సముద్రం ఒడ్డున ఆగి ఉన్న ఓడపైన ఓ కాకి వచ్చి వాలింది. అంతలో ఓడ ప్రయాణం ప్రారంభమై సముద్రం మధ్యలోకి చేరింది. కాకి ఓడపై భాగంలో ఎగిరింది. ఎటూచూసినా నీళ్లే ఉన్నాయి. వాలడానికి స్థలం లేదు. తిరిగి తిరిగి మళ్లీ ఓడపైనే వాలింది. చంచలమైన మనస్సు కూడా ఆ కాకిలాంటిదే. 
చాలాదూరం పరుగెత్తుతుంది. కానీ ఎక్కడా దానికి తృప్తి 
దొరకదు. గాలిలో దీపం లాగా ఎప్పుడూ కదులుతుంది. 

అందుకే మనసును కోతితో పోల్చారు. మనసు కోతిగా ఉంటేనే గెంతులేస్తుంది. అలాంటిది ఆ కోతి కల్లు తాగిలే.. దాన్నితేలు కుడితే.. దానికి దెయ్యం పడితే.. ఆపై అది నిప్పులు తొక్కితే? ఇక ఆ కోతి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాగే మనిషి మనసు కూడా!

ఈ రోజుల్లో ఏ మనిషిని కదిలించినా చాలా ‘బిజీ’గా ఉండడానికి కారణం మనసుకుండే ఈ కోతి స్వభావమే. ఇవాళ మనుషులకు అన్నీ ఉన్నాయి కానీ అందరిదీ ‘సమయ పేదరికం’. హద్దులు మీరిన ధనవ్యామోహం, తీవ్రమైన పదవీకాంక్ష, హద్దూ అదుపులేని కీర్తి కండూతి వల్ల మనిషి అశాంతిలో మునిగి తేలుతున్నాడు. ప్రతివారిలో ఆధ్యాత్మికత పెరిగినట్లు కనిపిస్తుంది. కానీ ఎక్కువమంది అశాంతితో జీవిస్తున్నారు. గుళ్లకు, గురువుల దగ్గరకు వెళ్లి నాకు ఇళ్లూ, ధనం, పదవి కావాలని భౌతిక సుఖాన్ని యాచిస్తున్నారు. అంతేతప్ప.. ‘నా మనసుకు శాంతి కావాలి’ అని ఎవరూ అడగట్లేదు.

వెండి, రాగి మొదలైన లోహాలతో కలిసినప్పుడు బంగారం విలువ ఎలా తగ్గిపోతుందో.. అలాగే శుద్ధజ్ఞానం గల జీవుడు శివస్వరూపి అయినాగాని అహంకార, మమకార గుణాలతో మాయ ఆవరించి జీవత్వం పొందుతున్నాడు. స్ఫుటం అనే శుద్ధి ప్రక్రియ ద్వారా స్వర్ణకారులు బంగారాన్ని ఇతర లోహాల నుండి ఎలా వేరు చేస్తారో గురువు కూడా అలా తన యోగ విద్యా ప్రబోధం వల్ల మనోనాశనం చేస్తాడు. సాధన వల్ల కలిగే సంస్కారాలతో జీవుని మనో మాలిన్యం తొలగిస్తే ‘శుద్ధ జ్ఞానైక శివస్వరూపుడు’ అవుతాడు. అలాంటి సాధానానుష్ఠానం మనోనిశ్చలతను కలిగిస్తుంది.

ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్‌
ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్‌

‘ప్రశాంతత పొందిన మనస్సు గలవాడై, త్రిగుణాలు శమించినవాడై పాపం లేనటువంటి బ్రహ్మ స్వరూపుడైన, జీవన్ముక్తుడైన యోగిని ఉత్కృష్టమైన బ్రహ్మానంద సుఖం ఆవరిస్తుంది’ అని గీతాచార్యుడు చెప్పినట్లు మనసుకు శాంతిని కలిగించాలి.


********************************
     ✍ ✍  డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి