ఫ్రస్థానత్రయంలాగానే త్రైతభావంలో దేవుడు- జీవుడు- ప్రకృతి ప్రధానమైనవి. పరమాత్మ సమస్త సృష్టికి మూలస్వరూపం. ఆయన నిరాకారుడు. నిరంజనుడు, సర్వవ్యాపకుడు, దేవాధిదేవుడు- ఆయనే పరబ్రహ్మ- పరమాత్మ.
‘ఏకమూర్తి త్రయోభాగః బ్రహ్మ విష్ణు మహేశ్వరః’- ఒకే మూర్తి మూడు భాగాలుగా మారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భాసిస్తున్నారు. ఆ ఒకే మూర్తి ‘ఏకమేవాద్వితీయం’ అన్నట్లు సృష్టిచక్రాన్ని నడిపిస్తాడు. సృష్టిలోని వివిధ కార్యకలాపాల నిర్వహణకు లేదా విధుల నిర్వహణకు ముగ్గురు మూర్తులుగా ప్రకటింపబడ్డారు. బ్రహ్మ శబ్దానికి పెద్దది, గొప్పది అని అర్థం. ఆ ముగ్గురిలో నారాయణుడు విష్ణువు. విష్ణు శబ్దానికి విశ్వవ్యాప్తమైనవాడు అని అర్థం. ఈశ్వరుడు శుభాలనిచ్చే పాలించే ప్రభువు. ఈ త్రిమూర్తులు, వారి సాధ్వీమణులు సరస్వతి, లక్ష్మి, పార్వతులు ఈ సృష్టి నియమాలను పాలించే శక్తి స్వరూపాలు. వీళ్లందరినీ నడిపించే చైతన్యమే పరమాత్మ.
ఓ దేశాన్ని పాలించే రాజు మనస్సులో మూడు ప్రశ్నలు ఉదయించాయి. ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు జవాబులు యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను, శాస్తక్రారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను మూడు ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకువచ్చి సరైన సమాధానం చెప్పినవారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. లేదంటే వారు ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పారు. దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఓ కుగ్రామంలోనుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు. రాజాస్థానం చేరుకొన్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు. పశువుల కాపరి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేసాడు. ‘‘చెప్పేవాడు గురువు; వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి’’. కాబట్టి మహారాజా! మీరు సింహాసనం దిగండి అన్నాడు. రాజు సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించి, ‘‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు.
మొదటి ప్రశ్న దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు. వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టాడు. మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు. ‘‘అన్నివైపులకు చూస్తుంది’’ అని జవాబిచ్చాడు రాజు. ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మనే. ఇక రెండవ ప్రశ్న ‘‘దేవుడు ఎక్కడ ఉంటాడు’’ అన్నాడు రాజు. ‘‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’’ అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు. ‘‘మహారాజా! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’’ అని అడిగాడు. ‘పాలను బాగా మరుగబెట్టాలి. వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధం అవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’’ అన్నాడు రాజు.
‘సరిగ్గా చెప్పారు మహారాజా! అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, మనస్సు అనే తోడు వేసి, స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’’ అన్నాడు కాపరి. సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. రాజా, మీరు అడిగిన చివరి ప్రశ్న దేవుడు ఏం చేస్తాడు? అని. ‘‘నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. క్రింద వున్న నన్ను సింహాసనంపైన కూర్చోబెట్టారు. పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు. సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు.

*************************************************

      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ
ॐ బుధవారం 卐 ఏప్రిల్ 25 卐 2018 ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి