శైవ సిద్ధాంతదర్శిని
‘ముదిగొండ వీరేశలింగశాస్ర్తీగారిపై పరిశోధనా గ్రంథం
డా.ముదిగొండ
(శివలెంక) భవాని
334 పుటలు
**
ప్రాచీనమైన మతం శైవం. ప్రాచీనమైన దేవుడు శివుడు. అందుకే శివుణ్ణి ‘సనాతనుడు’ అని పిలుస్తారు. ఆయన ‘రూప అరూపి’గానూ పిలవబడ్డాడు. లింగం మనకు దృగ్గోచరం కానీ అదే లింగం మనకు జ్యోతి స్వరూపం. అది అరూపం. లింగం అంటే చిహ్నం (ఒకౄఇ్య) అని అర్థం. అందులోని తత్త్వమంతా పరమాత్మదే! కాబట్టి అలాంటి పరమాత్మోపాసననే శివోపాసన. శివుని తత్వాన్ని తెలిపేది శైవం.
గృహ్య సూత్రాల్లో శివుణ్ణి వివిధ కాలాల్లో అనేకవిధాలుగా పూజించే సంప్రదాయమున్నా అవి శాఖలుగా ఏర్పడలేదని విజ్ఞుల అభిప్రాయం. రానునాను శైవంలో అనేక శాఖలు పుట్టుకొచ్చాయి. అవన్నీ మొదట సాధనల ఆధారంగా ఏర్పడ్డవే. ఈ శైవ శాఖలు ఏర్పడడం వెనుక ఉన్న సిద్ధాంతాలను పాఠకులకు అందించడానికి తెలుగునాట జరిగిన గొప్ప ప్రయత్నం ‘ముదిగొండ వీరేశలింగశాస్ర్తీగారి శైవ సిద్ధాంతదర్శిని’ అనే పరిశోధనా గ్రంథం వెలువడడం. డా.ముదిగొండ (శివలెంక) భవానిగారు 5 అధ్యాయాల్లో 334 పుటల్లో వెలువరించిన ఈ అమూల్య గ్రంథం శివతత్వాన్ని ద్రాక్షాపాక న్యాయంగా అందించింది. సాధారణంగా విశ్వవిద్యాలయంలో జరిగే పరిశోధనా గ్రంథాలు పరిశోధనకు బాగా ఉపయోగపడతాయి. కానీ వాటిలో పఠనీయత (రీడబులిటీ) ఉండదు.
పరాత్పరుడైన శివుడు ఏ గ్రంథాలలో ఏ విధంగా కొనియాడబడ్డాడు అనేది ఈ గ్రంథంలో ప్రధాన అంశం. శివగీత, శివసంహిత, శివరహస్యం రుద్రయామళం, 28 శైవాగమాలు, నీలకంఠ విరచిత బ్రహ్మసూత్ర భాష్యం పురాణాలు, వేదాలు, ఉపనిత్తులు శివుణ్ణి అనేక విధాలుగా స్తుతించినా మొదట వీటిలోని సాధనాల భేద కారణంగా అనేక శాఖలు ఏర్పడ్డాయి. శైవం ముఖ్యంగా శ్రౌత, అశ్రౌత భేదంతో ఏర్పడింది. శ్రుతులు, ఆగమాలు, స్మృతులు, పురాణేతిహాసాల ఆధారంగా నడిచేది శ్రౌతశైవం అనీ, గ్రంథాల ఆధారంలేకుండా దేశాచార పద్ధతులవల్ల ఏర్పడింది ‘అశ్రౌతము’ అని పిలుస్తారు. లింగ, భస్మరుక్షాక్షలతో శివదీక్షను పొందిన తెలుగు, కన్నడ దేశాల బ్రాహ్మణులను ఆరాధ్యులని పిలుస్తారు. అలాంటి ఆరాధ్య శైవ కుటుంబములో జన్మించిన కారణజన్ములు ముదిగొండ వీరేశలింగశాస్ర్తీగారి శైవమత ప్రచారమే ఈ గ్రంథం నిండా కుప్పలుపోసింది రచయిత్రి.
శైవము కృష్ణా, గోదావరీ పరీవాహ ప్రాంతాల్లో వ్యాప్తిచెందడానికి వీరేశలింగశాస్ర్తీగారి కృషి ఎంతో ఉందని ఈ సిద్ధాంత గ్రంథం నిరూపించింది. అంతేగాకుండా ఈ గ్రంథంనిండా వారి అభిప్రాయాలే నిండుగా కన్పిస్తున్నాయి.
శైవంలో ప్రాచీన శైవం, పౌరాణిక శైవం అనే వాటిలో పాశుపత, లకులీశ, మహేశ్వర, శైవ భాగవత, కాపాలిక, యోగనాథ, రసేశ్వరవాద, సంకలిత అను భేదాలు కన్పిస్తాయి. అయితే ఆగమశాస్త్ర విహితమైన శైవమే దక్షిణ దేశంలో అనుసరిస్తారు. ప్రత్యభిజ్ఞ అనే త్రికసిద్ధాంతంపై ఆధారపడ్డ శైవం కాశ్మీరు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండేది. అందుకే ముదిగొండ వీరేశలింగశాస్ర్తీగారు తెలుగుప్రాంతాల్లో శైవమతవ్యాప్తికి ఈ రకమైన శైవాన్ని ఎంచుకొన్నాడు.
ఆ శైవం వేద ప్రతిపాదితమని వారు నిరూపించారు. అందుకే ఓచోట ‘‘నిరుపాధికమైన పరమైశ్వర్య విశిష్టత్వముచే పరబ్రహ్మ ఈశాన శబ్దవాచ్యుడు’’అని నీలకంఠ భాష్యాన్ని ఉటంకించారు. ఈశానుడైన శివుడు పరబ్రహ్మ స్వరూపమే. వేదం పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించింది. వేద ప్రతిపాదిత పరబ్రహ్మతత్వమే శివతత్వం అని రచయిత్రి అభిప్రాయం. ఆమె తన పరిశోధనంతా వీరేశలింగశాస్ర్తీ రచనల, వ్యాఖ్యానాల ఆధారంగా చేసింది.
అలాగే వేదాంతానికి మూలశబ్దరూపాలు ఉపనిషత్తులు. భారతీయ పారమార్ధికతత్వాన్ని ఉపనిషత్తులు ప్రతిబింబిస్తాయి. అందుకే ఆచార్యులంతా వాటిపై భాష్యాలు రచించారు. మతాన్ని విజ్ఞానంగా ప్రబోధించేవి ఉపనిషత్తులు. అందుకే అవి ప్రస్థానత్రయంగా పేర్కొనబడ్డాయి. ఆ ఉపనిషత్తులు పరమేశ్వరుని ఎలా పేర్కొన్నాయో ఓచోట (పుట 21) చెప్తూ
‘‘సర్వవిద్యాధిపతి పరమేశ్వరుడు సమస్త వాఙ్మయమునకు మూలమైన ‘ఆ ఇఉణ్’ ఇత్యాది చతుర్దశ సూత్రములు మహేశ్వర సూత్రములే. ఇట్లే ‘ఈశాన్యస్సర్వ విద్యానాం’ అనుశ్రుతి వలన సమస్తశాస్తమ్రులు మహేశ్వర ప్రోక్తములే అని చెప్పబడుతున్నవి’’ అంటారు. శైవ ఉపనిషత్తుల్లోని పరమేశ్వరుడే సర్వాంతర్యామి, ఆత్మస్వరూపుడు పరమేశ్వరుడే, పరమేశ్వరుడే జగత్కర్త, ఆఖరుకు గాయత్రీ మంత్ర ప్రతివాద్యుడు కూడా పరమేశ్వరుడే అని చెప్పడం ఈ సిద్ధాంత గ్రంథ విశేషం.
‘‘గాయత్రీ మంత్రము భర్గపదాంకితమై భర్గదేవతాకమైనది. కావున గాయత్రీ మంత్రోపాసకులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులెల్లరకు భర్గుడే యుపాస్యుడు ఈతడే సర్వయజ్ఞాదిపతి’’ (పుట-35). అలాగే అష్టాదశ పురాణాల్లో శైవతత్వం ఎక్కెడెక్కడ ప్రతిపాదన చేయబడిందో పరిశోధకులు విశేషకృషివల్ల ఈ గ్రంథానికి ఎక్కించారు. అన్ని ప్రముఖ శాస్త్ర గ్రంథాల్లోని శివప్రతిపాదితతత్వం రచయిత్రి పేర్కొన్నారు.
‘‘అష్టాదశ పురాణములలో పది పురాణములీశ్వర మహిమాప్రతిపాదకములు అటులే ఉప పురాణములందేమి?‘‘స్మృతులయందేమి? ఉపస్మృతులయందేమి? శ్రుతులయందేమి? భారతాదులయందేమి? ఖిల సంహితయందేమి? అన్ని గ్రంథములయందును పది భాగములు శివోత్కృష్టతయే వచింపబడుతున్నది’’అని ఈ సిద్ధాంత వ్యాసం చెప్పింది.

డాక్టర్ పి. భాస్కర యోగి 
అంధ్రభూమి అక్షర పుస్తక సమీక్ష 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి