గతంలో గుజరాత్ సముద్ర తీరంలో ఓ సంఘటన జరిగింది. సముద్రం కొస నుండి గుజరాత్ తీరానికి ‘షార్క్ జెల్’ అనే చేపలు వచ్చి కొన్ని నెలలుండి సంతతిని వృద్ధి చేసుకునేవి. అయితే ఆ చేపలకు ఎక్కువ గిరాకీ ఉండడంవల్ల జాలరులు వాటిని పట్టి అమ్ముకొని ఎక్కువ డబ్బు సంపాదించేవారు. అరుదైన ఈ చేపల సంతతిని రక్షించాలని గుజరాత్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తీర ప్రాంతంలో దాదాపు ఆరు నెలలు రక్షణ వ్యవస్థను ఏర్పటు చేసినా ఫలితం కనిపించలేదు. జాలరులు ఎంత కష్టం అయినా ఆ చేపలను పట్టడం మానుకోలేదు. అప్పుడు గుజరాత్ జాలరులనంతా ఒకచోట కూర్చోబెట్టి ఓ ఆధ్యాత్మిక ఉపన్యాసం ఏర్పాటు చేశారు. అందులో అక్కడ పేరుమోసిన ఆధ్యాత్మికవేత్త మురారి బాపు మాట్లాడుతూ ‘‘హిందూ ధర్మంలో ఆడకూతురును ప్రసవానికి తీసుకొచ్చి ఎంతో బాగా చూసుకొంటారు. రకరకాల మిఠాయిలు తినిపించి, క్రొత్త బట్టలు పెట్టి ‘సీమంతం’ చేస్తారు. ఆ స్ర్తి ప్రసవించాక శిశువుకు డోలాహరణం, నామకరణం చేసి పంపిస్తాం. మరి మన గుజరాత్ తీరంలోకి పొదగడానికి వచ్చిన ‘షార్క్ జెల్ ఆడచేపల’ను చంపడం న్యాయమా? ఎక్కడో ఇతర ప్రాంతాలనుండి ప్రసవానికి వచ్చిన ఈ చేపలను చంపడం మన ఆడపిల్లలను చంపడంతో సమానం, కాబట్టి మీరు ఆ పని చేయవద్దు’’ అన్నాడు. అంతే! ఆ రోజునుండి ఆ చేపలను చంపడం జాలరులు ఆపేశాక ఇప్పటికీ ఆ తీరంలో షార్క్ జెల్ చేపలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి.
నైతికత మనిషిని ఇలా కట్టిపడేస్తుంది. దానికి మతం అనేది పైపైన మెరుగు మాత్రమే. లోపల మాత్రం ధర్మమే దాని స్వరూపం. మనిషి చట్టానికి బందీ అవడంకన్నా, నైతిక బంధానికి ఎక్కువ విలువ ఇస్తాడు. ‘‘ఏ దేశమైనా మోరల్ బాండేజ్ లేకుంటే ధ్వంసం అయిపోతాడు’’ అన్నాడు ఓ ఆధునిక మేధావి. హిందూ ధర్మానికి ఆ లక్షణాలు ఎక్కువ. దానినే మనం భారతీయతగా చెప్తాం. ఆ భారతీయతను అనేక రూపాల్లో మనం ధ్వంసం చేయడంవల్లనే బహుళ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ రోజు అవినీతినే తీసుకోండి, ప్రతిరోజూ ఏదో క్రొత్త అవినీతి కథ తెరపైకి వచ్చి పాత అవినీతిని మ్రింగేస్తోంది. అప్పటివరకు జరిగిన చర్చ రూపం మారిపోతుంది. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో అవినీతి కుంభకోణాలు జరిగాయి. నీతిగా ఉండడమంటే ఈరోజుల్లో తెలివి తక్కువతనంతో బ్రతకడం అనేలా అవినీతి రెక్కలు విప్పింది.?
ఓట్లకోసం, అధికారం కోసం అవినీతిని చట్టబద్ధం చేస్తున్న వైనం ఈ సమాజంలోని విలువలు వలువలు ఊడ్చేస్తోందన్నది నిజం. చిన్న స్థాయివాళ్లు లంచం తీసుకొంటే, నాయకులు, బ్యూరోక్రాట్లు పెద్ద ఎత్తున కుంభకోణాలు చేస్తున్నారు. ఒకప్పుడు లంచం తీసుకోవడం నేరంగా, తీసుకొన్నవాళ్లను నేరస్థులుగా చూసేవారు. మరి ఇప్పుడు? లంచం తీసుకోవడం గొప్పతనంగా, అవినీతికి పాల్పడడం హక్కుగా భావిస్తున్నారు. పైగా ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేస్తే అంత ఎక్కువగా ఉచిత ప్రచారం పొందుతున్నారు. దీనిని ‘నెగెటివ్ ప్రచారం’గా లోలోపల మురిసిపోతున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం!? దురదృష్టవశాత్తు మార్క్స్ ‘మతం మత్తుమందు’ అన్నాడు కాబట్టి ఈ దేశ మేధావులు ప్రతి భారతీయ విషయాన్ని ద్వేషించడం మొదలుపెట్టారు. మతాన్ని నైతిక కోణంలో కాకుండా మతాలమధ్య సంఘర్షణగా చూపెట్టారు. దాని దుష్ఫలితమే అవినీతి కారణాల్లో ఒకటి. ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్న ఈ అవినీతి, అభివృద్ధికి ఆటంకం. మన దేశంలో అవినీతిని ‘1988 అవినీతి నిరోధక చట్టం’ లేదా ‘మనీ లాండరింగ్ చట్టం’ ద్వారా నిరోధించి శిక్షించడానికి వీలుంది. అయితే ఈ చర్యకు ప్రభుత్వ అనుమతి అవసరం. ఈ అనుమతులు రాజకీయ వ్యవస్థ నుండి స్వతంత్రంగా ఆదేశించేందుకు లోక్‌పాల్ బిల్లు ప్రతిపాదించింది. గత ప్రభుత్వాల్లో సిబిఐని తమ జేబు సంస్థగా భావించి, ప్రత్యర్థులపై ఉసిగొల్పినవారే ఈ రోజు శారద, నారద కుంభకోణాలను, భూమ్యాకాశాలను మింగిన స్ప్రెక్టమ్, టుజి, త్రీజి, బొగ్గు కుంభకోణాల నిందితులపైకి వెళ్తే గగ్గోలు పెడుతున్నారు. అంతేగాకుండా అక్టోబర్ 2003లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ రూపొందించిన అవినీతి వ్యతిరేక ఒప్పందంపై సంతకం చేసినా, దాని ఆమోదం, అమలుకు అనేక ఆటంకాలు వచ్చాయి. 14 డిసెంబర్ 2005లో 38 దేశాలు ఆమోదించాక ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
అవినీతికి పాల్పడ్డ బడాబాబుల అంతు చూసే చట్టాన్ని స్విట్జర్లాండ్ 2010లో ఆమోదించగానే ఈజిప్ట్ నియంత హోస్నీ ముబారక్, లిబియా నియంత గడాఫీ స్విస్ బ్యంక్ అకౌంట్లన్నీ జప్తు అయ్యాయి. మన దేశంలోని నల్లడబ్బు అంతా స్విస్ బ్యాంకుల్లో ఉందని, వాటిని వెనక్కి తెస్తానని భాజపాను అధికారంలోకి తెచ్చాడు మోది. దానికి ముందడుగా ఓ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడం, నోట్ల రద్దు అని చెప్పినా ప్రజలకు దానిపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. నల్ల డబ్బును దాచుకొన్నవాళ్లు మన దేశంలో రాజకీయ ప్రాబల్యం కోసం వాటిని వాడుకొంటున్నారు. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు మాత్రం లేవు. కానీ అదే యూపిఏ ప్రభుత్వంలో 27 సెప్టెంబర్ 2001న రాహుల్ గాంధీ, ఆయన జీవన సహచరితో కలిసి బోస్టన్‌లోని లోగాన్ విమానాశ్రయంలో 1 లక్షా అరవై వేల డాలర్లతో దొరికినా, వారిని ఎఫ్‌బిఐ కొద్ది గంటల్లోనే వదలిపెట్టిందని డా.సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. భారతీయుల 1.50 ట్రిలియన్ డాలర్ల నల్లధనం స్విస్ బ్యాంకులో ఉండగా, లైచెన్ స్టీన్, వెల్ ఆఫ్ మాస్, కెమాన్, మకావు ద్వీపాలు మన అవినీతిని తమ గర్భంలో దాచుకొన్నాయి. వీళ్లను చూసి దేశమంతా చిన్నా, పెద్దా అందరూ లంచాలమయం చేశారు.
నల్లడబ్బువల్ల వనరుల కేటాయింపు సంక్షోభంలో పడుతుంది. ఈజీమనీ, ఫ్రీ మనీ పెరిగితే హత్యలు, విలాస జీవనం, రియల్ ఎస్టేట్ ప్రభావం ఎక్కువవుతుంది. వ్యక్తులే అధిక ధనవంతులై ప్రభుత్వాలను శాసిస్తారు. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత పెరిగి ద్రవ్యోల్బణం వంటి దుష్పరిణామాలు మన దేశాన్ని పతనం వైపునకు తీసుకెళ్తాయి. విదేశీ ప్రభుత్వాలు, సంస్థలు, ఎన్‌జీవోలు హద్దుమీరి ప్రవర్తించి సమాజంలో ఎలాంటి సంక్షోభాలను, సామాజిక రుగ్మతలను సృష్టిస్తాయో యూపిఏ ప్రభుత్వం కళ్లకుగట్టినట్లు చూపింది.
నల్లధనం డాన్‌లను పెంచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయిస్తుంది. దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సరుూద్ లాంటి వాళ్లు మన దేశంలోని స్టాక్ మార్కెట్లను, రాజ్యవ్యవస్థను నియంత్రించే పరిస్థితి ఏర్పడుతుంది. బినామీలతో పారిశ్రామికీకరణ జరిగి మన దేశ సంపద దోపిడీ అవుతుంది. దేశ సమస్యలకు పారిశ్రామికీకరణ మాత్రమే పరిష్కారం కాదు. అలాగే కేవలం సాంకేతిక పరిజ్ఞానం పెంపొందుతూ, నైతికత ప్రమాదంలో మనం ఎలాంటి దుష్పరిణామాలు ఎదుర్కొంటామో ‘సైబర్ నేరాలను’ చూస్తే తెలుస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామికీకరణ జరిగినంత మాత్రాన అవినీతిపరమైన, పాలనాపరమైన సమస్యలు రాత్రికి రాత్రి పరిష్కారం కావు. అట్లాగని ఇవి జరుగవద్దని కాదు. వీటికి సమాంతరంగా నైతిక ప్రబోధం జరగాలి. రోజురోజుకు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంవల్ల అదే స్థాయిలో కోర్కెల గుఱ్ఱాలు పరుగెత్తుతున్నాయి. ఈ సంక్షోభం మానవుణ్ణి మానసిక, శారీరక స్థాయిల్లో ధ్వంసం చేస్తున్నది. మితిమీరిన భౌతికవాదం వల్ల మనుషుల్లో అశాంతి చెలరేగి చివరకు వ్యవస్థనే ప్రమాదంలో పడే పరిస్థితులు మనమే సృష్టిస్తున్నాం. సాంకేతిక ప్రగతిని సాంస్కృతిక విలువలతో జోడించకపోతే వ్యష్టిగా, సమష్టిగా మనకు మనమే గోతిని త్రవ్వుకున్నవాళ్లం అవుతాం. భౌతిక ప్రగతి దురాశగా మారవద్దని, దేహం, ధనం శాశ్వతం కాదని మన భారతీయ ధర్మశాస్త్రాలు ప్రబోధించాయి. భారత వేదాంత శాస్త్రాలన్నీ రెండు విషయాలపై ఎప్పుడూ యుద్ధం చేయమన్నాయి. ఒకటి- అహంకారం, రెండు-మమకారం. ‘అంతా నేనే’ అన్నది అహంకారం. అన్నీ నాకే కావాలనుకోవడం మమకారం. ‘అహంకారం’లోనే కులం, మతం, పదవి, అధికారం, రూపం, గుణం, ప్రాంతం, భాష.. అన్నీ సమ్మిళితమై ఉంటాయి. ఇది మనిషిలో ప్రజ్వరిల్లినప్పుడల్లా వాటినే ఆసరాగా చేసుకొని అధికారం అనే అహంకారం పొందడానికి ప్రయత్నిస్తారు. తనకున్న వాటితో తృప్తిపడక అన్నీ నాకే కావాలి, అందరివీ నావే అన్న భ్రాంతిలో జీవిస్తారు. అలాగే ఇది దురాశకు దారితీస్తుంది. ఈ అవలక్షణం ఏదో విధంగా సంపదను ప్రోగుచేయిస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించని భారతీయులు అశాంతిలో మునిగే ఆశల సౌధాలు నిర్మిస్తుంటే, ఎందరో పాశ్చాత్యులు భారతీయతవైపు అడుగులేస్తున్నారు.
2012లో సుప్రసిద్ధ హాలీవుడ్ నటీమణి జూలియా రాబర్ట్స్ తన భర్త, పిల్లలతో కలిసి ‘హిందూమతం’ స్వీకరించింది. ‘వ్యక్తిగత సంతృప్తి’ని పొందడానికి హైందవ విలువలే నాకు మార్గదర్శనం అంటూ ఆమె ప్రకటించింది. ఈ రోజుకు తిరువణ్ణామలై వెళ్తే అక్కడ పాశ్చాత్యులు నెలల తరబడి ధ్యానంలో ఉంటారు. మహర్షి జీవించి ఉన్నప్పుడు వచ్చిన పాశ్చాత్య పాత్రికేయుడు పాల్ బ్రంటన్ మొదలుకొని ఈరోజు వరకు ఎందరో మహర్షి బోధనలు అనుసరిస్తున్నారు. ఇక్కడ మాత్రం హైందవ మతాన్ని కులంతో అంటగట్టి అరిగిపోయిన రికార్డులతో రాజకీయ, సామాజిక పబ్బం గడుపుతున్నారు. హిందూ జీవన వ్యవస్థలోని త్యాగం, నిస్వార్ధబుద్ధి, వైరాగ్యం, కుటుంబ వ్యవస్థలను తుంగలో త్రొక్కే వ్యవస్థను పెంచేస్తున్నారు.
జ్ఞానమే సమాజపు పైపొరలో ఉండాల్సిన స్థితినుండి సంకుచిత భావాలతో స్వార్థ ప్రపంచాన్ని సృష్టించుకొంటున్నాం. అత్యున్నత విలువలు పెంపొందించకుండా అస్తిత్వాల అడుగుల్లో పడి చస్తున్నాం. విపరీతమైన ధనదాహంతో నాలుగు రాళ్లు వెనకేసుకోవడం దగ్గరనుండి నాలుగు తరాలు కూర్చుని తినే డబ్బును ప్రోగేసుకుంటున్నాం. లేకపోతే సామాజిక సంపద అయిన డబ్బు కొందరి చేతుల్లో ఎందుకుందంటే సనాతన భారతీయ జీవన మూల్యాలు తెలియకపోవడమే. విచిత్రం ఏమిటంటే ఈ ప్రవాహంలో భారతీయులంతా కొట్టుకుపోతుంటే డబ్బు ప్రోగేసుకున్న నల్లకుబేరులే విలువల భారతానికి స్పాన్సర్స్‌గా ఉండడం!
ఈ దుస్థితికి మందు ఒక్కటే! భారతీయ వేదాంతసారం నుండి పురుడు పోసుకొన్న త్యాగం, నిస్వార్థం, హితచింతన, ఏకాత్మ మానవతావాదం, జ్ఞాన సమాజం వంటి ధార్మిక లక్షణాలను జాతిలో నింపడమే! దిగజారుతున్న మానవీయ విలువలు, పెరిగిపోతున్న అవినీతిని అంతం చేయాలంటే సాంకేతిక ప్రగతితోపాటు సాంస్కృతిక వికాసం ఈ దేశానికి అందించడమే తక్షణ తరుణోపాయం.

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published Andhrabhoomi,  Thursday, 16 November 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి