తెలుగు భాషకు ప్రాచీన హోదా
విహంగ వీక్షణం
వెల: రూ.120/-
ప్రతులకు: టి.్భస్కర్, ప్రెసిడెంట్
చెన్నపురి తెలుగువాణి
15/37, రాజమంగళం, 1వ మెయిన్‌రోడ్
విల్లివక్కం, చెన్నై-600 049
99626 92662
‘అమ్మ భాష తల్లి పాల వంటిది. పరాయి భాష డబ్బా పాల వంటిది’ అని మనం ఎంత నెత్తీనోరు మొత్తుకొన్నా ప్రపంచీకరణ పేరుతో మాతృభాషలను ఆంగ్లం అనే అనకొండ మింగేస్తోంది. అయినా అక్కడో ఇక్కడో కొందరు పెద్దలు మాత్రం మాతృభాష రక్షణకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నంతో తిరునగరి భాస్కర్ సంపాదకత్వంలో డా.జె.చెన్నయ్య, డా.సామల రమేశ్‌బాబు, డా.తూమాటి సంజీవరావు గార్లు 192 పుటలతో అనుబంధంతో కలిపి 4 శీర్షికలతో ఈ పుస్తకం రచించారు. ఈ పుస్తకం మొత్తం తెలుగు ప్రాచీన హోదా కోసం చేసిన పోరాటాన్ని, ఆ పోరాటక్రమాన్ని నిక్షిప్తం చేసేందుకు రచింపబడింది.
మాతృభాషను రక్షించుకోవాల్సిన జాతులకు ‘ప్రాచీన హోదా’ కూడా రాజకీయ చట్రంలో మునిగిపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. తమిళులకు భాషాభిమానం మెండు. 2004లో తమిళనాడును పాలించిన డిఎంకె మద్దతును యూపీఏ పొందడం కోసం ఈ ‘హోదా’ అనే ‘ఎర’ను వేయడం ఆలోచింపదగిన విషయం. ఈ భాషా హోదా కోసం ఓ కమిటీ వేస్తే అందులో తెలుగు భాషాశాస్తవ్రేత్త కూడా ఉన్నాడు. ఈ కమిటీ ప్రాచీన భాష హోదా దక్కడానికి ఆయా భాషలకు ఉండాల్సిన లిఖిత చరిత్ర 1500-2000 సం.లు ఉండడం, ఆయా భాషల వాళ్ల విలువైన వారసత్వంగా పరిగణించే ప్రాచీన రచనలు, ఆ సాహిత్యంలోని సంప్రదాయం ఆ భాషా సముదాయానికి వౌలికమైనదై ఉండాలి. క్లాసికల్ భాషకూ, అంతర్గత రూపాలకు అభేదం ఉండాలని నాలుగు ప్రమాణాలను కమిటీ నిర్దేశించింది. రాజకీయ అవసరాల కోసం తమిళానికి భాషా హోదా వచ్చింది. ఈ ప్రమాణాలన్నీ తమిళానికి ప్రాచీన హోదా ఇవ్వడం కోసమే తయారుచేయడం, అందులో ఓ తెలుగు భాషా శాస్తవ్రేత్త ఉండడం విడ్డూరం. ఈ భద్రిరాజు మనకే కాకుండా సంస్కృతం, పాళి, ప్రాకృతంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషలకు కూడా ఇవ్వాలని లేఖ రాయడం మరో వింత. మొత్తానికి తమిళ భాష ప్రాచీన హోదా కొరకు ఓ రాజకీయ ప్రహసనమే పెద్ద ఎత్తున నడిచింది.
తమిళ భాషకు రాజకీయ హోదా ఇవ్వడమే కాదు హిందీ తర్వాత ప్రాధాన్యత ఇవ్వాల్సిన భాషగా పేర్కొనడం మరో రాజకీయం. దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడే భాష తెలుగు. ఆ హోదా కూడా దక్కకుండా చేయడానికి ‘తమిళ తంబిలు’ బాగానే ప్రయత్నం చేశారు. కన్నడాన్ని క్లాసికల్‌గా ప్రకటించకుంటే 86 ఏళ్ల విద్యావేత్త డి.జవరేగౌడ నిరాహారదీక్షకు పూనుకొన్నాడు. అలాగే తెలుగు ప్రాంతంలో డా.సి.నారాయణరెడ్డి మొదలైన పెద్దలు డిసెంబర్ 24, 2005 నాడు ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఓ పెద్ద సమావేశం ఏర్పరిచి అనేక తీర్మానాలు చేశారు. మాతృభాషా సమితి, తెలుగు విశ్వవిద్యాలయం వంటి సంస్థలు విశేషంగా కృషి చేసి దీన్నొక ప్రజా ఉద్యమంలాగా మార్చాయి. ఆ తర్వాత రాజకీయ నాయకుల్లో కదలిక మొదలైంది. ఇలా ఈ పోరాటాన్ని మొత్తం కళ్లకు గట్టినట్లు డా.చెన్నయ్య వివరించారు. అందుకు సంబంధించిన దస్తావేజులను కూడా ఉటంకించారు. ‘మనకు తొమ్మిదవ శతాబ్దిలోనే పండరంగాని అద్దంకి శాసనంలో ఒక తరువోజ పద్యం దొరికింది. ద్విపదకు రెండింతలు తరువోజ. ఒక ఛందోబద్ధమైన పద్యం 9వ శతాబ్దిలో దొరికితే 6వ శతాబ్దంలో కడప జిల్లాలో దొరికిన విప్పర్ల శాసనం ద్వారా తెలుగు సాహిత్య చరిత్ర వెయ్యి సంవత్సరాలకు పైబడినదని తెలుస్తున్నది’ అన్నారు చెన్నయ్య. ఒక భాష, సాహిత్యానికి ఇంత పెద్ద ఉద్యమం చేయాల్సి రావడం - అదీ సాంకేతిక అంశాలను తెరపైకి తేవడానికి ఇలాంటి పోరాటం చేయడం ఆనాటి తెలుగు పాలకులు మనకిచ్చిన వరం అని వ్యంగ్యంగా చెప్పవచ్చు. నెల్లూరు, నంద్యాల, విజయనగరం, తిరుపతి, కర్నూలు, డోన్, వరంగల్, నల్లగొండ, విజయవాడ, ఏలూరులో జరిగిన వివిధ సంస్థలు, వ్యక్తులు చేసిన సుదీర్ఘ పోరాటం, వారి పేర్లతో సహా ఈ పుస్తకం వల్ల చరిత్ర కెక్కింది. ఆఖరుకు రాష్ట్రేతర ప్రాంతాల్లో భాషా హోదా కోసం చేసిన పోరాటం అందులో భాగస్వాములైన వారి యోగదానం మొత్తం ఈ పుస్తకంలో చేర్చారు డా.చెన్నయ్య. ప్రాచీన భాషా హోదా కోసం ఆనాటి అగ్రశ్రేణి సినీ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి జాతీయ పురస్కారం తిరస్కరించడం ఎంత సంచలనమో మనకు తెలుసు. ముందు తరాల భాషా స్ఫూర్తి కోసం ఈ సంచలన వార్తకు ఇందులో చోటు దక్కింది. మొత్తానికి 2008 నవంబర్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన హోదా ఇచ్చింది. ఈ ఉద్యమంలో ‘నడుస్తున్న చరిత్ర’ అనే మాసపత్రిక కృషిని డా.తూమాటి సంజీవరావు గొప్పగా వివరించారు. దాదాపు 80 పుటలు దస్తావేజులను ఈ వ్యాసంలో వారు నిక్షిప్తం చేసి తెలుగు జాతికి అందించారు. ఆయా దస్తావేజుల క్రమమంతా ఏదో ‘సివిల్ సూట్’లో దఖలు చేసినట్లు అంతా ఈ పుస్తకంలో అందించారు. మొత్తానికి ఈ సంస్థల కృషి ఫలించి నాటి కేంద్ర సాంస్కృతిక మంత్రి అంబికా సోని రాష్ట్ర ప్రజలు, రాజకీయ వర్గాల నుండి అభ్యర్థనలు పొందాయి. వాటిని భాషా నిపుణుల సంఘానికి నివేదించాం. తాజాగా ఈ సంఘం తెలుగు, కన్నడ భాషలను ప్రాచీన భాషలుగా గుర్తించవచ్చని సిఫారసు చేసింది’ అని 2008 అక్టోబర్ 31న ప్రకటించింది. అయితే ఇంత ఉద్యమం జరిగినా ప్రాచీన భాష హోదా వచ్చింది గానీ ఇంతవరకు తెలుగు ప్రాంతాలకు కార్యాలయమే రాలేదు. అదే కొసమెరుపు. దాని కోసం కూడా ఈ పుస్తకంలోని పోరాటం స్ఫూర్తిగా నిలవవచ్చు.

డాక్టర్ పి. భాస్కర యోగి 
అంధ్రభూమి అక్షర పుస్తక సమీక్ష 
Published Saturday, 6 May 2017


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి