ఈ రోజుల్లో మనుషులు ఎన్నో తప్పులు చేయడానికి ధనం ఒక కారణం. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవనంలో మనుషులు పవిత్రంగా ఉండడానికి కూడా ధనం ఆటంకంగా మారిపోయింది. ఈ ‘ధనసంచయం’ అనేది ఓ వికృత మనస్తత్వం. పూర్వం ప్రజలకు ఇప్పుడున్న వసతులేవీ లేకున్నా ‘కౌపీన వంత కడు భాగ్యవంత’ అన్నట్లు సుఖంగా ఉండేవారు. ఇప్పుడు అన్ని వసతులను అత్యంత వేగంగాపొందగలిగినా మోకాళ్లలోతు సుఖం.. మొలలోతు దుఃఖం చందంగా  జీవిస్తున్నారు.  అత్యాశ కారణంగాప్రతి రంగంలో మనిషి యంత్రంలాగా వేగంగా పరుగెత్తుతున్నాడు. అపరిమితమైన ఆ శతో అసలు సత్యాన్ని గుర్తించలేక జీవితం దుఃఖమయం చేసుకొంటున్నారు. ఈ అత్యాశ అనేది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అంధకారంలో పడేస్తుంది. అత్యాశ ధనం విషయంలో మాత్రమే కాదు, దేని విషయంలోనైనా అంతే. రోగానికి ఔషధం, అజ్ఞానానికి జ్ఞానం ఎలా విరుగుడో.. అలా అత్యాశకు ఆత్మజ్ఞానమే ఉపాయం. జ్ఞాని అయిన వాడు లోకంలోని దుఃఖానికి కారణం అత్యాశ అని గ్రహిస్తాడు. అది ఒక రోగం. దానికి ధర్మాచరణతో కూడిన ఆత్మజ్ఞానం ఔషధం. ఇది అర్ధం చేయంచడానికే పౌరాణిక గాథలు. పాపపుణ్యాలను ఆ గాథలకు లక్ష్యాలుగా నిర్ణయించి మనుషుల్లోని ఈ రోగనిర్మూలనకే ఇన్ని ఉపమానాలు. అవి విని మనలోని అసలు తత్వాన్ని తెలుసుకుంటే ఆత్మశాంతి లభిస్తుంది.

అర్ధస్య సాధనే సిద్ధే ఉత్కర్షే రక్షణే వ్యయే
నాశోపభోగ ఆయాసః త్రాసశ్చింతా భ్రమోనృణామ్‌

ధనసంపాదనలో నిమగ్నమయినవారు దాని అభివృద్ధి, రక్షణ, వ్యయం, నాశనం, అనుభవం కలుగగానే, వరుసగా శ్రమ, భయం, విచారం, దుఃఖం సుఖభ్రాంతులను పొందుతారు - అని భాగవతం తెలిపింది. ఈనాటి ధనసంపాదనంతా సుఖంగా జీవించడం కోసం, తమ సంతానం రాబోవు రోజుల్లో ఆనందంగా జీవితం గడపడం కోసం అనుకొని తీవ్రంగా ప్రతివారు కష్టపడుతున్నారు. అందులోనే విలువైన జీవితం గడిచిపోయి మనకున్న అసలైన ఆధ్మాత్మిక లక్ష్యాన్ని ధ్వంసం చేస్తున్నది.


*************************************************
      డాక్టర్‌ పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి