అణు విజ్ఞానం, గ్రహణాలు, కృష్ణబిల సిద్ధాంతం, ఖనిజ విజ్ఞానం, పాదరస ఔషధాలు, రాశిచక్రాలు, చెక్కుచెదరని లోహస్తంభ నిర్మాణం, స్ట్రింగ్‌ థియరీ, బిగ్‌బ్యాంగ్‌ థియరీ... ఇలా చెప్పుకుంటూపోతే భారతీయులు వేలు పెట్టని విద్య లేదు. అత్యంత ప్రాచీన కాలంలోనే భారతీయులు ఈ విషయాలను వాళ్ల కాలానికి తగినట్లుగా ఆచరణలో పెట్టారు. ఇప్పుడు గొప్ప విజ్ఞాన దేశాలుగా చెప్పేవి పుట్టని కాలంలోనే ఇలాంటి తొలి అడుగు వేసిన భారతీయ విజ్ఞాన వేత్తలను గుర్తించేదాకా మనకు పోరాటం తప్పదు.

ఆవు దూడలు దారివెంట నడుస్తున్నాయి. ఈ రెండు ఎక్కడివి? ఎవరివి? అని దారినపోయే దానయ్య పక్కనే నడుస్తున్న ఓ పెద్దాయనను అడిగాడు. ఆవు ఎక్కడిదో తెలియదు కానీ దూడ గురించి బాగా తెలుసు అన్నాడు. దానితో ఆగకుండా నాకు ఆవు నచ్చదు కానీ దూడ మాత్రం చాలా ఇష్టం. ఈ దూడ మాత్రం ఆవుదే! అన్నాట్ట. సరిగ్గా మన బుద్ధిజీవుల్లో కూడా ఇలాంటి పక్షపాతపు డైలాగులే రోజుకు పది పుడుతుంటాయి. ఈ దేశం మాదే అంటారు కానీ ఈ దేశంలో పుట్టిన సంస్కృతిని అంగీకరించరు!

ఈ మేధావులు రోజుకు పదిసార్లు పాశ్చాత్యుల గ్లోబలైజేషన్‌ను తిడతారు కాని వారి వైజ్ఞానిక ఆవిష్కరణలు చూపించి మన దేశ వైజ్ఞానిక పరంపరను నిందిస్తారు. ‘అన్ని వేదాల్లోనే ఉన్నాయష’ అని వేదాలను వెక్కిరించేవారు మనకు సంస్కర్తలుగా కొలువుదీరారు. ఈ భావవైరుధ్యం పక్కనపెట్టి నిజంగా ప్రపంచం బట్టలు కట్టని రోజే మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయో నిశితంగా చూడవచ్చు.

అణుబాంబు విస్ఫోటనం చూసి దాని అంతరార్థాన్ని భగవద్గీతలో (11/12, 11/32) శ్లోకాలలో చెప్పిన రాబర్ట్ జ్యూలియస్‌ వోపన్‌ హామర్‌ గురించి ఎంత మందికి తెలుసు! 16 జూలై 1945లో మాన్‌హట్టన్‌ ప్రాజెక్ట్‌లో ప్రముఖంగా పనిచేసి అణుబాంబు పరీక్షల అనుభవాన్ని గీతాతత్వంతో అన్వయించుకున్న ఈ పాశ్చాత్య శాస్త్రవేత్త భగవద్గీత గొప్పతనాన్ని తన జీవిత చరిత్రలో నమోదు చేసుకొన్నాడు. 

క్రీ.శ. 1543లో మొదటి సారి ‘సౌరవ్యవస్థకు సూర్యుడు కేంద్రంగా ఉంటే గ్రహాలన్నీ, భూమితో సహా అతని చుట్టూ తిరుగుతున్నాయి’ అని కోపర్నికస్‌ చెప్పకముందే, నవగ్రహాల మధ్యలో సూర్యుణ్ణి పెట్టి ఆరాధించే మన హైందవ దేవాలయ సంస్కృతి మరెంత గొప్పదో చూడండి. ఛార్లెస్ డార్విన్‌ జీవ పరిణామ వాదాన్ని వివరించాడు. దానికి ఆధునిక కాలంలో విశేష ప్రాచుర్యం ఉందని మనకు తెలుసు. కానీ పంతజలి మహర్షి తన ఆత్మ యోగ సిద్ధాంతం ద్వారా ‘మానవ జీవ పరిణామవాదం’ అందించాడు. మనిషి ప్రవృత్తులను యోగ విద్య ద్వారా దివ్యంగా మార్చే అపూర్వ సిద్ధాంతాన్ని పునఃస్థాపన చేశాడు. పశువులా జీవించే మనిషిని దివ్య మానవుడిగా ఎదిగించే రహస్యం మనకు అందించాడు. 

గురుత్వాకర్షణ సిద్ధాంతం – ఆపిల్‌ – న్యూటన్‌ కథ వినగానే, భూమ్యాకర్షణ సిద్ధాంతం అని చదవగానే మనం యురేకా! అంటూ పరుగులు పెడతాం, కానీ క్రీ.శ. 505లో జీవించిన వరాహమిహిరుడు తన ‘పంచసిద్ధాంతి’ అనే గ్రంథంలో ‘భూతలంలోని ఏ భాగంలో అయినా... అన్ని జ్వాలలు పైకెగుస్తాయి. పైకి వేసిన వస్తువు కిందకు పడుతుంది’ అని స్పష్టంగా చెప్పాడు. అలాగే బ్రహ్మగుప్తుడు (క్రీ.శ 591) భాస్కరాచార్యుడు (క్రీ.శ1114) ఇదే విషయాన్ని దృఢపరిచారు.

ఇదంతా సైన్సు కాదా? అలాగే గణితశాస్త్రంలోని అంక గణితం, రేఖాగణితం, బీజ గణితం, భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం కలగలిపి మన ప్రాచీనులు అభివృద్ధి చేశారు. వేదకల్ప సూత్రాల్లోని శుల్భసూత్రాలు, యజ్ఞవేదికల నిర్మాణాల విషయాలు అత్యంత ప్రాచీనమైనవి. క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందిన బ్రహ్మగుప్తుడు చక్రీయ చతుర్భుజ విస్తీర్ణాన్ని, దాని వికర్ణాన్ని కనుగొనడంలో విశేషకృషి చేశాడు. శూన్యాంశం (సున్న) వర్గమూలం (స్క్వేర్‌ రూట్‌) ఘనమూలం (క్యూబ్ రూట్‌)లను భారతీయులే కనుగొని ప్రపంచంలోనే మొదటి గణిత విప్లవం సృష్టించారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365.2587 రోజులు పడుతుందని తన ఖచ్చితమైన గణితంతో చెప్పిన భాస్కరాచార్యుడు ఎంత గొప్ప గణితవేత్త. 1962లో మురళీ మనోహర్‌ జోషి ఉత్తరప్రదేశ్‌ పాఠ్యాంశ నిర్ణాయక కమిటీ ముందు బోధాయనుని ప్రమేయం గురించి చెప్తే, అందరూ వ్యతిరేకించారు. అప్పడు జోషి, ఎడ్వర్డ్ టెల్లర్‌కు సంబంధించిన ‘సింప్లిసిటీ ఎండ్‌ ద సైన్సు’ పుస్తకం ముందు పెట్టి ఆయనే పేర్కొన్న బోధాయన ప్రమేయం మూలాలను చూపించాడు. ఈ ఎడ్వర్డ్ టెల్లర్‌ హైడ్రోజన్‌ బాంబు తయారీలో పాత్రధారి. నోబెల్‌ బహుమతి గెల్చుకొన్న విజేత. పైథాగరస్‌ పేర్కొన్న ప్రమేయాలకు బోధాయనుడి సూత్రాలే మూలం అన్నాడు. అదే విషయాన్ని తర్కబద్ధంగా వాళ్ల ముందు పెడితే చివరికి దానికి ‘పైథాగరస్‌ బోధాయన ప్రమేయంగా’ పేరు పెట్టారట! ఎంత విచిత్రం!!

రసవిద్య మన దేశంలో ఎంతో ప్రాచీనమైంది. నాగార్జునుడిని గొప్ప రసవిద్య తెలిసిన వ్యక్తిగా ప్రాచీన రసాయన గ్రంథాలు పేర్కొన్నాయి. రాగి, సీసం, బంగారం, తుత్తునాగం, వెండి వంటి వాటిని శుద్ధి చేసే విధానం ఈ దేశంలో అత్యంత ప్రాచీన కాలంలోనే ఉందని దాదాపు 50 ప్రాచీన రసగ్రంథాలు తెలియజేస్తున్నాయి. రస విద్య ద్వారా సప్త ధాతువుల్లో ఓజస్సు తగ్గకుండా ఎలా ఉండాలో మనవాళ్లు విశేష పరిశోధన చేశారు. ఆచార్య నాగార్జునుడి మార్గంలోనే ఐజక్‌ న్యూటన్‌ పరిశోధనలు చేసి రసవిద్య అంతు చూడాలనుకొన్నాడు. తన సహచర పరిశోధక మిత్రుడు రాబర్ట్ బోయల్‌తో కలిసి భారతీయ రసవిద్య ఆధారంగానే హేమ తారక విద్యను తెలుసుకోవాలనుకొన్నా మిత్రుడు మరణించడం, పెంపుడు కుక్క కొవ్వత్తిని తినడం ఆ ప్రయోగశాల బుగ్గిపాలయిందని చెప్తారు. న్యూటన్‌ రసవాదంపై చేసిన అంశాలు ఇప్పటికీ డీకోడ్‌ చేయలేకపోతున్నారని అనేక గ్రంథాలు ఆధారం ఇస్తున్నాయి. వేల యేళ్లనాడే అనేకానేక పరిశోధనలకు నెలవైన భారత రసాయన విద్య ఎందుకు మధ్యలో లుప్తమైందో ఆలోచించాలి!

కాంతి వేగాన్ని క్రీ.శ. 1675లో రోమర్‌ లెక్కించాడని చెప్తారు. కాని భారతీయ ప్రాచీనమైన ఋగ్వేదానికి సాయణాచార్యులు 14వ శతాబ్దంలోనే భాష్యం రాశారు. వారు కాంతి వేగం గురించి వ్యాఖ్యానిస్తూ ‘అర నిమిషానికి 2202 యోజనాల దూరం ప్రయాణించు ఓ కాంతి కిరణమా! నీకు నమస్కారం’ అంటారు. ఇదే విషయాన్ని 20వ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్తలు మెకీల్‌సన్స్, మోర్లే కాంతి వేగాన్ని సెకనుకు 1,86,300 మైళ్లు అని పేర్కొన్నారు. సాయణులు చెప్పిన విషయాన్ని క్రీ.శ. 1890లో మాక్స్ ముల్లర్‌ సంకలనం చేసిన ‘ఋగ్వేదం’ అనే ఆంగ్ల గ్రంథంలో కూడా ప్రస్తావించారు.

అనంతమైన కాలగణనను అరచేయిలో చెప్పే పంచాంగ, జ్యోతిష విజ్ఞానం వదిలి పెట్టి చిలక శాస్త్రాల జోస్యాలకు అలవాటుపడిన మనకు మన ప్రాచీనుల పరిజ్ఞానం ఎలా అర్థం అవుతుంది? సంస్కృతంలో కాలగణనకు చెప్పే ‘హోర’ హవర్‌ గా మారడం ఎలా సాధ్యమయిందో తెలిస్తే మన ప్రాచీనుల కాల చక్రం నేడు గ్రహించగల్గుతాం. మన చుట్టూ నడయాడిన బాలరాజు మహర్షి గొప్పతనాన్ని ఎవరో జర్మన్‌ వాళ్లు చెప్పాక గాని మనకు తెలిసిరాలేదు. ‘ఔషధం కాని మొక్కలేదు’ అన్న ఆయన సూత్రం ప్రకారం మన ప్రాచీన వైద్య గ్రంథాలలో 1,50,000 ఔషధ మొక్కల వివరాలున్నాయంటే మనం నమ్మగలమా! ప్రాచీన కాలంలోనే మరుగుజ్జు వృక్షాలను (బోన్సాయ్‌ మొక్కలు) గురించి చరకుడు తన చరక సంహితలో ‘వామన తను వృక్షాది విద్య’ ప్రత్యేక ప్రకరణంలో పేర్కొన్నాడు. ఆచరణలో పెట్టాడు. స్త్రీ అండాన్ని, పురుషుని శుక్రకణాన్ని టెస్ట్ ట్యూబ్‌లో కలుపుతారు. ఫలదీకరణం జరిపి పిండాన్ని స్త్రీ గర్భంలో ప్రవేశపెడతారు. ఇది ఆధునిక కాలంలో జరుగుతున్న ప్రక్రియ. ఐదు వేల యేళ్ల క్రితమే వ్యాస మహర్షి గాంధారి గర్భంలోని పిండాన్ని నూటొక్క కుండల్లో ప్రవేశపెట్టి కౌరవ సంతానోత్పత్తికి ఆద్యుడయ్యాడు. గర్భ మార్పిడి, వీర్య దానం వంటి విషయాలను పిండోత్పత్తి శాస్త్రంగా ఆనాడు అభివృద్ధి పరిచారు. ఇది ఎందరికి తెలుసు?

లింగమార్పిడి, మంత్ర తంత్రాలు, అంతరిక్ష విహారం, ఆకాశంలో ఎగిరే పుష్పక విమానం, ప్రాచీన అణు విజ్ఞానం, గ్రహణాలు, కృష్ణబిల సిద్ధాంతం, పంచభూతాల పరిజ్ఞానం, నేలలో దాగిన ఖనిజ విజ్ఞానం, పాదరస ఔషధాలు, రాశిచక్రాలు, నవగ్రహ విజ్ఞానం, విజువల్‌ చలనం, విశ్వ పరిజ్ఞానం, చెక్కుచెదరని లోహస్తంభ నిర్మాణం, భూతద్దాల తయారీ, తాళపత్రాలను గ్రంథాలకు వాడడం, నగర నిర్మాణం, అద్భుతమైన సంస్కృత భాష, సంఖ్యామానం, స్ట్రింగ్‌ థియరీ, బిగ్‌ బ్యాంగ్‌ థియరీ, శబ్దంలోని మర్మం, రూపంలోని రహస్యం, భారద్వాజ వైమానిక శాస్త్రం, నౌకా నిర్మాణం, వ్యవసాయ విజ్ఞానం, క్రీడలు, అవధానం, కవిత్వం, భారతంలోని యుద్ధ నైపుణ్యాలు, స్వరాలతో సంగీత శాస్త్రం, శిల్పం, నృత్యకళ, చిత్రలేఖనం, సాముద్రికం, కామశాస్త్రం, మంత్రం, వాస్తు, ఋషుల శాంతి దృక్పథం, అర్థ, న్యాయశాస్త్రాలు... ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయులు వేలు పెట్టని విద్య లేదు. అత్యంత ప్రాచీన కాలంలోనే భారతీయులు ఈ విషయాలను వాళ్ల కాలానికి తగినట్లుగా ఆచరణలో పెట్టారు. ఇప్పుడు గొప్ప విజ్ఞాన దేశాలుగా చెప్పేవి పుట్టని కాలంలోనే ఇలాంటి తొలి అడుగు వేసిన భారతీయ విజ్ఞాన వేత్తలను గుర్తించేదాకా మనకు పోరాటం తప్పదు.

సైన్సు అనగానే తామే దాని టేకేదార్లమని ప్రగల్భాలు పలికే వాళ్లు సైన్సు వల్ల జరిగే అభివృద్ధిని వ్యతిరేకిస్తారు. సైన్సు అంటే బ్యూరెట్టు, పిప్పెట్టు, ప్రయోగశాల అని మాత్రమే భావించి మాట్లాడే అజ్ఞాన వేదికలకు చెప్పలేక పోవచ్చు కాని సమతుల్య మనస్సుతో అధ్యయనం చేసే వాళ్లను ఆహ్వానించవచ్చు. సైన్సు అంటే అధ్యయనానికి, ప్రయోగానికి ఓ ప్రక్రియ. అంతేకాని అదో జడ పదార్థం కాదు. ఏమీ తెలియకుండానే ప్రాచీన భారతీయులు ఇన్ని ప్రక్రియలకు సంబంధించిన ఊహలు చేయగలిగారు. భారతీయులకు ఎన్ని విద్యలు తెలిసినా మనం ఎక్కడి నుండి వచ్చాం? మనం ఎవరం? మనం ఎక్కడికి వెళ్లాం? అన్న మూడు ప్రశ్నల చుట్టే తమ శాస్త్రాలను తిప్పుకొన్నారు. ఉత్తర కొరియా, పాకిస్థాన్‌లలాగా అణు బాంబులను చేతిలో పట్టుకొని బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడలేదు. అలాంటి మహోన్నత భారత వారసత్వాన్ని అనుసరించి డా. ఏ.పి.జే. అబ్దుల్‌ కలాం కూడా భారతీయ అణు విజ్ఞానం మన రక్షణకే గాని ఇతరులపై ప్రయోగానికి కాదు అన్నాడు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ తన చివరి ముప్పై ఏళ్ళలో సాధించిన సాపేక్షతా సిద్ధాంతం ప్రపంచానికి కొత్త వెలుగైనా మానవ జీవన మూల్యాలను చెప్పే భారతీయ తత్వ శాస్త్రాలవైపు మొగ్గు చూపాడు. అందుకే సున్నాను కనుగొన్న భారతీయులకు ప్రపంచం ఋణపడి ఉందన్నాడు ఐన్‌స్టీన్‌. వాస్తవాలు తెలుసుకోకుండా కుయుక్తులతో కాలం గడిపే బుద్ధిజీవులు సమతుల్యమైన మనస్సుతో అధ్యయనం చేస్తారని ఆశిద్దాం.

*******************************
✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి 
ఎడిటోరియల్ :  వ్యాసం :  ఆంధ్రజ్యోతి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి