ఒక వ్యక్తి చేపలు అమ్మే దుకాణంపెట్టి ఇక్కడ తాజాచేపలు అమ్మబడును అనే బోర్డు బయట తగిలించాడు. మరుసటి రోజు ఓ పెద్దాయన వచ్చి నీవు ‘ఇచ్చట’ కాకపోతే ‘అచ్చట’ అమ్ముతున్నావా? దుకాణం ఇక్కడే ఉన్నప్పుడు బోర్డులో ‘ఇచ్చట’ ఎందుకు? అనగానే రంగుతో ‘ఇచ్చట‘ చెరిపేశాడు. రెండురోజులకు ఇంకో వ్యక్తి వచ్చి ‘నీవు తాజా చేపలు’ కాకపోతే నిన్నటివి, మొన్నటివి అమ్మితే కొనుక్కోవడానికి మేమేమైనా తెలివి తక్కువ వాళ్లమా! ‘తాజా’ అనే పదం ఎందుకు అన్నాడట. వెంటనే ‘తాజా’ కూడా బోర్డులో ఎగిరిపోయింది. వారమయ్యాక ఇంకొకరు వచ్చి ఎదురుగా ‘చేపలు’ కనబడుతుంటే ఇదేమైనా కూరగాయల దుకాణం అనుకుంటారా! అయినా కిలోమీటర్ దూరం చేపల కంపు కొడుతుంటే బోర్డుపై ‘చేపలు’ అని అవసరమా! అనగానే రంగుతో చేపలు అనే పదం తొలగించాడు. బోర్డుపై ‘అమ్మబడును’ మాత్రమే మిగిలితే ‘ఈ బోర్డు ఎందుకు అమ్ముతావు’ అని అడిగాడట మరో వ్యక్తి!
ప్రస్తుతం దేశంలో వామపక్ష పార్టీల పరిస్థితి ఇదే! 1925 ప్రాంతంలో పుట్టిన వామపక్ష పార్టీకి ఇనే్నళ్లు గడచినా ఈ దేశ వౌలిక భావనలు అర్థం కాకపోవడం వింతల్లోకెల్లా పెద్దవింత. ఎర్రన్నల వైఖరి ఎందుకు వేలంవెర్రిగా మారింది?
స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ చంకలో చేరి సాంస్కృతిక రంగాన్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకున్న వామపక్ష విపరీత ధోరణి ఇటీవల ఎక్కువైంది! 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీ అనే జాతీయవాది ప్రధాని కావడం వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజూ ప్రజల గురించి తపిస్తున్నామన్న కమ్యూనిస్టులు ఎన్నో చారిత్రక తప్పిదాలు చేసి తర్వాత లెంపలేసుకున్నారు. గాంధీని, టాగూర్‌ను, సుభాశ్ చంద్రబోస్‌ను, స్వామి వివేకానందను ఆఖరుకు వీరసావర్కర్, అంబేద్కర్‌ను కూడా వదిలిపెట్టలేదు. విధ్వంసం అయ్యాక వీటన్నిటికి పశ్చాత్తాపపడి తమ ‘చారిత్ర తప్పిదాల’ లిస్టులో చేర్చారు.
స్వాతంత్య్ర పోరాటంలో ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని వారు వ్యతిరేకించారు, దేశ విభజనకు ముస్లింలీగ్ ప్రయత్నిస్తే వారికి మద్దతునిచ్చారు. పాకిస్తాన్ విభజన కోసం ముస్లింలీగ్‌కు, జిన్నాకు మద్దతుగా కమ్యూనిస్టులు 1941నుండి 1947 వరకు దేశంలో భయంకర ఆందోళన జరిపారు. ఈరోజుకూ కాశ్మీర్ వేర్పాటువాదులకు మానవ హక్కుల పేరుతో, భావ స్వేచ్ఛ పేరుతో సహకరిస్తునే వున్నారు. చివరకు పార్లమెంటుపై దాడిచేసిన మహ్మద్ అఫ్జల్‌ను ఓ వామపక్ష కవి భగత్‌సింగ్‌తో పోల్చాడు! భారత సార్వభౌమత్వాన్ని ధిక్కరిస్తూ దాడి చేసిన సూత్రధారులకు శిక్ష విధిస్తే వామపక్షాలు శిక్షకు వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో ప్రముఖపాత్ర వహించాయి. కమ్యూనిస్టు ఆర్థికవేత్త, నాటి పశ్చిమ బెంగాల్ మంత్రి అశోక్‌మిత్ర అందులో ప్రముఖ పాత్ర వహించాడు. ఈ విషయాన్ని ప్రముఖ కమ్యూనిస్టు నేత మోహిత్‌సేన్ తన ఆత్మకథ ‘ఎ ట్రావెలర్ ఎండ్ ద రోడ్’లో ప్రస్తావిస్తూ ‘్భరతీయ కమ్యూనిస్టులు అన్నిరకాల పాపాల్లో మునిగిపోయారు. అదే క్రమంలో ఉగ్రవాదులను సమర్ధించడానికి రకరకాల తర్కాలు అల్లుతుంటారు’ అన్నాడు. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి?
ఇది గత ఎనభై దశాబ్దాల నుండి కొనసాగుతునే ఉంది. 1920లో తాష్కంట్‌లో ఓ కమ్యూనిస్టు పార్టీ ప్రారంభం అయింది. ఆనాడు అక్కడి కమ్యూనిస్టులు ‘్భరతదేశంలో తిరిగి మొఘల్ సామ్రాజ్యం స్థాపించాలనే’ వ్యక్తులతో జత కట్టారు. అయితే బ్రిటిష్‌వాళ్లు ఆఫ్ఘానిస్తాన్‌కు చెందిన అమీర్ హబీబుల్లాను లొంగదీసుకుని ఆ ప్రయత్నాలను విఫలం చేసారు. ఇలా అడుగడుగునా భారత వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్న వామపక్షాలు ఇటీవల నరేంద్ర మోదీ చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తున్నాయి. నల్లధనం వెనక్కి తేలేదని మోదీని ప్రకాశ్‌కారత్ దగ్గరనుండి బి.వి.రాఘవుల వరకు అందరు తిట్టిపోశారు. పెద్దనోట్ల రద్దు చేయగానే కనీసం ఒక్క క్షణం ఆలోచించకుండా మోదీ చేసిన పని అవివేకం అన్నారు. సిపిఐ నేత నారాయణలాంటి వారైతే ఒక అడుగు ముందుకేసి ‘మోదీని ఉరి తీయాలి’ అన్నాడు. ఇదంతా ఆదానీకి, అంబానీకి లాభం చేకూర్చడానికే అన్నారు. మరి డెబ్బై ఏళ్లనుండి కాంగ్రెస్, ఇతర పక్షాల పల్లకీ మోస్తున్న వామపక్షాలకు తెలియకుండానే ఈ కార్పొరేట్ సంస్థలు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చాయా? అలాగే నరేంద్ర మోదీ విదేశాంగ విధానంపై, పరిపాలనపై, జిఎస్టీపై, ఆర్థికాంశాలపై అన్నింటిపై క్షణం ఆగకుండా వామపక్షాలు, వాటి సిద్ధాంత మేధావులు విమర్శిస్తారు. క్షీర నీర న్యాయం వామపక్షాలకు వర్తించదా?
గోద్రా రైలులో 59మంది నిర్దాక్షిణ్యంగా చంపబడ్డ హిందువుల గురించి ఒక్క మాట మాట్లాడని వామపక్షాలు, ఆ తర్వాత జరిగిన గుజరాత్ అల్లర్లను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లాయి. సఫ్దర్ హష్మీ ట్రస్ట్‌ను నడిపే వాపపక్ష నేత, అభినేత్రి షబనా హష్మీ దేశ విదేశాల్లో నరేంద్రమోదీని అపఖ్యాతిపాలు చేసింది. అదే సమయంలో వామపక్ష మదర్సాగా చెప్పే జెఎన్‌యుకు చెందిన ఆచార్యులు అమెరికా పార్లమెంటు బృందం ముందు మనదేశం పరువుతీసేలా సాక్ష్యం ఇచ్చారు.
హిందుత్వాన్ని, జాతీయతను, దేశభక్తిని లక్ష్యంగా చేసుకుని విదేశీ శక్తులకు కూడా మద్దతిచ్చే మనస్తత్వం వామపక్షాలకు మొదటినుండి అలవాటే. 1919 ప్రాంతంలో ఖిలాఫత్ ఉద్యమానికి, మనకూ ఎలాంటి సంబంధం లేకున్నా కేరళలోని మోప్లాలో జరిగిన హిందువుల హత్యకాండలో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తుల వారసత్వంగా ఈ రోజు కేరళలో జరిగే విధ్వంసం నిజం కాదా?
1980-90 మధ్యలో సోవియట్ యూనియన్ ఆఫ్ఘానిస్తాన్‌వైపు, అమెరికా వేర్పాటువాదులవైపు మద్దతు తెలిపాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికా అక్కడి తాలిబన్లకు వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలైంది. అమెరికాపై లాడెన్ యుద్ధం ప్రకటించాకగానీ ఆ దేశానికి తత్వం బోధ పడలేదు. విచిత్రంగా ఈ దేశంలోని కమ్యూనిస్టులు అమెరికాపైనున్న గుడ్డి వ్యతిరేకతతో మనదేశంలోని తీవ్రవాదులను సమర్థించడం మొదలుపెట్టారు. దానికోసం ‘సూడో సెక్యులరిజం’ వారికి బాగా ఉపయోగపడుతోంది. కేవలం హిందు నాయకులను, జాతీయవాదులను, ఈ దేశ సార్వభౌమత్వాన్ని ఎప్పుడూ వ్యతిరేకించడమే వారి ప్రధాన ఎజెండా!
నరేంద్ర మోదీ తప్పుచేస్తే తప్పు అనాలి; ఒప్పు చేస్తే ఒప్పు అనాలి. కానీ నరేంద్ర మోదీ ఏది చేసినా తప్పే అనే ధోరణి పిడివాదం తప్ప ఇంకోటి కాదు. అభివృద్ధి విషయంలో సంప్రదాయ పార్టీలు చాలా ముందున్నాయి. అవి ప్రాంతీయ పార్టీలైనా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుస్తున్నాయి. అందుకే అవన్నీ ఎన్నో ఒడిదుడుకులను సహించి, సమీక్షతో ముందుకు వెడుతున్నాయి. కానీ వామపక్షాలు ఓ మత సిద్ధాంతంలా ప్రవర్తిస్తూ హిందూ వ్యతిరేకత మూటగట్టుకుని, రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ప్రచార, ప్రసార మాధ్యమాల్లో తిష్ట వేసుకున్న ఈ గుంపు ప్రతి విషయాన్ని హిందూ జాతీయ వ్యతిరేకత కోణంలో చూస్తాయి. పుంఖానుపుంఖాలుగా రచనలు చేస్తూ మేధావి వర్గం, వామపక్షాలు నిలువెల్లా హిందూ వ్యతిరేకత నింపుకున్నాయి. 29 డిసెంబర్ 2007న ప్రముఖ కమ్యూనిస్టు పాత్రికేయుడు కరుణ్‌ధాపర్ ‘నరేంద్ర మోదీని ఆకస్మిక తొలగిపు’ చేయాలన్నాడు. అంటే దీనర్ధం ఏమిటి? అలాగే కమ్యూనిస్టు మేధావులుగా చెప్పుకునే వాళ్లంతా కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కావాలనే వాళ్లకు వత్తాసు పలుకుతారు కానీ బౌద్ధుల టిబెట్ గురించి మాట్లాడరు! కాశ్మీరీలు, భారతీయులు జాతిపరంగా ఒక్కటే, కానీ టిబెట్‌ను ఆక్రమించాలనుకుంటున్న చైనాకు వామపక్షాల మద్దతు ఉంటుంది. నిజానికి టిబెటన్లు చైనీయుల హాన్ జాతికి భిన్నమైన వాళ్లు మాత్రమే కాదు. వారు మతపరంగా కూడా భిన్నమైన వారే. ఇదెక్కడి నీతి? ‘ఎర్ర’వారిది గురివింద చందం కాదూ?
కాశ్మీర్‌నుండి వెళ్లగొట్టబడిన లక్షలాది మంది కాశ్మీరీ పండితుల గురించి నోరు తెరవని కమ్యూనిస్టులు పాలస్తీనా శరణార్ధుల గురించి ఇజ్రాయిల్‌కు వెళ్లేందుకు వారికున్న అపార హక్కుల గురించి ధర్మపన్నాలు వల్లిస్తారు. గడచిన నెలరోజులనుండి రోహింగ్యా ముస్లిం శరణార్ధుల గురించి గ్యాలెన్లకొద్దీ కన్నీళ్లు కారుస్తున్నాయి ఈ ఎర్రకలాలు!? సుశీల్ చోప్రా, దినేష్ వాస్నిక్ వంటి వామపక్ష నాయకులు జాతీయ చానళ్లలో రోహింగ్యాలకు మద్దతు ప్రకటించారు. భారతదేశాన్ని ఒక స్వతంత్ర రాష్ట్రాల సమాఖ్యగా అభివర్ణించే కమ్యూనిస్టులు ఈ దేశాన్ని ‘సాంస్కృతిక ఏకత్వం’ ఉన్న మూలభూమిగా ఎందుకు గుర్తించరు? ఇనే్నళ్ల రాజకీయంలో వామపక్షాల వెనుకబాటుకు ఇది కారణం కాదాః
ఏమీ తెలియని అఖిలేశ్ యాదవ్ ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ లాంటి అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కమ్యూనిస్టులు సంబరపడతారు. వారసత్వంగా వచ్చిన విఫల నాయకుడు రాహుల్‌గాంధీ ఓ పార్టీకి ఉపాధ్యక్షుడై నాటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ జారీ చేసిన అధికార పత్రాన్ని చించి చెత్తబుట్టలో వేసినా యువరాజు గొప్పవాడే! 25 ఏళ్లనుండి ఏకంగా పార్లమెంటుకి ఎన్నికైన యోగి ఆదిత్యనాధ్ యుపి ముఖ్యమంత్రి అయితే అది అంతర్జాతీయ నేరమా? వారసత్వంగా కాని, దొడ్డిదారిన కానీ యోగి, మోదీలు అధికారం చేపట్టారా? ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నాయకులను తిట్టడమే పార్టీ విధానంగా వుండడం విడ్డూరం! కేవలం హిందూ జాతీయ వ్యతిరేకతనే దీనికి కారణం. ఇతర మతాలకు చెందిన నాయకుల్లో ఎన్ని అవలక్షణాలు, అవినీతి, ఆశ్రీత పక్షపాతం, బంధుప్రీతి వున్నాసరే వారంతా వామపక్షాల దృష్టిలో మహానుభావులు. దీనికి సెక్యులరిజం ఓ ముసుగు మాత్రమే. హిందూ జాతీయతను తిట్టగలగడమే ఈనాటి కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టో! హిందుత్వ వ్యతిరేకతనే మార్క్స్‌వాదమా! మరి ఈ దేశంలో కోట్లాదిమంది మనోభావాలకు విలువలేదా!
ఇంత గుడ్డిగా జాతీయతా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కమ్యూనిస్టులు సమీక్ష లేకుండా ముందుకు వెళ్తే మరింత సంకుచితమై దిగజారడం ఖాయం. ఇప్పటికే అరవై ఏళ్లు దాటిన సిపిఐ నారాయణ ఓనమాలు దిద్దుతున్న కన్హయ్యకుమార్‌కు స్వాగతం పలుకుతుంటే జనం నవ్వుకుంటున్నారు. కులాల మధ్య ఘర్షణ పెట్టి స్వయం ప్రకటిత మేధావిగా మారిన కంచ ఐలయ్య చేతిలో కమ్యూనిస్టు పార్టీలు నడుపుతున్న ‘టీమాస్’ పెట్టిన తమ్మినేని వీరభద్రంపై జనం జాలిపడుతున్నారు. ఇలాంటి చౌకబారు రాజకీయ విధానం వామపక్షాలు ఇంకెన్నాళ్లు నడిపిస్తారు? కమ్యూనిస్టుల ఆలోచనలు మంచివే అని చాలామందికి విశ్వాసం. కానీ ఆ ఆశయాలకోసం నడిచే దారి, ఆశయాలను, ఆశలను మింగేయడం ఆత్మహత్యా సదృశం!

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published Andhrabhoomi,  Friday, 13 October 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి