కొక్కొరో ... క్కో ...
ఇంకెన్నాళ్లీ నాటకం !?


ఇటీవల నసీరుద్దీన్‌ షా అనే ప్రముఖ హిందీ నటుడు ఓ దుర్వాఖ్య చేసాడు. ముసలితనం వచ్చాక ఈ దేశంలో జీవించాలంటే నాకు భయం వేస్తుంది; నా పిల్లలకు రక్షణ లేదు’ అని వ్యాఖ్యానించి తన దుర్బుద్ధి చాటుకున్నాడు. ఈ దేశంలో మహమ్మదాలీ జిన్నా మొదలుకొని ఈ అంటు జాడ్యం నసీరుద్దీన్‌ షా వరకు కొనసాగుతూనే ఉంది. మొన్నటికిమొన్న హమీద్‌ అన్సారీ అనే నాయకుడు ఉపరాష్ట్రపతి పదవి 5 ఏళ్లు బాగా అనుభవించి పోతూ పోతూ ‘ఈ దేశంలో మాకు భద్రత లేదు’ అంటూ ఓ రాయి వేసిపోయాడు. అంతకుముందు అమీర్‌ఖాన్‌ అనే అపర నటుడు ఇలాంటి కుత్సిత వ్యాఖ్యాలే చేసాడు. ఇప్పుడు 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు వాపసీ గ్యాంగ్‌ తమ నకిలీ లౌకికవాద ముఖాలను మళ్లీ అలంకరించుకుంటున్నారు..!
హిందువులను బోను ఎక్కించే ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెన్నాళ్లు భరించాలో ఆ దేవుడికే ఎరుక? విచిత్రం ఏమిటంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజలను ఎంత బాగా తిట్టి ఉతికి ఆరేస్తే అంతగొప్ప సెక్యులర్‌! హిందువులను తాలిబన్లు, హిందూ పాకిస్తాన్‌, ఉగ్రవాదులు అనేవాళ్లంతా పూజనీయులు, ఆరాధనీయులే గాక ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడేవాళ్లే..! సూపర్‌!
దీనిని గొప్ప సంప్రదాయంగా నకిలీ లౌకిక రాజకీయవేత్తలు, సిద్ధాంతకర్తలు మనకు అందిస్తున్నారు. రామజన్మ భూమి ఉద్యమంలో 16 మంది కరసేవకులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి ‘మైనార్టీ సంతుష్టీకరణకు అంతకన్నా నేను ఏం చేయలేకపోయాను’ అన్న ముల్లా ములాయాంసింగ్‌ యాదవ్‌ ఈ దేశ సెక్యులర్‌ భావాల పరిరక్షకుడు! రామజన్మభూమి రథయాత్రను అడ్డుకున్న లాలూప్రసాద్‌ ఈ దేశ రక్షకుడు! హాజీ యాకూబ్‌ ఖురేషీ అనే ముస్లిం నాయకుడు డేనిష్‌ కార్టూనిష్టుకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసాడు. గతంలో అతడు యూపీ ప్రభుత్వంలో పదోన్నతి పొందాడు. బాట్లాహౌజ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన తీవ్రవాదులను తలచుకొని రాత్రిళ్లు నిద్రపోకుండా సోనియా ఏడ్చిందనే నిజాన్ని ఓట్ల కోసమైనా బయటపెట్టిన సల్మాన్‌ ఖుర్షీద్‌ను ఈదేశంలో ఎవరైనా ఏమైనా అన్నారా! ఇదే సల్మాన్‌ ఖుర్షీద్‌ అలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదే! హైద్రాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో సాక్షాత్తు మజ్లిస్‌ ప్రజాప్రతినిధులు తస్లీమా నస్రీన్‌ను చుట్టిముట్టి దాడిచేస్తే అప్పుడు గద్దెపైనున్న మన్‌మోహన్‌ మౌనంగా ఉండడం తప్ప ఇంకేం చేయలేకపోయాడు. ‘జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌’లో పాల్గొన్న రచయిత సాల్మన్‌ రష్దీని అడ్డుకొన్నప్పుడు దేశంలో అందరూ భద్రంగా ఉన్నారా? రామజన్మ భూమి వివాదం 2019 ఎన్నికల తర్వాత విచారణ చేయండని కపిల్‌ సిబాల్‌ సుప్రీంకు చెప్తే అది సెక్యులరిజం! మీ ఓట్లు 90 శాతం మాకే పడాలి అని ముస్లింలకు హితబోధ చేసి గద్దెనెక్కితే అక్కడ మెజార్టీలు భద్రంగా ఉన్నట్లు..! ఇదేం ఫిలాసఫీ! ‘ఉగ్రవాదానికి మతం ఉండదు’ అనేవాళ్లు ఉగ్రవాదులంతా ఏ మతం వాళ్లని ఎప్పుడైనా ప్రశ్నించారా? అలా ఈ దేశ ప్రజలు అడగనంత కాలం ‘నసీరుద్దీన్‌ షా నాటకాలు’ ఇలాగే ఉంటాయి!

కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి

‘ఏమి తెలియనమ్మ ఎక్కెక్కి ఏడ్చింది’ అనే సామెత చెప్పినట్లు ఇటీవల రాహుల్‌గాంధీ ‘రాఫెల్‌’ కొండను తవ్వి అందులోంచి అనీల్‌ అంబానీ అనే మేకను తీసి మోదీపైకి పంపిస్తున్నాడు. నిజానికి పదేళ్ల యూపీఏ కాలంలో ‘సోనియాజీ’ తప్ప నాకు టూజీ త్రీజీ గురించి తెలియదు’ అని అన్నట్లుగా మన్మోహన్‌ సింగ్‌పై జోక్‌ ఉండేది. ఇటీవల రాహుల్‌కు ఎవరో చెప్పిన చిలుక పలుకులు ‘రాఫెల్‌ స్కాం’ అనే పెద్ద ఘనత సాధించిపెట్టాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ దేశ ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నది విని తరిస్తున్న ఈ దేశ మీడియాకు పులిట్జర్‌ అవార్డు ఇవ్వాల్సిందే. అయితే రాహుల్‌ మాటల్లోని డొల్లతనాన్ని భాజపా నేతలు చాలా సున్నితంగా, బుజ్జగింపు ధోరణితో ఎదుర్కోవడం వల్లనే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా రాహుల్‌ సాక్షాత్తూ ఈ దేశ ప్రధానిని అనరాని మాటలు అన్నాడు.
ఈ విషయంలో భాజపా వారు కేసీఆర్‌ను చూసి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. రాహుల్‌గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చి వెళ్లాక కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి, రాహుల్‌ ఆరోపణలను ప్రస్తావిస్తూ ‘బఫూన్‌’లకు జవాబు చెప్పాలా ? అంటూ తేలిగ్గా తీసి పారేసారు. అదేం చిన్న విషయం కాదు. కేసీఆర్‌ ఆత్మవిశ్వాసంతో చెప్పిన ఆ తిట్టు ప్రజలు నిజంగా గ్రహించారు. ‘రాహుల్‌కు ఏమీ తెలియదు’ అన్న విశ్వాసం ప్రజల్లో కేసీఆర్‌ కలిగించాడు. అందుకే రాహుల్‌ ఉపన్యాసాలకు ఇక్కడి ప్రజలు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వలేదు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ వాళ్లకు ముద్దు అయ్యాడు గానీ ప్రజలు ఆయనని చూడ్డానికి గాని, చెప్పింది వినడానికి గానీ వచ్చింది లేదు. దీనికి కారణం కేసీఆర్‌ అతనిని తేలిగ్గా తీసిపారేయడమే. అదే రాహుల్‌ను బీజేపీ వారు ‘రాహుల్‌జీ’ అంటూ హద్దులు మీరిన క్రమశిక్షణతో గౌరవించడం వల్ల అతను హద్దు మీరి ప్రధానిపైనే తిట్ల దండకం అందుకుంటున్నాడు. ఇంతకన్న ఎక్కువ ఏమీ చేయలేని రాహు ల్‌ను మీడియా ఆకాశానికెత్తేసే సరికి ఈ మార్గం బాగుందని కాంగ్రెస్‌ వారు చంకలు గుద్దుకుంటున్నారు.
మోదీ పేరు చెప్తేనే బండబూతులు లంకించుకొంటున్న తెలుగుదేశం నాయకులు తమ చంద్రబాబును కేసీఆర్‌ బండబూతులు తిట్టినా వాటిని హాయిగా సహిస్తున్నారు. లేని నవ్వు ముఖంపై పులుముకొని ‘కేసీఆర్‌ తిట్లను తాను భరించాను చూడు’ అన్నట్లు చంబానా చిరుదరహాసాలు చిందిస్తున్నాడు. కానీ ఈ రోజు వరకు భాజపా నాయకులు చంద్రబాబు పట్ల లేని మర్యాదను కురిపిస్తున్నారు. దాంతో టీవీల్లో తెదేపా నాయకులు మోదీపై పేలుతున్న మాటలు చూస్తే వాళ్ల నోటికి మొక్కాల్సిందే! తెలంగాణ యాసలో తన తిట్లతో చంద్రబాబును నిలువరిస్తున్న కేసీఆర్‌ను చూసి భాజపా నాయకులు కొన్ని నేర్చుకోకపోతే భవిష్యత్తు కష్టమే.
***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
07 : 13 : జనవరి - 2019
సంపుటి : 71, సంచిక : 10

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి