*ఇంకెన్నాళ్లు భారత్‌పై కుట్రలు!?*


ఇటీవల ‘‘ది ఎకనమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్’’ అనే భారత వ్యతిరేక సంస్థ ఓ సర్వేను వెల్లడించింది. ఆ సర్వేలో భారత్‌లో మానవ హక్కుల పరిరక్షణలో భారత్ దిగజారిందని ఆందోళన వ్యక్తం చేసిందట. 2019లో 690 స్కోరు పొంది 51వ స్థానంలోకి చేరిందని, భారత్‌లో పౌర హక్కుల అణచివేత ఎక్కువైందని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసిందట! ఈ వార్తను సోషలిస్ట్, మావోయిస్ట్ మానసికతను నిండా నింపుకొన్న కొన్ని తెలుగు ప్రముఖ పత్రికలు గొప్ప వార్తగా ప్రచురించాయి. శ్రీలంక, ఫిన్లాండ్, ఐర్లండ్, డెన్మార్క్.. లాంటి చిన్న చిన్న దేశాలు కూడా అందులో ఉన్నాయి. 

అవన్నీ భారత్‌లోని రెండు, మూడు పెద్ద జిల్లాలతో సమానం. అలాగే భారత్ జనాభా 140 కోట్లకు చేరనుంది. మానవ హక్కులు జనాభాను ఆధారంగా చేసుకొని లెక్కించాలి. ఇంత పెద్ద జనాభా, భిన్న సంస్కృతులు, వైవిధ్యాలు ఉన్న దేశంలో జరిగే చెదురుమదురు సంఘటనలను బ్యూరెట్ట్, విప్పెట్టుల్లో వేసి పరిశీలిస్తారా? ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాల్లో కూడా లేని ఇస్లాం గ్రూపులు మన దేశంలో ఉన్నాయి. అలాగే క్రైస్తవ దేశాల్లో కూడా దొరకని క్రిస్టియన్ గ్రూపులో మన దేశంలో బ్రతకనిచ్చాం. అలాగే బౌద్ధం, ఫార్శీలు, యూదులు... ఇలా అందరికీ మనది ధర్మసత్రమే. 

ఈ దేశంలో హద్దులు మీరిన స్వేచ్ఛ ఉంది. ఈ దేశంలో అందరూ హాయిగా బ్రతికే స్వేచ్ఛకు కారణం ఇక్కడి మెజారిటీ ప్రజల నరనరాల్లో అందరినీ అంగీరించే మనస్తత్వమే. కానీ రోజూ ఈ దేశంలో ‘రాజ్యాంగం’ ప్రమాదంలో ఉందని గోల చేస్తుంటారు. అదీ ముఖ్యంగా హిందూ మనస్తత్వం వాళ్లకు నచ్చడం లేదు. హిందువులపై, వాళ్ల సంస్కృతులపై ఎన్ని దాడులు చేసినా ఏమీ అనకుండా ఉంటే అది లౌకికవాదం; ఎదురు తిరిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డట్లు!?


బాబర్ దాడిని గురించి మాట్లాడని వాళ్లు రాముని అస్తిత్వాన్ని అడుగుతారు. గోద్రా రైలు దుర్ఘటనను ప్రశ్నించని వారు గుజరాత్‌ను గురించి దుమ్మెత్తి పోస్తారు. కాశ్మీర్ పండిట్లపై అత్యాచారాలకు స్పందించని వారు ఫరూఖ్, ముఫ్తీల స్వేచ్ఛను గురించి అరుస్తారు!?

ఈ 15 రోజుల్లో తెలంగాణలోని భైంసా పట్టణంలో మత ఘర్షణ జరిగింది. మెజార్టీప్రజల ఇళ్లు తగలబడ్డాయి. బైకులు అంటబెట్టారు, రాళ్ల దాడి జరిగితే అక్కడి ఆరెకటికె కులస్థులు ఇళ్లు వదిలి పారిపోయారు. దీనిపై ఏ లౌకిక పార్టీ మాట్లాడదు. ఇదంతా శాంతికాముకులు చేసిన గొప్ప పని. ఇక్కడి ఆరికటికెలకు మానవ హక్కులు లేవు!? అదే ముంబై అల్లర్లలో 300 పైగా ప్రజల ప్రాణాలు పోయేందుకు కారణమైన యాకూబ్ మెమన్ ఉరితీతను అడ్డుకునేందుకు అర్ధరాత్రి సుప్రీంకోర్టు తలుపు తెరిపించినవారు, అలాగే అర్బన్ నక్సల్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి గురించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి ఆదివారం రోజు హైకోర్టు జడ్జిని కదిలించినవారు ఈ బైంసా బాధితుల గురించి ఒక్క మాటా మాట్లాడరు!?


భయంతో ఇళ్లు విడిచిపోయే వ్యక్తులను గురించి ఒక్క సరస్వతీ సమ్మాన్ పురస్కారం, కబీర్ పురస్కారం పొందిన జులపాల కవికుల గురువు నోరు తెరవడు? ప్రతి దానికి వందల మంది మేధావులుగా, కవులుగా సంతకాలు చేసే వాళ్ల కళ్లకు బైంసా బాధితులు కన్పించరు. 


అన్నిచోట్లా పౌర హక్కుల గురించి మాట్లాడే కరణం కమ్యూనిస్టు ప్రొఫెసర్ వీళ్ల గురించి నోరు తెరవడు!? పంచె ఎగేసుకొని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రోజూ ప్రెస్‌లో కన్పించే వృద్ధ విద్యావేత్తకు ఆరెకటికెల కష్టం కన్పించదు, విన్పించదు!? తన సొంత అల్లుడి పౌరసత్వం ఏమవుతుందో అని బాధపడి, లేని అలజడి సృష్టిస్తున్న ‘‘్భజం సంచి ఎర్రపార్టీ’ నేత ఇలాంటి ఘటనపై నోరు మెదపడు!! నరం లేని నాలుకున్న నారాయణా దీనిపై స్పందించడు. ఇక మాట్లాడితే ‘నియంతృత్వం’ అంటూ మోదీని, కేసీఆర్‌ను విమర్శించే సంపాదకులకు ఇక్కడ ఏ ‘సందర్భం’ కన్పించదు. ఇదొక ఉదాహరణ మాత్రమే.

ఈ దేశంలో ‘్భరత ద్రోహులు’ చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఇక రైట్ వింగ్‌కు ‘సోయి’ లేదు. చరిత్ర, సాంస్కృతిక, కళా, సాహిత్య రంగాల్లో మఠం వేసుకొని పాతుకుపోయిన ఈ చెదలను తొలగించకుండా చేస్తున్న సాముగరిడీలో ఓటమి తప్ప ఇంకేం మూటగట్టుకోలేరు. ఈ విషయంలో కేసీఆర్‌ను మెచ్చుకోవచ్చు. అటు లెఫ్ట్‌వింగ్‌ను, ఇటు రైట్‌వింగ్‌ను తన వెంట బెట్టుకొని తాళ్లకు ‘తెలంగాణ ఇంజెక్షన్’ ఎక్కించాడు. ఈ కమ్యూనిస్టులను, అర్బన్ నక్సల్స్‌ను గాలికి వదలిపెడితే ప్రజల్లో వాళ్లకు బలం లేకున్నా ‘రోజూ’ ప్రజాస్వామ్యం అంటూ పిచ్చెక్కిస్తారు. 


వాళ్లకు కావలసిన విధంగా తెలంగాణ వాదం ముందుకు తెచ్చి కొందరికి పదవులు ఇచ్చాడు. అలాగైనా కొందరు తెలంగాణ వాళ్లకు పదవులు వచ్చాయి. ఈ పని ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలేకపోయింది. ఇప్పుడు బిజేపీది అదే దుస్థితి. ఈ రెండు పార్టీలకోసం లేదా వారి సిద్ధాంతాలకోసం పనిచేసే టీవీలు, పత్రికలు ఒక్కటి గూడా లేదు. అదే కమ్యూనిస్టులకున్న మెకానిజం కూడా వీళ్లకు లేదు. ఇక అర్బన్ నక్సల్స్ పౌర హక్కుల పేరుతో భారత్‌ను అపఖ్యాతి చేయకుండా ఉంటాయా?
అత్యాచారం చేసిన వాళ్లను ఎన్‌కౌంటర్ చేసిన ఘటనలో కూడా వాళ్ల ముట్లుడిగిన పౌర హక్కులు అభాసుపాలయ్యాయి. విచక్షణ కోల్పోయిన వాళ్లను ఎవరు బాగుచేయాలి?


కులం, మతం, ప్రాంతం, భాష, ప్రాదేశికం.. వంటి అనేక అంశాలు మీడియాలో ఉన్న, మేధావులుగా చలామణి అవుతున్న అర్బన్ నక్సల్స్‌కు బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకే పౌరసత్వ సవరణ చట్టంపై ఏ ఇబ్బంది లేని ముస్లింలను రెచ్చగొట్టి దేశాన్ని విభజించే పనికి పూనుకున్నారు. కాంగ్రెస్ వెనుకనుండి పనిచేస్తూ కమ్యూనిస్టు, మత పార్టీలకు మద్దతు ఇస్తున్నది. మహారాష్టల్రో ముస్లింల కోరిక మేరకే శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసామని ఆ పార్టీ నేత, మాజీ సీఎం అశోక్‌చవన్ ప్రకటించడం ఈ దేశంలోని మెజార్టీ ప్రజలు గమనించాలి. అంటే ఈ దేశంలో ప్రభుత్వాల ఏర్పాటులో వెనుక ఎవరు ఉన్నారో గమనించాలి.

 ఈ శక్తులకు ఈ దేశంలో మెజార్టీ ప్రజల మనోభావాలు ప్రతిబింబించే అధికారం ఉండవద్దు కదా? ఆఖరుకు కరడు గట్టిన జాతీయభావం ఉన్న శివసేనను కూడా అధికార లంపటంలోకి లాగారు కదా! ఈ తుక్డేతుక్డే గ్యాంగుకు దేశాన్ని ముఖ్యంగా తక్కువచేసి చూపడమే ప్రధాన ఎజెండా, క్రీ.పూ. 327కు పూర్వం మన దేశం ‘ఒకే జాతి అనేక రాజ్యాల సమూహం’గా ఉండేది. దానివల్లనే బానిసలుగా మారిపోయాం. అందుకే చాణక్యుడు పాటలీపుత్రం కేంద్రంగా ‘జాతి రాజ్యం’గా సరిక్రొత్త అడుగువేసాడు. అలా దాదాపు వెయ్యేళ్లు ఈ దేశం తనను తాను రక్షించుకొంది. ఇపుడు దేశంలోని జాతీయవాద భావం ఉన్న ప్రభుత్వం వ్యక్తిగత ద్వేషంతో ప్రతి దాన్ని విమర్శిస్తూ విషం వెళ్లగక్కుతున్నారు. ఇదంతా కుట్రగాక ఇంకేమిటి?
*********************************
* శ్రీకౌస్తుభ*
*పెన్ గన్ గ : ఆంధ్రభూమి*
*24-01-2020 : శుక్రవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి