“పరిస్థితులను చూస్తుంటే మోదీని హత్య చేసేందుకు నితిన్ గడ్కరీ ఆరెస్సెస్ కుట్ర చేసినట్లనిపిస్తోంది. వారు రాజీవ్ తరహాలోనే మోదీని చంపేయాలని పన్నాగం పన్నినట్లు తోస్తుంది. ఆ అపవాదును ముస్లింలపైకి, కమ్యూనిస్టులపైకి తోసి అటు తర్వాత ముస్లింలను ఊచకోస్తారేమో” అంటూ నాలుగు రోజుల క్రితం మార్క్సిస్ట్ మదర్సా అయిన జేఎన్‌యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రశీద్ ట్వీట్ చేసింది. ఈ దేశంలో గత డ్బ్బు ఏళ్ల నుండి హిందూ ఫోబియాను చూపించి సంతుష్టీకరణ ఎలా చేస్తున్నారో అన్న నగ్నసత్యానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దీనిపై నితిన్ గడ్కరీ తీవ్రంగా స్పందించి పరువు నష్టం కేసు వేస్తాననగానే ఆమె ఉత్తుత్తినే మాట్లాడాను అన్నది!?

కేంద్రంలో పూర్తి మెజారిటీతో జాతీయవాద ప్రభుత్వం మోదీ నేతృత్వంలో ఏర్పడ్డప్పటి నుండి గత డ్బ్బు ఏళ్ల నుండి ప్రత్యక్షంగా, పరోక్షంగా అధికారానికి అలవాటుపడిన పార్టీలు, కళా సాంస్కృతిక రంగాల్లో తిష్టవేసుక్కూచున్న మేధావులు కుతకుత ఉడికిపోతున్నారు. ఎవరు అవునన్నా, కాదన్నా బీజేపీ హిందుత్వను తలపైకి ఎత్తుకున్న పార్టీ. వాళ్ల సిద్ధాంతం ప్రకారం ఈ దేశంలోని ప్రతివారూ హిందుస్తానీలే. ఇక్కడున్న అన్ని మతాల ప్రజల పూర్వీకుల సంస్కృతి ఒక్కటే. గతంలో హైదరాబాద్‌లోని సీసీయంబీ శాస్త్రవేత్తలు, అమెరికా హార్వర్డ్ మెడికల్ స్కూలు మొదలైన అంతర్జాతీయ సంస్థలతో కలిసి దేశంలోని 13 ప్రాంతాల్లో జరిపిన డీఎన్‌ఏ పరిశోధనలను ‘నేచర్’ ఆంగ్ల పత్రిక 2009 సెప్టెంబర్‌లో ప్రచురించింది. ఈ దేశంలోని ప్రజల డీఎన్‌ఏలో ఎన్నో సారుప్యాలున్నాయని ఈ పరిశోధన తేల్చింది.

ఈ సిద్ధాంతాన్నే బంగారు లక్ష్మణ్ భాజపా అధ్యక్షుడిగా పనిచేసినపుడు బాగా ప్రచారంలోకి తెచ్చారు. భాజపా ఎంతలా తమ సిద్ధాంతం గురించి వివరించినా సెక్యులర్ పార్టీలు దానిని హిందుత్వ పార్టీగానే ముద్ర వేసాయి. క్రీ.శ. 712లో సింధు రాజ్యాన్ని పరిపాలించిన హిందూ రాజు దాహిర్ సేన్ పరాజయం తర్వాత ఈ దేశంలో హిందూ రాజ్యవ్యవస్థ కుప్పకూలింది. ఆ తర్వాత హిందువులను ఒక జాతిగా కలిసి ముడివేసే వ్యవస్థ లేకుండా పోయింది. ఆనాటి నుండి హిందువులు ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగానే జీవించారు. అక్కడక్కడ అప్పుడప్పుడు మెరుపుతీగల్లా రాణాప్రతాప్, శివాజీ, కృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుడు, ముసునూరి సోదరులు తదితరులు కన్పించినా.. అది దేశం మొత్తం జాతీయతా స్ఫూర్తిని నింపి రాజకీయ పునరేకీకరణ చేయలేకపోయింది.

స్వాతంత్య్ర పోరాటంలో అతివాద నాయకులంతా హిందుత్వ స్ఫూర్తితో రగిలినవారే. 1918 తర్వాత గాంధీజీ స్వాతంత్య్ర ఉద్యమ ప్రవేశంతో ‘మృదు హిందుత్వ’ అతివాదుల ప్రభావాన్ని తగ్గించడం చారిత్రక సాక్ష్యం. 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భావం సైద్ధాంతికంగా హిందుత్వ రాజకీయాలకు వేదికైంది. అప్పటికే రాజకీయ యవనికలో ఎందరో హిందూ రాజకీయ వేత్తలను అందించిన ఆర్య సమాజం, హిందూ మహాసభలకు సమాంతరంగా ఈ సంస్థ ఎదుగుతూ వచ్చి జనసంఘ్‌కు, భారతీయ జనతా పార్టీల ఆవిర్భావానికి కారణభూతమైంది. జనసంఘ్ నాయకుడు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఆనాటి పాలనకు కేంద్ర బిందువైన జవహర్‌లాల్ నెహ్రూకే కంట్లో నలుసుగా మారాడు. ఆయన తర్వాత వచ్చిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయ్, లాల్‌కృష్ణ అద్వాణీ జనసంఘ్‌ను, తదనంతరం భాజపాను తీర్చిదిద్దారు.

1990 తర్వాత వచ్చిన రామ మందిర ఉద్యమం, ఆద్వాణీ రథయాత్ర భారత జాతీయతను మలుపుతిప్పి కేంద్రంలో వాజ్‌పేయ్ నేతృత్వంలో మూడుసార్లు గద్దెనెక్కిన ఒక్కసారే సంకీర్ణ ప్రభుత్వం రూపంలో పాలన సాగింది. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు, బలిదానాలు జరిగాక జాతీయవాదుల గొంతు మెల్లగా విన్పించసాగింది. ఎంతో వ్యయ ప్రయాసల తర్వాత 2014లో 282 సీట్లతో సంపూర్ణ మెజారిటీ సాధించి మోదీ ఈ దేశప్రధాని అయ్యారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ అక్కడి  హిందువులకు రక్షకుడిగా నిలిచాడు. అభివృద్ధి, నిజాయితీలకు పెద్ద పీట వేశాడని ఈ దేశంలో ఎక్కువ మంది విశ్వసించారు. మిగతా కారణాలు ఎన్ని ఉన్నా ఇవి సత్యాలు.

మోదీ నేతృత్వంలో బీహార్, ఢిల్లీ, ఎన్నికలు తప్ప అన్నింట్లో అప్రతిహత విజయమే లభించింది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు, సూడో సెక్యులర్ మేధావులు మోదీని గద్దెపై నుండి దించాలంటే ఏం చేయాలని విచారించారు. మైనార్టీ, మెజార్టీలుగా మాట్లాడితే మెజార్టీలంతా మోదీ వెంబడి నిలబడుతున్నారు. కాబట్టి మైనార్టీ ప్రస్తావన లేకుండా హిందువుల్లో చీలికలు లేపడం, కులాల మధ్య సంఘర్షణ సృష్టించడం ఎత్తుగడగా భావించారు. దాద్రీలో అఖ్లాఖ్ హత్యను బూచిగాచూపి దేశంలో మతసామరస్యం కొరవడిందని కుహనా మేధావులు అవార్డులు వాపసు ఇచ్చారు. రోహిత్ వేముల ఆత్మహత్యను కులాలమధ్య ఘర్షణగా చిత్రీకరించారు. చర్య జరిపి రెచ్చగొట్టడం రెచ్చిపోయిన వాళ్లు ప్రతిచర్య చేస్తే దానిపై దుష్ప్రచారంం చేయడం ఈశక్తుల ఎత్తుగడల్లో, వ్యూహాల్లో భాగమే. సిద్ధాంతపరంగా, హింతుత్వను వ్యతిరేకించే కమ్యూనిష్టులు వీటివెనుక నిలవడం ఎన్నోసార్లు రుజువైంది.

ఇందులో భాగమే గత డిసెబర్ 31 తర్వాత జరిగిన భీమా కోరేగావ్ అల్లర్లు. ఇవి ముదరిపోయి ఆఖరుకు హిందూ ఫాసిస్ట్ పాలనను మోదీ ప్రోత్సహిస్తున్నందుకు మోదీ హత్యకు కుట్ర జరిగినట్లు వారం క్రితం వార్తలొచ్చాయి. రోమావిల్సన్ ఇంట్లో సోదాలు జరిగినపుడు బయట పడిన లేఖల్లో ఈ విషయంపై కామ్రేడ్ ప్రకాశ్, ఆర్, అనే వ్యక్తుల మధ్య ఈ సంభాషణ జరిగినట్లు పోలీస్ వర్గాల సమాచారం. ఇందులో తెలుగునాట ఎందరినో విప్లవం పేరిట బలిపీఠం ఎక్కించిన వరవరరావు పేరుండడం విశేషం. ఈ మహానుభావుడు చూస్తే నిరాడంబరంగా కన్పిస్తూ  ఇంతకుట్ర చేస్తాడా, ఇన్ని కోట్లడబ్బు సమకూరుస్తాడా అని ఇప్పటికే కొంరు నమ్మలేక పోతున్నారు. దళిత, బీసీ కులాల బిడ్డలు నక్సల్స్ ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఈ మహానగర మావోయిస్టులే కారణం అని ఎందరో మేధావులు విశ్లేషించారు.

ఇక్కడ సిద్ధాంత పరంగా హిందుత్వను ద్వేషించే శక్తులు అధికార భాజాపాను, మోదీని అంతమొందించాలని చూస్తున్నట్లు ఈ లేఖలు తెలుపుతున్నాయన్న సంగతి భాజాపా నాయకులు గుర్తించాలి. ఇంత తీవ్రంగా సిద్ధాంత వైరుధ్యాలు దేశంలో ఉన్నట్లు భాజాపా గమనించకుంటే 2019 ఎన్నికలు వారికి శాపంగా పరిణమిస్తాయి. స్వాతంత్య్రం వచ్చినప్పుటినుంచి కళా, సాహిత్య, సాంస్కృతిక, ప్రసార, ప్రచార మాధ్యమాల్లో పాతుకు పోయిన వామపక్ష భావజాలాన్ని మరమ్మతు చేయకుండా భాజాపా చేసే అశ్వమేధయాగం ఎక్కడో ఒకచోట ఆగిపోవడం ఖాయం. జాతి విద్రోహులకు పద్మ పురస్కారాలు, మావోయిస్టు కవికుల గరువులకు పురస్కారాలు ఇస్తే వాళ్లే సెలబ్రిటీలై భాజాపాపై దుమ్మెత్తి పోస్తారు!? నిజానికి కేసీఆర్‌ను చూసి భాజాపా చాలా నేర్చుకోవాలి.

కేసీఆర్ అధికారంలోకి బొటాబొటీ మెజార్టీతో వచ్చినా తెలంగాణ పునరేకీకరణ పేరుతో అన్ని పార్టీల నాయకులను, అదీ చురుకైన వాళ్లను తెలంగాణ వాదులుగా మార్చి తనకు ఎదురు లేకుండా చూసుకొని శత్రుపక్షాన్ని దెబ్బతీసాడు. ముందు నుండి తెలంగాణపై అక్కసు వెళ్లగక్కే చంద్రబాబు, జగన్, చిరంజీవి వంటి నాయకులకు నిలువ నీడ లేకుండా చేశాడు. దుష్ప్రచారం చేసే మీడియాను కిలోమీటర్ లోతున పాతర వేస్తానన్నాడు. వీటితో పాటు ప్రజలను ఆకర్షించే సంక్షేమ పథకాలు, సాహిత్యం, కళలు, పత్రిక, భావజాలం అన్నింట్లో తనకు ఎదురు లేకుండా చేసుకున్నాడు. మీడియా రంగంలోని, సినిమా రంగంలోని పెద్దతలకాయలను నాగస్వరం ముందు పాము తల ఆడించినట్లు చేసి పాలిస్తున్నాడు. దీనికి భిన్నంగా భాజపా అన్ని శక్తులను స్వేచ్ఛగా బజారులో వదిలిపెట్టి వాళ్లు కొట్టే దెబ్బలను కాయలేక బాధపడుతూనే విజయాలు సాధిస్తున్నది. అత్యధికంగా దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు భాజపాకున్న దేశంలో దళిత వ్యతిరేకముద్ర అన్ని కోణాల్లో మోదీపై వేస్తున్నా వారెవ్వరూ మాట్లాడడం లేదు.

హద్దులు మీరిన క్రమశిక్షణ కూడా అప్పుడప్పుడు ప్రమాదకారి అవుతుందనడానికి ఇది నిదర్శనం. పోనీ ఎన్డీయేలో భాగస్వాములైన దళిత నాయకులు రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవాలేలు అపుడపుడు మాట్లాడినా అదీ ద్వందార్థంలో మాట్లాడ్డం శోచనీయం. మరి పార్టీలోని దళిత నాయకులు ఇంక దేనిపై స్పందిస్తారు?  అలాగే మీడియా అయ్యిందానికి కానిదానికి మోదీని బోనులో నిలబెడుతుంటే వాటి నియంత్రణకు అధికారంలో ఉండి కూడా  ఏమీ చేయకుండా నిస్సహాయంగా నిలబడుతుంటే జాతీయవాద భావజాలం ఉన్నవాళ్లు కుమిలిపోతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలను గాల్లో సృష్టించి దుష్ప్రచారం చేసి మోదీ, షాలను విలన్లుగా, అసమర్థులుగా చిత్రీకరించడానికి వెనుక ఉన్న అదృశ్య శక్తులను ఇప్పటికైనా భాజపా గుర్తించిందా? నోట్ల రద్దు తర్వాత నుండి బ్యాంకుల్లో జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటిగా సరిచేయకుంటే సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు భాజపాకు ఎదురెళ్లే పరిస్థితి ఉంది.

అదే బ్యాంకులను ఉపయోగించుకొని కేసీఆర్ రైతుబంధు చెక్కులను ఇవ్వగలిగినపుడు కేంద్ర ప్రభుత్వం ఏటీఎంలను పనిచేయించడానికి ఆర్‌బీఐని ఎందుకు క్రమశిక్షణలో పెట్టదు? జీఎస్టీ అమల్లోకి తెచ్చి దాని లాభాలను సామాన్యులకు వివరించకపోతే ఏదో ఆర్థిక మాంద్యం వచ్చిందని మన్మోహన్ సింగ్ ప్రచారాన్ని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. ఉద్దేశం మంచిదైనా దానిని ప్రజల మెదళ్లలోకి చేర్చే వ్యవస్థ లేకపోతే ఎలా? అందరికన్నా ఎక్కువగా మిడిసిపడుతున్న చంద్రబాబును ఎదుర్కోవడంలో విఫలమైతే దేశం అంతా ఇదేవిధంగా ధనం, కులం, మీడియాను అడ్డుపెట్టుకొని కుల, కుటుంబ పార్టీలు చెలరేగే అవకాశం ఉంది. భాజపాకు ప్రాణప్రదమైన 370 ఆర్టికల్, రామ మందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి పెట్టకపోతే జాతీయవాదుల్లో నిరుత్సాహం ఏర్పడే ప్రమాదం ఉంది. 

మోదీ ఒక్కడు నిజాయితీపరుడని చూపించినంత మాత్రాన దుష్కర పరిస్థితులను, దుష్ప్రచారాన్ని ఆపడం సాధ్యమా? మోదీ పాలనపైన జరిగే చర్చకన్నా సైద్ధాంతికంగా ఎక్కువ దుష్ప్రచారం జరుగుతుంది కాబట్టి సిద్ధాంతపరంగా సరైన పునాదులు నిర్మించకుండా భవనాలు కట్టడం ప్రమాదంలో పడడమే! ఇన్నేళ్లు భాజపా సిద్ధాంతాలపై నిలబడినందుకే ఇంత విస్తృతంగా పరుచుకుంది. ప్రతీదానికి మోదీని మాత్రమే స్పందించే విధంగా ప్రతిపక్షాలు స్కెచ్ వేస్తే ఆ ఉచ్చులో భాజపా కూడా పడిపోతున్నట్లు తాజా ఉదాహరణలు ఎన్నో చెప్పవచ్చు. అలాగే అతిగా ఆర్థిక క్రమశిక్షణకు పోయి పెట్రోల్ ధరల్లాగా అపఖ్యాతి పాలు అయితే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంది. కొందరి కోసం హద్దులు మీరిన ఆర్థిక ఆంక్షలతో కూడిన పథకాలు సమాజంలోని పెద్ద సంఖ్యలో ఉన్న వర్గాలను దుష్ప్రభావానికి గురిచేస్తాయి.

రాజకీయ నాయకులు వజ్ర సదృశమైన దృఢ సంకల్పం కలిగి ఉంటారో, వెన్న లాంటి మనసు కూడా కలిగి ఉండాలి. దేశంలో ఎక్కువ మందికి మేలు చేసే ఏ అంశంలోనైనా చాలా సున్నితంగా ఆలోచించకుండా మొరటుగానే ముందుకు పోవాలి. భాజపా వాళ్లు దేశాన్ని అతిగా ఆర్థిక క్రమశిక్షణ చేసి ఆ డబ్బును రాహుల్ గాంధీ నోట్లో పెట్టి పోతారా ఏంటని, ఎక్కువ మంది ఆందోళనకు గురవుతున్నారు. డ్బ్బు ఏళ్ల నుండి వ్యవస్థలు ధ్వంసం అయినందుకే మోదీ అనే వ్యక్తిని ప్రజలు నమ్మారు. కాబట్టి వ్యవస్థను రక్షిస్తూనే మోదీ,  భాజపా పెద్దలు వ్యూహాలు కూడా తక్షణం మార్చాలి. 

******************************************************
డాక్టర్. పి. భాస్కర యోగి : సంపాదకీయ వ్యాసం 


1 కామెంట్‌:

  1. మోడీ,షా లు మేల్కొనలి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి లేకుంటే చాల నష్టం.

    రిప్లయితొలగించండి