాని ఆ ముసుగులో జాతీయవాదాన్ని అడ్డుకునేందుకు శపథం చేస్తుంటారు. హిందుత్వం అంత ప్రమాదకరమైనదా?
హిందూ జాతీయవాదంపై 1925నుండి వారు పోరాటం చేస్తున్నా, అది రోజురోజుకూ రాజకీయంగా ‘్భజపా’ రూపంలో బలపడిందే కానీ నాశనం అయిపోలేదే? కమ్యూనిస్టు దేశాల్లో ఇప్పుడు వారు చెప్పే మతాలు కమ్యూనిజాన్ని కాపాడాయా? భారత్‌లో హిందువులు మెజార్టీగా ఉన్నన్ని రోజులే ‘సెక్యులర్’ పదం వినబడుతుందని విదేశీ మేధావులు చెప్తుంటే ఇక్కడి కమ్యూనిస్టుల చెవికి ఎందుకు ఎక్కదు? వర్గ దృక్పథంతో ‘ఎర్ర’బడ్డ కళ్లకు కాషాయం ఎందుకు కటువైంది?
‘హిందూ ఫోబియా’కు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర ప్రాంతీయ పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి? వారికి లోలోపల ఎక్కడో తాము హిందువులకు ‘అన్యాయం చేస్తున్నాం’ అన్న తలంపు ఉంది. అందుకే ఇటీవల కేరళలో కమ్యూనిస్టులు వినాయక చవితికి గణేశుణ్ణి నిలబెట్టినట్లు సిపిఐ నేత మధు స్వయంగా ఓ టీవీ చర్చలో ఒప్పుకొన్నాడు. గత ఏడాది శరన్ననవరాత్రుల్లో దుర్గాపూజ, నిన్నగాక మొన్న శ్రీరామనవమి శోభాయాత్రను వీర సెక్యులర్ వాది మమతా బెనర్జీ నిర్వహించడం చూశాం. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఎన్నో దేవాలయాలు చుట్టూ ప్రదక్షిణ చేయడం, ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో మఠాలు, స్వాముల చుట్టూ తిరగడం ఇందులో భాగమే. మోదీని ఒక్కణ్ణే ‘హిం దూ ఛాంపియన్’గా చేయడం రాహుల్‌కు ఇష్టం లేదని, ఇదంతా రాజకీయంగా మోదీని దెబ్బగొట్టడానికే అని విశే్లషకుల అభిప్రాయం.
‘హిందూ ఫోబియా’ను చూపించి గత డెబ్బై ఏళ్లు రాజకీయాలు నడిచాయి. కానీ నకారాత్మకంగా అది ఈరోజు విశ్వరూపం ధరించింది. 2019 ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ప్రతి విషయం రాజకీయ రంగు పులుముకుంటుంది. ఉదాహరణకు జమ్మూలోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను 3నెలల క్రితం కొందరు అత్యాచారం చేసి, హత్యచేశారు. నిందితులు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా చట్ట ప్రకారం శిక్షించాలి. కులం, మతం గురించి రంధ్రానే్వషణ తగదు. కాంగ్రెస్, కమ్యూనిస్టు మీడియా మోదీని, భాజపా-పీడిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని దోషిని చేయడానికి ప్రయత్నిస్తోంది. దానికి కౌంటర్‌గా భాజపా వాళ్లు ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ దేశంలో జరిగే ప్రతి అత్యాచారంలో, అల్లర్లలో కులం, మతం గురించి ఆరా తీసే పని మొదలయ్యింది. అలా చరిత్ర తవ్వితే ఏం తెలుస్తుందో అందరికీ తెలుసు. జమ్మూలో హిందువులు, కాశ్మీర్‌లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉంటారు. కథువా ఘటనను కర్నాటక ఎన్నికల కోసం వాడుకోవాలని ప్రయత్నం మొదలయ్యింది. రేపిస్టులైన నిందితులకు భాజపాకంటే కాంగ్రెస్‌వారే ఎక్కువ వెన్నుదన్నుగా నిలబడ్డారు. ప్రముఖ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌కు అత్యంత సన్నిహితుడైన బి.యమ్.సధియా (అక్కడి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు) నిందితులకు అనుకూలంగా మాట్లాడినట్లు జాతీయ టీవీ ఛానళ్లు బట్టబయలుచేశాయి. కాంగ్రెస్ జమ్మూలో రాజకీయం మొదలుపెట్టగానే భాజపా చేతులు ముడుచుకొని కూర్చోదుకదా! కాశ్మీర్ సంకీర్ణ సర్కారులో భాజపాకు చెందిన మంత్రులు లాల్‌సింగ్, చాంద్‌ప్రకాశ్ గంగ్ మంత్రివర్గం నుండి వైదొలిగారు.
ఈ చర్చను ఇంతటితో ఆపకుండా, దేశంలో రేప్‌లు చేసినవారి కులాలు, మతాల గురించి గణించడం మొదలుపెట్టారు. బిహార్‌లోని ససారంలో 5 ఏళ్ల హిందూ బాలికను ఓ ముస్లిం అత్యాచారం చేశాడని, నగరోటాలో షానవాడ్ అనే వౌల్వీ ముస్లిం బాలికపై అత్యాచారం చేసినా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎందుకు వౌనంగా ఉన్నాడని భాజపా ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఇలా ప్రతి విషయంలో మతపరమైన విభజన రాజకీయంగా ఏ పార్టీకైనా లబ్ధి చేకూరుస్తుందేమో గానీ జాతి సంక్షేమానికి  గొడ్డలిపెట్టు అవుతుంది. ఇక కమ్యూనిస్టు పత్రికలు, మీడియా ఓ అడుగుముందుకేసి ఇవన్నీ హిందువుల వల్లనే జరిగాయన్నట్టు ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. నిజానికి హిందూధర్మం మూలాలు సెక్యులర్ భావనను కలిగి ఉ న్నాయి. ఇజ్రాయిల్ జ్యూస్‌లతో దేశంగా ఏర్పడ్డాక తమ మొదటి పార్లమెంట్ సమావేశంలోనే ‘్భరత్ మాత్రమే మమ్మల్ని వంచించని ఏకైక దేశం’ అని పేర్కొంది. హిందూ సమాజంపై వారు ఎంతో గౌరవభావం ప్రదర్శించారు. కానీ, గతంలో కాంగ్రెస్ ‘సెక్యులర్ ప్రభుత్వం’ ఆ దేశంతో బహిరంగంగా సంబంధాలు నెరపలేదు. పాలస్తీనా ముస్లిం నియంతృత్వ రాజ్యం కాబట్టి ఇజ్రాయిల్‌తో సంబంధాలు పెట్టుకొంటే ఇక్కడి మైనార్టీలు తమకు ఓటువేయరనే కుత్సితభావం ఇందులో దాగి ఉంది. ఇజ్రాయిల్ మనకు సాంకేతిక, రక్షణ, వ్యవసాయ రంగాల్లో ఎంతో తోడ్పడినా మనం బయటకు చెప్పుకోలేకపోయాం. మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇక్కడి సూడో సెక్యులర్‌వాదులకు ఇష్టం లేదు. దీనికి కారణం రాజకీయ పార్టీలు మత సంతుష్టీకరణ ద్వారా ఓటు బ్యాంక్‌ను సుస్థిరం చేసుకోవడం.
మన దేశంలో మెజార్టీ ప్రజలైన హిందూ జాతితో కలిసి ఎన్నో మతాలు జీవిస్తున్నాయి. గ్రీక్స్, రోమన్స్, యూదులు, పార్సీలు, జ్యూస్‌లు ఇక్కడ జాతీయతతో ఏకం అవుతున్నాయి. కేంబ్రిడ్జ్, మైసూర్ విశ్వవిద్యాలయాలు ఇక్కడున్న ప్రజలందరు జన్యుపరంగా ఒక్కటే అని తేల్చి చెప్పినా ఓట్లవేట ఈ దేశాన్ని విభజిస్తూనే ఉంది. ఈ విభజనలో లౌకికవాద శక్తుల బండారం బయటపడసాగింది. దాని ప్రభావమే ఈరోజు జాతీయవాద మూలాలున్న భాజపా విస్తరణ దేశం నిండా పరచుకొంటోంది. ఇన్నాళ్లూ మతం పేరుతో విభజన చేసి, హిందూ ఫోబియాను చూపినవాళ్లు 2014 తర్వాత పునరాలోచనలో పడ్డారు. మెజార్టీ-మైనార్టీలుగా సమాజాన్ని విభజిస్తే మెజార్టీ ప్రజలు మోదీవైపు నిలబడ్డారు. దీంతో వారు ఇపుడు కులం పేరుతో హిందువులను చీల్చేప్రయత్నంలో పడ్డారు. కర్ణాటక ఎన్నికల వేళ లింగాయత్‌లను మైనార్టీలుగా గుర్తించాలని సీఎం సిద్ధరామయ్య వేసిన ఎత్తుగడను సెక్యులర్ మీడియా గొప్ప చాణక్యంగా కీర్తిస్తోంది. అంబేడ్కర్‌ను, మహాత్మా పూలేను స్వంతం చేసుకోవాలని క్రొత్తక్రొత్త శక్తులు తెరమీదకు వస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు అంబేద్కర్ భక్తులుగా నటిస్తున్నారు. ఆఖరుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాబాసాహెబ్ జయంతి నాడు క్రైస్తవులుగా మారిన వాళ్లకు ఎస్సీ హోదా ఇస్తానని ప్రకటించాడు.
నిజంగా క్రైస్తవులపై ప్రేమ ఉంటే భాజపాతో అంటకాగినపుడు ఈ ప్రస్తావనను చంద్రబాబు ఎందుకు తేలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న! జాతీయవాద శక్తులను రాజ్యపాలనలో అడ్డుకోవడమే ఈ ముప్పేట దాటి. హిందూ సమాజంలో అలజడి రేకెత్తించి ఆత్మరక్షణలో పడేయడం కూడా అత్యాచార ఘటనలను చిలువలు పలువలు చేయడంలో దురుద్దేశం. విచిత్రం ఏమిటంటే ‘హిందూ ఫైర్‌బ్రాండ్’ ప్రవీణ్ తొగాడియాను ఇన్నాళ్లు తిట్టిపోసిన మీడియా ఒక్కసారిగా ఆయనపై ప్రేమ ఒలికించడం మొదలుపెట్టింది. మోదీతో పొరపొచ్చాలు ఉన్నాయని తొగాడియాను విలన్‌ను చేయడమే మీడియా లక్ష్యం. బిహార్ సీఎం నితీశ్‌కుమార్ గతంలో మోదీని విమర్శించగానే ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మోదీపై ఒంటి కాలిపై లేవగానే అతణ్ణి భావి ప్రధానిగా అభివర్ణించారు. కేజ్రీవాల్ చల్లబడగానే కన్హయ్య కుమార్‌తో మోదీని బండబూతులు తిట్టించారు. మొన్న కేసీఆర్ మోదీని విమర్శించడం మొదలుపెట్టగానే మూడు రోజులు కేసీఆర్‌కు నిద్రపట్టకుండా చేశారు. ఎన్టీయే నుండి చంద్రబాబు బయటకురాగానే గతంలో ఆయన మోదీ గురించి చెప్పిన విషయాలను తెలుగు మీడియా ఆపకుండా ప్లేచేసింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టంపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలిచ్చినా, ఎన్‌ఐఏ కోర్టు మక్కా పేలుళ్ల నిందితులను నిర్దోషులుగా తేల్చినా అన్నింటికీ భాజపా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే ప్రధాన ఎజెండాగా సాగుతోంది. దీన్ని జాతీయవాదంపై జరిగే ‘ముప్పేట దాడి’గా హిందుత్వ శక్తులు గుర్తించకపోతే మొదటికే మోసం రావడం ఖాయం.


********************************************************
-డా. పి భాస్కరయోగి 
Published Andhrabhoomi :
Friday,  April 20, 2018