‘‘ఓదేశాన్ని పాలించే రాజు తలకు చేతులు పెట్టుకొని కూర్చున్నాడట. ప్రక్కనే ప్రధానమంత్రి ‘‘మహారాజా! దేశ దేశాలను జయించిన మీరు ఎందుకు చింతాక్రాంతులై ఉన్నారు’’ అడిగాడు. రాజు సమాధానం ఇస్తూ ‘‘మంత్రివర్యా! ఈమధ్య నాకో అనుమానం మొదలైంది. ప్రపంచంలో అందరూ భార్యకు భయపడుతారా! నేనొక్కడినేనా? ఆలోచించి చెప్పండి’’ అన్నాడు. ‘‘లేదు రాజా! భార్యకు భయపడనివాడు ఎవ్వడూ లేడు. నేను చెప్పేది నమ్మకపోతే మనదగ్గర 20 మంది మంత్రులున్నారు; వాళ్లను కూడా అడగండి’’ అని మంత్రులతో సమావేశం పెట్టి ఈ విషయంపై ఆలోచించమన్నాడు ప్రధాని. మరుసటి రోజు ఉదయం దర్బారులో రెండు వైపులా ఇరవై, ఇరవై కుర్చీలు వేసి భార్యకు భయపడేవారు ఒకవైపు, భయపడనివారు ఇంకోవైపు కూర్చోమన్నారు. 19 మంది భయపడే వరుసలో కూర్చోగా, ఒక మంత్రి భయపడని వరుసలో కూర్చున్నారు. ఆ ఒక్కమంత్రి గట్టిదనంలోని రహస్యం కనుక్కొందామని ‘మీరు ఎందువల్ల భయపడడంలేదో చెప్పండి’ అన్నారు. ‘‘ఏమీ లేదు రాజా! నిన్న ప్రధాని చెప్పిన విషయం నా భార్యతో చెప్తే- ‘నీవు అవతలి వరుసలో కూర్చుంటే నీ వీపులు పగులగొడతా!’ అన్నది. అందుకే ఈ వరుసలో కూర్చున్నా’’ అన్నాడట! ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షాలన్నీ ఇదే మానసిక స్థితిలో వున్నాయి.
తెలంగాణ మేమే ఇచ్చాం, తమతోనే వస్తాడనుకున్న కాంగ్రెస్‌కు కెసీఆర్ ఢిల్లీలో కుటుంబంతోపాటు సోనియాతో ఫొటోలు దిగేవరకు మాత్రమే ఆ ఆనందం మిగిల్చాడు. ఆ తర్వాత తన రాజకీయ చతురతతో కాని కాంగ్రెస్ వాళ్లకు కెసిఆర్ ఇచ్చిన షాక్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిన మాట వాస్తవం. డి.శ్రీనివాస్ లాంటి నేతలు టిఆర్‌ఎస్‌లో చేరడం, ఒకే సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆ పార్టీలో మిగలడం వాళ్లకు మరో విషాదం. దురదృష్టమేమిటంటే కాంగ్రెస్ పార్టీ గతంలో మాదిరిగానే ‘ఎండ్రకాయ గుంజుడు’ సిద్ధాంతంతో బాధపడుతోంది. సభలో ఏ విషయమైనా తడుముకోకుండా అనర్గళంగా మాట్లాడే కెసిఆర్ మాటల చతురత ముందు టిపిసిసి అధ్యక్షుడు తేలిపోతున్నాడన్నది కఠోర సత్యం. కెసిఆర్ వ్యూహాలముందు, ఆయన అనుచరుల దూకుడు ముందు ఉత్తమ్ సరైన ప్రతివ్యూహం ఉరకలెత్తించే ఉత్సాహం క్యాడర్‌లో పుట్టించలేకపోతున్నాడని పార్టీ నేతలే చెవులు కొనుకొంటున్నారు. ఇక జానారెడ్డి ధర్మరాజు పాత్రనో, విదురుని పాత్రనో తెలుసుకోవాలంటే మళ్లీ మహాభారతం చదవాల్సిందే! జానా అంటే గిట్టనివాళ్లు అది శల్య సారథ్యం అని కూడా ఆడిపోసుకొంటున్నారు. డి.కె.అరుణ, మల్లు భట్టివిక్రమార్క, సంపత్, వంశీచంద్ ఎంత కబడ్డీ ఆడుదామన్నా వారి ముందరికాళ్లకు బంధమే!?
ఇక అసెంబ్లీ బయట విహెచ్‌లాంటి ‘మాస్’ లీడర్ ఎంత లొల్లి చేసినా కెసిఆర్ తర్కబద్ధ వ్యవహారంతో అది గాలిలోనే తేలిపోతున్నది. జైపాల్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు అప్పుడప్పుడు ‘కెసిఆర్ రహస్యాలు’ నేను బయటపెడతా అన్నట్లు రావడం, అది గంగలో మునిగి గరిటె బయటకు తెచ్చినట్లు ఉండడంవల్ల తెరాసకే లాభం అవుతోంది. ఏళ్లనుండి రాజకీయాల్లో ఉన్న జైపాల్ తెలంగాణకు గానీ, పాలమూరుకుగానీ, పురిటిగడ్డ మాడ్గుల్‌కు గానీ పెద్దగా చేసిందేమీ లేదు. అద్భుతమైన ఆంగ్లం మాట్లాడడం తప్ప! షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి అప్పుడప్పుడు ప్రకటనలకే పరిమితం. మొన్న రిజర్వేషన్ బిల్లు మండలిలో చర్చ చేస్తున్న సందర్భంలో కెసిఆర్ ముందు షబ్బీర్ అలీ వినయం ఎంత గొప్పగా వుందో? కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు, జగ్గారెడ్డి తమ కార్యకలాపాలు తగ్గించారు. కెసిఆర్ కంట్లో నలుసుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ స్వతంత్ర సేనానులే. వారు గట్టిగానే ఉన్నా నల్లగొండ వరకే పరిమితం అయ్యారు. ఇటీవల రిజర్వేషన్ బిల్లుపై గట్టిగా మాట్లాడిన జీవన్‌రెడ్డిని తగ్గించడానికి ఆయన నియోజకవర్గంలోనే కెటిఆర్ సభ పెట్టడం ఓ హెచ్చరికనే. ఇలా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి వేస్తన్నారు. దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ లాంటి తెరాస నుండి వచ్చిన వలసనేతలు కాంగ్రెస్‌లో తమ ‘గాడ్‌పాదర్ల’ను ఇంకా సృష్టించుకోలేదు. దిగ్విజయ్‌సింగ్ వేయించిన తప్పటడుగులు కుంతియానైనా సరిచేస్తారా చూడాలి. 2019లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు కలే అని ఉత్తరభారతం ఘోషిస్తుంటే, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ రాహుల్ గాంధీకి ఆక్సిజన్‌గా మారుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకమే!
తెలంగాణ తెలుగుదేశంలో రేవంత్‌రెడ్డి గట్టి నాయకుడే! ఓటుకు నోటు కేసు తర్వాత అతని గ్రాఫ్‌ను కెసిఆర్ ఎప్పటికప్పుడు తగ్గిస్తున్నాడు. అసెంబ్లీలో నోరుతెరవకుండా ముందే సస్పెండ్ చేయడంవల్ల రేవంత్ వాదన విన్పించే అవకాశం లేకుండా పోతున్నది. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి మీదనే పోరాటం చేసిన రేవంత్‌రెడ్డి కెసిఆర్ తనకెంత అనుకొంటున్నాడు. కానీ కెసిఆర్ రాజకీయ రంగంలో ‘మత్తగజం’లాంటివాడు. యుద్ధరంగంలో మత్తగజం తాను యుద్ధానికి మాత్రమే నేరుగా వెళ్లదు. పోతూ పోతూ శత్రుసైన్యాన్ని తొక్కేసుకుంటూ వెళ్తుంది. రేవంత్‌రెడ్డి ప్రయివేటుగా కెసిఆర్‌తో ఎలా ఉంటాడో చెప్పలేం కాని బయట మాత్రం ధీటుగానే కన్పిస్తున్నాడు. అందుకే కొందరు కాంగ్రెస్ నాయకులు చెబుతున్న ‘బాహుబలి-2’ రేవంతే అని గుసగుసలాడుకొంటున్నారు. సోషల్ మీడియాలో అయితే రేవంత్‌రెడ్డి భాజాపాలోకి వెళ్తాడని విస్తృత ప్రచారమే సాగుతున్నది. తన సామాజిక వర్గానికి చెందిన అన్ని పార్టీల నాయకులను భాజపాలోకి తీసుకెళ్లి కెసిఆర్‌కు బలమైన వ్యతిరేక వర్గాన్ని తయారుచేసే సత్తా రేవంత్‌రెడ్డికి ఉందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఈ అమిత్‌షాలు, మోదీలు మమ్మల్ని ఏమీ చేయలేరని తెరాస నాయకులు చెబుతున్నా భాజపా అంటే తెరాసకు లోలోపల భయం ఉన్నది నిజం. మరి అగ్నికి ఆజ్యం తోడైనట్లు రేవంత్‌రెడ్డి భాజపాలోకి వెళ్తే..?! తెలుగుదేశంలో నామమాత్రంగా మిగిలిన మోత్కుపల్లి, ఎల్.రమణ, సండ్ర అందరూ రేవంత్ రెడ్డి వెళ్లేదారి పడతారా? ఎందుకంటే కెసిఆర్ వ్యూహం ముందు తెలంగాణ తెలుగుదేశం నిలదొక్కుకోవడం కష్టమే.
తెలంగాణ భాజపా ఏదో అద్భుత ప్రయోగం చేయబోతోందని ప్రచారం నడుస్తున్నది. అది 2019కి పనికివస్తుందా! 2024కి పనికివస్తుందా అని చెప్పే జ్యోతిష్యులు మాత్రం ఎవరూ లేరు. యుద్ధానికి తగిన రంగం సిద్ధం చేయకుండా వేసే ఎత్తుగడలు ‘ఏటిలో పిసికిన చింతపండే’ అని తెలంగాణ భాజపా గ్రహించాలి. యుపిలాంటి వ్యూహాత్మక పరిణామాలు జరిగితే భాజపాకు కలిసివస్తుంది.
ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలది మరో దుస్థితి. సిపిఎం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించగా, సిపిఐ మద్దతిచ్చి పెద్దగా సాధించింది ఏమీ లేదు. రాఘవులు, నారాయణ మాటలు పట్టించుకొనేవారు లేరు. చాడ వెంకటరెడ్డి పాత్ర పరిమితం. కేసిఆర్ వాళ్లకన్నా ముందు ‘నేనే కమ్యూనిస్టును’ అంటుంటే నిజమైన కమ్యూనిస్టులకు ఏం మాట్లాడాలో తెలియడంలేదు. ఇటీవల పాదయాత్రతో తమ్మినేని వీరభద్రం తెలంగాణ వ్యతిరేక అపప్రథను తొలగించుకోవాలని ఆరు నెలలు నడిచాడు. చివరకు ‘సమర సమ్మేళనం’ పేరుతో కేరళ ముఖ్యమంత్రిని ముఖ్య అతిథిగా పిలిచి పెద్దసభ పెట్టారు. లాల్-నీల్ జెండా అన్నారు. ఇక్కడే కెసిఆర్ అలర్ట్ అయ్యాడు. ముఖ్యమంత్రిగా వచ్చిన ముఖ్య అతిథి పినరయ్ విజయ్‌ను తన ఇంటికి పిలుచుకొని విందు భోజనం పెట్టాడు. ఇక్కడి సకల జనుల సర్వే మొదలుకొని సాదా బైనామాల వరకు విజయ్‌కు ఆసక్తిగా వివరించాడు. తన ఆసనంలో కూర్చోబెట్టి గౌరవించాడు. మరుసటి రోజు పత్రికల్లో విజయన్ సమర సమ్మేళనంలో మాట్లాడిన చిత్రం ఓ వైపు, కెసిఆర్ విందులో పాల్గొన్న చిత్రం మరోవైపు కన్పించగానే జనం బ్యాలెన్స్ అయ్యారు. ఆయన కూడా కెసిఆర్‌ను పెద్దగా విమర్శించకుండా సురవరం సుధాకర్‌రెడ్డి, సీతారాం ఏచూరిలా నరేంద్ర మోదీని, మతతత్త్వాన్ని తిట్టిపోయాడు. ఆ పడికట్టు పదాలు ఇక్కడెవరికి ఎక్కలేదు. ఒక్క విందు భోజనంతో ఆర్నెల్లు బొబ్బలెక్కిన కాళ్లకు బర్నాల్ పూసినంత పని చేశాడు కెసిఆర్.
కెసిఆర్ దృష్టిలో పార్టీల పరిస్థితి ఇలా వుంటే పేపర్ పులుల్లాంటి మేధావి వర్గం ఒకటి ఉంది. వాళ్లు మంది ఎక్కువ జమ అయితే దానిని పోరు సభ అంటారు. ఆ నలుగురే ఉంటే రౌండ్ టేబుల్ సమావేశం అంటారు. వరవరరావు, హరగోపాల్, కోదండరాం, రామయ్య లాంటివాళ్లు అప్పుడపుడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై ప్రభుత్వం ఏం చేయాలో చెప్తుంటారు. కోదండరాం మూడేళ్లు వేచి చూసి కళ్లు తెరిచేసరికి ఇక్కడ కలియుగం రెండుసార్లు గడిచిపోయింది. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పోరాటం ఆ ప్రాంతానికే పరిమితం కాగా, సుధీర్ కమిటీ సిఫార్సులపై జిల్లా సభలపై జేఏసిలోని బీసీ వర్గాలే పెదవి విరిచాయి. ఇక నిరుద్యోగ ర్యాలీ సఫలం కాకపోగా ఉన్న ధర్నాచౌక్‌ను మ్రింగేసింది. జెఏసి రెండు ముక్కలైంది. హరగోపాల్ పడికట్టు పదాలైన జనం, తిరుగుబాటు, ప్యూడలిజం, నియంతృత్వం సామాన్యులకు అర్థం కావు. దత్తాత్రేయ అలయ్ బలయ్‌లో సన్మానం పొందే రామయ్య అదే దత్తాత్రేయకు వ్యతిరేకంగా రోహిత్ వేముల సంతాప సభలో మాట్లాడగలడు. ఇందిరా పార్కు ధర్నాలో కెసిఆర్ వ్యతిరేక సభలో కన్పించి, మరుసటి రోజు కేసిఆర్ ప్రతిభకు అభినందన తెలుపగలడు. ఇదిగో ఈ ఆనుపానులన్నీ.. ఈ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ కేసిఆర్‌కు తెలుసు. అందుకే తన బలంతోపాటు ప్రతిపక్షాల బలహీనతలను కూడా తెలివిగా వాడుకొంటున్నాడు. తన రాజకీయ ప్రస్థానం సాఫీగా సాగించకుండా తన దారికి అడ్డుగా వస్తున్న ప్రతిపక్షాల ఆనవాలును మూలమట్టంగా పెరికివేయాలనుకుంటున్నాడు. అందుకే తెలంగాణకు సమర్థుడైన ప్రతిపక్ష నాయకుడు కావాలి!!?

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published Andhrabhoomi, Friday, 6 October 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి