నరేంద్రమోదీ-సూడో సెక్యులరిస్టుల మధ్యనే 2014 సార్వత్రిక ఎన్నికలు జరిగాయని ఓ రాజకీయ విశే్లషకుడు చెప్పాడు. నిజమే! నరేంద్రమోదీ గెలవడానికి కారణం కేవలం ‘హిందూ ఓటు బ్యాంక్ పోలరైజేషన్’ మాత్రమే అనుకోవడం భ్రమ. కాంగ్రెస్ బలహీనతలు, హిందూ-జాతీయవాదుల విస్తృత ప్రచారం, అభివృద్ధి, మోదీ మచ్చలేని వ్యక్తిత్వం, అవినీతి, ఆశ్రీత పక్షపాతం లేని సూటిదనం, అదరగొట్టే ప్రసంగాలు, పదేళ్ల కాంగ్రెస్ అవినీతి, అసమర్థపాలన, అనధికార అధికార కేంద్రం.. ఇలా ఎన్నో విషయాలు మోదీ విజయానికి తోడ్పడ్డాయి అని రకరకాల విశే్లషణలు కొనసాగాయి. కానీ ఈ దేశంలో హిందువుల అణచివేతను సెక్యులరిజం పేరుతో ఆచరణలోపెట్టిన నాయకులు, పార్టీలు, సంస్థలు ఈ అసలు కారణాలను గమనించడం లేదు. దాని తీవ్రస్థాయిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కానీ సత్యదృష్టితో ఆలోచించడం లేదు.
ఇటీవల సిపిఎం పార్లమెంట్ సభ్యులైన సలీం అవుట్‌లుక్ ప్రకటించిన ఓ కథనం ప్రస్తావిస్తూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను టార్గెట్ చేస్తూ ‘800 ఏళ్ల తర్వాత భారతదేశానికి ఓ హిందూ పాలకుడు రాబోతున్నాడు’ అని ఎన్నికల్లో రాజ్‌నాథ్ ప్రచారం చేసినట్టు చెప్పా డు. రాజ్‌నాథ్ ఆ మాట అన్నా, అనకున్నా ఇలాంటి భావం హిందూ సమాజంలో ఎందుకున్నది అని మేధావులు, పార్టీలు, నాయకులు ఎందుకు ఆలోచించడం లేదు? నరేంద్రమోదీ గెలుపుకు ఇలాంటి ప్రధాన భావం కారణం కాదా? దాన్ని ఎందుకు మరుగుపరచాలనుకుంటున్నారు? ఈ భావం ప్రజల మెదళ్లలో వేళ్లూనుకోవడానికి ‘సంఘపరివార్’ విస్తృత ప్రచారమే కారణమని దబాయిస్తారా? అసలు నరేంద్రమోదీ గుజరాత్ అల్లర్ల తర్వాత ఎందుకు హీరో అయ్యారు! అలాంటి అల్లర్లు, మత ఘర్షణలు దేశంలో ఎన్ని వందలసార్లు జరుగలేదు! గోద్రా సంఘటన తర్వాత జరిగిన గుజరాత్ అల్లర్లు హిందువులు చేసిన ప్రతిక్రియగా ఎక్కువమంది హిందువులు ఎందుకు భావిం చారు? మమ్మల్ని ముస్లిం తీవ్ర మనస్తత్వం గలవాళ్ల నుండి కాపాడే ‘మెస్సయ్య’ ఇతడే అని ప్రజలు ఎం దుకు భావించారు? ఈ ప్రశ్నలన్నిటి వెనుక ఓ లోతైన, బలమైన చారిత్రక, సామాజిక, రాజకీయ నేపథ్యం ఉంది. ఇప్పుడు కూడా వందల మంది మోదీలను సృష్టించే వైఖరికి పార్టీలు, మేధావులు, సంస్థలు ‘సెక్యులరిజం’ పేరుతో పరోక్ష మద్దతు ఇవ్వడం నిజంకాదా?
గాంధీజీ రాకముందు కాంగ్రెస్‌లో అతివాదం మితవాదం బయటకు కనబడకుండా ఉండేది. గాంధీజీ అనంతర కాంగ్రెస్‌లో మితవాదులు ముస్లిం మద్దతుదారులుగా, అతివాదులు హిందూ అనుకూలురుగా మారిపోయారు. ఉదా. 1921లో కేరళలోని మలబార్ ప్రాంతంలో అక్కడి మోప్లా ముస్లింలు హిందువులను ఊచకోత కోశారు. అయినా నాటి కాంగ్రెస్ మితవాదులు అనుకూలతను ప్రదర్శించారు. అలాగే 1925లో స్థాపించిన కమ్యూనిస్టుపార్టీ నాయకులు, పార్టీ అనుబంధ మేధావులు ఈనాటికీ అలాంటి ‘సంతుష్టీకరణ’విధానమే అవలంబిస్తున్నారు. 1906లో లార్డ్‌మింటో ముస్లిం లీగ్ గొంతెమ్మ కోర్కెలను కాంగ్రెస్ మితవాదులను అడ్డంపెట్టుకొని తీర్చాడు. ఆ తర్వాత మనకు సంబంధం లేని ‘ఖలీఫా’ఉద్యమానికి గాంధీజీ మద్దతు తెలిపాడు. ఇలాటి సందర్భాలు, ఉదాహరణలు ఎన్నో చెప్పొచ్చు.
స్వాతంత్య్రానంతర నెహ్రూ ప్రభుత్వం ఓ క్రొత్త రకమైన ‘క్విట్ ఇండియా’ ఉద్యమం ప్రారంభించింది. పాశ్చా త్య పాదార్థిక సంస్కృతిని అతిగా ఆచరించడం, సంప్రదా య హిందూ సంస్కృతిని, ఆధ్యాత్మికతను గుడ్డిగా వ్యతిరేకించడం- ఇది నెహ్రూ కొనసాగించిన ఉదార సాంస్కృతిక వాదం. ఇక అధికారం రాదని భావించిన కొందరు కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌లోకి దూకి తమ సాంస్కృతిక ఎజెండాను అమలుచేశారు. అది పూర్తిగా ‘వర్గ సంతుష్టీకరణ’అనే చెప్పొచ్చు.
డా.బాబాసాహెబ్ ఈ విషయంలో గొప్ప ముందుచూపుగల వ్యక్తి. సంతుష్టీకరణ విధానం ఆయన ఎన్నడూ సమర్ధించలేడు. అందుకే ‘లౌకికవాదం’అనే పదం రా జ్యాంగంలో చేర్చలేదు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ (కమ్యూనిస్టు) ప్రభుత్వాలు సెక్యులరిజం రాజ్యాంగంలో చేర్చి హిందువులను తిట్టడం, ఇతర మతాలను నెత్తిన ఎక్కించుకోవడం లౌకికవాదం అని భావించారు. దానికి ప్రతిగానే హిందూ సంస్థలు ‘సూడోసెక్యులరిజం’ పదబంధాన్ని సృష్టించాయి. ఆ పదబంధాన్ని వెంబడిస్తూ ఎందరో చదువుకొన్న హిందువులు నరేంద్రమోదీ వెంబడి నడిచారన్నది విస్మరించలేని సత్యం. హిందూ సమాజాన్ని, సంస్కృతిని, సభ్యతను, ఆచారాలను హేతువాదం, సైన్సు పేరుతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంస్థలు, మేధావులు ఇతర మతాల ఛాందసాన్ని పనె్నత్తి మాట్లాడడం లేదు. ఇది చాలామంది హిందువులను కలచివేస్తున్న అంశం షహబానో కేసులో కాంగ్రెస్ వైఖరి, దాన్ని సరిదిద్దుకోవడానికి రామమందిరం తాళాలు తెరిపించడం రాజీవ్‌గాంధీ చేసిన అపరాధం కాదని చెప్పగలరా? సంఘ పరివార్‌ను, హిం దూ సంస్థలను, భాజపాను అంటరాని వారుగా భావించే పార్టీలు, నాయకులు మజ్లీస్, ముస్లింలీగ్‌లతో అంటకాగడం ఎంతవరకు సబబు? ఇవన్నీ హిందూ విజ్ఞులను, తటస్థులను హిందూ అభిమానులుగా మారుస్తున్నాయి.
‘ఈ దేశ మూల సంపదలో మైనార్టీలదే మొదటి కబళం’అని తెంపరితనంగా మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ప్రకటించడం ఎంతవరకు సబబు! ఈ దేశంలోని ప్రతి పౌరునికి సమానంగా ఉండాల్సిన రాజ్యాంగం కొందరు లేదా ఓ వర్గానికి అనుకూలంగా ఉందని సాక్షాత్తూ ప్రధాని ప్రకటించడం హిందుత్వవాదుల్లో, న్యూట్రల్ హిందువుల్లో కలవరాన్ని కలిగించలేదంటామా! ఇందులో మీడియా పాత్ర ఏం తక్కువకాదు. దశాబ్దాలుగా ప్రభుత్వ సాంస్కృతిక సంస్థల్లో పత్రికల్లో తిష్ఠవేసుకొని కూర్చొని వామపక్ష భావజాలంగల మేధావులు ‘హిందూ వ్యతిరేక వైఖరి- మైనార్టీ అనుకూల వైఖరి ఏకకాలంలో ప్రదర్శిస్తున్నారు.
కుటుంబ, వంశ, ధన, రాజకీయ ప్రస్థానం లేకుండా ఓ సామాన్యమైన వ్యక్తిని ప్రధాని స్థాయికి పంపిన సంస్థను అధ్యయనంచేసే విధానం ఇదేనా! కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మాత్రమే నరేంద్రమోదీ ప్రధాని అయ్యారా! లేక సూడో సెక్యులరిస్టుల హిందూమతంపై అతి విమర్శలు, మైనార్టీ సంతుష్టీకరణ, హిందువుల్లో అభద్రతాభావానికి కారణం కాదా! అని ఈ దేశంలోని సెక్యులర్ మేధావులు ఆలోచించండి. లేదంటే రాష్ట్రానికో మోదీ పుట్టడం ఖాయం.
- డా . పి. భాస్కరయోగి సెల్: 9912070125  
Published Thursday, 1 September 2016  ఆంధ్రభూమి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి