‘వోల్ఫ్ మెసింగ్’ రష్యాలో ప్రసిద్ధి పొందిన మహిమాన్వితు డు. 1910లో అతడు యువకుడిగా ఉన్నప్పుడు ఇంటి నుండి పారిపోయాడు. అలా వెళ్తూ రైలెక్కాడు. కానీ అతని దగ్గర టిక్కెట్ లేదు. అందువల్ల రైలు పెట్టెలో సీటు కింద దాగున్నాడు. కొద్దిసేపు అయ్యాక టి.సి. వచ్చి ‘యంగ్‌మాన్.. యువర్ టికెట్?’ అని ప్రశ్నించాడు. మెసింగ్‌కు ఏం చేయాలో పాలుపోక మనస్సునంతా ధ్యానంలోకి తీసుకొని అక్కడ పడివున్న పేపర్ ముక్కపై తన ధారణ పెట్టాడు. వెంటనే ఆ పేపర్ ముక్కను టి.సి. చేతిలో పెడితే- ‘ఇదే నీ బెర్తు’ అంటూ చూపించి వెళ్ళిపోయాడు. ధారణశక్తితో ఎలాంటి భ్రమయైనా కలిగించవచ్చని అతనికి ఆరోజే అర్థమైంది. ఈ వ్యక్తి ఆ తర్వాత చాలా ప్రసిద్ధుడు. హిట్లర్, స్టాలిన్, ఐన్‌స్టీన్, గాంధీ లాంటి వ్యక్తులు అతని ‘్ధరణామహిమను’ ప్రశంసించారు. మెసింగ్ రష్యాలో తన ఆత్మకథను ప్రచురించాడు. దానిపేరు ‘ఎబౌట్ మై సెల్ఫ్’. హిట్లర్ అయితే ఇతణ్ణి చంపి తలను తెస్తే 2 లక్షలు ఇస్తానని ప్రకటించాడు. ఓసారి నాటకంలో ఉన్నపుడు పోలీసులు వచ్చి ‘వోల్ఫ్ మెసింగ్’ను అరెస్టు చేశారు. తీరా చూస్తే అతను కొద్దిసేపట్లో నాటి కమ్యూనిస్టు నేత స్టాలిన్ ముందున్నాడు. స్టాలిన్ మెసింగ్ గురించి చాలా విన్నాడు. అందుకే పరీక్ష చేయడానికి పిలిపించాడు. ‘రేపు మధ్యాహ్నం వరకు నీవు నా ఆధీనంలో ఉంటావు.. 2 గంటలకు పోలీసులు నిన్ను బ్యాంక్ వద్దకు తీసుకెళ్తారు. నీవు ఒక లక్ష రూపాయలు తీసుకొని రావాలి’ అన్నాడు. మరుసటి రోజు వరకు స్టాలిన్ అధీనంలో ఉన్న వోల్ఫ్‌ను మధ్యాహ్నం 2 గంటలకు బ్యాంక్‌లో కౌంటర్ కూడా ఫలానాది అని చెప్పకుండా లోనికి పంపారు. ఒక తెల్లకాగితం తీసుకొని ఒక క్షణం సేపు తీక్షణంగా దానివైపు చూసి, ‘నాకు లక్ష రూపాయలు కావాలి’ అన్నాడు. బ్యాంకు ఉద్యోగి ఆ కాగితం చూసి డబ్బులిచ్చాడు. ఇది చూసి స్టాలిన్ ఆశ్చర్యపోయాడు.
స్టాలిన్ రెండో పరీక్షకు సిద్ధపడ్డాడు. వోల్ఫ్‌ను ఓ గదిలో బంధించి సరిగ్గా రాత్రి 12 గంటలకు తన గదికి రావాలన్నాడు. నిజానికి స్టాలిన్ ఏ గదిలో ఉంటాడో ఎవరికీ తెలిసేది కాదు. చివరకు అతని భార్యకు కూడా! తన అంగరక్షకులు కూడా అతను ఏ నెంబర్ గదిలో ఉన్నాడో చెప్పలేకపోయేవారు. ఎందుకంటే స్టాలిన్ అన్ని గదులు ఒకేలా ఉండి, అన్ని చోట్లా బాడీగార్డులు ఉండేవారు. కానీ వోల్ఫ్ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు స్టాలిన్ గదికి వచ్చాడు. స్టాలిన్ ఆశ్చర్యంతో ‘ఇదెలా సాధ్యం?’ అన్నాడు? దానికి వోల్ఫ్ ‘కళ్లు మూసుకొని నేను చారియామ్’ను అన్నాను అందరూ నాకు స్వాగతం పలుకుతూ మీ దగ్గరకు తెచ్చి వదిలారు. నిజానికి అక్కడ కాపలా ఉండే గార్డులందరూ ‘చారియామ్‌ను’ బాగా గుర్తిస్తారు. వోల్ఫ్ ధారణవల్ల అతనే చారియామ్‌గా వాళ్ళకు కన్పించాడు. చారియామ్ స్టాలిన్‌కు ముఖ్యమైన ఆంతరంగికుడు. రష్యాలో 1940కి ముందు ఇలాంటి మహిమలు చూపిన వాళ్లెందరినో కమ్యూనిస్టులు చంపారు. స్టాలిన్ ఆజ్ఞతో ‘కారత్ ఆటోవిజ్’ అనే మహిమలు చూపే వ్యక్తిని కూడా చంపారు. స్టాలిన్ వోల్ఫ్ మెసింగ్ లాంటి వ్యక్తుల అతీత శక్తులను గమనించి ఇలాంటి గొప్ప వ్యక్తులను హత్య చేయవద్దని ఆదేశించాడు.
మరి మన దేశంలో ఎందరో మహిమలుగల తత్త్వవేత్తలు పుట్టారు. వారి ముందు రాజకీయ పార్టీలు దాసోహం అంటున్నాయా? లేక స్వామీజీలే ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నారా? అన్న ప్రశ్నలతో గత పదిహేను రోజుల నుండి ప్రచార, ప్రసార మాధ్యమాలు పోటీలు పడి చర్చిస్తున్నాయి. ‘డేరా సచ్ఛా సౌదా’ అధిపతి రామ్హ్రీం గుర్మీత్ సింగ్‌ను ఇటీవల కోర్టు దోషిగా తేల్చడంతో అతను ఆధ్యాత్మికత ముసుగులో చేసిన అత్యాచారాలు, లీలలు, (నిజయమో, కావో కోర్టు తేల్చాలి) ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు అతని దయాదృష్టి కోసం ఎదురు చూసిన నోళ్లే ఈరోజు అతణ్ణి తిట్టి పోస్తున్నాయి.
1893 సెప్టెంబర్ 11 నుండి 27 వరకు సర్వమత మహాసభలకు అమెరికా పర్యటనకు వెళ్లి నిలువనీడలేక రాత్రిపూట పాత రైలు డబ్బాలో పడుకొని మరుసటిరోజు ప్రపంచ మత మహాసభల్లో ‘‘అమెరికా సోదర సోదరీమణులారా! సహనాన్ని సర్వమత సత్యత్వాన్ని లోకానికి అందించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను’’ అంటూ నాలుగువేల మంది సభికుల మధ్య హైందవ ధర్మ ఔన్నత్యాన్ని గర్వంగా చాటి చెప్పిన స్వామి వివేకానందను ‘మాంక్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. ఆ ఉపన్యాసం తర్వాత అమెరికాతోపాటు పాశ్చాత్య దేశాలు స్వామి వివేకానందం ముందు సాష్టాంగ పడ్డాయి. అమెరికా వీధుల్లో స్వామి కటౌట్లు పెడితే త్రోవలో వెళ్లేవాళ్లు శిరస్సు వంచి వెళ్ళేవాళ్లు. వారి మీద ఆయన ప్రభావం ఎంత గొప్పదోమరి! ఆయన గురువు పరమ హంసలకే పరమహంస శ్రీరామకృష్ణులు- ఆధునిక యుగంలో నిర్వికల్ప సమాధి పొందిన సిద్ధగురువు. కామినీ కాంచనాలను మట్టిబెడ్డలతో సమానంగా చూడమని ప్రబోధించాడు.
కేరళలోని కాలడి నుండి కాలినడకన బయల్దేరి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హటక్ నుండి కటక్ వరకు పాదయాత్ర చేసి మండని మిశ్రుడు, కుమారిల భట్టు వంటి పండితుల వాదనలు పూర్వపక్షం చేసి దేశం నాలుగు దిక్కుల్లో నాలుగు అమ్నాయ మఠాలు స్థాపించి వైదిక ధర్మ పునరుద్ధరణకు తోడ్పడ్డారుడు ఆదిశంకరుడు. ‘శంకరమ్ లోక వశంకరమ్’. ఈ జాతి ఆయన పాదాలపై పడింది. దేశమంతా తిరిగి విశిష్టాద్వైతామృతాన్ని లోకానికి పంచిన శ్రీమద్రామానుజులు, ద్వైత సిద్ధాంతం ద్వారా జీవుడు-దేవుడు ప్రపంచంలో ఎలా ప్రవర్తిస్తారో చెప్పిన మధ్వాచార్యులు, నింబార్కుడు, వల్లభాచార్యుల వంటి పరమగురువులు ఈ జాతికి మహోన్నత వైదిక, వేదాంత సిద్ధాంతాలను అందించారు. ‘నేనే రాముడు, కృష్ణుడు.. అన్నీ నాలోనే ఉన్నాయి’ అని మానవ శరీరంలోని అద్వైతానుభూతిని ఖండాంతరాల్లో చాటిచెప్పిన కాషాయాంబరధారి రామతీర్థ వేదాంతం మనం మరువగలమా! ‘అందరూ వేదపఠనం చేయవచ్చని, ఈ దేశంలో పుట్టిన వాళ్లంతా ఆర్యులేనని ఎలుగెత్తి చాటిన వైదిక ధర్మపతాక.. స్వామి దయానంద సరస్వతి ధర్మం కోసం తన ప్రాణమే పోగొట్టుకున్నాడు. ఆయన కోవలోనే నడిచిన అసలు మహాత్ముడు స్వామి శ్రద్ధానంద 90 ఏళ్ళ క్రితమే శుద్ధి కార్యక్రమం ద్వారా మతం మారిన హిందువులను పునరాగమం చేయించాడు. ఈ యజ్ఞంలో 1926 డిసెంబర్ 23న అబ్దుల్ రశీద్ అనే మతోన్మాది చేతిలో హత్య చేయబడ్డ స్వామి శ్రద్ధానంద ఈ దేశ కాషాయగుంపునకు గొప్ప ఆదర్శం!
స్వామి వివేకానంద తర్వాత 25 ఏళ్లకు అమెరికావెళ్లి తన క్రియాయోగ సిద్ధాంతం ద్వారా పాశ్చాత్యులను భారతీయ యోగం వైపు మరల్చిన ఒక యోగి ఆత్మకథ (ఎ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి) రచయిత పరమహంస యోగానంద ఈ దేశ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక. వీరవిప్లవ స్వాతంత్య్ర యోధునిగా ఉండి ఒక్కసారిగా జైలులో కృష్ణ దర్శనం పొంది పూర్ణయోగం ద్వారా ఈ దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వస్తుందో ముందే చెప్పిన పూర్ణయోగి అరవిందుడు ఈ దేశ గురు సమాజానికి ఆదర్శమే కదా! ఆనంద్‌మార్గ్‌ను స్థాపించి ‘పౌట్ ఫిలాసఫీ’ ద్వారా కమ్యూనిజానికి ప్రత్యామ్నాయ ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించి, ఆనందమూర్తిగా మారిన ప్రభాత్ రంజన్ సర్కార్ ప్రాచీన భారతీయ వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం. పాశ్చాత్య దేశాలకు కృష్ణుణ్ణి తీసుకెళ్ళి క్రీస్తును మటుమాయం చేసిన ఎ.సి. భక్తి వేదాంత స్వామి అడుగుజాడల్లో ఫోర్డ్ కంపెనీ యజమాని కూడా నడవడం మన భగవద్గీతకున్న మహాత్మ్యం కాకపోతే ఇంకేమిటి?
ఆధ్యాత్మిక మార్గంలో సేవా దృక్పథాన్ని స్థిరీకృతం చేసి పాశ్చాత్యులను, పదవులున్న వాళ్లను తన పాదాల చెంత మోకరిల్లేలా చేసిన భగవాన్ సత్యసాయి కట్టిన కాషాయవస్త్రం ఈ జాతి విశేషం కాదా? మొదటిసారిగా శూద్రకులాలకు మఠాలు స్థాపించే అధికారం ఇచ్చి యోగ విజ్ఞానం ప్రయోగాత్మకంగా చూపించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఈ దేశంలోని స్వాములకు వారసత్వమే కదా! తన ‘నారాయణ ధర్మ పరిపాలన యోగం’ ద్వారా కేరళ ప్రాంతంలో ప్రాచీన హిందూ మత వైభవాన్ని పునరుద్ధరించి నారాయణగురు ధరించిన కాషాయాంబరం మన ఆత్మగౌరవం కాక ఇంకేమిటి?
వేదాంతాన్ని వాదనతో కాకుండా బోధనతో జాతికి అందించి సరిక్రొత్త సనాతన వేదాంతం అందించిన మలయాళస్వామి పాదాలకు మనం ప్రణమిల్లకుండా ఉండగలమా? తన వౌనంతోనే రాష్టప్రతులను సైతం రాళ్లలా ముందుకు కూర్చోబెట్టగలిగిన రమణమహర్షిని మించిన అద్వైత మూర్తి ఇంకెవరుంటారు? స్ర్తిలకు యోగవిద్యను అందించి భారతీయ యోగాన్ని విశ్వమయం చేసి బ్రహ్మబాబాగా పేరొందిన దాదా లౌక్‌రాజ్‌జీని మించిన యోగమూర్తి ఎక్కడైనా కన్పిస్తాడా? భారతీయ ఆధ్యాత్మిక విద్యలను ప్రపంచ యవనికపై నిలబెట్టి విదేశాల్లో విశ్వవిద్యాలయాలు ప్రారంభించిన మహర్షి మహేశ్ యోగి మన వారసత్వం భావిస్తున్నామా? లేదా? ఋషీకేశ్ నుండి యోగ, వేదాంతాలను దేశమంతా ప్రసరింపచేసేందుకు స్వామి శివానంద అనుసరించిందే అసలైన మార్గం అని మనం మరిచిపోయామా? నిశ్శబ్దంగా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆవరించిన రామచంద్ర మిషన్ కార్యక్రమాలు మనలో ఎందరికి తెలుసు? కాషాయ వస్త్రాలు కట్టకుండానే దేశాన్ని, ధర్మాన్ని ‘తల్లి భారతి’గా మలిచి ఈ జాతిని కాపాడిన డాక్టర్ హెగ్డేవార్, యంయస్ గోళ్వాల్కర్ సన్యాసులకు తీసిపోతారా? ఆధ్యాత్మిక మార్గంలోకి రాకుంటే దేశంలో మరో గాంధీకి సమానమైన కంచి పరమాచార్య, అభినవ ఆది శంకరులు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్ఫూర్తి మనం విస్మరించగలమా?
మన ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు ఆకర్షితులై ఈ మట్టిని, ఇక్కడి జ్ఞానాన్ని ప్రేమించి ఈ దేశ కాషాయ ధ్వజం ముందు శిరస్సు వంచిన మేడం బ్లావేట్‌స్కీ, సిస్టర్ నివేదిత, మాతా అరవింద వంటి జ్ఞానులు కోకొల్లలు. ఈ దేశంలో పుట్టిన మహాత్ములపై 90 ఏళ్ళ క్రితమే ‘ఎ సీక్రేట్ సెర్చ్ ఇన్ ఇండియా’ అనే పేరుతో పరిశోధనా గ్రంథం రాసిన పాల్‌బ్రంటన్ అనే ఫారిన్ జర్నలిస్ట్ రమణమహర్షి వౌనంతో కలిసిపోవడం మనం గమనించామా! ఇంత గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం ఉన్న ‘మన మహాత్ములు’ ఈ రోజు గమనించాల్సిన కొన్ని విషయాలున్నాయి. నిరాడంబరత్వానికి ప్రతీక మన సంప్రదాయం. సేవ పేరుతో లేదా గుంపు పేరుతో విలాసాలకు, భోగాలకు అలవాటుపడడం ఆత్మవంచన తప్ప ఆత్మ జ్ఞానం ఎప్పటికీ కాదు. ఒక కార్యక్రమానికి రావాలని ఓ స్వామీజీని పిలిస్తే ఎన్ని పోస్టర్లు వేస్తారు? ఎన్ని బ్యానర్లు కడతారు? ఎంత మందిని పిలుస్తారు? అని విచారణ చేసి వెళ్లడం ఏం ఆధ్యాత్మికత? ‘డాగ్స్ అండ్ పొలిటికల్ లీడర్స్ ఆర్ నాట్ ఎలౌడ్’ అని ఆశ్రమం బయట బోర్తుపెట్టిన పూర్వపు ఓ గురువు ధైర్యం ఈరోజు ఒక్కరికైనా ఉందా? ‘పాదపూజలకు పదివేలు, ఆశీర్వాదానికి ఐదువేలు’ అని బోర్డు పెట్టి గుళ్లో టిక్కెట్ల ధరల్లా వసూలు చేసే వందిమాగదులను గురువులు దూరం పెట్టాలి.
ఇతర మతాలకు ఓ చక్కటి అవకాశం ఉంది. పాస్టర్లు పెళ్లిళ్లు చేసుకొని తమ మత ప్రచారం చేస్తారు. వౌల్వీలు, ముల్లాలు సంసార జీవనంలో అన్ని వ్యవహారాలు చేస్తూనే తమ మతరక్షణ చేస్తారు. జామా మసీదు ఇమాం అక్రమంగా ఎంత సంపాదించినా, కె.ఎ.పాల్ కోట్లాది రూపాయలు సంపాదించి.. ‘అమెరికా అధ్యక్షుడు నా కాళ్లదగ్గర పడి ఉంటాడ’ని ప్రగల్భాలు పలికినా మీడియా పట్టించుకోదు. హిందూ స్వాములు అలాకాదే? మతానికి సేవచేసే వారితో మీడియాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ల చేతిలో ఓట్లు ఉంటాయి కాబట్టి రాజకీయ నాయకులు వారిని రక్షిస్తారు. ఆధ్యాత్మిక జీవనం గడిపేవారిని ఎవరు కాపాడాలి? ఇదే హిందూ మతానికి వచ్చిన చిక్కు. ఆధ్యాత్మికత తెలిసిన వాళ్లకు దేశం, ధర్మం పట్టదు. దేశం, ధర్మం తెలిసిన వాళ్లకు మనం పట్టడం కష్టం. ఇటీవల తెలుగునాట ఉన్న స్వాముల పరిస్థితి కూడా వీటిలో భాగమే.
రాజకీయ నాయకులకు గురువులుగా కొందరు, దిక్కు మాలిన సినిమాలతో జాతిని సర్వనాశనం చేస్తున్న సెలబ్రిటీలను ఆశీర్వదించేవారు ఇంకొందరు, లోకం పోకడ తెలియక సామాన్యుల దరిచేరనివారు ఇంకొందరు, తమ జ్ఞానంతో అజ్ఞానుల మాయలో చిక్కుతున్నవారు ఎందరో? ఆశారాం బాపూ లక్షలమందికి ప్రబోధం చేస్తుంటే నాడు కాంగ్రెస్ కీలక నాయకుడు కమల్‌నాథ్ వంటి వారు వినయంగా ఆయన ముందు కూర్చొనేవారు. ఆయన కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లాక రోజుకో కథనం పుట్టుకొస్తుంది. ‘దేవుని తైలంతో నొప్పులు తగ్గిస్తాం! ప్రార్థనలతో కుంటివాళ్లను నడిపిస్తాం’ అని బహిరంగ సమావేశాలు పెట్టేవాళ్లను ప్రశ్నించే ధైర్యం ఏ దమ్మున్న ఛానల్ చేయదు. మృగశిర కార్తెలో చేపమందు ఇచ్చే వాళ్ల వల్లనే ఈ ప్రపంచం రోగాలమయం అయిందంటూ అజ్ఞాన విజ్ఞానంతో ఊదరగొట్టేస్తారు. ధర్మాన్ని ప్రచారం చేసే స్వామిని ‘మీరు చిన్నప్పుడు మందు తాగారా?’ అని ఓ ఛానల్ విలేఖరి ప్రశ్నిస్తే ఆయన చిరునవ్వుతో వౌనంగా ఉంటే - ‘చూశారా! స్వామి చిన్నప్పుడు మందు త్రాగాడు కాబట్టే వౌనం వహించి నవ్వుతున్నాడ’ని సాయంత్రం వరకు చూపిస్తారు. సాయిబాబా దేవుడా? కాడా? అనే చర్చను మంచి కండపట్టిన స్వామికి, ఓ బక్క పలచన ఉన్న స్వామికి మధ్య కబడ్డీ పోటీలా పెట్టి వికృతానందం పొందుతారు!
కాబట్టి ‘జగడానికి జల్లెడ పడుతున్న’ ఇన్ని ‘నకారాత్మక శక్తుల’ మధ్య ఆధ్యాత్మిక ఉపాసన బహుకష్టం. మతం మత్తుమందు అంటూనే దాని మత్తును తాగి ఊగే మీడియా ప్రపంచం ఒకవైపుసందు దొరికితే స్వామీజీలనే తమ సామంతులను చేయగల అధికారం.. ఇన్నింటి మధ్య వేదాంతం హాహాకారం. అసలైన భారతీయ ఆధ్యాత్మికతను అర్థం చేసుకుంటే స్వామి వివేకానందలా నిర్భయులమవుతాం. బలహీన మనస్తత్వాన్ని ఆధ్యాత్మిక సోపానంగా చేయమని భారతీయ వేదాంతం ఎప్పుడూ చెప్పదు. గురువులారా! కాస్త ప్రజ్ఞతో జీవిద్దాం! అజ్ఞానాన్ని తరిమేద్దాం! *

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published Andhrabhoomi, Friday, 1 September 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి