ఓ ఆశ్రమం వాకిట్లో సన్యాసి కూర్చునివుంటే తన ముందు నుంచి ఓ నీడ పరిగెత్తుతున్నట్టు అనిపించింది. ఆ నీడను ఆపి ‘నీవుఎవరు?’ అని ప్రశ్నించాడు సన్యాసి. ‘నేను మృత్యుదేవతను.. పక్కనున్న నగర జనాన్ని ప్లేగు వ్యాధితో చంపడానికి వెళ్తున్నాను’ అంది ఆ నీడలాంటి ఆకారం. ‘ఎంతమందిని నీవు చంపబోతున్నావు?’ అని సన్యాసి ప్రశ్నిస్తే- ‘దాదాపు పదివేల మందిని..’ అని మృత్యుదేవత చెప్పింది. ఓ పదిరోజులయ్యాక అక్కడ ప్లేగు వ్యాధితో 50వేల మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అదేరోజు సాయంత్రం ఆశ్రమం ముందునుండి మృత్యుదేవత వెళ్తుంటే సన్యాసి గట్టిగా గదమాయించి ‘నాకు పదివేల మందిని మాత్రమే చంపుతానని చెప్పి, 50వేల మందిని చంపుతావా?’ అని నిలదీస్తే ‘ఓ సన్యాసీ! నేను 10వేలమందిని మాత్రమే చంపాను. నా భయానికి మిగతా 40 వేల మంది మరణిస్తే నేనేం చేయాలి?’ అని మృత్యుదేవత వాపోయిందట! సరిగ్గా తెలంగాణలో ఇప్పుడు ఇలాంటి రాజకీయ పరిణామం నడుస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజాకర్షణ, ఆయన అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలతో ప్రతిపక్షం బెంబేలెత్తుతోంది. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, సమాజాన్ని చైతన్యం చేసే ప్రజాసంఘాలు, ప్రసార మాధ్యమాలు, మేధావులు.. అందరూ సమాజానికి అవసరమే. కానీ, దురదృష్టవశాత్తూ ‘సబ్బండవర్గాల’ ఉద్యమంతో తెలంగాణ సాధిస్తే అవన్నీ ఒక్కొక్కటిగా నిర్వీర్యం కావడం గమనార్హం.
వందల ఏళ్ల నిరంకుశ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. తమ అస్తిత్వాన్ని పోగొట్టుకున్నా, తమ లోలోపల రగిలే జ్వాలను మాత్రం చల్లార్చుకోలేదు. ఆదివాసీలు, గోండుల నుండి ఓ కొమురం బీం, రాంజీ గోండు అడవుల్లో ఎదురు తిరిగితే, హైదరాబాద్ నడిబొడ్డున షోయబుల్లాఖాన్ ఉద్యమించి రజాకార్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ వారసత్వం ఈనాటికీ తెలంగాణ ప్రజల్లో ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఎంత అమాయకులో అంత పోరాటపటిమ గలవాళ్లు. నిజాం రాజు నుంచి విముక్తి చెందాక, సమైక్య పాలనలో తెలంగాణ మోసానికి గురైందని 1969 ఉద్యమం, 2000 నుండి మలి దశ ఉద్యమం ప్రారంభమైంది. ఎందరో త్యాగాలు, బలిదానాలు, పోరాటాలు చేస్తే మొత్తానికి తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. తెలంగాణ వచ్చాక కూడా అణచివేత ధోరణి కనిపిస్తోందన్న ఆరోపణలు కొన్నాళ్లుగా జోరందుకున్నాయి. ఇక్కడి ప్రత్యేక అస్తిత్వాలన్నీ ఏదోరకంగా కనుమరుగవుతున్నాయన్న వ్యాఖ్యానాలూ లేకపోలేదు. మంద కృష్ణమాదిగ చేపట్టిన అస్తిత్వ ఉద్యమంలో ‘దళిత గౌరవం’ హక్కులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎమ్మార్పీఎస్ పేరిట మంద కృష్ణ ఊరూరా ‘దండోరా’ మోగించాడు. తెలంగాణ వచ్చాక వర్గీకరణ కోసం అతను కొంత భాజపాకు దగ్గరయ్యాడు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తే మంద కృష్ణపై భాజపా తన అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ విషయాలు గమనించిన కేసిఆర్ ‘మంద’కు ప్రత్యామ్నాయంగా కొందరు నాయకులను తయారుచేశాడని విమర్శకులు అంటారు. వంగపల్లి శ్రీనివాస్, యాతాకుల భాస్కర్ వంటి నేతలు మందకృష్ణను గట్టిగా నిలువరించే ప్రయత్నం ఇదే అని చెప్తారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఈరోజు ఎంపీ అయిన బాల్కసుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, పిడమర్తి రవి వంటి విద్యార్థి నాయకులు తెలంగాణ దళిత అస్తిత్వానికి కొత్త ప్రతినిధులుగా మారడం ఇందులో భాగమే. మొత్తానికి ఈ ప్రభావమంతా దళిత అస్తిత్వ తీవ్రతను తగ్గించిందని కూడా చెప్తారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఏళ్లుగా మంద కృష్ణమాదిగ పోరాటం పోసి, ఆఖరుగా భాజపా నాయకుల మద్దతు కూడగట్టి ఓ కొలిక్కి తెచ్చే సమయంలో కేసిఆర్ దానిని హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తే- తెలంగాణ భాజపా నాయకులు అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి.
ఇక, ఎస్టీ ఉద్యమాల విషయానికి వస్తే తేజావత్ బెల్లయ్య నాయక్ వంటివారు తెలంగాణ ఉద్యమంలో ముందుండి, ఆ తర్వాత బలహీనపడ్డారు. ‘తండాలను గ్రామ పంచాయితీలుగా మారుస్తాం’ అన్న కోరికను ప్రభుత్వం సజీవంగా పెట్టి మూడేళ్లు గడిపింది. గిరిజన రిజర్వేషన్లను ముస్లిం రిజర్వేషన్ల బిల్లుతో కలిపిపెట్టి దానిని మరో ఎస్సీ వర్గీకరణ సమస్యలాగ మారుస్తారా? అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు రావాల్సిన రిజర్వేషన్లను రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చే ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెడితే సహించేది లేదని బిజెపి నేత కిషన్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పనే చెప్పాడు. రేపు ఈ రెండు బిల్లులూ ఆగిపోతే నెపం కేంద్రంపై నెట్టేసి ప్రశాంతంగా ఉండి, ఓట్లు అడగవచ్చని కేసిఆర్ వ్యూహం కూడా కావచ్చు. ఎస్టీల ఆరాధ్య గురువైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వమే నిర్వహించి, ‘ఇది మా ప్రభుత్వమే’ అన్న సకారాత్మక దృక్పథంతో గిరిజనులను దెబ్బతీసే వ్యూహం కూడా ఇందులో ఉందని అంటారు.
తెలంగాణలో 52 శాతానికి పైబడి బీసీ జనాభా ఉంది. ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ పుణ్యమాని ఎంతోమంది బీసీలు నాయకులుగా ఎదిగారు. మండల వ్యవస్థ, పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దు వల్ల మండల్ కమిషన్ కన్నా ముందే జరగడంతో బీసీలకు లాభం వచ్చింది. ఆనాడు తేదెపాలో ఎదిగిన నేతలంతా ఈరోజు తెరాసాలో చక్రం తిప్పుతున్నారు. రాష్ట్ర విభజన జరగక ముందు నుంచీ బీసీ ఉద్యమాన్ని ఆర్‌కృష్ణయ్య గత ముప్పై ఏళ్లకు పైబడి చేస్తూనే ఉన్నాడు. 2014 ఎన్నికల్లో తెదేపా ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆయన గుర్తింపంతా బిసి ఉద్యమనేత గానే. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మెల్లమెల్లగా బిసీ ఉద్యమం చల్లారిపోతోంది. కొండా లక్ష్మణ్ బాపూజీ, కేశవరావ్ జాదవ్ వంటినేతలకు తెలంగాణ సాంస్కృతిక పథంలో పెద్దగా స్థానం లభించలేదు. చాకలి ఐలమ్మను, సర్వాయి పాపన్నను ఒక్కో కులానికి పరిమితం చేసి వదిలేశారు. బీసీలకు మొత్తం ప్రతినిధిగా ఉన్న ఆర్.కృష్ణయ్య నరుూం కేసులో పోలీసులు ప్రశ్నించారు. ‘సెమీ ఫైనల్’గా ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో నడుస్తున్న బీసీ సంఘాన్ని నిట్టనిలువునా చీల్చారు. ఇదంతా పాలకులకు సంబంధం లేకుండా జరిగినా, బీసీ అస్తిత్వం నిర్మూలన కేసిఆర్ వైపే వేలు చూపిస్తున్నదా? అనే అనుమానాలున్నాయి. దీనికి కారణం ఇటీవల ప్రవేశపెట్టిన ముస్లిం రిజర్వేషన్ బిల్లు. 52 శాతానికి పైగా ఉన్న బీసీలను ఎంబీసీలుగా విభజించారు. బిసీలకు రిజర్వేషన్లను పెంచకుండా ఎస్సీ, ముస్లిం రిజర్వేషన్ బిల్లుమాత్రమే శాసనసభలో పెట్టారు. బిసీల్లో అగ్రభాగాన ఉన్న ‘ఎ’ గ్రూపునకు లేనంతగా- 12 శాతం రిజర్వేషన్లను ముస్లింలు పొందితే- బీసీ కులాల అస్తిత్వం ఇంకెక్కడ బతుకుతుంది? బిసీ కమిషన్‌ను ముస్లిం రిజర్వేషన్‌ను ఇవ్వడానికి ఉపయోగించుకోవడం ఎంతవరకు సబబు? అనే ఆలోచన బీసిల్లో ప్రారంభమైంది. బీసీల కోసం రచనలు చేసిన బి. ఎస్.రాములు ఈ వ్యూహంలో అస్త్రంగా ఉపయోగపడడం మరో విడ్డూరం.
మైనార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల కులాల పేరుతో గురుకులాలు ఏర్పాటైతే చిన్ననాటినుండే వాళ్లలో కులతత్వం పెరిగిపోయి భవిష్యత్తులో కులాల సంఘర్షణ కలిగే అవకాశం లేకపోలేదు. అయినా, తెలంగాణ ఉద్యమంలో- ‘కులాలకతీతంగా’ నిర్బంధ విద్య అమలు చేస్తామని కేసిఆర్ చెప్పినపుడు అందరం సంతోషించాం. కానీ, ఇప్పుడు జరుగుతున్నది.. భవిష్యత్తులో జరగబోయేదీ కులాల సంఘర్షణనే. రిజర్వేషన్ల విషయంలో ముస్లింలను బీసీల్లో చేర్చిన నాటి, నేటి పాలకులు- బీసీ, మైనార్టీలకు గురుకులాలు వేర్వేరుగా ఎందుకు స్థాపిస్తున్నారు? అంటే సమాధానం చెప్పలేరు. మొత్తానికి బిసీ అస్తిత్వ వాదం అనేక కోణాల్లో ఈనాడు ప్రశ్నార్థకమైంది. మావోయిస్టు మేధావులు,కళాకారులు, రచయితలంతా దాదాపుగా తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికారు. అందులో ఇప్పుడు చాలామంది కేసిఆర్ అనుకూలురుగా ఉన్నారు. నక్సలైట్ల ఎజెండానే తన ఎజెండా అన్న కేసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న మాట వాస్తవం. దానికి ఆకర్షితులైన ఈ కవులు, కళాకారులు తమ అస్తిత్వాన్ని పదవుల రూపంలో నిర్వహిస్తున్నారు. చుక్కా రామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, వరవరరావు, గద్దర్, విమలక్క లాంటి వాళ్లంతా పత్రికలకే తమ అస్తిత్వాన్ని పరిధిగా చేసుకున్నారా? వీళ్లందరి ఈ స్థితికి కారణం ఏమిటి? తెలంగాణ ఉద్యమంలో ‘గొంగళి పురుగు’నైనా ముద్దాడుతానని చెప్పిన కేసిఆర్ ఆ సమయంలో ఆలె నరేంద్రతో పాటు కేంద్ర ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి వెళ్లి సంఘ్‌పెద్దల మద్దతు కూడగట్టారు. ఆ తర్వాత ఎప్పుడూ ‘సంఘ్’ను రాసుకోలేదు, పూసుకోలేదు. దేశపతి శ్రీనివాస్, రమణాచారి తదితరుల సాయంతో ఆధ్యాత్మిక సంస్కృతిని కెసిఆర్ బాగానే పెంచుతున్నారు. బ్రాహ్మణ సంక్షేమానికి వందకోట్లు కేటాయించడం మంచి పరిణామమే. బ్రాహ్మణ అస్తిత్వమంతా నిజంగా చరిత్రలో ఎన్నడు లేనంతగా కేసిఆర్ తన చుట్టు తిప్పుకోగలిగాడు. అయితే- చిన్నజీయర్ స్వామిని, పరిపూర్ణానంద స్వామిని ఆకర్షించే కార్యక్రమాలు చేయడంతో ఇక్కడ హిందుత్వ అస్తిత్వం పలుచనైంది.
కులపరంగా తెలుగు ప్రాంతాన్ని పాలించిన కమ్మ, రెడ్లు ఈరోజు తెలంగాణలో పాలకవర్గంలో పెద్దగా లేరు. కమ్మలు ఆంధ్రాకే పరిమితం కాగా రెడ్లు మాత్రం కాంగ్రెస్‌కే ఎక్కువగా పరిమితమయ్యారు. వాళ్లు రాజకీయ అస్తిత్వం నిలబెట్టుకోవాలనే మాకూ ‘మధ్యలో ఓ బాహుబలి’ వస్తాడని కాంగ్రెస్ వారు చెప్పుకుంటున్నారు. ‘బాహుబలి వచ్చాడు.. ఆయనే కేసిఆర్’ అని తెరాస వారు చెప్తున్నారు. తెలంగాణలో రెండు వర్గాల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోందని విశే్లషకుల అంచనా. ఈ విద్యలన్నీ కాంగ్రెస్ సిఎం వైఎస్‌ఆర్ నేర్పినవే. ఆనాడు ఇతర పార్టీలలోని రెడ్లనంతా వైఎస్ లాగేశాడు. ‘నీవు నేర్పిన విద్యయే..’ అంటూ కేసిఆర్ అవే వ్యూహాలు పన్నుతున్నాడు.
కెసిఆర్ సజీవ అస్తిత్వాలను మాత్రమే కాదు, భౌగోళిక అస్తిత్వాలను సైతం తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. పెద్దపెద్దగా వున్న జిల్లాలను విడగొట్టడం ద్వారా నాలుగు జిల్లాలకు నాయకుడిగా చెలామణి అయ్యే నాయకులు ఇప్పుడు నియోజకవర్గమంత జిల్లాకు మాత్రమే పరిమితం అయ్యారు. ఉదాహరణకు ఇజ్రాయిల్ దేశమంత వున్న మహబూబ్‌నగర్ జిల్లాను నాలుగు ముక్కలు చేయడంతో అక్కడి జిల్లా నాయకులంతా సామంతరాజులయ్యారు. 10 జిల్లాలుగా వున్న తెలంగాణను 31 జిల్లాలుగా 584 మండలాలుగా విభజించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగి శాసనసభ స్థానాలు పెరిగితేనే ఇబ్బడి ముబ్బడిగా తెరాసలో చేరిన నాయకులకు అధికారం దండం అందేది! ఒకవేళ వాళ్లు అసంతృప్తులైతే కేసిఆర్ ఏ వ్యూహం రచిస్తాడో చూడాలి! మొ త్తానికి కెసిఆర్ ప్రభుత్వం ఇక్కడి అన్ని అస్తిత్వాలను సకారాత్మంగానో, నకారాత్మకంగానో తన పరిధిలోకి తెచ్చుకోగలిగింది. కానీ, చరిత్ర కొన్ని సత్యాలు చెప్పింది. వాటిని గ్రహించి ఏ పాలకుడైనా తన పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు పోవాలి. తనకు అడ్డుగా అన్ని అస్తిత్వాలను తొక్కేస్తే అవన్నీ తిరిగి తనవైపునకే చూస్తాయి. ‘నీ సిద్ధాంతం, నా సిద్ధాంతం వేరుగా ఉండనీ గాక.. కానీ- నీ భావ వ్యక్తీకరణకు నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం’ అన్న ఓ మహానుభావుని సూక్తిని ఆచరిస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.
*
-డా. పి. భాస్కరయోగి సెల్: 99120 70125

Published AndhrabhoomiFriday, 19 May 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి