ముల్లా నసీరుద్దీన్ మంచి హాస్యగాడు. అతనికి ఓసారి పదిలక్షల లాటరీ తగిలింది. ఓ మిత్రుడు వచ్చి ‘‘మీకింత పెద్ద లాటరీ ఎలా తగిలింది?’’ అని ప్రశ్నించాడు. ‘‘నాకు రాత్రి స్వప్నంలో మూడుసార్లు ఏడు నంబర్ కన్పించింది. నేనేమో పద్దెనిమిది నెంబర్‌పై పందెం కాసాను. అంతే! నాకు పది లక్షల లాటరీ వచ్చింది’’ అన్నాడు. ‘‘మూడు ఏడులు కలిస్తే ఇరవై ఒకటి అవుతాయి కదా, మరి నువ్వేమో పద్దెనిమిదిపై పందెం కాసావు. ఇది ఎలా సాధ్యం?’’ అని మిత్రుడు మళ్లీ ప్రశ్నించాడు. ‘‘మీరు ఈ గణాంకాలపై చర్చ చేయండి. నేను లాటరీ అనుభవిస్తాను’’ ముల్లా నసీరుద్దీన్ అన్నాడు. మొన్న వెలువడిన గుజరాత్, హిమాచల్ ఫలితాలపై భాజాపా అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీ ఇలాగే లాటరీ అనుభవిస్తుంటే వారి వ్యతిరేకులు గణాంకాల్లో తలమునకలై ఉంటే, ఇక తెలుగు టీవీ చానళ్లు మాత్రం కోడిగ్రుడ్డుపై ఈకలు పీకుతూ ఎన్నికల ఫలితాలపై చేసిన చర్చ సత్యదూరంగా, పేలవంగా ఉంది.
గతంలో 2014 ఎన్నికలకు ముందే నరేంద్ర మోదీ గద్దెపై ఎక్కొద్దని మన టీవీ చానళ్ళు, పత్రికలు తీవ్రంగా ప్రతిఘటించాయి. కొన్ని పత్రికలైతే పదులకొద్దీ సంపాదకీయాలు రాసాయి. మోదీ అనే వ్యక్తి ప్రధాని పదవి కుర్చీలో కూచోవడం ఏదో అపవిత్ర కార్యం అన్నట్లు ప్రచారం చేశాయి. అలాగే మొన్న యుపి ఎన్నికలు జరిగితే అంతకుముందు తెలుగు చానళ్ళు భాజపాకు, యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారంతో దుమ్మెత్తిపోశాయి. యుపిలో మొదట భాజపా గెలవదని చెప్పి, గెలిచాక మతతత్వంతో భాజపా గెలిచింది అని ముగింపు ఇచ్చారు.
అదే వరుసలో గుజరాత్ ఫలితాలపై తెలుగు ఛానళ్ళు దుర్మార్గపు చర్చను చేపట్టాయి. ‘జో జీతా హై వహీ సికిందర్’ అన్న ప్రజాస్వామ్య సూత్రానికి భిన్నంగా ‘హార్ మే భీ ప్యార్’ (ఓటమిలో గెలుపు)ను ప్రదర్శించాయి. ఉదయం పది గంటలప్పుడు భాజపా కొన్ని స్థానాల్లో వెనుకబడింది అనగానే ‘నరేంద్ర మోదీ దుర్మార్గుడు, దేశంలోని సవాలక్ష సమస్యలకు కారణం ఆయనే. జియస్టీ దుర్మార్గం, నోట్ల రద్దు తెలివితక్కువ పని. భాజపా పతనం ప్రారంభమైంది, మోదీ గ్రాఫ్ పడిపోయింది’ అంటూ ఆస్థాన విశే్లషకులు కువ్యాఖ్యానం మొదలుపెట్టారు.
విచిత్రం ఏమిటంటే నిర్విరామంగా అయిదుసార్లు ప్రభుత్వాన్ని నడిపి ఆరవసారి కొన్ని సీట్లు తగ్గితే అదేదో ‘ఓడిపోయినట్లే’ అని మన చానళ్ళు కలర్ ఇవ్వడం వింత! అందులో పాల్గొన్న విశే్లషకులైతే గెలిచినందుకు కూడా మోదీపై, భాజపాపై దుమ్మెత్తిపోయడం విశేషం. ఓ చానల్ వారి చర్చలో ఓ విశే్లషకుని సూత్రీకరణ ఇంకా వింతగా ఉంది. ‘‘కేంద్రంలో ఎవరు గెలిచినా దక్షిణాది వాళ్ళకు ఒరిగేది లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వని ప్రభుత్వం గెలిస్తే ఎంత? ఓడితే ఎంత?’’ అని మాట్లాడుతూంటే మనం ఏ దేశంలో ఉన్నామో అర్థం కాలేదు.
మరో విశే్లషకుడు ‘‘ఉత్తరాదిలో గెలిచిన బిజెపి దక్షిణాదిన కాలుబెట్టడం అసాధ్యం- అది ఉత్తరాది పార్టీ’’ అని సరిపెట్టాడు. మరో చానల్‌లో ‘‘ప్రధాని సర్వశక్తులు ఒడ్డాడు. అక్రమంగా ప్రచారం చేశాడు. అయినా ప్రధానే స్వయంగా అన్ని ర్యాలీల్లో పాల్గొంటాడా?’’ అని తన మనసులోని భాజపా వ్యతిరేకతను స్వయం ప్రకటిత మేధావి సరిపెట్టుకొన్నాడు.
ఇక యధాలాపంగా కాంగ్రెస్ తరఫున పాల్గొన్న విశే్లషకుడు ‘‘నైతిక విజయం మాదే’’ అన్నాడు. మరో విశే్లషకుడు ‘‘కాంగ్రెస్ పార్టీని కాబట్టి భాజపా దెబ్బకొట్టింది. ప్రాంతీయ పార్టీలను కొట్టమనండి చూద్దాం’’ అన్నాడు.
ఇదంతా వింటుంటే ఇంత సత్యదూరంగా, అసత్యాలతో, అక్కసుతో మన చానళ్ళు ఎందుకు ప్రవర్తిస్తున్నాయి? తెలుగు మాధ్యమాలు ఈ రోజుకూ ఎర్ర కళ్ళతో చూస్తున్నాయన్నది పచ్చి నిజం. వీళ్ళకు జాతీయవాదులన్నా, భాజపా అన్నా ఒళ్ళు మంట. అందుకే ఇలాంటి దుష్ప్రచారానికి తెగబడ్డాయి. మరీ ఇంత ధృతరాష్ట్ర ప్రేమ తగునా? ఈ వ్యాఖ్యానాలకు కారణం?
వీళ్ళ వెనుక ఉన్న లేదా వీళ్ళు వీర విధేయతతో ఆరాధించే నాయకుల వ్యాఖ్యలు చూస్తే తేటతెల్లం అవుతుంది. అసదుద్దీన్ ఓవైసీ ఓ ప్రముఖ హిందీ చానల్‌లో మాట్లాడుతూ ‘‘్భజపా ఓ మిషన్‌లా పనిచేస్తుంది. దానిని ఎదుర్కోవాలంటే రాహుల్, ములాయం, మమతాబెనర్జీ, లాలూ యాదవ్, చంద్రశేఖరరావు, ఓవైసీ’’ కలిసి పనిచేయాలన్నాడు. అంటే దేశ ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాన్ని, అదీ సంపూర్ణ మెజారిటీ ఉన్న పార్టీ నడిపిస్తున్న ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి మోదీ గద్దెనెక్కిన నాటినుండి ప్రయత్నం సాగుతూనే వుంది. ఇనే్నళ్ళు మైనారిటీ సంతుష్టీకరణ ద్వారా ప్రభుత్వాలను నడుపుతూ వచ్చిన కాంగ్రెస్, ఇతర సూడో సెక్యులర్ పార్టీలకు అదే శాపమై ఇపుడు కూర్చుంది. ‘మైనార్టీ’ అనే పదం ఈ పార్టీలు వాడిన వెంటనే మెజారిటీ ఓటు పోలరైజ్ అవుతుంది. అందుకే రాహుల్ గాంధీ గుజరాత్ ప్రచారంలో భాగంగా దాదాపు 28కిపైగా దేవాలయాలను సందర్శించాడు. మరి రేపు ఇతర రాష్ట్రాల్లో అలాగే మెజారిటీ ప్రజల మనోభావాలు గౌరవిస్తాడా?
ముఖ్యంగా మోదీపై అక్కసుతో తెలుగు చానళ్ళు, విశే్లషకులు గెలిచినా విషం గక్కారు. ‘‘2012లో 115 సీట్లు గెలుపొందిన భాజపా ఇపుడు 16 సీట్లు కోల్పోయింది. మిషన్ 150 ప్రయోగం విఫలమైంది’’ అంటూ వ్యాఖ్యలు ఓడినవాళ్లను గురించి చెప్పినట్లు చెప్పడం మన చానళ్ళ వైఖరికి నిదర్శనం.
ఈ చర్చల్లో పాల్గొన్న విశే్లషకుల వింత వ్యాఖ్యానాలకు ‘పట్టపగ్గం’ లేదు. ‘‘పటీదార్, ఒబీసీ, దళిత నేతలైన హార్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకూర్, జిగ్నేశ్ మేవానీల యువ నాయకత్వం కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చింది. పటేర్లకు ఎక్కువ సీట్లు ఇచ్చినా, బిజెపికి ఫలితం దక్కలేదు’’ అన్న వ్యాఖ్యానం వింటే అక్కడ బిజెపి ఓడిపోయి, కాంగ్రెస్ గెలిచిందా అన్న అనుమానం కలుగుతుంది.
‘గుజరాత్‌లో ఈవిఎంల ట్యాంపరింగ్ వల్లనే భాజపా గెలిచింది’ అని హార్దిక్ పటేల్ అన్నాడని అదేదో పవిత్ర వాక్యంలాగా దానిపై వింతైన వ్యాఖ్యలు విశే్లషకులు చేశారు. మరి ట్యాంపరింగ్ చేసి కాంగ్రెస్‌ను 80 సీట్లలో గెలిపించారా? ఇంకో చానల్‌లో మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ గెలుస్తుందన్న మరో విశే్లషకుడు ‘గుజరాత్‌ల భాజపా గ్రాఫ్ తగ్గిపోయిందని, ఇది అసలు గెలుపే కాదన్నాడు’. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి అత్యధికంగా 60 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 49.1శాతం మాత్రమే వచ్చాయి. కానీ కాంగ్రెస్‌కు 33 శాతంనుండి 41.4 శాతానికి ఓటు బ్యాంక్ పెరిగింది అన్నాడు. వెంటనే మరో అడుగు ముందుకు వేసి ‘‘2002 నాటి గుజరాత్ అల్లర్ల సమయంలో జరిగిన ఎన్నికల్లో భాజపా ఓటు బ్యాంక్, కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌లో తేడా గణనీయంగా ఉంది. అప్పుడున్న ఓటు బ్యాంక్ తేడా 10.4 శాతం కాగా, 2012 ఎన్నికలకు వచ్చేసరికి ఈ తేడా 9 శాతానికి, ప్రస్తుతం 7.7 శాతానికి తగ్గిపోయింది’’ అన్నారు. ఎంత కువ్యాఖ్యానం ఇందులో ఉందో చూడవచ్చు!
అంటే మొత్తానికి భాజపా విజయం సాధించినా దానిని పరాజయంగా వర్ణింపజేసిన తెలుగు చానళ్ల భావ దారిద్య్రాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. తమకు నచ్చనివారిపట్ల మనసు నిండా కపటంతో చేస్తున్న ఈ విశే్లషణలో మీడియా పారదర్శకతకు నిదర్శనమా?
ఇలాంటి వామపక్షపాతం తెలుగు మీడియాకు సోకడం ఎంతవరకు సమంజసం. వాస్తవాలను చర్చించకుండా ఎదుటివారిపై ముందే ముద్రించుకొన్న అభిప్రాయాలతో, అవాస్తవాలతో ఎదురుదాడి చేయడం ఏ రకమైన మీడియా సంస్కృతికి అద్దం పడుతుందో పాత్రికేయులైన పెద్దలు కూడా ఆలోచించాలి. ఇలాంటి పక్షపాత వైఖరి ఎలాంటి మార్గంవైపు తీసుకెళ్తుంది?
తీరా గెలిచాక ‘్భజపాది నైతిక ఓటమి’ అన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలను తెలుగు మీడియా చాలా గొప్పగా చూపించింది. అలాగే సురవరం సుధాకర్‌రెడ్డి, సీతారాం ఏచూరి ‘‘ఇలాంటి గెలుపు ప్రమాదకరం’’ అనడం వాళ్లు చెప్పే ఏ ప్రజాస్వామ్య సూత్రం. మోదీని నియంతృత్వ నేతగా వర్ణిస్తున్న కమ్యూనిస్టు పార్టీలు ఉత్తర కొరియా అధ్యక్షుడు ‘కిమ్ జాంగ్ ఉన్’ను హీరోగా భావిస్తూ కేరళలో పోస్టర్లు వేస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన నరేంద్ర మోదీని కమ్యూనిస్టులు, వారి ఆస్థాన మీడియా నియంతగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి కమ్యూనిస్టు పార్టీ కేరళలో నియంత కొరియా అధినేత పోస్టర్ వేస్తే ఒక్క తెలుగు చానలైనా ప్రశ్నించిందా?
ఈ విశే్లషణలో కొన్ని తెలుగు పత్రికలు కూడా ఏం తక్కువ తినలేదు. ‘‘గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో బిజెపి అభ్యర్థి బాబూ బాయ్ బొఖారియా 1,855 ఓట్లతో గెలుపొందగా, అదే నియోజకవర్గంలో నోటా గుర్తుకు 3,433 ఓట్లు పోలయ్యాయి’’ అంటూ మెజారిటీ కన్నా ‘నోటాకే’ ఎక్కువ పోలయ్యాయి కాబట్టి బిజెపి గెలిచినా ఓడినట్లే అని ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించింది.
భాజపా గుజరాత్, హిమాచల్‌లో గెలవగానే ‘‘అసలు ప్రధాని అన్ని ర్యాలీలు తీయడం దుర్మార్గం, అనైతికం’’ అన్నారు. మరి రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల్లో అశ్వమేధయాగాలూ, రాజసూయ యాగాలూ నిర్వహించి వచ్చాడా? ఇది అటల్ బిహారీ వాజ్‌పాయ్ కాలం అయితే మీడియాకు సూడో సెక్యులర్ నాయకుల దుష్ప్రచారానికి కావలసినంత మసాలా ఉండేది. అమిత్‌షా, మోదీలు ఇద్దరూ అన్ని రంగాల్లో ఆరితేరినవారని గుర్తు ఎరగాలి. మరీ ముఖ్యంగా తెలుగు ప్రసార మాధ్యమాల వైఖరిలో మార్పు రావాలి. అప్పుడే మీడియాకున్న పవిత్రతకు విలువ పెరుగుతుంది.

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published Andhrabhoomi, Friday, 22 December 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి