ఓ తాగుబోతు తూలుతూ ఆసుపత్రికి వెళ్లాడు. తన ఆరోగ్యం అసలు బాగోలేదని వైద్యునితో మొరపెట్టుకున్నాడు. వైద్యుడు అతణ్ణి అన్నివిధాలా పరీక్షించి, ‘నువ్వు తాగుడు మానేయకపోతే ఆరునెలల్లో చచ్చిపోతావు’అని తేల్చిచెప్పాడు. తాగిన మైకంలో వున్న ఆ రోగి వైద్యుడు చెప్పిన మా టలు పచ్చి అబద్ధమన్నాడు. సరే! నీ ముందు ఓ ప్రయోగం చేస్తానని వైద్యుడు రెండు గాజు గ్లాసులు తెప్పించాడు. కొన్ని బతికున్న వానపాములను ఆ గ్లాసుల్లో ఒక్కోటి వేసి రోగి దగ్గర సీసాలో మిగిలి వున్న విస్కీని ఓ గ్లాసులో పోసి, ఇంకో దాంట్లో నీళ్లు పోసాడు. ఓ ఐదు నిముషాల తర్వాత చూస్తే విస్కీ పోసిన గ్లాసులోని వానపాము మరణించించగా, నీళ్లలోని వానపాము తేలి ఆడుతోంది. ఈ ప్రయోగం చూపించిన వైద్యుడు ‘నీకు ఏమర్థమైంద’ని రోగిని ప్రశ్నించాడు. ‘విస్కీని కడుపులో పోస్తే జీర్ణాశయంలోని పురుగులు చచ్చిపోతాయ’ని అన్నాడట!
సరిగ్గా మన దేశంలోని ఓ వర్గం మీడియా, కుహనా మేధావుల పరిస్థితి కూడ ఇలాగే ఉంది. భావ దారిద్య్రంతో కొట్టుమిట్టడుతున్న కొన్ని ప్రచార, ప్రసార మాధ్యమాలు ఇటీవల కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాత్రికి రాత్రి హీరోను చేశాయి. నిజాయితీపరుడని మూడేళ్ల క్రితం రాత్రింబవళ్లు తమ వందిమాగధ స్వరాలతో కీర్తించిన మీడియా ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను రాత్రికి రాత్రే ‘ద్రోహి’గా మార్చేసింది.
1990 ప్రాంతంలోనే బిహార్‌లో కాంగ్రెస్ పార్టీ దిల్లీ దారిపట్టింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ను ‘సెక్యులర్’ బ్రాండ్‌తో భుజాలపై మోసే ఆర్‌జెడి పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 15 ఏళ్లపాటు బిహార్ మహా సామ్రాజ్యాన్ని ఏలుకున్నాడు. కేంద్రంలో ఎప్పడూ కాంగ్రెస్ వెంటే అతను నడవడం వల్ల ఆ పార్టీకి ఆర్‌జెడితో ఎప్పుడూ పేచీ రాలేదు. అందునా ఈరెండు పార్టీల్లో మూడు ‘సి’లు సమానంగా ఉన్నాయి. ‘కమ్యూనల్, కాస్ట్, కరప్షన్’ అనే వాటికి వీళ్లు ‘సెక్యులర్’ అనే అందమైన తొడుగు తొడిగారు. లాలూ యాదవ్ పాలనలో బిహార్‌కు ‘జంగల్ రాజ్’ (ఆటవిక రాజ్యం) అనే పేరు వచ్చింది. ‘జబ్‌తక్ సమోసామే ఆలూ.. తబ్‌తక్ బిహార్ మే లాలూ’ అని ఆర్జేడీ అధినేత ఎంత బల్లగుద్ది చెప్పినా గతంలో ఎన్డీఏ ప్రభుత్వం బిహార్‌ను విడగొట్టి రెండు రాష్ట్రాలు చేసింది. ఆ తర్వాత 2005లో భాజపా-జేడియు కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మళ్లీ 2010లో నితీశ్‌కుమార్ (జెడియు), సుశీల్ మోదీ (బిజెపి) నాయకత్వంలో 206 స్థానాల్లో విజయం సాధించి ఈ కూటమే మళ్లీ అధికార పీఠం కైవసం చేసుకుంది. 243 స్థానాల్లో జేడియు 82 శాతం గెలుచుకున్నా, భాజపా 89 శాతం ఓట్లతో బిహార్ రికార్డు మారిపోయింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయ దుందుభిని జీర్ణిచుకోలేని నితీశ్ ఆయనకు వ్యతిరేకంగా స్వరం పెంచాడు. అప్పుడే దేశంలోని సదరు మీడియాకు, పార్టీలకు, మేధావులకు నితీశ్ ‘బంగినపల్లి మామిడిపండు’లా దొరికాడు. మోదీని తిట్టగలిగిన ఏకైక ‘సెక్యులర్’ నిజాయితీపరుడని మురిసిపోయి, మోదీ- నితీశ్ మధ్య మరింత అంతరం పెంచారు. రాజకీయ ప్రయోజనాలు ఎవరికి వారికి ఉండొచ్చు. అది వేరే విషయం.
ఈలోపు మోదీ కొండను ఢీకొట్టడానికి కాంగ్రెస్, జేడియు, ఆర్జేడీ-మహా ఘట్‌బంధన్ (మహాకూటమి) పేరుతో జత కట్టాయి. కల్ముర్గి,్ధబోల్కర్ హత్యలకు విస్తృత ప్రచారం కల్పించారు. తాతల కాలం నాటి అవార్డులను ‘వాపసు’ ఇవ్వడానికి మంచాలపై ఉన్న నానమ్మలు, తాతయ్యలు కదిలివచ్చి మోదీని వీలైనంత మోదారు. వాళ్ల తపస్సు ఫలించి అప్పట్లో బిహార్‌లో నితీశ్‌కుమార్ ‘మహాకూటమి’ ప్రయోగం సఫలమైంది. దాంతో మోదీని ‘్ఢ’ కొట్టే మొనగాడొకడు మీడియాకు, ప్రతిపక్షాలకు దొరకడంతో వారి ఆనందానికి అంతేలేదు. ఈమధ్యలో లాలూ పుత్రరత్నం, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, లాలూ కుటుంబ సభ్యులు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోగా ఇదంతా నితీశ్‌కు చిర్రెత్తించింది. కేంద్రంతో సయోధ్య చేసుకుని భాజపాతో జతకట్టాలని, నితీశ్‌కన్నా ముందే లాలూ కేంద్రానికి రాయబారం పంపాడు. ఈ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా నిర్ధారించుకున్న నితీశ్ కేంద్రంతో నిత్యం ‘టచ్’లో ఉన్నాడు. ఈలోగా మహాకూటమిని కాపాడుకోవడానికి జెడియులోని 16మంది యాదవ, ముస్లిం శాసనసభ్యులను తనవైపు తిప్పుకుని నితీశ్‌ను ఇరుకునపెట్టాలని లాలూ అండ్ కో వ్యూహరచన చేసింది. ఇవన్నీ నితీశ్ గమనించి ‘లాలూచీ’ అనుకున్నాడు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అందరూ ఎరిగినవే!
లాలూతో చెట్టాపట్టాల్ వేసుకుని నితీశ్ వెళ్లిన రోజున ‘్భష్ భేష్’ అంటూ పొగిడిన ఆ నోళ్లే ఈరోజు భాజపాతో కలవగానే భర్తృహరి సుభాషితాలను ఒక్కొక్కటిగా వినిపిస్తున్నారు. కారణం భాజపాను, మోదీని తిడుతుంటే వీళ్లకు అపరిమితానందం. నితీశ్ లాంటి నిజాయితీపరుడు మరో నిజాయితీపరుడు మోదీతో కలిస్తే వీళ్ల పబ్బం ఎలా గడుస్తుంది? ‘సెక్యులరిజం’ అవినీతిపై వేసే ముసుగు కాకూడదు.. అని సాక్షాత్తూ అసెంబ్లీలో నితీశ్ చెప్పగానే వీళ్లంతా ఒంటికాలిపై లేస్తున్నారు.
చివరకు ‘్ఛ’ పొమ్మన్న నితీశ్‌కుమారే ‘మోదీ’ని మించి మొనగాడు లేడని తేల్చేశాడు. ఈమధ్యలో మోదీని అయినదానికి, కానిదానికి పనిగట్టుకుని విమర్శించే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి కూడ మీడియాలో ఇవ్వని ప్రాముఖ్యతనిచ్చారు. దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులంతా అవినీతిలో కూరుకున్నా, రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నా, జెఎన్‌టియు, ఢిల్లీ, హెచ్‌సియుల్లో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినవాళ్లను ఎవరు విమర్శించినా- అన్నింటికీ నరేంద్ర మోదీనే కారణం అంటూ ప్రేలాపనలు చేసేవాడు కేజ్రీవాల్. మోదీని తిట్టలేనివాళ్లు, జాతీయ ప్రభుత్వంపై కంటగింపు వున్న వాళ్లంతా కేజ్రీవాల్‌ను చూసి ఉబ్బితబ్బిబ్బయిపోయారు. కపిల్ మిశ్రా అనే ఆప్ శాసనసభ్యుడే కేజ్రీవాల్ బండారమంతా బయటపెట్టగానే అంతా చల్లబడ్డారు. ‘అయ్యో! మేం మోదీపైకి ఎగదోసిన కేజ్రేవాల్ కుప్పకూలాడే’ అని చతికిలబడ్డారు.
ఇక మోదీని, జాతీయ ప్రభుత్వాన్ని బాగా తిట్టగల దిట్టల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెద్దబాల శిక్ష మొత్తం పూర్తి చేసింది. ప్రతిదానికీ ఫత్వా జారీ చేసే కలకత్తా టిప్పుసుల్తాన్ మస్జిద్ ఇమాం నూరుర్ రెహమాన్ బర్కతీని వెంటబెట్టుకుని హిందూ సంస్థలను, భాజపాను, మోదీని మమత పెద్ద తిట్లపురాణమే రచించడం మొదలుపెట్టింది. నారద, శారద కుంభకోణాల్లో పీకల్లోతు మునిగిపోయిన మమత కేంద్రంపై కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇప్పటికీ ‘బెంగాల్ అస్మిత’ పేరుతో మమతను మోదీపైకి ఉసిగొల్పుతున్నారు. రాహుల్ గాంధీకి స్క్రిప్ట్ రచయితలు సరిగ్గా లేక మోదీ అంచుకైనా వెళ్లలేకపోతుంటే ఇటీవల బిహార్, గుజరాత్ రాజకీయాల్లో జరిగిన పరిణామాలను ‘నీతి-అవినీతి’ లాంటి పదాలను ప్రయోగించి మోదీ-షా ద్వయం చాణక్యనీతిని వేలెత్తి చూపిస్తున్నారు. దానిపై వారం రోజులనుండి కొత్తకొత్త కోణాల్లో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను రాజకీయంగా ఎదిగించే రాజ్యసభ పట్ట్భాషేకం కోసం ఓవైపు సమాయత్తమవుతుంటే- గుజరాత్‌లో వాఘేలా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరడంతో సెక్యులర్ శిబిరంలో కలకలం ప్రారంభం అయింది.
ఓవైపు గుజరాత్ వరదలతో అతలాకుతలం అవుతుంటే కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను- తమకు మిగిలివున్న ఏకైక కంచుకోట కర్నాటకలో కాంగ్రెస్ కట్టప్ప సిద్ధరామయ్య ఆధీనంలో ఉంచారు. వరదలతో ప్రజలు దిక్కూ మొక్కూ లేకుండా చస్తుంటే ఈ దిక్కుమాలిన రాజకీయాలేంటని చెప్పాల్సిన మేధావులు భాజపాది అనైతికత అంటూ విశే్లషిస్తున్నారు. రాజకీయ పార్టీలపై గల వైరాన్ని జాతీయతపై ప్రదర్శిస్తున్నాయి. ఇక కొన్ని ప్ర చార-ప్రసార మాధ్యమాలు భాజపాను అడ్డం పెట్టుకుని భారత జాతీయతను తూలనాడుతూ రాక్షసానందం పొందుతున్నాయి. భారత జాతీయతకు భంగం వాటిల్లితే భాజపా వాళ్లు తప్ప ఇంకెవరూ ప్రశ్నించకూడదా? వాళ్లమీద ఉండే కోపంతో వారి వ్యతిరేకులు ఏది చేసినా ‘్భళా’ అంటూ పొగిడేస్తున్నాయి. ఇటీవల కర్నాటకలో సిద్ధరామయ్య జాతీయ పతాకంతో పాటు కన్నడ పతాకం ఏర్పాటుకు తొమ్మిది మందితో ఓ కమిటీ వేశాడు. భారతదేశానికి ఒకే జెండా-ఎజెండా ఉండాలని రాజ్యాంగం చెబుతోందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. అయినా కన్నడ ప్రజల మనోభావాల పేరుతో ‘కొత్త జెండా’ మాకు కావాలని సిద్ధరామయ్య అండ్ కో వాదిస్తోంది. నక్సలైట్లు, మావోయిస్టులు, వేర్పాటువాదులు ఎవరి జెండాలను వారు ఇప్పటికే దేశంలో అక్కడక్కడ ఊపుతునే ఉన్నారు. ఆఖరికి ఉగ్రవాద సంస్థ ‘ఐసిస్’ జెండా కూడా కాశ్మీర్‌లోకి ప్రవేశించింది. పార్టీలకు, మత సంస్థలకు పతాకాలు ఉన్నాయి. కానీ భారత సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించే జాతీయ జెండా మాత్రం ఒక్కటే ఉంటుంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం కొత్త జెండాలు ఏర్పాటు చేస్తే ప్రతి రాష్ట్రం ఓ దేశమవుతుంది. దిక్కులేక చూస్తున్న కర్నాటక కాంగ్రెస్ పెద్దలు ఎలాగైనా అధికారం కాపాడుకోవాలని ఇలాంటి జాతి వ్యతిరేక చర్యలకు పూనుకోవడం ఎంతవరకు సబబు?
హిందీ భాషను వ్యతిరేకించే ముసుగులో ఇన్నాళ్లు ద్రావిడ పార్టీల రాజకీయం కొనసాగింది. తమిళనాడు వాళ్లకు తమిళ భాషాభిమానం దురభిమానంగా మారింది. విచిత్రం ఏమిటంటే పెరియార్ రామస్వామికి కన్నడ మూలాలు, కరుణానిధి, వై.గోపాస్వామి (వైగో)లకు తెలుగు మూలాలు, ఎంజీ రామచంద్రన్‌కు మలయాళ మూలాలు, రజనీకాంత్‌కు కన్నడ మూలాలే ఉన్నాయి. వీళ్లంతా తమిళం కోసం యుద్ధం చేసే యోధులు. ఇంకో అడుగు ముందుకేస్తే వీళ్లంతా హిందీ భాషకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారు. ‘హిందీ గోబ్యాక్’ అని ఇంగ్లీషులో నినాదాలు చేస్తారు. ఎక్కడో ఏడు సముద్రాల అవతల పుట్టిన ఆంగ్లం వీళ్లకు చుట్టం అవుతుంది. ఈ దేశంలో పుట్టిన హిందీ వీళ్లకు విషమవుతుంది. ఇక దేశ సమగ్రత ఎలా సాధ్యం? ఈ జాఢ్యం మెల్లమెల్లగా కర్నాటకకు అక్కడి అధికార కాంగ్రెస్ పార్టీవల్ల సోకింది. ఎవరో ఒకరిద్దరు హిందీ బోర్డులపై నల్లరంగు పూసి, నూరుమంది కూడా లేకుండా బహిరంగ సభలు పెడితే అది ఉత్తర భారతీయులకు, భాజపాకు, జాతీయతకు సవాల్ విసరడమని కొన్ని ఛానళ్లు, పత్రికలు మసాలా దంచేస్తున్నాయి.
1937లోనే మద్రాసులో రాజాజీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు అక్కడి పాఠశాలల్లో హిందీ బోధన తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశం మొత్తాన్ని సమగ్రంగా ఉంచే ఈ దేశభాషను రక్షించాల్సిందిపోయి, హిందీకి వ్యతిరేకంగా మాట్లాడడం గొప్ప స్వేచ్ఛా వి హారం అన్నట్టు మీడియా అలాంటి వాళ్లను ఆకాశానికి ఎత్తడం సిగ్గుచేటు. 12వ శతాబ్దంలో అనేక సామాజిక రుగ్మతలకు పరిష్కారం చూపిన మహనీయుడు బసవేశ్వరుడు. తన అనుభవ మంటపం ద్వారా కుల నిర్మూలన,కాయకమే కైలాసం (వర్క్ ఈజ్ వర్‌షిప్) సత్యం, అహింస, స్ర్తి జన గౌరవం, కుటీర పరిశ్రమలు, ఆర్థిక విజ్ఞానం, వ్యక్తిస్వేచ్ఛ, దేశ భాషల అభివృద్ధి, సంపద సృష్టి వంటి అంశాలను ఆధ్యాత్మిక జీవనంతో జోడించి విప్లవ ఆధ్యాత్మిక పంథాను అనుసరించాడు బసవేశ్వరుడు. నిమ్న జాతులకు, స్ర్తిలకు తన అనుభవ మంటపం (పార్లమెంటు)లో గొప్ప స్థానం కల్పించిన ఆయన కన్నడ ప్రాంతంలో వీర శైవం ద్వారా సామాజిక విప్లవం నడిపాడు. అక్కడి వేలాది మఠాలు ఈరోజుకూ ఓ ప్రభతో వెలుగుతున్నాయి. కాబట్టి అక్కడి రాజకీయ నాయకులకు ఆయా మఠాధిపతులకు వ్యతిరేకంగా మాట్లాడితే వారి రాజకీయాలకు నూకలు చెల్లినట్టే. సిద్ధరామయ్య ఓ అడుగు ముందుకేసి భాజపా వాళ్లను ఇరుకున పెట్టాలన్న కుట్ర బుద్ధితో ‘లింగాయతులను’ హిందూయేతర మతంగా గుర్తించాలని వివాదం సృష్టించాడు. అక్కడి భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యెడ్యూరప్ప కూడా లింగాయతుడే. వీర శైవం కూడా హిందూధర్మ అంతర్భాగమైన ప్రాచీన శైవం నుండి పుట్టిందే. కానీ రాజకీయాలకు దీన్ని కూడా వాడుకోవడం వారి భావ దారిద్య్రానికి నిదర్శనం.
కమ్యూనిస్టు మేధావులు ఇటీవల ‘లించింగ్’, ‘లించిస్తాన్’ అనే కొత్త పదాలను వారి అమ్ములపొది నుండి సంధించారు. ‘లించింగ్’ అంటే ఖైమా ఖైమాగా కొట్టి చంపడం. గోరక్షకులు ఇలా చేస్తున్నారని, ప్రభుత్వం, హిందూమత సంస్థలు వీరి వెంబడి ఉన్నాయని వారి ఆరోపణ. గతంలో హిట్లర్, స్టాలిన్ వంటివాళ్లు లక్షలాదిమందిని ఊచకోత కోశారు. ఆ దారుణ సంఘటనలకు కూడా ఇలాంటి పదం వాడలేదు. మరి ఈరోజు అంత దారుణంగా హత్యలు జరుగుతున్నాయా? అలా అయితే కేరళలో, బెంగాల్‌లో జరుగుతున్న నరమేధం గురించి ఈ పదం ఎపుడైనా ఉపయోగించారా? జమ్ము కాశ్మీర్‌లో లక్షలాది మంది హిందువులు వలస వెళ్తే ఇంత తీవ్రపదం ఎప్పుడైనా ప్రయోగం జరిగిందా? భారతదేశంలో సంపూర్ణ గోవధ నిషేధం కోసం సాధుసంతులు పార్లమెంటును ముట్టడిస్తే వారిపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో ఎందరో మరణించారు. ఆ తర్వాత 1967లో ఎన్నికలు కాంగ్రెస్‌ను బాగా బలహీనపరిచాయి. అలా చచ్చిన వేలాదిమంది కోసం ఈ పద ప్రయోగం చేసారా? 1984లో ఇందిర హత్యానంతరం సిక్కుల ఊచకోత జరిగితే ఈ పద ప్రయోగం జరిగిందా? దేశం అశాంతిగా, అసహనంగా ఉందని చెప్పడమే ఈ కుహనా మేధావుల, పార్టీల సంస్థల ఏకైక లక్ష్యం. ఒక వ్యక్తినో, ఒక పార్టీనో, సంస్థలనో నిందించడం కోసం రాజకీయ కుట్రలు ఈస్థాయిలో సాగడం జాతీయ సమగ్రతకు గొడ్డలిపెట్టు. అమిత్ షాకు, ఆరెస్సెస్‌కు, మోదీకి, భాజపాకు వ్యతిరేకంగా దేశ ప్రజలను భాష, కులం, మతం, ఆహారం పేరుతో విభజిస్తే మరోసారి దేశ విభజన తప్పదు! లేదా భారత్‌లోనే మినీ పాకిస్తాన్‌లు పుట్టుకొస్తాయి. రాజకీయంలో బురద ఉండొచ్చు, కానీ బురదలో రాజకీయం ఉండకూడదు.*

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published AndhrabhoomiFriday, 4 August 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి