‘అత్త పగులగొడితే పాతకుండ.. కోడలు పగులగొడితే కొత్తకుండ’ అన్నట్టు ఈ దేశంలో సూడో సెక్యులర్, లిబరల్ మేధావులు అన్నింటినీ సూత్రీకరిస్తారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా దానికి ముందు స్థానికంగా జరిగే దాడులకు దేశవ్యాప్త ప్రచారం కల్పిస్తారు.

 ఈ దేశంలో ఇపుడు కూడా వామపక్ష శక్తుల ప్రభావం బలంగా కొన్నిచోట్ల కన్పిస్తూంది. అధికారం దృష్ట్యా కేరళ, ప్రభావం దృష్ట్యా మీడియా, కుత్సిత మేధోవర్గం దృష్ట్యా జెఎన్‌యూ.. కేరళను వదిలేస్తే ఈ రెండు చోట్లా ప్రబలంగా ఉన్న సూడో సెక్యులర్ శక్తులు హిందువులను బోనులో ఎక్కించేందుకు ఎప్పుడూ పోటీపడతాయి. వాళ్లు మైనారిటీలపై జరిగే దాడులను, స్థానిక గొడవలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళతారు. 

దానికి ‘మాబ్ లించింగ్’ లాంటి అందమైన పేర్లు పెడతారు. అలాగని, మైనారిటీలపై దాడులు జరగాలని కాదు. కానీ అదే మెజారిటీ ప్రజలపై జరిగే దాడులను వార్తగా కూడా వేసేందుకు ఇష్టపడరు. అదృష్టవశాత్తూ ‘సోషల్ మీడియా’ ఉన్నందున ఈ రోజు చాలా సమాచారం బయటకు వస్తున్నది. 

లేకపోతే ‘వాళ్లు చెప్పిందే వార్త.. మునిగిందే గంగ’ అన్న చందంగా ఉండేది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో హిందూ మహాసభకు చెందిన కమలేశ్ తివారీని దారుణంగా హత్యచేశారు. దానిపై ఏ మీడియా చర్చించలేదు; ఎక్కడా కొవ్వొత్తుల ర్యాలీ జరగలేదు. ధిక్కార గళాలు, ‘అవార్డు వాపసీ గ్యాంగు’ స్పందించలేదు. మేధావులు ప్రధానికి లేఖలు రాయలేదు. ఎవరూ కవిత్వం, వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా వెలువరించలేదు. దానికి కారణం అతడు హిందూ సంస్థకు చెందినవాడు కాబట్టి!

ఈనెలలో బెంగాల్‌లో ఓ ఆరెస్సెస్ కుటుంబాన్ని మొత్తం దారుణంగా మట్టుబెట్టారు. అయినా వాళ్ల హృదయం కరుగలేదు. అది కవితారూపం దాల్చలేదు. ఏ అఖ్లాఖ్, పెహలూఖాన్ మరణాలపై, కథువా అత్యాచారంపై దేశవ్యాప్త సంచలనం సృష్టించారో, యం. యం.కల్బుర్గి, పన్సారే, గౌరీ లంకేశ్ మరణాలపై రాద్ధాంతం చేశారో వాళ్లు ‘కమలేశ్ తివారీ’ హత్యను కనీసం ఖండించలేదు.

 తివారీ ఒక మతప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతనిపై ఫత్వాలు, రివార్డులు జారీ అయ్యాయి. పోనీ ఈ దేశంలో ప్రవక్తలపై, దేవుళ్లపై ఏ మతం వాళ్లూ ఒక్క మాట మాట్లాడలేదా? అక్బరుద్దీన్ ఓవైసీ ఏకంగా శ్రీరాముడిపై ఎన్ని నిందలు చేస్తూ ప్రసంగం చేశాడు? జకీర్ నాయక్ వినాయకుడిపై, ఇతర దేవతలపై ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు? ఏకంగా ఓ రచయిత్రి రామాయణ విషవృక్షమే రాసింది. 

ఓ అపరమేధావి దేవుళ్లను కించపరుస్తూ పుస్తకాలు ప్రచురించాడు! మరి ఏ హిందువూ వారిపై దాడి చేయలేదే? అంతెందుకు, ఈ దేశాన్ని ‘జహిలియ్యా’గా (చీకటి నేలగా) అంధకారం లో వున్న సమాజంగా ఇక్కడి ప్రజలను కాఫిర్లుగా అభివర్ణిస్తే మెజారిటీలు ఏనాడైనా తిరగబడ్డారా? ఈ కాఫిర్‌లు ‘ఉమ్మా’లో భాగం ఎన్నటికీ కాలేరని ఇతర మతాల గ్రంథాలు మనల్ని విగ్రహరాధకులుగా తిట్టిపోస్తున్నాయి కదా! ‘గంగ జమున తహెజీబ్’ గురించి ఈ దేశ సెక్యులర్ శక్తులు కదా మాట్లాడేది. 

వారికి ‘సంక్లిష్ట సంస్కృతి’ లేదా ‘ఉమ్మడి సంస్కృతి’ అన్న అంశంపై నిజంగా నమ్మకమే ఉంటే ఈ మత గ్రంథాల్లో విగ్రహారాధకులపై వున్న వ్యాఖ్యల గురించి ఏనాడైనా ఒక్క అక్షరం రాశారా? 18వ శతాబ్దానికి చెందిన షావల్లీ ఉల్లా, 19వ శతాబ్దికి చెందిన సయ్యద్ అహ్మద్ బరౌల్వీ, అబ్దుల్ అజీబ్, టుట్‌మిర్ వంటి ఇస్లాం మత పండితులు ఏనాడూ తమ పుస్తకాల్లో హిందూ ముస్లింలు ఒక జాతిగా కలిసి బ్రతకాలని ఏనాడూ కోరుకోలేదు. వీరంతా ముస్లిం ప్రత్యేక జాతి (క్వాం, అవాం) అనే కదా చెబుతున్నది. 

ఈ వంద ఏళ్లలోనే ఈ పరిస్థితి వుంటే మహమ్మద్‌బిన్ కాశిం, గజనీ ఘోరీ, బాబర్‌ల నుండి ఏం ఆశిస్తారు? దాని ప్రభావమే కదా ఇవాళ ఐసిస్ లాంటి మత ఉగ్రవాదంపై ప్రపంచమే యుద్ధం చేయాల్సి వస్తోంది. దాని కొనసాగింపే కమలేశ్ తివారీ హత్య.

అలవికాని సిలబస్ వల్ల జాతీయవాద సంస్థలు కూడా ఈ సన్నటి పొరను గుర్తించలేకపోతున్నాయి. ప్రజలను చైతన్యపర్చాల్సిన మీడియాను, సాహిత్యాన్ని, సాంస్కృక రంగాన్ని వామపక్షాల చేతిలో పెట్టి కేవలం ‘రాజకీయాధికారం’తో కత్తి తిప్పడం దీర్ఘకాలికంగా నష్టం కలిగిస్తుంది. ఈ దేశానికి నెహ్రూ మొదటి ప్రధాని కావడంతో వామపక్ష వర్గాల పంట పండింది. 1969లో కాంగ్రెస్ చీలిపోయి ఇందర ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. 

చాలామంది పి.వి.నరసింహారావుది మొదటి మైనారిటీ ప్రభుత్వం అనుకుంటారు కానీ మైనారిటీలో పడిన మొదటి మైనార్టీ ప్రభుత్వం ఇందిరాగాంధీదే. ఆ సమయంలో ఆమె సిపిఐ మీద ఎక్కువగా ఆధారపడింది. కాంగ్రెస్ (ఒ) సీపిఎం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం సిపిఐ, డిఎంకెల సహకారంతో గట్టెక్కింది. ఆ తర్వాత 1971 ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని లాభపడింది. దాంతో వామపక్ష మేధో వర్గానికి ‘్భరత సాంస్కృతిక రంగం’ బార్లా తలుపులు తెరచింది. 

నెహ్రూ కాలంలో కాంగ్రెస్ ముసుగులో, గాంధేయవాద ముసుగులో వున్న కమ్యూనిస్టు గుంపు ఇందిర కాలంలో బరితెగించి అన్ని రంగాలనూ దురాక్రమణ చేసింది. ఇప్పటికీ అది అలాగే కొనసాగుతున్నది. దాని ప్రభావం వల్లనే గౌరీ లంకేశ్ హత్యకు వచ్చిన ప్రాచుర్యం కమలేశ్ తివారీ హత్యకు రాలేదు. పెహలూఖాన్ హత్యపై జరిగిన అల్లరి హైదరాబాద్‌లో బిర్జు మాదిగ చచ్చిపోతే జరగదు. కథువా అత్యాచారంపై జరిగిన వ్యాఖ్యానం ప్రతిరోజూ జరుగుతన్న ‘లక జీహాద్’పై ఎక్కడా జరగదు!

ముఖ్యంగా మీడియా మేధోరంగం పేరుతో ‘వామపక్ష పాత్ర దృష్టి’ ఇటీవల మరీ ఎక్కువైంది. అందుకే ‘కాలాపానీ’ శిక్ష అనుభవించి స్వాతంత్య్రం కోసం అహరహం శ్రమించిన వీర సావర్కరుకు ‘భారతరత్న’ ఇవ్వాలంటే ఈ దేశంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ, పిడికెడుమంది మేధావుల ముసుగులో ఆయనపై విషం చిమ్ముతున్నారు. గతంలో సీతారాం ఏచూరి, మణిశంకర్ అయ్యర్ వంటి వాళ్లు వీర సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

ఇటీవల ఆయనకు ‘భారతరత్న’ ఇవ్వాలని అనగానే ఈ శక్తులన్నీ నిద్రలేచి, పడగ విప్పి బుసలు కొడుతున్నాయి. చరిత్రకు మసిపూసి మారేడుకాయ చేసిన రొమిల్లా థాపర్ నుండి రామచంద్ర గుహ వరకు అందరూ దోషులే. రాంప్రసాద్ బిస్మల్, వాసుదేవ బలవంత్ ఫడ్కే, అనంత లక్ష్మణ్ కన్హారే, థింగ్రా, గురుతేజ్ బహదూర్, బాజీప్రభు, ఉద్ధం సింగ్ వంటి వీరుల చరిత్రకు సమాధి కట్టిన శక్తులే ఈ రోజు బుజ్జగింపు డాన్సులు చేస్తున్నాయి. ఇదంతా సంతుష్టీకరణలో భాగం. ఈ ‘సంతుష్టీకరణ’ విధానం మార్చుకోకుంటే ‘సెక్యులరిజం’ మనడం కష్టం. అన్ని మతాలనూ సమానంగా గౌరవించాల్సిన ‘సెక్యులర్ భావన’ కొందరిని బుజ్జగిస్తూ, మరికొందరిని వంచనతో ద్వేషిస్తూ ‘సవతితల్లి ప్రేమ’ చూపించడం ఆత్మవంచన తప్ప ఇంకేమీ కాదు.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*01-11-2019 : సోమవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి