ఒక కార్యాలయంలో ఓ ఛిన్న పని గురించి వెళ్లిన మనం అటెండర్ దగ్గరినుండి అందరికీ ‘మస్కా’ కొట్టి సలాం చేసి గులాముల్లా మారి పనులు చేసుకొంటున్నాం.
ఇలాంటి మనస్తత్వం మనలో అవకాశవాద, స్వార్థబుద్ధిని నింపుతున్నది. స్వార్థం మనలో అంతులేకుండా పెరిగినపుడు మన మనస్సు విషపూరితమవుతున్నది. విషపూరిత మనస్సు మొత్తం లోకాన్ని అలాగే మార్చేస్తున్నది. తద్వారా మనకు సత్యదర్శనం కావడంలేదు. ఎంతవరకు సత్యదర్శనం కాదో అప్పటివరకు పరమాత్మ వైపు మన అడుగులు పడడంలేదు.
క్రింది మెట్టు వద్ద ఆగిపోతున్న మనం పరమాత్మను చేరుకోలేని స్థితిలో ఉన్నాం. ఆధ్యాత్మిక సంబంధాలు అంతరిస్తున్నాయ్. తద్వారా మనుషుల మధ్య మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయ్. విషయ వాసనలు ఎక్కువై మనిషి ఇంద్రియాలను బలహీనపరచి సంస్కారాల పరంపరను పెంచుతాయి. జన్మజన్మల నుండి వాసనలు బలంగా మానవుణ్ణి బంధించి అవన్నీ పైకి ప్రకోపించి సత్సంకల్పం నుండి దూరం చేస్తాయి. విశ్వమే నాది, విశ్వమే పరమాత్మ అనుకొనే భావన నుండి దూరం జరిగి నేను, నాది అనే అహంకారంలోకి దిగజారిపోతున్నాం.
అది మానవ ధర్మ నిర్వహణకు అతి పెద్ద ఆటంకం. ఇన్ని లొసుగుల్లో పడిపోయి పరమాత్మ పథాన్ని ప్రక్కన పెడుతున్నాం. అది మనకు భవిష్యత్తులో పెను సవాలుగా మారి మనిషిని వ్యక్తిగా బలహీనపరచి, కైలాస పటంలోని పాములా మ్రింగేస్తుంది. అపుడు మోక్షం వైపు కాదు కదా ఆధ్యాత్మిక వాసనలే తెలియని అజ్ఞానిగా మారిపోతాడు.
అంతరిక్షంలోని విజ్ఞానమంతా తన సొంతమే అనుకొంటున్న ఈ వ్యక్తి తనలో జరిగే ఈ తతంగం గురించి తెలుసుకోకపోవడం అతని అజ్ఞాన భావానికి పరాకాష్ఠ. ఈ విశ్వాన్ని నడిపించే విశ్వచైతన్యమూర్తి; పరంజ్యోతి పరమాత్మ. అన్ని విషయాలను నడిపించే సమర్థుడు, జీవుల జన్మలను నిర్ణయించడమే కాదు, వారి జన్మ దుఃఖాన్ని పోగొట్టి తన కార్యంలో భాగం పంచుకోమంటాడు. ఆయన సర్వశక్తిమంతుడు. షడ్విధాలైన ఐశ్వర్యములు కలవాడు. అతని విభూతియే ఈ లోకం. ఈ సత్యం తెలుసుకొన్న జిజ్ఞాసువు ఆయన కోసమే తపిస్తాడు, జపిస్తాడు.
నిరహంకారివై నిరాకారం వైపు పయనించు!
ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడు పరమాత్మ. పరమాత్మ విశ్వచైతన్యం కల నిరాకార స్వరూపుడు. ఈ నిరాకార తత్వంతోనే జగన్నియామకుడై ఈ సృష్టిని ప్రవర్తింపజేస్తున్నాడు. అయితే పరమాత్మ మార్గాన్ని మరచిపోయిన మానవులు నిరంతరం అహంకారంతో, దంబంతో కామక్రోధాలతో తమ జీవితంలో తానే నిప్పులు పోసుకొంటున్నారు. తత్త్వ దృష్టి లేని మానవులు వీర విహారంతో భోగాలను అనుభవిస్తూ కన్నుగానకుండా తయారవుతున్నారు.
దుర్వ్యసనాలకు బానిసలైన కొందరేమో తాము చేస్తున్న పనిని సమర్థించుకోవడానికి రకరకాల సిద్ధాంతాలు అల్లుతున్నారు. నిరంతరం అశాంతికి గురిచేసే ఈ కుట్రల చట్రంలో మునిగిన మనుషులు తన అసలు తత్త్వాన్ని తెలుసుకోలేక విచిత్ర విన్యాసాలు చేయడం విడ్డూరం.
వేల సంవత్సరాలనాడే విశ్వతత్వాన్ని ఆపోసన పట్టిన మన వైదిక ఋషులు ‘సూర్యవిద్య’ను వేద విజ్ఞానం ద్వారా మనకు అందించారు. భగవత్ ప్రాప్తి కోసం ‘మోక్షసాధన’ కొరకు ‘యోగవిద్య’ కూడా మనకు అందించబడింది.
ఈ విద్యల్ని సులభోపాయంగా మనకు సాధించే మార్గాలను కూడా మన ముందు పెట్టారు. ‘మాయ’ను మనసునిండా ఆవరింపజేసుకొన్న మనం విషవృక్షంపై వున్న కీటకాల్లా మారిపోయాం. మనసులేని మనస్తత్వంతో ఆధ్యాత్మిక దృష్టి, తాత్విక దృష్టి వదలిపెట్టి సమాజంలో చీడపురుగుల్లా తయారై అందరినీ అశాంతికి గురిచేస్తున్నాం. అస్తవ్యస్త విధానాలతో మన ప్రభుత్వాలు మానవీయ విద్యను- ఆధ్యాత్మిక విద్యను వదలిపెట్టి మనిషిని పతనం చేసే పామరత్వానికి గురిచేస్తున్నాయి. ‘నేను-నాది’ అనే భావం రోజురోజుకు పెరిగి అహంకారంతో వ్యవహరిస్తున్న మనిషి మమకారం చూపిస్తూ ‘అన్నీ నావే’ అంటున్నాడు. ఆ దశను మనం దాటుకొని ‘అహంకారం’ వదలిపెట్టి నిరాకార పరబ్రహ్మను ఉపాసించే ‘నిరాకారతత్వం’వైపు అడుగులేద్దాం.

*************************************************
      డాక్టర్‌. పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రభూమి 卐 ధర్మభూమి 卐 ధర్మధ్వజం ॐ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి