రెండు నెలల క్రితం హైదరబాద్‌లో సిపిఎం వాళ్లు తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘సమర సమ్మేళనం’ నిర్వహించారు. ఆ తర్వాత కెటిఆర్, హరీశ్‌రావు ‘కేసీఆర్‌ను మించిన కమ్యూనిస్టు’ ఇంకెవరూ లేరన్నారు. ఇటీవల శ్రీత్రిదండి చినజీయర్ స్వాముల వారు సైతం ‘నేనూ కమ్యూనిస్టునే’ అన్నారు. నిజంగా.. కమ్యూనిజం అంత పవిత్రమైనదా?
సిపిఐ నేత కె.నారాయణ ఓసారి మరిచిపోయి గాంధీ జయంతి రోజున చికెన్ తినడం వివాదాస్పదమైంది. దానికి ప్రాయశ్చితంగా కొన్నాళ్లు చికెన్ ముట్టుకోనని ఆయన ప్రకటించాడు. ఇది గాంధేయ వాదాన్ని గౌరవించినట్టు మనకు అనిపిస్తుంది. అదే నారాయణ ఆ తర్వాత- ‘ప్రధాని మోదీని ఉరి తీయాలని, కాల్చి పారేయాలని, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ను కల్లు తాగిన కోతి’ అని అన్నాడు. ఈ భాషంతా నారాయణ అంతరాళంలో దాగిన మా ర్క్సిస్టు భాష. మొదట కమ్యూనిస్టులు భాషను తిట్లతో నింపేస్తారు, తిట్లను వారి ‘అకడమిక్ భాష’గా రూపొందిస్తారు. అరుంధతీ రాయ్, అర్బన్ సుఖియా, బిపిన్ చంద్ర, రోమిల్లా థాపర్, సతీశ్ చంద్ర పుస్తకాలు ఏవైనా తిరగేయండి- అందులో తిట్లను భాషగా, చరిత్రగా, కవిత్వంగా మార్చేస్తారు. వాళ్లు తమకు సిద్ధాంతపరంగా వ్యతిరేకులైన రామ్‌స్వరూప్, అరుణ్ శౌరి, సీతారాం గోయల్ వంటివాళ్లను తిట్లతో ఏకిపారేస్తారు. ప్రతి కమ్యూస్టుకు కొన్ని పడికట్టు పదాలుంటాయి. భూస్వామ్య, దళారీ, ఫాసిస్టు, సాంప్రదాయిక, మతతత్వ, బూర్జువా, రాజ్యం.. వంటి పదాలు సాధారణ కమ్యూనిస్టు కార్యకర్త నుండి గద్దర్ వరకు అందరూ ఉపయోగిస్తారు, సిద్ధాంతాలకు అస్తిత్వాలను జోడిస్తారు. ఇంకొందరు పర్యావరణ వాదులమని, జనవిజ్ఞాన వేదిక అనీ, స్ర్తివాదులమనీ, మానవహక్కుల రక్షకులమనీ.. ఇలా అనేక కొత్త కొత్త సైద్ధాంతిక ఔషధాలను నూరి పాత సీసాల్లో పోస్తూ ఉంటారు.
మన దేశంలో 1925లో ప్రారంభమైన కమ్యూనిజం మూలాలన్నీ రష్యా, చైనా, బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ చేతుల్లో ఉండేవి. ‘పిలిప్స్‌ఫ్రాక్’ అనే ఆంగ్లేయ రచయిత ‘నెహ్రూకి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు వౌనంగా ఉన్నాడని’ వాపోయాడు. రష్యా, చైనా నిధులతో కమ్యూనిస్టు పార్టీలు భారత్‌లో ఎలా తమ కార్యకలాపాలు విస్తరించాయో 1956లో ఏకంగా పార్లమెంటులోనే చర్చించారు. 1917లో జరిగిన రష్యా విప్లవాన్ని భారతదేశంలో గోరంతలు కొండంతలు చేసి వర్ణించి తమ ఉనికిని కమ్యూనిస్టులు కాపాడుకున్నారు. 1940 తర్వాత భారత దేశ విభజనకు సహకరించారు. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ లాంటి కమ్యూనిస్టులు ముస్లిం లీగ్‌ను తలకెక్కించుకున్నారు. దేశ విభజనలో ముస్లిం లీగు తర్వాత కమ్యూనిస్టులదే ప్రధాన పాత్ర. ‘్భరత దేశాన్ని మొగలుల నుండి బ్రిటిష్ వాళ్లు లాక్కుంటే వాళ్లనుండి మేం లాక్కుంటాం’ అని బహిరంగంగా ప్రకటించిన ముస్లిం లీగుకు ఇక్కడ కమ్యూనిస్టులు సైద్ధాంతిక భూమిక సిద్ధం చేసి ఇచ్చారు.
జాతీయవాద, హిందూ వ్యతిరేక తీవ్రత పెరిగిపోయి కమ్యూనిస్టులు ఆఖరుకు దేశ భద్రత విషయంలోనూ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. రాజకీయరంగాన్ని కాంగ్రెస్‌కు అప్పచెప్పి సాంస్కృతిక, కళా, సాహిత్య రంగాల్లో నెహ్రూ కాలం నుండి కమ్యూనిస్టులదే పై చేయిగా ఉంది. స్టాలిన్ చేసిన క్రూరత్వం తెలిసినా మన పార్లమెంటు అతనికి నివాళులు అర్పించింది. నెహ్రూ అవలంబించిన రాజకీయ విధానాల వల్ల అన్ని రకాల చారిత్రక, సాంస్కృతిక రంగాలు కమ్యూనిస్టులకు వేదికలయ్యాయి. మేధో సిద్ధాంత పరంగా ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్ లాంటి జాతీయవాద సంస్థలను నిలువరించడానికి కాంగ్రెస్ ఈ పనిని విస్తరించింది. కమ్యూనిస్టు రచనలన్నీ ఏదోరకంగా రాజకీయ, సామాజిక రంగాలను ప్రభావితం చేసేవిగా ఉంటుంటాయి. వివిధ విశ్వవిద్యాలయాల్లో, సాంస్కృతిక రంగాల్లో వారి అకడమిక్ విధానాలన్నీ దేశ రాజకీయ, సామాజిక రంగాలను అల్లకల్లోలం చేసే విధంగా ఉంటాయి. మార్క్సిస్టులు సాహిత్యాన్ని ఆవేదన, ఆవేశంతో నింపేశారు. కవిత్వాన్ని అరాచకత్వంతో నింపేశారు. మార్క్సిస్ట్‌లను అన్నిరంగాల్లో ప్రభుత్వం ప్రొత్సహించడంతో మన చరిత్ర ఎరుపు రంగును అద్దుకున్నది. ఆఫ్ఘాన్ నుండి వచ్చిన దురాక్రమణదారుడైన బాబర్‌కు ఉన్న మన చరిత్రలో దక్కిన స్థానం భారతీయ తత్వశాస్త్రం, కళలు అధ్యయనం చేసిన దారాషికోకు దక్కలేదు. పరమత సహనం లేని అక్బర్‌ను లౌకిక వాదిగా చూపించిన ఈ చరిత్రకారులు, గడ్డిరొట్టెలు తిని దేశం కోసం జీవించిన రాణాప్రతాప్‌కు చరిత్రలో సరైన స్థానం కల్పించలేదు. గెరిల్లా పోరాటంతో, సరికొత్త వ్యూహాలతో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీని ఓ రాష్ట్రానికి పరిమితం చేసి మరాఠా వీరునిగానే హద్దులు నిర్ణయించారు. భారతీయ ఇతిహాస, పురాణాలకు మతం రంగు పులిమి తక్కువ స్థాయిలో చూపించి వాటికి స్థానం లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు.
కొందరు ‘కమ్యూనిస్టు సిద్ధాంతం మంచిదే.. కానీ ఆచరణలో విఫలం’ అయిందని పైన వెన్న పూయడానికి ప్రయత్నం చేస్తారు.‘నియో మార్క్సిజం’ పేరుతో కొద్దిగా ‘సాఫ్ట్‌కార్నర్’ తీసుకుని ఇటీవల కమ్యూనిస్టులు అన్నిరంగాల్లో ప్రవేశించారు. పత్రికల్లో, ప్రచార, ప్రసార మాధ్యమాల్లో గాంధేయ వాదుల్లా, లిబరల్ మేధావుల్లా, సెక్యులరిస్టులుగా, సోషలిస్టులుగా నటిస్తూ ఆయా రంగాలను ప్రభావితం చేస్తుంటారు. కమ్యూనిజం ‘చింతింపదగ్గ విశే్లషణ’ అంటూ కలర్ ఇస్తారు. కానీ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం వల్ల జరిగిన హింస క్రూసేడ్‌లు, జీహాద్‌లాగానే జరిగింది.
‘చైనాలో వర్షం పడితే భారత కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగులు’ పడతారు అన్న సామెతనే పుట్టింది. విదేశీ సిద్ధాంతంతో విదేశీ భావనలతో నడిచే కమ్యూనిస్టులు ఏటా 5 లక్షల యుఎస్ డాలర్లు పొందేవాళ్లని 1991లో ‘హిందుస్థాన్ టైమ్స్’ పేర్కొంది. రష్యా, చైనాలోనే పెట్టుబడులు వెల్లువెత్తుతుంటే ఇక్కడి కమ్యూనిస్టులు ఆదానీనీ, అంబానీని తిట్టిపోస్తుంటారు. ‘పేద ప్రజల కోసం పని చేస్తున్నాం’ అని చెప్పుకునే వీళ్లు సంప్రదాయ రాజకీయపార్టీలకన్నా వెనుకబడే ఉన్నారు. త్రిపుర, కేరళ, బెంగాల్ రాష్ట్రాలలో ఏళ్ల తరబడి కమ్యూనిస్టుల పాలన సాగింది. కానీ వాటికన్నా ఎన్నో రాష్ట్రాలు పాలనలో పారదర్శకత పాటిస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి. నిరాడంబరులుగా ప్రచారం చేసుకునే కమ్యూనిస్టులకు దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల ఆస్తులు, భవనాలు, పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఎలా వచ్చాయి? కేన్లీ ఆర్కాయిస్ అనే రష్యా కమ్యూనిస్టు చాలా సంవత్సరాలు సేవ చేసి కమ్యూనిస్టు పార్టీ వదిలిపెట్టాడు. అందులో రెండవ అధ్యాయంలో భారతదేశంలోని కమ్యూనిస్టుల వ్యవహారాలను ప్రస్తావించాడు. పౌరహక్కులు, ప్రపంచ శాంతి కాముకుల పేరుతో ఏన్‌జీవో సంస్థల పేరుతో వాళ్లు ఎలా నిధులు పొందుతారో వివరించాడు. ‘అధికారం హస్తగతం చేసుకో’ అన్న స్టాలిన్ మాటలకు బదులు- రాజకీయ అనిశ్చితి, ఆణదోళనలు సృష్టించడంలో కమ్యూనిస్టులు కొంతవరకు కృతకృత్యులవుతున్నారన్నది సత్యం.
మనదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఎన్నో ముక్కలైంది. మావోవాదం పేరుతో రాజ్యాంగబద్ధమైన దేశంపై పోరాటం ఒకవైపు కొనసాగుతుండగా ఎప్పుడూ ప్రజా సమస్యలు, పోరాటాలు, ఉద్యమాలు అంటూ మరోవైపు ఓ ‘గుంపు’ ప్రజాస్వామ్య వ్యవస్థను ఆటంకపరుస్తుంది. ప్రజల సమ స్యలపై పోరాటం చేయడం తప్పుకాదు కానీ ఎప్పుడూ రాజ్య వ్యవస్థపై ధిక్కారమే లక్ష్యంగా పనిచేయడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. ప్రస్తుతం దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు హిందూ వ్యతిరేకతను, ఇస్లాం సమర్ధతను ఎజెండాగా తీసుకున్నాయి. అందుకే రామ్‌స్వరూప్ తన రచనల్లో ‘వాళ్ల వేట హిందూధర్మం’ అని కుండబద్దలు కొట్టాడు. మావోయిస్టు మేధావులు కూడా ‘్భరతదేశంలో హిందూ ధర్మం ఉన్నంతవరకు ఒక్క అడుగు ముందుకు వేయలేం’ అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి.
హిందూ ధర్మంపై నేరుగా పోరాటం చేయకుండా ఇక్కడ ‘బహుజన వాదం’ పేరుతో రెచ్చగొట్టే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. సమాజంలో కుల వైషమ్యాలు రెచ్చగొట్టి, గుడ్డిగా ఓ మతానికి మద్దతు పలుకుతున్నారు. దానికి వాళ్లు పెట్టిన ముద్దుపేరు ‘సెక్యులరిజం’. హిందూమతాన్ని తిట్టడమే సెక్యులరిజం మొదటి లక్షణం. హిందూ ఆచారాలను విమర్శించడం, చరిత్రను వక్రీకరించడం, సాంస్కృతిక ధార నుండి కొన్ని వర్గాలను దూరం చేయడం ఈ దేశపు కమ్యూనిస్టుల్లో గూడుకట్టుకున్న జాతీయ వ్యతిరేకతకు నిదర్శనం. ఈ క్రమంలోనే వారు మహాత్మాగాంధీని వ్యతిరేకించారు, తర్వాత మహాత్ముడన్నారు. సుభాష్ చంద్రబోస్‌ను తిట్టిపోశారు. తర్వాత నాలుక కరుచుకున్నారు. ఇటీవల వరకు సావర్కర్‌ను తిడుతునే ఉన్నారు. అంబేద్కర్‌ను, రవీంధ్రనాధ్ ఠాగోర్‌ను, స్వామి వివేకానందను కూడా వాళ్లు వదిలిపెట్టలేదు. తర్వాత ‘క్షమించాం’ పొమ్మన్నారు. ఇప్పుడు వాళ్ల టార్గెట్ నరేంద్ర మోదీ. ఎప్పుడూ వ్యతిరేకించడం వారికో సిద్ధాంతం. తర్వాత ‘చారిత్రక తప్పిదానికి మన్నించండి’ అని వేడుకోవడం-ఇదీ కమ్యూనిస్టుల చరిత్రలో జరిగిన చారిత్రక తప్పిదాలు..
అబద్ధాన్ని అదేపనిగా ప్రచారం చేయడానికి వాళ్లకు సాధనా సంపత్తి బాగా ఉంది. ‘ప్రగతిశీల’ అన్న ఒక పదంతో మీడియాలో ఓ చీకటి సామ్రాజ్యానికి వాళ్లు రారాజులు. అందులో కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలందరికీ భాగస్వామ్యం ఉంటుంది. హార్వార్డ్ ఫాస్ట్ అనే ప్రపంచ ప్రసిద్ధ రచయిత 20 ఏళ్లు కమ్యూనిస్టు సిద్ధాంతంలో పని చేసి ఆ సిద్ధాంతం నుండి దూరం జరిగి ‘కమ్యూనిస్టులు బలం చేత నశించరు; సత్యం చెప్పడం వల్ల నశిస్తారు’ అని చెప్పాడు. తోక పార్టీలుగా పొత్తులు పెట్టుకుని ‘తామే దానిని సాధించాం’ అని చెప్పడం కమ్యూనిస్టులకు అలవాటు. ఈ మధ్యలో అన్ని పార్టీలతో పొత్తులు వికటించి, ఇపుడు ‘లాల్-నీల్’ ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. కమ్యూనిస్టులకు, దళితులకు మధ్య తాను ఇనుప గోడలా అడ్డుగా వుంటానని అంబేద్కరే స్వయంగా చెప్పారు.
ఓ రాజుగారు తోటకు వాహ్యాళికి వెళ్తే అక్కడే వున్న ఓ కాకి తన దగ్గరున్న చిల్లుబడ్డ, చెల్లని నాణెం తీసుకొమ్మని రాజును బతిమాలుతూ వెంబడించింది. దాని నస భరించలేక నాణెం రాజుగారు స్వీకరిస్తే ఆ కాకి ఊరు వాడా తిరిగి ‘నేనురాజుకు అప్పుఇచ్చానహో’ అంటూ చాటింపు వేసిందట! కమ్యూనిస్టులతో పొత్తు, స్నేహం ఎలా ఉంటుందో కరుణానిధి చెప్పిన పిట్ట కథ ఇది. అలా రాజకీయ పార్టీలను వెంటబడి పొత్తుపెట్టుకుని ప్రజాస్వామ్య వ్యవస్థకు తామే మూలస్థంభాలమని ప్రగల్భాలు పలుకుతారు. 150 మందిని చంపాడని కోర్టులో నిరూపణ అయ్యాక ఎన్నో ఏళ్లకు యాకుబ్ మెమెన్‌ను ఉరి తీస్తే వామపక్షాలు వ్యతిరేకిస్తాయి. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్‌గురును కీర్తిస్తారు. కాశ్మీర్‌కు స్వాతంత్య్రం కావాలంటారు. ఉర్దు మాట్లాడేవాళ్లకు ప్రత్యేక దేశం కావాలంటారు. మాటిమాటికీ అంబేద్కర్‌ను ముందుకు తీసుకువస్తారు, కానీ ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన ప్రభుత్వాలను గౌరవించరు. ‘దళితనామం’ జపిస్తారు, కానీ- సీపిఎం పొలిట్‌బ్యూరోలో ఒక్క సీటు కూడా దళితులకు ఇవ్వరు. ఇటీవల సిపిఎం నేత సీతారాం ఏచూరిని ఎవరో ప్రశ్నిస్తే ‘నా కులగోత్రాలు కాదు.. నా పనితనం చూడు‘ అని తప్పించుకున్నారు. ఇదే ఏచూరి కాశ్మీర్ వేర్పాటువాదుల ఇళ్ల ముందు పడిగాపులు పడి వాళ్లకు దాసోహం అంటాడు. కాశ్మీర్ ప్రత్యేక దేశం కావాలనే కన్హయ్యకుమార్‌కు, ఉమర్ ఖాలిద్‌కు మద్దతిస్తారు. మరి టిబెట్, హాంకాంగ్ ఉద్యమాల గురించి ఎందుకు నోరు మెదపరు..?
‘ప్రయోగ శరణం వ్యాకరణం’-్భషా ప్రయోగాలను బట్టి వ్యాకరణం పుడుతుంది అనేది ఈ సూత్రం. ప్రజల మనోభావాలను బట్టి సిద్ధాంతాలు మార్చుకోవాలి. కానీ కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను బట్టి ప్రజలే మారాలంటారు. కమ్యూనిస్టు సిద్ధాంతం అందరూ అనుకునేవిధంగా ‘అహింసా వాదం’ కాదు. ఈ సిద్ధాంతం వల్ల ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది హత్య చేయబడ్డారని విశే్లషకులు చెప్తారు. ‘పేద ప్రజలకు మేలు చేయడం కోసం పోరాటం’ అనేది ఓ మేలి ముసుగు. ఆ ముసుగు వెనుక ఎన్నో చీకటి మరకలున్నాయని తెలిస్తే ‘మేం కమ్యూనిస్టులం’ అని చెప్పుకోవడానికి ఎవరూ పోటీపడరు. *

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published Andhrabhoomi Friday, 23 June 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి